31, ఆగస్టు 2023, గురువారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ అభయం

 శ్రీకృష్ణ అభయం 
(పైన చిత్రంలో అర్జునుడు మానవాళికి ప్రతినిధి. శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి మూలకారకుడు, పరమాత్ముడు - "నేను ఉన్నాను కదా" అన్నట్లుగా అభయం యిస్తున్నట్లుగానూ, ఆయన అసలు ఎవరో  తెలియజేస్తున్నట్లుగానూ ఉంది ఈ చిత్రం. ఆయన భగవద్గీతలో అర్జునుడి ద్వారా మనందరికీ యిచ్చిన వాగ్దానము, అభయము, రక్షణ, మన కర్తవ్యము ఈ క్రింది వ్యాసంలో పరికిద్దాం.) 

శ్రీ భగవానువాచ:
వాగ్దానము, రక్షణ 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం 
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 


తాత్పర్యము: సాధు-సజ్జనుల సంరక్షణ కోసము, దుష్టులను శిక్షించడం కోసము, ధర్మ పరిరక్షణ కోసము, అవసరమైనప్పుడల్లా అవతరిస్తూనే ఉంటాను.  


 కర్తవ్యబోధ 

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ 

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః 


తాత్పర్యము: ఎవరు 'నన్ను' ఏ విధంగా సేవిస్తున్నారో వారిని 'నేను' ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉన్నాను. మనుషులందరూ కూడా నా మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. 


మన కర్తవ్యము 
అనన్యాశ్చింతయంతోమాం  యే జనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 

తాత్పర్యము: ఎవరైతే మరేదీ ఆలోచించకుండా నా దివ్య రూప్యంపై ధ్యానిస్తారో వాళ్ళ యోగక్షేమాలు ప్రతినిత్యం నేనే చూసుకుంటాను. 

మన కర్తవ్యము 
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి 
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః.

తాత్పర్యము: పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీటితో అర్ఘ్యం గాని ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, అటువంటి భక్తితో కూడిన మనస్సు కలిగిన వ్యక్తిచే సమర్పింపబడినదాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. 

అభయము, వాగ్దానము  
సర్వధర్మాన్పరిత్యజ్య  మామేక శరణ్య వ్రజ 
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచ.

తాత్పర్యము: ఇప్పటి వరకూ బోధించిన ధర్మాలే గాక అన్నీ ధర్మాలు నాకు విడిచిపెట్టి, నా యందు శరణాగతి భావంతో ఉండు; నీ సమస్త పాపాల నుండి విముక్తి కలిగించెదను, భయపడకు.

శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవాళికంతటికీ ,ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు అందించిన అందరూ తేలికగా అనుసరించగలిగే అద్భుతమైన పరిష్కారాలు. వీటి భావాన్ని మన మనసులో శాశ్వతంగా నిలుపుకుంటూ మన సాధన చేసినట్లయితే, మన ఆధ్యాత్మిక పురోగతి వేగం పుంజుకుంటుంది, రోజురోజుకూ భగవంతునికి చేరువయ్యే అవకాశం ఉంది. అందరూ మనస్ఫూర్తిగా ప్రయత్నించెదరుగాక.  



29, ఆగస్టు 2023, మంగళవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణుడి అష్ట భార్యలు


 శ్రీకృష్ణుడి  అష్ట భార్యలు 
(పైన చిత్రంలో శ్రీ కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు - రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నగ్నజీతి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ అని అష్టభార్యలు. మధ్యలో రాధాకృష్ణులు) 

శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు కాదు, మొత్తం 16108 మందిని పెళ్ళి చేసుకున్నాడని మనందరమూ చిన్నప్పటి నుండి విని ఆ మహాపురుషుడు అంతమందిని పెళ్ళి చేసుకున్నాడని విమర్శలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి ఆయనకు ఉన్నది 8 మంది భార్యలే. పైన చెప్పిన విధంగా. రాధ ఆయన దివ్యసహవాసి. మిగిలిన 16100 మంది నరకాసురుని చెరలో బంధింపబడ్డ వారు. శ్రీకృష్ణుడు నరకాసుర వధ చేసిన తరువాత వాళ్ళందరినీ చెర నుండి విడిపించి,  వాళ్ళ-వాళ్ళ ఇళ్ళకు వెళ్ళమంటాడు. కానీ వాళ్ళు, ఆసురుడితో ఇంత కాలం జీవించినందుకు సమాజం వాళ్ళని అంగీకరించదని, పైగా మమ్మల్ని కళంకితులుగా చూస్తారని, ఇంటికి వెళ్ళలేమని,  తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళకు సమాజంలో వారికి గౌరవించదగ్గ హోదా కల్పించడానికి వాళ్ళందరినీ వివాహమాడి వాళ్ళకు అన్నీ రకాల రక్షణ కల్పిస్తాడు. ఇంతకంటే మరో కారణం లేదు. ఇంకా వివరాలు కావాలంటే మనం భాగవత పురాణం చదివి తెలుసుకోవాలి. 
ఇక ఈ అష్ట భార్యల విషయంలో కూడా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్లే ఆయన వివాహం చేసుకుంటాడు:
రుక్మిణి: రుక్మిణి శ్రీకృష్ణుని మొదటి భార్య. ఈమె సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మి అవతారమని భాగవతం చెబుతుంది. రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. కానీ ఆమె వివాహం శిశుపాలునితో బలవంతంగా చేయబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను తన రథంలో ఎత్తుకొని వచ్చి వివాహమాడతాడు.  
సత్యభామ: శ్రీకృష్ణుడు శమంతకమణి అనే మణిని జాంబవంతునితో యుద్ధం చేసి తీసుకువచ్చి సత్రాజిత్తుకు అందజేసి, తనపై సత్రాజిత్తు వేసిన అపవాడును పోగొట్టుకున్నందుకు, సత్రాజిత్తు తన కుమార్తెను హృదయపూర్వకంగా ఇచ్చి శ్రీకృష్ణునితో  వివాహం జరిపిస్తాడు. ఆమె కూడా కృష్ణ ప్రేమికురాలే. సత్యభామను భూదేవి అవతారమని అంటారు. 
జాంబవతి: శ్రీకృష్ణుడి మూడవ భార్య జాంబవతి. శమంతకమణిని జాంబవంతుడితో 29 రోజులు యుద్ధం చేసి గెలుచుకుని, జాంబవంతుడి శ్రీరామునితో యుద్ధం చేయాలన్న కోరికను శ్రీకృష్ణావతారంలో తీర్చి, శ్రీరామ సాక్షాత్కారం శ్రీకృష్ణునిలో జరిగినందుకు కృతజ్ఞతతో తన కూమార్తె అయిన జాంబవతిని, శమంతకమణిని రెంటినీ శ్రీకృష్ణ భాగవానుడికి అర్పిస్తాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని ఆ విధంగా వివాహమాడాడు.  
కాళింది: కాళింది ఎవరో కాదు, సాక్షాత్తు యమునా నదే. ఒక రోజు కృష్ణార్జునులు వేటాడుతూండగా కాళింది శ్రీకృష్ణుడిని ప్రేమస్తూ, వివాహమాడాలని తపిస్తూ ఉంది. ఆమె భక్తికి, ప్రేమకు మెచ్చి శ్రీకృష్ణుడు ఆమెను వివాహమాడటం జరుగుతుంది. 
మిత్రవింద: మిత్రవింద అవంతీపుర రాజకుమార్తె. ఆమె స్వయంవరంలో శ్రీకృష్ణుడిని కోరుకుంటుంది. కానీ ఇది ఆమె అన్నదమ్ములకు నచ్చక శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తే, వాళ్ళందరినీ ఓడించి మిత్రవిందను వివాహం చేసుకోవడం జరుగుతుంది. 
నగ్నజీతి: నగ్నజీతికి సత్య అనే పేరు కూడా ఉంది. ఈమెను వివాహమాడటానికి స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఏడు వృషభాలకు ముక్కు త్రాడు వేయవలసి ఉండింది. కృష్ణుడు ఆ పని చాలా తేలికగా చేసి నగ్నజీతిని వివాహమాడటం జరుగుతుంది. 
భద్ర: భద్ర శ్రీకృష్ణుడి బంధువుల అమ్మాయే. ఆమె శ్రీకృష్ణుడిని అపారంగా ప్రేమించింది. ఆమె అన్నదమ్ములే శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరుపుతారు. 
లక్ష్మణ: లక్ష్మణకు లక్షణ అన్న పేరు కూడా ఉంది. ఆమె గొప్ప సౌందర్యవతే గాక ఎన్నో గొప్ప లక్షణాలు గలది కూడా. ఆమెను కూడా శ్రీకృష్ణుడు స్వయంవరంలో వివాహమాడటం జరుగుతుంది.
రాధ: రాధ కృష్ణుని కంటే వయసులో పెద్దది. మొట్టమొదటిసారిగా రాధకు 12 యేళ్ళున్నప్పుడు, కృష్ణుడికి 7 యేళ్ళున్నప్పుడు బృందావనంలో కలుస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే ఆమె శ్రీకృష్ణునితో అనేక ఆధ్యాత్మిక సూక్ష్మ స్థాయిల్లో లయమైపోవడం జరిగిపోయిందని భాగవతం చెబుతుంది. రాధాకృష్ణుల ప్రేమ అలౌకికమైనది, దివ్యమైనది. వీరి ప్రేమ తత్త్వాన్ని గురించి స్వయంగా భగవానుడే బాబూజీతో పంచుకున్న అంశాలు మనం ఇంతకు ముందు వ్యాసంలో చదువుకున్నాం: శ్రీకృష్ణుడు రాధతో లేని క్షణమే లేదని, చివరికి యుద్ధరంగంలో కూడా అదృశ్యంగా ఆయనతోనే ఉందని, ఇరువురూ ఒకరులేకపోతే మరొకరు లేరని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ధ్యానించదగ్గ ఆమోఘ వ్యక్తిత్వం. అందరూ ఆ ప్రయత్నంలో ఉందురుగాక. 

ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు 16108 మందిని వివాహం చేసుకోవడం జరిగింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, భగవానుడు చేసినవన్నీ  లీలలేనని, లోకకళ్యాణార్థమేనని, కర్మవశాన జరిగిన సంఘటనలు కావని కొంత సూక్ష్మ దృష్టితో పరికించి చూస్తే గాని బోధ పడదు. అందుకే ఓషో రజనీష్ కృష్ణుడు భవిష్యత్తులో అర్థంచేసుకోగలిగిన వ్యక్తిత్వం అని చెప్పడం జరిగింది. అందుకే రాముడిని అనుసరించాలి, కృష్ణుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.  

 

28, ఆగస్టు 2023, సోమవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - కృష్ణచైతన్యంతో బాబూజీ

 


శ్రీకృష్ణ చైతన్యంతో బాబూజీ మహారాజ్ దివ్య సంభాషణ
 
పై చిత్రంలో బాబూజీ  మహారాజ్ నిగూఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ చైతన్యంతో జరిగిన కొన్ని దివ్య-సంభాషణలు మనం ఇక్కడ చదువుకుందాం. శ్రీకృష్ణ చైతన్యం లేక శ్రీకృష్ణుని వద్ద నుండి వచ్చే ప్రాణాహుతి నీలివర్ణ ఛాయలో ఉండేదని బాబూజీ తన ఆటోబయాగ్రఫీలో చెప్పడం జరిగింది. పైన చిత్రం కేవలం కాల్పనికం మాత్రమే. బాబూజీ తన ఆధ్యాత్మిక సాధనలో, నిగూఢ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మహారాజే గాక ఎందరో విముక్తాత్మలు, మహాత్ములు, మహర్షులు, మహాపురుషులు, అవతార పురుషులు, వీరి సంపర్కంలోకి వచ్చి అనేక రకాల ఆదేశాలనిచ్చి, బాబూజీని ఒక స్పెషల్ పర్సనాలిటీగా (ఒక విశిష్ఠ వ్యక్తిత్వంగా) తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ బాబూజీ తన ఆటోబయాగ్రఫీలో అంటే తన డైరీలో వ్రాసుకోవడం జరిగింది. అందులోని కొన్ని అంశాలు, శ్రీకృష్ణునికి సంబంధించినవి ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. 

భగవద్గీతను గురించి 
శ్రీ కృష్ణ భగవానుడు బాబూజీతో (ఏప్రిల్ 2, 1946, సా. 7.30 గంటలు): "భగవద్గీత సారాంశం ఈ విధంగా ఉంది: అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి యున్న తనకు దగ్గరవారైన స్వజనులను చూసి విషాదానికి  గురయ్యాడు. వాళ్ళను ఎలా చంపాలి, ఎందుకు చంపాలన్న సంధిగ్ధతలో అవాక్కయ్యాడు. తన స్వంత మనుషులనే నరికేసి, తన బంధుమిత్రుల కుటుంబాలను నాశనం చేసేసి సామ్రాజ్యాన్ని సాధిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఇటువంటి ఆలోచనలన్నీ అతని మనసులో కల్లోలం సృష్టిస్తున్నాయి. పిరికితనం హృదయంలో చోటుచేసుకుంటుంది. అతని ఉత్సాహం అంతా నీరు కారిపోయింది, క్షత్రియ ధర్మమైన తన కర్తవ్య నిర్వహణ నుండి మనసు దూరమవుతూ ఉంది. 
"అతను నిర్వహించవలసిన కర్తవ్యాన్ని, అర్థమయ్యేలా, మాటల్లో బోధించడానికి ప్రయత్నించాను. డానితోపాటుగా నా సంకల్పశక్తినుపయోగించి యౌగిక ప్రాణాహుతి ప్రసరణ ద్వారా అతన్ని వివిధ ఆధ్యాత్మిక దశల ప్రవేశ ద్వారానికి తీసుకువచ్చాను. మాటలతోపాటు ఆలోచనా శక్తి తోడుగా లేకపోతే ఎంత గొప్పగా వివరించినా ఉపయోగం ఉండదు. ఆ విధంగా అన్నీ ఆధ్యాత్మిక బిందువులను ఆతని హృదయంలో ప్రవేశపెట్టి, స్థితప్రజ్ఞ స్థితిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్థితిలో కష్టం సుఖం రెండూ ఒకేలా ఉంటాయి; అలాగే జన్మమృత్యువులు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కూడా. ఇదీ నేను అర్జునుడికి బోధించిన గీత. 
"నీకు నీ పూజ్య గురుదేవులు అందించిన బోధ కూడా ఇలాగే లేదూ? లోపలున్న అడ్డుతెరలను కేవలం ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా ప్రాణాహుతి ప్రసరణ సహాయం లేకుండా తొలగించడం సాధ్యపడుతుందా? ఒక్క విషయం గీతలో కచ్చితంగా బాగా నొక్కి చెప్పడం జరిగింది:  ఏ వ్యక్తి అయినా కూడా, తనకున్న సామాజిక స్థాయిని బట్టి, సామాజికపరమైన లేక పరంపరగా వస్తున్న సాంప్రదాయాన్ని బట్టి తనకు అప్పగించిన బాధ్యతను బద్ధుడై అంకితభావంతో నిర్వర్తించాలి. వాస్తవానికి ఈ అంశాన్ని ఒక గ్రంథ రూపంలో విశదీకరించడం జరిగింది. నేను ఎలా చెప్పానో సరిగ్గా అలాగే ఉంది అందులో."

రాధాకృష్ణుల ప్రేమ తత్త్వాన్ని గురించి 
శ్రీ కృష్ణ భగవానుడు బాబూజీతో (ఏప్రిల్ 3, 1946, ఉ. 9.20 గంటలు):
"నేను చాలా విచిత్రమైన విషయాన్ని వెల్లడిస్తున్నాను. రాధ, నేను యుద్ధభూమిలో కూడా కలిసే ఉన్నాం, రాధ నాతోనే ఉంది. ఎవ్వరికీ కూడా ఆమెను చూసి గుర్తించగలిగేంత శక్తి ప్రసాదింపబడలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా స్థితి? పరిపూర్ణుడైన మాస్టరు చేసే అద్భుతం ఇదే. ఇద్దరున్నా కూడా ఒక్కరే ఉన్నట్లుగా కనిపిస్తారు. రాధ ఎప్పుడూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే నేను కూడా ఎప్పుడూ రాధ ఆలోచన లేకుండా ఉండలేదు. ఇరువురిదీ ఒకే అస్తిత్వం. అంటే, అంతటా ఆమెతోనే ఉన్నాను, అలాగే ఆమె కూడా అంతటా నాతోనే ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక గమ్యస్థానం, దీన్ని చూడాలంటే కళ్ళు కావాలి, సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే తగిన మెదడు కావాలి. 
"మెదడు అంతా కేవల పుస్తకాలలో చదివినవాటితో మాత్రమే నింపుకున్న వ్యక్తికి ఈ అద్భుత మర్మాన్ని గ్రహించలేడు. ఇదొక విషయం అయితే అది పూర్తిగా భిన్నమైన మరొక విషయం. జ్ఞానులను పండితులని, పండితులను జ్ఞానులని పిలవడం ప్రారంభించారు. నిజమైన తత్త్వం ఇరువురిలో ఎవరూ బోధపడినవారు కాదు. 
"గీతలో నేను కేవలం ఆరు శ్లోకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఏడవ శ్లోకం చెప్పడానికి అవకాశమే లేకపోయింది. దీన్ని ప్రత్యక్షంగా అనుభవంలోకి తీసుకురావడం జరిగింది. ప్రతీ శ్లోకము ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రతిబింబిస్తుంది."

(సేకరణ:  విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్, వాల్యూమ్ 3, ఏప్రిల్ 1945 - ఏప్రిల్ 1946
పేజీ 399 నుండి 401 వరకు ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదం) 




27, ఆగస్టు 2023, ఆదివారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ లీలామృతం



శ్రీ కృష్ణ లీలామృతం  

ఆదౌ దేవకీదేవగర్భజననం గోపీగృహే వర్ధనం 
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధరణం |
కంసఛ్ఛేదకౌరవాదిహననం కుంతీసుతాపాలనం 
ఏతద్భాగవతం  పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం|| 

(ఏకశ్లోకీ భాగవతం అంటే ఒక్క శ్లోకంలో భాగవతం)

శ్రీకృష్ణ లీలామృతాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకునే ముందు మనం 'లీల' అంటే ఏమిటో తెలుసుకుందాం. మామూలు మనుషులు కర్మవశాన పుడతారు. జన్మించిన తరువాత చేసే పనులు కూడా కర్మవశాన్నే చేస్తూంటారు. వాటిని కర్మలంటాం  కూడా. శ్రీకృష్ణుడు కర్మవశాన జన్మించినవాడు కాదు. ఒక నిర్దుష్టమైన కార్యాన్ని నిర్వహించడానికి - దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ - అనే కార్య నిర్వహణకు దిగిరావడం జరిగింది, ఆ పరమాత్మ కాబట్టి అటువంటి అవతారా పురుషుడు చేసినవన్నీ కర్మలు కావు, వాటినే లీలలు అంటారు. దివ్య చైతన్యంతో, పూర్తి ఎరుకతో చేసే కార్యాలను, లీలలు అని అంటారు. ఆ లీలలన్నీ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ దిశగా నిర్వర్తించినవే. 

శ్రీకృష్ణ పరమాత్మ జన్మే ఒక లీల; ఎనిమిదవ సంతానంగా పుట్టడం, ఖైదులో జన్మించడము, దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారి సంతానంగా జన్మించడం, ఆ తరువాత ఆయన ఆదేశాల ప్రకారం ఖైదులో నుండి కుంభవృష్టి జరుగుతూండగా ఒక బుట్టలో జన్మించిన శిశువును పెట్టుకుని యమునా నది దారివ్వగా, ఆదిశేషుడు పడగ విప్పి స్వామిని కాపాడగా, నందవ్రజ గ్రామంలో ఉన్న నంద-యశోదల ఇంట్లో ఉంచి, ఆమె సంతానాన్ని తిరిగి ఖైదులోకి తీసుకురావడం; ఇదంతా ఒక గొప్ప లీలే. శ్రీకృష్ణ పరమాత్ముడు తన జన్మకు పూర్వం నుండి, మనిషి జీవితంలోని అన్ని దశాల్లోనూ  కూడా సంపూర్ణ ఎరుకతో, దివ్య చేతనతో కార్యాలు నిర్వహించడం ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ  లీలలన్నీ శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారుడనడానికి తార్కాణాలు. 

జన్మించిన తరువాత శిశువుగా ఉన్నప్పుడు, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన లీలలే చాలా ప్రమాదకరమైనవి, అలాగే ఎందరినో ఉద్ధరించిన సందర్భాలు కూడా. అదే దుష్టశిక్షణ, శిష్టరక్షణ. పూతన స్తన్యములకున్న విషాన్ని తాకకుండా పాలు త్రాగుతూ ప్రాణాలు హరించి, ఆమెకు ముక్తిని ప్రసాదిస్తాడు; ఆ తరువాత వాళ్ళమ్మ యశోద రోటికి కట్టేస్తే వాటిని రెండు మానుల మధ్య బలం ఉపయోగించి తీసుకువెదుతూంటే, ఆ మానులకు మోక్షం కలుగుతుంది; మట్టి తిన్నాడాని యశోద తిట్టి నోరు చూపించమంటే మొత్తం బ్రహ్మాండం చూపించి తన మహిమను చాటుతాడు; ఆ తరువాత కాళింది మాడుగులో కాళీయ విషసర్పం మీద నృత్యం చేసి దాన్ని హతమార్చడం; ఇంద్రుడి తాపం నుండి కాపాడుతూ గోవర్ధనగిరిని చిటికెన వ్రేలుతో ఎత్తి స్వజనాన్ని కాపాడటం; గోకులంలోని ఇళ్ళల్లో వెన్నను మాత్రమే దొంగిలించడం, తన వెంట ఉన్న వారందరికీ పెట్టిన తరువాత మాత్రమే భుజించడం;  గోపికలతో రాసలీలలు; (రాసలీలలు అంటే అశ్లీలంగా ఉండేవి కావు మనం అపార్థం చేసుకునే విధంగా; ఆయన సాంగత్యంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని, మనస్సును, తమను తాము పూర్తిగా ఆధ్యాత్మికానందంలో పరవశులై బ్రహ్మానందాన్ని అనుభూతి చెందడం),  ఇలా అనేకానేకం ఉన్నాయి బాలకృష్ణ లీలలు. పరికించి చూస్తే అన్నిటికీ పరమార్థం కనిపిస్తుంది. 

ఇక పెద్దయిన తరువాత చూపించిన లీలలు కోకొల్లలు; అందుకే శ్రీకృష్ణుడిని లీలామానుషవిగ్రహం అంటారు కూడా. సర్వజన సమ్మోహనాకారుడు. రెండు సార్లు తన విరాట రూపాన్ని చూపిస్తాడు; ఒకటి యశోదకు, మరోసారి అర్జునుడికి కురుక్షేత్రంలో, మహాభారత యుద్ధ సమయంలోనూ. తన విశ్వరూపాన్ని చూపించిన ఏకైక అవతారం శ్రీకృష్ణావతారం; అందుకే ఈ  అవతారాన్ని పరిపూర్ణ అవతారం అని అంటారు. చివరికి ఆయన నిర్యాణం కూడా ఒక లీలే. ఈ లీలలను గురించిన పరమార్థాలు ఒక్కొక్క లీలను తెలుసుకోవాలంటే ఎందరో మహానుభావులు వ్రాసిన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా పోతన వ్రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతం తప్పక చదవవలసిన గ్రంథం; ఆసక్తిగలవారు చదువుకోవచ్చు, ప్రవచనాల రూపంలో వినవచ్చు లేదా ధ్యానించవచ్చు. 
 






 

24, ఆగస్టు 2023, గురువారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - గీతాచార్యుడు

 


భగవద్గీత - గీతాచార్యుడు 

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 

తత్ర శ్రీరవిజయో భూతిః ధృవా నీతర్మతిర్మమ || 


అర్థం 

ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనస్సును ధరించిన పార్థుడు ఉంటారో, అక్కడ తప్పక విజయం, నీతి ఉంటాయి అని అర్థం. శ్రీకృష్ణుడు అనుగ్రహానికి ప్రతీక; పార్థుడు మానవ ప్రయత్నానికి ప్రతీక. మానవ ప్రయత్నం, భగవంతుని కృప, ఈ  రెండూ ఉన్నచోట తప్పక విజయం ఉంటుంది. 


శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత రూపంలో భారతీయ జన మానసంలో, అందరిలోనూ ఇక్కడ పుట్టిన అందరిలోనూ, చదువుకున్నవారైనా, చదువుకోనివారైనా, పామరులైనా, పండితులైనా, అక్షరాస్యులయినా, నిరక్షరాస్యులైనా, ఏ మతానికి చెందినవారైనా, ప్రతి ఒక్కరిలోనూ గీత వారి జీవితాల్లో యేదో విధంగా దర్శనమిస్తుంది. ఉదాహరణకు అందరిలో సమానంగా ఉన్న ఒక అవగాహన, ప్రయత్నం చేయడం వరకే మన పని, ఫలితం ఆ భగవంతునిది అన్న అవగాహన. ఇదే భారతీయులను శతాబ్దాలుగా జరిగిన అన్ని దండయాత్రలను, దాడులను, తట్టుకుంటూ కూడా తన మూల అస్తిత్వాన్ని, నాగరికతను, కోల్పోకుండా రక్షించినది, అపరిమితమైన సహనాన్ని ఇచ్చినది ఈ అవగాహనే. పైన చెప్పిన శ్లోకం అన్నిటి కంటే గొప్ప గీతోపదేశం అనిపిస్తుంది, ముఖ్యంగా ఈ మానవ జీవిత మనుగడను సాధించడానికి ఈ శ్లోకం గొప్ప బలాన్నిస్తుంది, స్ఫూర్తినిస్తుంది, నిర్భయంగా ముందుకు సాగేలా చేస్తుంది.  


శ్రీకృష్ణ భగవానుడు, గీతాచార్యునిగా, బోధించిన భగవద్గీతకు ఎందరో మహానుభావులు అనేక భాష్యాలు వ్రాసారు, వ్రాస్తూనే ఉన్నారు. ఈ శాస్త్రాన్ని అనేక రకాలుగా అభివర్ణించారు కూడా. ఇవన్నీ చూస్తే, గీత ఎవరి అవసరాలకు తగ్గట్టుగా అలా దర్శనమిస్తుందనిపిస్తుంది. మనిషి జీవితంలో ప్రతీ క్షణమూ, ప్రతీ దశ కూడా సవాళ్ళతో కూడుకొని ఉన్నదే. పైగా ఒక్కొక్కరికీ ప్రత్యేకమైన విధంగా ఉంటుంది కూడా. యే ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండవు. వాళ్ళ-వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళున్న పరిస్థితులను బట్టి, తగిన మార్గదర్శనం చేసేటువంటి మహా గ్రంథం భగవద్గీత. కేవలం కంఠస్థం చేసి మనసులో అనుకున్నా కూడా ఆ శబ్ద తరంగాలకు ఆత్మకు తెలియని శాంతి కలుగుతుంది. ఆనందులోని విషయం ఆ విధమైనటువంటి స్వస్థత చేకూర్చే శక్తి ఉన్నది, తద్వారా ఆ వ్యక్తికి కర్తవ్య బోధ జరుగుతుంది కూడా. 


భగవద్గీత మహాభారత ఇతిహాసంలోనిది. కురుపాండవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాక ముందు, అర్జునుడు తన స్వజనులను చంపుటకు ఇష్టపడక, అధైర్యానికి లోనై, విషాదంలో మునిగిపోయిన క్షణంలో, శ్రీ కృష్ణ భగవానుడు ఆర్జనుడికి కర్తవ్య బోధ చేసి మరల యుద్ధానికి సన్నద్ధుడిని చేసే క్రమంలో వారివురి మధ్య జరిగిన సంవాదమే శ్రీమద్భగవద్గీత. ఈ సంవాదంలో అనేక సందేశాలు మనకు కనిపిస్తాయి; భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ, అన్ని రకాల వారికి వర్తించే అంశాలు అనేకం దర్శనమిస్తాయి. ముఖ్యంగా దీన్ని యోగశాస్త్రంగా పరిగణిస్తారు పెద్దలు. మనిషి జీవిత పరమార్థమైన యోగాన్ని ఇక్కడ విశదీకరిస్తారు.


భగవద్గీత, ఉపనిషత్తుల సారము, కర్మ, భక్తి, జ్ఞాన యోగములను, భగవంతుని తత్త్వాన్ని, ఆత్మ స్వరూపాన్ని తెలియజేసే ఉద్గ్రంథం. కురుక్షేత్ర యుద్ధానికి, భగవద్గీతకు,  ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు, సంజయుడు, వేదవ్యాస మహర్షి, బర్బరీకుడి శిరస్సు. 


దీన్ని రచించినది వేదవ్యాస మహర్షి. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొదటి ఆరు అధ్యాయాలను కలిపి కర్మషట్కము అని, తరువాతి ఆరు ఆధ్యాయాలను కలిపి భక్తిషట్కము అని, చివరి ఆరు ఆధ్యాయాలను కలిపి జ్ఞానషట్కము అని అంటారు. అంతేగాక ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగమని కూడా చెబుతారు. అవి ఈ విధంగా ఉన్నాయి: 

1) అర్జున విషాద యోగము, 2) సాంఖ్య యోగము, 3) కర్మ యోగము, 4) జ్ఞాన యోగము, 5) కర్మసన్న్యాస  యోగము, 6) ఆత్మ సంయమ యోగము, 7) జ్ఞానవిజ్ఞాన యోగము, 8) అక్షరపరబ్రహ్మ యోగము, 9) రాజవిద్యా రాజగుహ్య యోగము, 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము, 12) భక్తి యోగము 13) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము 14) గుణత్రయవిభాగ యోగము, 15) పురుషోత్తమప్రాప్తి యోగము 16) దైవాసురసంపద్విభాగ యోగము 17) శ్రద్ధాత్రయవిభాగ యోగము 18) మోక్షసన్న్యాస యోగము.

శ్రీకృష్ణ భగవానుడు అన్నీ యోగమార్గాలూ చెప్పిన తరువాత 18 వ అధ్యాయంలో చెప్పిన ఈ శ్లోకం సామాన్యులయిన మనకు, ఇవన్నీ ఎప్పటికి అధ్యయనం చేయాలి, ఎప్పటికి అర్థం అవ్వాలి, ఎప్పటికి ఆచరణలో పెట్టాలి, ఎప్పటికీ జ్ఞానోదయం కావాలి, అన్న సంధిగద్ధమలో పడిపోయి ఈ మహత్తర విద్యకు దూరమవకుండా మనందరికీ ఈ శ్లోకం ఎంతో ఊరటను, తేలికదనాన్ని,  ధైర్యాన్ని, అభయాన్ని అందిస్తుంది. అన్నిటినీ వదిలిపెట్టేసి ఎవరైతే నా శరణులోకి వస్తారో వాళ్ళ పాపాలను తొలగించి, మోక్షం యిస్తానని గొప్ప అభయం యిస్తాడు భగవానుడు. 


సర్వ ధర్మాన్పరిత్యజ్య  మామేకం శరణం వ్రజ 

అహంత్వా పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 


అయితే యుద్ధ రంగంలో ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉండగా శ్రీకృష్ణుడు అర్జునుడికి 700 శ్లోకాలు చెప్పే అంత సమయం ఉందా అని మన వంటి సామాన్యులకు ప్రశ్న కలుగుతుంది. ఆ సందేహాన్ని ప్రక్కకు పెట్టి కాస్సేపు ఈ గ్రంథాధ్యయనం చేసినవారు దీని వల్ల ప్రయోజనం పొందడంలో ఎటువంటి లోటూ రాదు. అయితే ఈ సందేహాన్ని పూజ్య బాబూజీ మహారాజ్ నివృత్తి చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు చెప్పే అంతా సమయం లేదని, వాటిని  కేవలం, దివ్య చైతన్య ప్రసరణతో కూడిన శ్లోకాల్లో చెప్పడం జరిగిందని వెల్లడి చేయడం జరిగింది. తక్కిన శ్లోకాలన్నీ వేదవ్యాస మహర్షి వివరణలని, అవి సాధకులందరూ చదవదగ్గవని పూజ్య దాజీ 2021 లో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నిగూఢమైన ధ్యాన స్థితిలో వారికి బాబూజీ నుండి అందినటువంటి ఆ ఏడు శ్లోకాలనే గాక, మరో మూడు శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికినవి కూడా వెల్లడించడం జరిగింది. ఈ శ్లోకాలేవేవి తెలుసుకోడానికి, మరిన్ని వివరాలకు ఈ క్రింది లింకుల ద్వారా దీనికి సంబంధించిన 5 వ్యాసాలు దయచేసి చదువగలరు. 

https://hrudayapatham.blogspot.com/2021/11/1.html

https://hrudayapatham.blogspot.com/2021/11/2-7.html

https://hrudayapatham.blogspot.com/2021/11/2-3.html

https://hrudayapatham.blogspot.com/2021/11/4.html

https://hrudayapatham.blogspot.com/2021/11/5.html









23, ఆగస్టు 2023, బుధవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ తత్త్వం

 



శ్రీ కృష్ణ తత్త్వం 

హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే ||
హరే రామ హరే రామ | రామ రామ హరే హరే ||

శ్రీకృష్ణ తత్త్వం గాని, ఆయన మానసం గాని తెలుసుకోవడం దుస్సాధ్యం గాని, కొందరు మహానుభావులు పలికిన పలుకులను మనం స్మరించుకోవచ్చు. 

'కృష్'  అంటే అతిగొప్పదైన 'ణ' అంటే ఆనందం, అంటే కృష్ణ అంటే అతిగొప్పదైన ఆనందాన్ని కలిగించేవాడు అని ఒక అర్థం చెబుతారు ఇస్కాన్ వ్యవస్థాపకులు అభయ చరణ భక్తి వేదాంత ప్రభుపాదులవారు. అలాగే అతిగొప్పగా ఆకర్షించేవాడిని కూడా కృష్ణ అని చెప్తారు. ఎవరిలోనైనా అద్వితీయ ప్రతిభ ఉంటే, సౌందర్యం ఉంటే, అద్భుతమైన వ్యక్తిత్వం గలవాడైతే,  గొప్ప విద్యావంతుడైతే, ప్రసిద్ధ వ్యక్తి అయితే, చక్కగా మాట్లాడగలిగినవాడైతే, మహా శక్తివంతుడయితే, శ్రుతిశాస్త్రపు మర్మములు తెలిసినవాడైతే, మంచి వివేకవంతుడైతే, దైవత్వం ఉట్టిపడేవాడైతే, చక్కటి అంతరంగ సమత్వాన్ని ప్రతిబింబించేవాడైతే, ఇలా యే ఒక్క విషయం ఉన్నా వ్యక్తులు ఆకర్షిస్తారు. కానీ కృష్ణుడిలో ఈ సమస్త లక్షణాలూ ఉండటం వల్ల, ఆయనను మించి ఆకర్షించగలిగినవాడు సృష్టిలోనే ఇప్పటి వరకూ ఉద్భవించలేదు. అంతే కాదు నల్లనివాడు కాబట్టి కృష్ణుడాని కూడా అంటారు. నల్లవాడైనా అంత ఆకర్షణీయంగా ఉండేవాడు కృష్ణుడు. 

అనంత తత్త్వం పరిమితం అవడమే అవతారము. ఆనంతత్వం నుండి పరిమితంగా దిగిరావడమే అవతారము యొక్క అర్థం. అవతారాల పరమార్థం దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అని, అధర్మం పెచ్చు మీరినప్పుడు, ధర్మాన్ని స్థాపించడం కోసము, సాధు జనాన్ని రక్షించడం కోసము  భూమమేడ అవతరిస్తారని భగవద్గీతలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుని జీవితంలో ఇవన్నీ కనిపిస్తాయి. అంతే కాదు, రానున్న ఘోర కలియుగంలోని మానవుల కళ్యాణ నిమిత్తం ఆర్జనుడిని మాధ్యమంగా తీసుకుని ఒక బాహుదీర్ఘ దర్శి అయిన ఆచార్యునిగా మనకు భగవద్గీతను బోధించడం జరిగింది. ఆ గీతచే ఎంతమంది జీవితాలకు మార్గదర్శనం ఈ రోజుకీ లాభిస్తున్నాడో మనందరమూ కొంతవరకూ పరికించగలుగుతున్నాం. 

మామూలు మనుషులు ప్రారబ్ధ వశాన లేక కర్మవశాన భూమ్మీద జన్మించడం జరుగుతుంది. అవతారా పురుషులు కోరి మానవ కళ్యాణం కోసం మానవ దేహాన్ని ధరించడము, ఒక ప్రణాళికా బద్ధంగా తమ జీవితాన్ని కొనసాగించడమూ, తమ అవతారాన్ని చాలించడమూ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే శ్రీకృష్ణావతారంగా ఆ ఆనంతత్వం దిగి వచ్చినది. శ్రీకృష్ణుడి జన్మ దగ్గర నుండి ఆయన ప్రణాళిక అమలు అవడం గమనించవచ్చు. యే తల్లి గర్భంలో జన్మించబోతున్నాడో (దేవకీ వాసుదేవులకు) , ఎక్కడ జన్మించబోతున్నాడో, (ఖైదులో), జన్మించిన తరువాత వాసుదేవుడు ఏమి చేయాలో (బుట్టలో పెట్టుకుని యమునా నది అవతలి ఒడ్డుకు వర్షంలో తరలించడం), యే తల్లి వద్ద పెరగాలో (యశోద), వాసుదేవుడు తిరిగి మరల ఖైదుకు తిరిగి రావడం, ఇవన్నీ ఆయన ఆదేశాల మేరకే  జరిగిపోయాయి. ఇలాగే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పుట్టుక ముందు నుండీ, ప్రతీ ఘట్టంలోనూ, మహాభార యుద్ధంలోనూ, చివరికి తన అవతారం చాలించే వరకూ కూడా తన దివ్య ప్రణాళిక అయిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అనే అంశాలను అమలు పరచే విధంగా, తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఈ దృష్టి కోణంతో గనుక మనం శ్రీకృష్ణ అవతారాన్ని, వారి లీలలను పరికించి చూస్తే ఏ  విధంగా శ్రీ కృష్ణుడు తన దివ్యత్వం యొక్క సంపూర్ణమైన ఎరుకతో జీవించాడనేది, ఎందుకు ఆయనది సంపూర్ణావతారం అని అంటారో, ఎందుకు పరిపూర్ణ అవతారం అని చెబుతారో ఎవరికైనా అర్థమవుతుంది;  శ్రీకృష్ణ తత్త్వం బోధపడే అవకాశం ఉంది. మనిషిగా అనుభవించేవన్నీ అనుభవిస్తూ, ఎవరికీ దివ్యపురుషుడని తెలియకుండా భూమ్మీదకు వచ్చిన తన ప్రణాళికను నిర్వర్తించి అవతారాన్ని ముగించాడో పరికించి చూసినట్లయితే ఆయన తత్త్వం కొంతవరకైనా ఆవిష్కరింపబడుతుంది.   

శ్రీకృష్ణ తత్త్వాన్ని గురించి అర్థం చేసుకోవడం గాని, దాన్ని గురించి ప్రసంగం చేయడం గాని, వ్రాయడం గాని, చేయాలంటే ఎంతటి మహాత్మునికైనా ఒక జీవిత కాలం కూడా సరిపోదు. స్వామి చిన్మయానంద చెప్పినట్లుగా బహుశా సాక్షాత్తు శ్రీకృష్ణుడికి కూడా సాధ్యపడదేమో! ఓషో రజనీష్ కృష్ణ తత్త్వాన్ని తన ప్రసంగాల ద్వారా అద్భుతంగా తెలియజేస్తూ కూడా, కృష్ణుడు భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిత్వం అని, ఎవరికీ అర్థం కాడని, ఎవ్వరూ అర్థం చేసుకోలేరని అనడం జరిగింది. ఇది కేవలం దుస్సాహసం మాత్రమేనని ముందుగానే చెప్పుకున్నాను. 



 







21, ఆగస్టు 2023, సోమవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో

 


యుగపురుషః జగద్గురు యోగీశ్వరః శ్రీకృష్ణః  
(కాలం: 5000 కంటే ఎక్కువ సంవత్సరాలకు పూర్వం,  ద్వాపర యుగం)

వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం | 
దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం || 

శ్రీకృష్ణ జన్మాష్టమి 2023 సెప్టెంబర్ 6 వ తేదీన ఆసన్నమవుతున్న సందర్భంగా యుగపురుషుడు, యోగీశ్వరుడు, మొట్టమొదటి జగద్గురువు అయినటువంటి  శ్రీకృష్ణ పరమాత్మను, యథాశక్తి,  ప్రత్యేకంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం దుస్సాహసమే అయినప్పటికీ పూజ్య గురుదేవుల కృప వల్ల కలిగే  శ్రీకృష్ణ భాగవానుడి ఆశీస్సులతో ధైర్యం చేద్దాం. 

 

శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి, విస్తృతమైన వైదిక వాజ్ఞ్మయాన్ని  (వేదాలు, వేదాంగాలు, షడ్ దర్శనాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం ఇలా ఎన్నో వైదిక గ్రంథాలను) మానవాళి తేలికగా అధ్యయనం చేసుకోవాలన్న సంకల్పంతో వీలుగా ఉండేలా క్రోడీకరించి, సంకలనం చేయడం జరిగింది. ఇంత చేసిన తరువాత కూడా, అంతటి మహహత్తర కార్యాన్ని సంపూర్ణంగా నిర్వహించిన తరువాత కూడా, యేదో తెలియని వెలితి ఆయన మనసులో ఉండి బాధపెడుతున్న తరుణంలో శ్రీ నారద మహర్షి, ఆయనను ఒక భక్తిరస ప్రధానమైన శ్రీమద్భాగవతాన్ని రచించమని కోరతారట. భాగవత కథ అంటే భగవంతుని కథ అని అర్థం. అంటే శ్రీకృష్ణ భగవానుని కథ. ఆ విధంగా శ్రీమద్భాగవతం ఆవిర్భవించింది. 

 

రాముడిని అనుసరించు, కృష్ణుడిని అర్థం చేసుకో - అన్నారు  మన పెద్దలు. విష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముని అవతారంగా అవతరించాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడని మన వైదిక సాహిత్యం చెప్తుంది. రామావతారం అసంపూర్ణ అవతారమని, కృష్ణావతారం పూర్ణ అవతారమని కూడా చెబుతోంది మన సనాతన ధర్మం. రాముడికి తనలో ఉన్న దివ్యత్వాన్ని గురించిన ఎరుక ఉండేది కాదట; కృష్ణునికి పుట్టినప్పటి నుండీ తనలోని దివ్యత్వం యొక్క ఎరుక ఉండేదట. రాముడిని రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు; అంటే రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. అంతటి ధర్మ నిరతుడు ఇంతకు పూర్వం జన్మించ లేదు; ఇక జన్మించడు బహుశా. అందుకే ఆయనను అనుసరించవలసిన అవసరం. కృష్ణుడిని కృష్ణం వందే జగద్గురుం అన్నారు. కృష్ణుడు తన జీవితమంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ, సజ్జనులకు మార్గదర్శనం చేస్తూ, జీవిత పరమార్థాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి తెలియజేసిన పరమోత్కృష్ట గురువు కావడం వల్ల ఆయనను జగద్గురువుగా మన మనసుల్లో నిలిచిపోయారు.    యుగానికి యుగపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మే. 

 

అంతే కాదు, మన సహజమార్గ సాంప్రదాయంలో కూడా మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ పరమాత్మేనని, ఆయనతోనే మన గురుపరంపర ప్రారంభమయ్యిందని కూడా సహజమార్గ  సాహిత్యం చెబుతున్నది. 

 

శ్రీకృష్ణుని స్పర్శ, శ్రీకృష్ణచైతన్యము, శ్రీకృష్ణ తత్త్వం, ప్రతీ భారతీయుని హృదయంలోనూ, దేశంలోని ప్రతీ చెట్టు, చేమ, పుట్ట, రాళ్ళల్లోనూ, అణువణువులోనూ ఏదొక రూపంలో నిక్షిప్తమై ఉన్నదని చెప్పనవసరం లేదు. గీతాచార్యునిగా ఆయన బోధించిన శ్రీమద్భగవద్గీత  మన నాగరికతను, మన భారతీయ మనస్తత్వాన్ని, ఎంత మంది దాడులు చేసినా చెరగని సంస్కృతితో విలసిల్లడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ మానవ కళ్యాణానికి  ఇప్పటికీ కారణమవుతున్నది.  


 

 

 

 

 

సనాతన వైదిక సాహిత్యంలో అనేక గీతలు

 


 


సనాతన వైదిక సాహిత్యంలో
 ఆశ్చర్యం కలిగించే విధంగా అనేక గీతలు 

మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప ప్రత్యేకత - భగవంతుడిని లేక పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి లేక చేతనను సంపూర్ణంగా అర్థం చేసుకోడానికి ఇద్దరి మధ్య అనేక సంవాదాలున్నాయి. ఇవే గీతలుగా మారాయి.  ఈ రోజుకూ అటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో జరిగే సంభాషణలు అనేకం.  మన పూజ్య గురుదేవులు దాజీ కూడా ఈ ప్రక్రియను అవలంబిస్తున్నారు. అటువంటి సంవాద రూపంలో ఉన్న అద్భుత గ్రంథాలు కేవలం శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిల్లో సేకరించగలిగినన్ని గీతల పేర్లు మీ ముందుంచుతున్నాను; 

1) అగస్త్య గీత, 2) అజగర గీత, 3) అను గీత, 4) అష్టావక్ర గీత, 5) అవధూత గీత, 6) ఐల గీత, 7) కపిల గీత, 8) ఉద్ధవ గీత/హంస గీత, 9) రామగీత, 10) విదుర గీత, 11) గణేశ గీత, 12) గురు గీత, 13) భగవద్గీత, 14) కరుణ గీత, 15) తులసి గీత, 16) కశ్యప గీత, 17) కామ గీత, 18) ఉత్తర గీత, 19) ఉతథ్య గీత, 20) గర్భ గీత, 21) బ్రహ్మ గీత, 22) యమ గీత, 23) దేవీ గీత, 24) బ్రాహ్మణ గీత, 25) యాజ్ఞవల్క్య గీత, 26) శృతి గీత, 27) యుగళ గీత, 28) రుద్ర గీత, 29) గాయత్రి గీత, 30) పింగళ గీత, 31) భ్రమర గీత, 32) ప్రణయ గీత, 33) భిక్షు గీత, 34) ఋభు గీత, 35) గోపికా గీత, 36) వశిష్ఠ గీత, 37) హరిత గీత, 38) వానర గీత, 39) విచఖ్ను  గీత, 40) వామదేవ గీత, 41) సూత గీత, 42) జయంతేయ గీత, 43) పుత్ర గీత, 44) వ్యాధ గీత, 45) వ్యాస గీత, 46) వృత్ర గీత, 47) పరాశర గీత.  

ఇవన్నీ ప్రశ్నోత్తరాలే; అన్నీ ఆసక్తికరమైనవే. శోధించగలిగినవాళ్ళు శోధించే ప్రయత్నం చెయ్యండి. ప్రగాఢమైన విజ్ఞత వీటిల్లో నిక్షిప్తమై ఉంది. 



20, ఆగస్టు 2023, ఆదివారం

సంస్కృత భాష ప్రాశస్త్యం

(ఈ అద్భుతమైన పాట ఆకాశవాణిలో మనం చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం వినేవాళ్ళం)
సంస్కృత భాష ప్రాశస్త్యం 
కేయూరాణి  న విభూషయంతి పురుషం,  హారా న చంద్రోజ్వలాః  
న స్నానం న విలేపనం న కుసుమం నాలజ్ఞకృతా మూర్ధజాః 
వాణ్యేకా సమలజ్ఞ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 
క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
- భర్తృహరి  
అర్థం
పురుషం అంటే ఆత్మను కేయూరాలు అంటే చేతి కంకణాలతో గాని, హారములచే గాని, వెన్నెలచే గాని  స్నానం ద్వారా గాని, విలేపనాలంటే అత్తర్లు, సుగంధాల్లాంటివాటి చేత గాని, కుసుమాల చేత గాని, శిరోజాలు అలంకరించడం చేత గాని, ఆత్మను అలంకరించలేము. ఆత్మను అలంకరించగలిగేది కేవలం వాక్కు చేత మాత్రమే, అంటే మాట చేత మాత్రమే; అది కూడా ఏ వాక్కు అయితే సంస్కృతంతో కూడి ఉంటుందో అదే ఆత్మకు నిజమైన భూషణం అవుతుంది. వాగ్భూషణమే ఆత్మకు భూషణం.

శృతి అంటే వినిపించినది. వ్రాసినది కాదు, చదివినది కాదు. నేరుగా శబ్ద రూపంలో (అంటే వైబ్రేషన్ రూపంలో) వినిపించినది. శబ్దాన్ని తర్జుమా చేస్తే, అక్షరం అయ్యింది, అక్షరాల సమూహం భాష అయ్యింది. శ్రుతులు అంటే ఆ విధంగా వినిపించినవే. ఆ విధంగా వినిపించినదే  సంస్కృత భాష. అందుకే దీన్ని వేద భాష అంటారు. ఈ శ్రుతులనే మనం వేదం అంటాం. ఈ భాష వాక్కుకే అలంకారం అని చెబుతున్నది భర్తృహరి వ్రాసిన ఈ శ్లోకం (పైన వీడియోలో వినండి); ఎంత శ్రావ్యంగా ఉంటుందో!  

మనం ఇంతకు ముందు పాణిని మహర్షి గురించి ప్రస్తావించుకున్నప్పుడు మాట్లాడుకున్నాం - భాష ముందా లేక వ్యాకరణం ముందా? అని. సృష్టి ముందా  లేక సృష్టి నియమాలు ముందా? అంటే సృష్టే ముందు. అలాగే భాషే ముందు, వ్యాకరణం తరువాత. సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకునేది మానవుడు. అలాగే భాష ఎలా ఏర్పడిందో తెలుసుకునేది కూడా మానవుడే.  స్వతః సిద్ధంగా ఉన్న ప్రకృతి ఏ  విధంగా ఏర్పడిందో ఇంకా మానవుడు కనుగొంటూనే ఉన్నాడు. పైగా ఆ విధంగా కనుగొన్నవి మారుతూనే ఉన్నాయి కూడా. కానీ పాణిని మహర్షి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రింద సంస్కృత భాష ఎలా ఏర్పడిందో కనుగొన్న నియమాలు, దాన్నే మనం వ్యాకరణం అంటాం, ఇప్పటికీ మారలేదు, మారదు కూడా. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఇప్పటికీ ఆ నియమాలు వర్తిస్తాయి. అదే వైజ్ఞానికుడు కనుగొన్నవాటికి, మహర్షి కనుగొన్నవాటికి గల గొప్ప వ్యత్యాసం. మహర్షి కనుగొన్నవి శాశ్వత సత్యాలు. 

సంస్కృతం అంటే కేవలం మరో భాష కాదు. 
సంస్కృత భాష భారతీయ భాషాలన్నీటికే గాక అనేక అంతర్జాతీయ భాషలకు మాతృక. వేదాలు ఈ  భాషలోనే అందుకోవడం జరిగినందువల్ల దీన్ని దేవ భాష అని కూడా అంటారు. మొత్తం సాంకృత భాష అంతా కూడా పాణిని మహర్షి చెప్పినట్లు 14 సూత్రాలపై ఆధారపడుంది. ఈ 14 సూత్రాల్లోని అక్షరాలతోనే భాష ఏర్పడింది. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది అని అర్థం. ఈ అక్షరాలన్నీ  నిజానికి శబ్దాలు అంటే వైబ్రేషన్లు. ఇవి ప్రకృతి సిద్ధంగా ఉండే వైబ్రేషన్లు. ఉదాహరణకు అ, ఈ, ఉ అనే శబ్దాలు పెదాలు కలపకుండా పలికే శబ్దాలు; అలాగే కొన్ని శబ్దాలు పెదాలు కలపకుండా పలుకలేము. కొన్ని శబ్దాలను నాసికంతో పలుకుతాం. ఇలా శబ్ద వ్యవస్థను ఈ 14 సూత్రాల ద్వారా పాణిని మహర్షి వివరిస్తారు. ఈ సూత్రాలనే మహేశ్వర సూత్రాలని, పాణిని సూత్రాలని కూడా అంటారు. శబ్దం అంటే వైబ్రేషన్ నుండే అక్షరం, అక్షరం నుండే పదం, పదాల ద్వారానే వాక్యం ఏర్పడుతుంది. 

సంస్కృతంలోని మరొక గొప్పదనం మనం ఏమి పలుకుతామో అదే వ్రాస్తాం. ఏది వ్రాస్తామో అదే పలుకుతాం. అన్య భాషలలో అలా కాదు. ఉదాహరణకు ఆంగ్లంలో కొన్ని అక్షరాలు వ్రాసి, వాటిని సైలెంట్ అంటారు. ఉదాహరణకు know లో k సైలెంట్ అంటారు. అక్షరం వ్రాస్తాం గాని పలకం. సంస్కృతంలో అలా ఉండదు. ఇలా సంస్కృతం ఒక సంపూర్ణమైన భాష, ఒక పరిపూర్ణమైన భాష. 

సంస్కృతం మాట్లాడితే మనిషి సంస్కారవంతుడవుతాడు. ఎందుకంటే నాలుక సంస్కరింపబడుతుంది. మన లాలాజీ సంభాషణా సూత్రాల్లో చెప్పినట్లుగా. యే భాష నేర్చుకుంటే ఆ భాషకు సంబంధించిన సంస్కృతి మనిషికి అబ్బుతుంది. సంస్కృతం నేర్చుకుంటే భారతీయ సంస్కృతి అబ్బడమే గాక ఆమోఘమైన జ్ఞానం వస్తుంది. సౌశీల్యం కలుగుతుంది. సంస్కృత భాష నేర్చుకుంటే ప్రపంచంలో యే భాష అయినా తేలికగా నేర్చుకోగలుగుతారు. 

అందరూ వీలు చేసుకొని కొంతైనా సంస్కృత భాషను అధ్యయనం చెయ్యండి, అది మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా ఉపయోగపడుతుంది. పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ సంస్కృతం పూర్తిగా అధ్యయనం చేయలేకపోయానే అని బాధపడేవారు. 



 




 

19, ఆగస్టు 2023, శనివారం

సనాతన వేద వాజ్ఞ్మయం

 


సనాతన వేద వాజ్ఞ్మయం 

అగ్నిర్మీలే పురోహితం యజ్ఞస్య దేవామృత్త్విజం | హోతారం రత్నధాతమం ||

(ఋగ్వేద మంత్రం 1, 1)

మనందరమూ భారతీయులుగా సనాతన వైదిక ధర్మంలో జన్మించినవారము. మన ప్రతి రక్త కణంలో ఈ వైదిక పరమాణువులు ఏదొక రూపంలో నిద్రాణ స్థితిలో ఉన్నా, కచ్చితంగా అందరిలో ఉన్నాయి. వాటిని బహిర్గతం చేయవలసిన అవసరం ప్రతీ సాధకుడికి ఏదొక దశలో ఏర్పడుతుంది; తెలుసుకోవాలన్న తపన పెరుగుతుంది; తెలుసుకోవలసిన ధర్మం కూడా ఉందని అర్థమవుతుంది. క్లుప్తంగానైనా సరే, అసలు ఈ వేద వాజ్ఞ్మయం  అంటే ఏమిటో, ఎంత విస్తృతమైనదో, ఇందులో ఏమేమి గ్రంథాలున్నాయో, శాస్త్రాలున్నాయో, ఇంకా ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

అంతకంటే ముందు మనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియాలి. సనాతన ధర్మం అంటే మానవునికి, మానవ జీవితంలోని ప్రతీ అంశానికీ  ఎప్పటికీ వర్తించే ధర్మం. కేవలం భారతీయులకే  కాదు, మానవుడు ఎక్కడున్నా వర్తించేటువంటి ధర్మాలు ఇందులో పొందుపరచి ఉన్నాయి. సనాతనంగా అంటే ఎప్పటికీ ఉండే ధర్మం, ఎప్పటికీ వర్తించే ధర్మం. సనాతన ధర్మం. 

వేదం అనేది ఒక గ్రంథం కాదు. ఇది ఒక విశాల జ్ఞాన సమూహం. ఈ  జ్ఞాన సమూహాన్నే వేదం అంటారు; వేద అంటే జ్ఞానం. ఈ  జ్ఞాన సమూహంలో శ్రుతులు, స్మృతులు  అని రెండున్నాయి; వేదాన్ని 4 వేదాలుగా విభజించడం జరిగింది - ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం; వీటినే శ్రుతులు అని కూడా అంటారు. శ్రుతులు అంటే వినిపించినవి అని అర్థం. వేదములు ఎవరో రచించినవి కావు; అందుకే వాటిని అపౌరుషేయాలు అని కూడా అంటారు. ఇవి మూలాలు వైదిక వాజ్ఞ్మయానికి. వీటి నుండి వెలువడినవి స్మృతులు. 

మహర్షులు శృతులుగా శబ్దరూపంగా (శబ్దం అంటే ఆంగ్లంలో వైబ్రేషన్) అందుకున్న ఈ వేదాన్ని మౌఖికంగా గురు-శిష్య పరంపర ద్వారా ఎన్నో శతాబ్దాలు ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తూ రావడం జరిగింది. అప్పట్లో వ్రాయడం ఉండేది కాదు. ఆ తరువాత కాలక్రమేణా తాళపత్ర గ్రంథాలపై వ్రాయడం మొదలుపెట్టారు. వాటిని చాలా వరకూ అనేకమంది మన దేశంపై చేసిన దండయాత్రల్లో ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి వ్యాస భగవానుడు చేసిన కృషిలో చాలా తక్కువ భాగమే ఉంది, అయినా చాలా ఉన్నట్లుగా మనకనిపిస్తుంది. 

అటువంటి వేదం అనే విస్తృత జ్ఞాన సమూహాన్ని శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి మానవాళి తేలికగా అధ్యయనం చేసుకోగలగడం కోసం, ఈ విధంగా సంకలనం చేయడం, క్రోడీకరించడం, వర్గీకరించడం జరిగింది. వారి అనుపమాన కృషికి, ఊహించలేని కృషికి, అపార కరుణకు, సర్వదా మానవాళి కృతజ్ఞతతో ఉండవలసినదే. 
పూజ్య గురుదేవులు దాజీ వేదాలను గురించి ఆంగ్లంలో వ్రాసుకున్న అంశాలు:

Vedas
Who wrote them?
Who received that knowledge?
Can we also receive knowledge in the same way?
That knowledge was actually revealed to the individuals who were pure at heart. They had no iota of ego OR any desire to compete with anyone. They did not care for any recognition. Where 'I' ness is absent, who would write or claim their authorship?

వేదాలు 
వాటిని ఎవరు వ్రాసారు?
ఆ జ్ఞానాన్ని ఎవరు అందుకున్నారు? 
అదే విధంగా మనం కూడా అందుకోగలమా ?
పవిత్రమైన, స్వచ్ఛమైన హృదయం గలవారికి మాత్రమే ఈ  జ్ఞానాన్ని అందజేయబడింది. వాళ్ళకు లేశమాత్రం  కూడా అహం లేదు, ఎవరితోనూ పోటీ పడే తత్త్వం లేదు. గుర్తింపు కావాలన్న ఆలోచన లేదు. ఎక్కడా  'నేను' అనే భావమే ఉండదో, అక్కడ కర్తలు తామని వ్రాసుకోవడం గాని, చెప్పుకోవడం ఎవరు చేస్తారు?  


వేద వాజ్ఞ్మయం  ఈ  క్రింది విధంగా ఉంది: 
శృతి: వేదం 
4 వేదాలు/మూల సంహితలు : ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము 

స్మృతులు:  సంహితలు, 108 ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఉన్నాయి.
ప్రధాన ఉపనిషత్తులు: అయితరేయ, కౌశిటాకి, ఛాందోగ్య, కేన, బృహదారణ్యక, ఈశ, తైత్రేయ, కఠ, శ్వేతాశ్వతార , మైత్రి, ముండక, మాండూక్య, ప్రశ్న.
ఇతర సంహితలు: అష్టావక్ర సంహిత, భృగు సంహిత, బ్రహ్మ సంహిత, దేవ సంహిత, గార్గి సంహిత, కశ్యప సంహిత, శివ సంహిత, యాజ్ఞవల్క్య సంహిత ఇత్యాదివి కొన్ని ఉదాహరణలు.   
4 ఉపవేదాలు - 1) ధనుర్వేదము, 2) గంధర్వవేదము, 3) శిల్పవేదము, 4) ఆయుర్వేదము. 
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు; పురాణం అంటే ప్రాచీనమైనది అని అర్థం. అవి ఇలా ఉన్నాయి: 1) బ్రహ్మ పురాణము, 2) విష్ణు పురాణము, 3) శివ పురాణము, 4) గరుఢ పురాణము, 5) దేవీ పురాణము, 6) భాగవత పురాణము, 7) నారద పురాణము 8) వరాహ పురాణము, 9) వామన పురాణము, 10) కూర్మ పురాణము, 11) మృత్యు పురాణము, 12) బ్రహ్మాండ పురాణము 13) బ్రహ్మవైవర్ణ పురాణము, 14) మార్కండేయ పురాణము, 15) భవిష్య పురాణము, 16) లింగ పురాణము, 17) స్కంద పురాణము, 18) అగ్నిపురాణము.
ఇతిహాసాలు: రామాయణం (24000 శ్లోకాలు),  మహాభారతం (లక్ష శ్లోకాలు)
6 వేదాంగాలు: 1) శిక్షా 2) కల్ప 3) వ్యాకరణ 4) నిరుక్తం 5) ఛంద 6) జ్యోతిషం  
6 షడ్దర్శనాలు:  1) ఉత్తర మీమాంస, 2) న్యాయ, 3) వైశేషిక 4) సాంఖ్య, 5) యోగ, 6) పూర్వ మీమాంస 
3 తంత్ర శాస్త్రాలు : శైవ, శాక్త, వైష్ణవ  తంత్ర శాస్త్రాలు 
ఆగమ శాస్త్రాలు: 1) వైఖానస ఆగమం 2) పాంచరాత్ర ఆగమం 
శాస్త్రాలు, సూత్రాలు: ధర్మ శాస్త్ర, అర్థ శాస్త్ర, కామసూత్ర, బ్రహ్మ సూత్ర, సాంఖ్య సూత్ర, మీమాంస సూత్ర, న్యాయ సూత్ర, వైశేషిక సూత్ర, యోగ సూత్ర, ప్రమాణ సూత్ర, చరక సంహిత, శుశ్రుత సంహిత, నాట్య శాస్త్ర,  వాస్తు శాస్త్ర, పంచ తంత్ర, దివ్య ప్రబంధ, తిరుమురై, రామచరితమానస్, యోగవాశిష్ఠం, స్వర యోగం, శివ సంహిత, ఘేరండ సంహిత, వంచదశి, వేదాంతసార స్తోత్ర. 

వినమ్ర ప్రార్థన 
పాఠకులందరూ మన అపార వేద సంపదను గుర్తించి, సమర్థ గురువు యొక్క ఆశ్రయంలో, మార్గదర్శనంలో తగిన విధంగా అన్వయించుకొని కృతార్థులగుదురుగాక! 

 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...