24, మార్చి 2026, మంగళవారం

సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం


సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం

 ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కనీ, విని ఎరుగని, యే పవిత్ర ఆధ్యాత్మిక సాహిత్యంలో కనిపించనిది, నమ్మడానికి కూడా  కష్టసాధ్యమయ్యే సత్యం, ఒక అత్యద్భుత సంఘటన ఈ మార్చ్ 24, 1945 న చోటు చేసకుందట.  పూజ్య దాజీ ఇటీవల బసంత పంచమి మొట్టమొదటి సందేశంలో లాలాజీని స్మరిస్తూ వెల్లడించిన సత్యం ఇది. 

మనందరికీ ఒక గురువు తన శిష్యునికి దీక్షనివ్వడం విన్నాం, చదివ్యయం, మనలో కొంతమంది అనుభూతి కూడా చెంది ఉంటాం. దీన్నే ఉపదేశం అని కూడా అంటారు. ఈ దీక్ష అనేది అనేక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది; సాధకుడు ఎంతో ఆధ్యాత్మికోన్నతి, శరణాగతి, ప్రేమ, పవిత్రత వినమ్రత, వంటి అనేక అంశాలలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆయా స్థాయిల్లో దీక్షానివ్వడం జరుగుతూ ఉంటుందట. ఈ మార్చ్ 24, 1945 వ తేదీన మానవ జన్మలో ఉన్న ఒక శిష్యునికి తన గురువు గాక, సాక్షాత్తు ఆ పరతత్త్వమే, ఆ పరమాత్మే స్వయంగా, నేరుగా దీక్షనిచ్చారట. వారే పూజ్య మన బాబూజీ మహారాజ్.  ఈ మానవ ఊహకందని నిజాన్ని పూజ్య బాబూజీ తన ఆధ్యాత్మిక డైరీలో స్వయంగా వ్రాసుకున్నారు. ఈ సంఘటనను, శ్రీ కృష్ణ భగవానుడు, స్వామి వివేకానంద వారిని కీర్తిస్తూ, ఇటువంటి సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదని ప్రశంసిస్తారు. 

మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మహత్తర అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ విషయంపై బాబూజీని స్మరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో సుదీర్ఘ ప్రార్థనా పూర్వక ధ్యానం చేసి ప్రయత్నించడమే తప్ప మరో మార్గం లేదు. మేధస్సుతో అర్థం చేసుకునే విషయం అస్సలు కాదు. వారి అనుగ్రహం ద్వారా తప్ప అర్థం కాని నిగూఢ అంశం ఇది. వారి అపార అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మనలను మనం మలచుకునే ప్రయత్నంలో నిమగ్నులై ఉందాం. 

23, మార్చి 2026, సోమవారం

హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు

 


దోమల్గుడా యోగాశ్రమం  హైదరాబాదు ప్రారంభోత్సవం - బాబూజీ 

హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు 

హార్ట్ఫుల్నెస్ - శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో ఆశ్రమాల లేక ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవం ఒక విశిష్ఠమైన ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకుని ఉంటాయి. అందులోనూ సాక్షాత్తు మాస్టర్లు ప్రారంభిస్తున్నప్పుడు వీక్షిస్తున్నవారందరి, అక్కడున్నవారందరి హృదయాల్లో  ఒక అలౌకిక ఆనందం చోటు చేసుకుంటుంది. 

పైన చిత్రం 1967 మే లో దోమలగుడా, హైదరాబాదులో, బాబూజీ కరకమలాలచే  యోగాశ్రమ ప్రారంభోత్సవం చేస్తున్న చిత్రం. చిత్రం చూస్తేనే భక్తులు పరవశిస్తారు. అలాగే పూజ్య చారీజీ మణప్పాకంలో, బాబూజీ మెమోరియల్ ఆశ్రమం ప్రారంభిస్తున్నప్పుడు అనుభూతి చెందడం జరిగింది. అలాగే పూజ్య దాజీ కాన్హాశాంతి వనం లో మన గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించినప్పుడు  కూడా హృదయాలు పులకించిపోవడం మనందరమూ అనుభూతి చెందాం. 

అంతే కాదు, ఇతర ఆశ్రమాలు గాని, చిన్న-చిన్న ధ్యాన కేంద్రాలను ప్రారంభోత్సవ సందర్భాలలో కూడా అటువంటి వాతావరణమే ఆయా ప్రదేశాలలో నెలకొని ఉండటం గమనించడం జరిగింది. దీనికి మూల కారణం గురుదేవుల సంకల్పం అయితే, స్థానికంగా అభ్యాసుల హృదయాల్లో ఉన్న శ్రద్ధాభక్తులు,  సంబంధించిన పనుల్లో, ఆలోచనల్లో, మనసుల్లో  కనబరచే ఉత్సాహం వల్ల ద్విగుణీకృతం అవుతుంది. అందుకే అభ్యాసులు ఇటువంటి సందర్భాలలో ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు ప్రేమ, సామరస్యాలతో చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాతావరణం కొట్టొచ్చినట్లుగా అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో అనుభూతి చెందడం జరుగుతుంది. హృదయాంతరాళంలో కలిగే ఈ ఆనందం, ఈ ఆత్మసుఖం, మనలో పరివర్తనకు తగిన పునాదులు ఏర్పరస్తుంది. ఆ విధంగా జీవితం అంతా జీవించే అవకాశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. 

ఈ ధ్యాన కేంద్రాల్లో ఆధ్యాత్మిక సమావేశాలు, నిత్యం ధ్యానం జరుగుతూ ఉంటుంది. శక్తి భాండాగారాలుగా ఉంటాయి. మనిషి ఆత్మపరంగా జీవితంలో అలసిపోయినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశాలు. మనిషి మరింత మెరుగయ్యే వాతావరణం ఉన్న కేంద్రాలు. ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే కాంతి కేంద్రాలు. హృదయంలోని అంధకారాన్ని తొలగించగలిగే సత్తా ఉన్న కేంద్రాలు. 

చారీజీ వీటిని కాంతి కేంద్రాలుగా అభివర్ణించేవారు. వీటిని మాస్టర్లు తమ ఆధ్యాత్మిక సంకల్పంతో ఛార్జ్ చేస్తారు. ఈ కేంద్రాలకు వెళ్ళేప్పుడు, సాధకుడు మాస్టర్ వద్దకు, గురువు వద్దకు వెడుతున్నామన్న భావనతో వెళ్ళమన్నారు చారీజీ.

ఇక్కడ సోదరభావం, సమష్టి చైతన్యం (ఎగ్రెగోర్) వల్ల కలిగే ప్రయోజనాలు ప్రత్యక్షంగా అనుభవిస్తేనే కానీ తెలియదు. హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాలు అంతా ప్రశస్తమైనవి. అందరూ వీటిని సద్వినియోగం చేసుకుందురుగాక. 



14, మార్చి 2026, శనివారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

 

కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020 
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్లో పని చేస్తున్న రోజుల్లో 2020 లో మన స్థానిక అభ్యాసులు మన ఆశ్రమంలో ఆవులు పెంచడం జరిగింది. అప్పుడొక ఆవు, ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ, ఆ దూడకు యేదైనా పేరు పెట్టమని పూజ్య దాజీని కోరడం జరిగింది, ఫోటో కూడా పంపించడం జరిగింది. దానికి వారు  ఎంతో కరుణతో "భోలీ" అని నామకరణం చేశారు.
 
పైన చిత్రంలో కుడి ప్రక్కన ఉన్నది భోలీ. ఎడమ ప్రక్కన ఉన్నది అన్నపూర్ణ. సోదరులు మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆవుల పట్ల మంచి శ్రద్ధ చూపించేవారు. ధన్యులు. 


12, మార్చి 2026, గురువారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6


తెలంగాణా గ్రామాల్లో  ధ్యానం  

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6

భారత దేశ గ్రామాల్లో ధ్యానం పరిచయం చేసే సౌభాగ్యం మనందరికీ  గురుదేవుల దయ వల్ల కలుగుతూ ఉంది. అది ఒక చక్కని అనుభూతి. పైన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఇందులో మాట్లాడుతున్నవాళ్ళందరూ ధ్యానం సాధన చేస్తున్న మన అభ్యాసులే. ఈ వీడియో మన గురుదేవులైన పూజ్య దాజీకి బాగా నచ్చిన వీడియో. 

ఆయా గ్రామాల సర్పంచ్ ల సహాయంతో లేక మన అభ్యాసుల సహాయంతో అక్కడ ప్రవేశించి అనేక గ్రామాల్లో 3 రోజుల గ్రామ-ధ్యానోత్సవాలు నిర్వహించడం కొనసాగుతూ ఉంది.  ఒక గుడిలోనో లేక బడిలోనో లేక గ్రామ పంచాయితీ కేంద్రంలోనో లేక గ్రామ గ్రంథాలయంలోనో నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని కేంద్రాలలో సాధన చక్కగా కొనసాగిస్తున్నారు కూడా; అటువంటి చోట మన పరాశిక్షకులు తమ సేవలు అందిస్తున్నారు కూడా. 

నేను నిర్వహించిన మొట్టమొదటి గ్రామం కరీంనగర్ జిల్లాలోనో హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజజూపల్లిలో ధ్యానోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. హనుమంతుడి గుడిలో నిర్వహించాం. ఇప్పటికీ ఆ కేంద్రం కొనసాగుతూ ఉంది. 

ఆ తరువాత అనేక గ్రామాల్లో ఈ గ్రామ-ధ్యాయణోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుల, జాతి, మత బేధం లేకుండా ఆసక్తి గలవారందరికీ ఈ ధ్యానాన్ని పరిచయం చేయగలగడం మన గొప్ప అదృష్టం. మనిషి చేయగల ఉత్కృష్ట సేవ మనిషి హృదయానికి ప్రశాంతత, మనసును స్థిరంగా చేయడమే గదా. అది మన ధ్యానం ఎటువంటి నేపథ్యం నుండి వచ్చినవారికైనా తేలికగా అందిస్తుంది. 

మన గ్రామాలన్నీ సాధ్యమైనంత త్వరగా ధ్యానమయమవ్వాలని  అందరూ ప్రార్థిద్దాం, కృషి చేద్దాం. 



28, ఫిబ్రవరి 2026, శనివారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

 


జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం 

తెలంగాణాలో 

శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 5


పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనసాగుతూ మహబూబాబాద్ జిల్లా లోని జయ్యారం అనే ఒక చిన్న గ్రామంలో మన ఆశ్రమ నిర్మాణ పనిలో కూడా ఒక చిరు పాత్ర లభించింది.
 
ఇక్కడ సుమారు 30 అభ్యాసులున్నారు.  ఈ కేంద్రం విశేషం ఏమిటంటే వాతావరణం ప్రేమతో నిండి ఉంటుంది. అభ్యాసులందరూ ప్రేమపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమ నిర్మాణ వర్కర్ల పట్ల వీరు కనబరచిన ఆతిథ్యం, ప్రేమ అద్వితీయం. ఈ అభ్యాసులందరూ ఆశ్రమం కోసం, నిర్మాణ లేబర్ తో సమానంగా (నిర్మాణ సమయం అంతా) శ్రమించడం హృదయాన్ని ద్రవించింది.   ఇక్కడ చుట్టు-ప్రక్కల ఉన్న అభ్యాసీలు కూడా ఎంతో సహృదయంతో తమ విరాళాలతో సునాయాసంగా ఆశ్రమ నిర్మాణానికి తోడ్పడ్డారు. వీళ్ళు అజ్ఞాతంగా ఉండటానికే ఇష్టపడే అభ్యాసులు.  జయ్యారం బృందమే గాక బంగ్లా, ఖమ్మం బృందాలు కూడా  గొప్ప సహకారాన్ని అందించారు. 10 మాసాల్లోనే  ఈ నిర్మాణం వీళ్ళందరి సహకారంతో చక్కగా తీర్చి దిద్దబడింది. పూజ్య గురుదేవులు రిమోట్ గా సత్సంగాన్ని నిర్వహించి ప్రారంభించడం జరిగింది. 

దీని చరిత్ర చాలా ఆసక్తికరమైనది. 1976 లో ఈ గ్రామానికి చెందిన మన ప్రశిక్షకులు, ఉపాధ్యాయులు అయిన  కీ.శే. భిక్షమయ్యగారు 15 మంది అభ్యాసులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. 1981 లో 436 రూపాయలతో చిన్న భూమి కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 10,1983 న పూజ్య బాబూజీ మహారాజ్ ఎంతో కరుణతో ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికని 6000 రూపాయలు అనుగ్రహించడం జరిగింది. ఆ భూమిని కొంచెం పెద్దది చేసి ఈ నాడు ఈ ఆశ్రమ నిర్మాణం జనవరి, 2023 లో పునరుద్ధరించబడి, ప్రారంభించబడింది. 

ఈ ఆశ్రమ నిర్మాణ క్రమంలో సామరస్యం, పరస్పర గౌరవం, ప్రేమ ఉంటే పనులు ఎంత త్వరగా జరుగుతాయో ప్రత్యక్షంగా నేర్చుకోవడం జరిగింది. 
 


27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 4

 

ఫిబ్రవరి 22-24, 2019 కరీంనగర్ మొట్టమొదటి ధ్యానోత్సవం 

తెలంగాణాలో

 శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 4 

మనిషిలో సహజంగా పరివర్తన, ఆధ్యాత్మిక పరిణతిని   తీసుకురాగలిగే ప్రాణాహుతి శక్తిని, భూమ్మీదున్న ప్రతీ గుండెకీ అందించే పవిత్ర కార్యాన్ని విశ్వవ్యాప్తి చేయడం కోసం పూజ్య దాజీ అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాల్లోనూ, కార్పొరేట్లలోనూ, పోలీసులకు, డాక్టర్లకు, ఇంజనీయర్లకు, లాయర్లకు, గృహస్థులకు, ఇలా అన్ని వర్గాల వారికి, కులమత రంగు, భాష, జాతి వివక్ష లేకుండా హార్ట్ఫుల్నెస్  ధ్యాన పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే సాధారణ ప్రజలకు విస్తృతంగా ఈ పరిచయ కార్యక్రమం అందించాలని సంకల్పించారు. దీనికనుగుణంగా ఛత్తీశ్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఒక స్టేడియంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ గా ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడం జరిగింది. దానికి 3000 కు పైగా ప్రజలు హాజరయ్యారట. అటువంటి కార్యకమాన్నే  కరీంనగర్ లో కూడా చేద్దామని సూచించడం జరిగింది. అది పూజ్య దాజీ స్వయంగా నిర్వహించవలసిన కార్యక్రమం. అప్పుడే కానహాలో బసంత్ కార్యక్రమం పూర్తయ్యింది. వారి కంఠంలో ఇబ్బంది కలిగి మాట్లాడలేని స్థితిలో ఉన్నానన్నారు. ఎలాగూ నేను తెలుగులో మాట్లాడలేని కదా, మీరే తెలుగులో నిర్వహించమనడం జరిగింది. ఆ విధంగా కృష్ణను 3 రోజులూ పద్ధతిని గురించి పరిచయం ఇవ్వమని కోరడం జరిగింది. ఆ విధంగా ఆ గురువాజ్ఞ, నాకు మొట్టమవదాటుసారిగా తెలుగులో పబ్లిక్ గా మన పద్ధతిని పరిచయం చేసే మహద్భాగ్యం, వారి అనుగ్రహం కలిగింది. కానీ నా గుండెల్లో గుబులు కూడా బయల్దేరింది. మరలా వారినే బలంగా స్మరించుకుని కార్యక్రమానికి ఉపక్రమించడం జరిగింది. 


ఆ సమయంలో కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత మన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అప్పుడే మన కార్యక్రమానికి "ధ్యాయణోత్సవం" అన్న పేరు మనసులో మెదిలింది. అందరూ ఆ పేరును స్వీకరించిన తరువాత ఆ పేరుపైన బ్యానర్లు, ఫ్లయర్లు, తయారు చేసేసిన తరువాత గురుదేవులకు చూపించడం జరిగింది, అమాయకంగా. ప్రింట్ చేయక ముందు అనుమతి తీసుకోవలసింది, తరువాత వారి ముందుంచడం జరిగింది. వారి అపార అనుగ్రహం, వారికి ఆ పేరు బాగా నచ్చింది. అప్పటి నుండి ఇటువంటి కార్యక్రమాలను ధ్యానోత్సవాలని పిలవడం జరుగుతోంది. గ్రామాల్లో చేసే కార్యక్రమాలను గ్రామ ధ్యానోత్సవం పేరున నిర్వహించడం జరుగుతోంది. 


ఇక నిర్వహించిన తీరు చాలా అమాయకంగా జరిగింది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంపూర్ణ సామరస్యంతో నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ అభ్యాసీలందరూ ఎంతో ప్రేమగా సహకరించడం జరిగింది. మన సోదరీమణులు ఇంటింటికీ కుంకుమ భరణితో వెళ్ళి బొట్టు పెట్టి ఎంతో ఆదారంగా ఆహ్వానించడం జరిగింది. ఇంచుమించు లక్ష మందిని పిలవడం జరిగింది. ఆ 3 రోజులూ కరీంనగర్ పట్టణం అంతా హార్ట్ఫుల్నెస్ పండుగలా ఉండింది వాతావరణం. మన ఆహ్వానానికి 5000 మందికి పైగా స్పందించి విచ్చేయడం జరిగింది. బి. ఆర్.  అంబేద్కర్ స్టేడియం కళాకళలాడింది. వచ్చిన జనం ఓపికగా కూర్చున్నారు. ప్రసాదం తీసుకుని వెళ్ళారు. అలా 3 రోజులూ 5000 సంఖ్య తగ్గలేదు. 


వ్యక్తిగతంగా నాకు మొట్టమొదటిసారిగా 5000 మందికి పద్ధతిని గురించి పరిచయం చేసే అవకాశం, అంత మందికి ధ్యానం నిర్వహించే అవకాశం, ఆ అద్భుత లోపలి వాతావరణం, బయట వాతావరణం, వ్యక్తం చేయలేని విధంగా నా హృదయాన్ని ద్రవింపజేశాయి. పూజ్య గురుదేవులు గంట-గంటకీ ఇక్కడ రిపోర్ట్ తెలుసుకుంటూ వారి దృష్టి అంతా కరీంనగర్ పైనే ఉంచడం చూసి గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహం, ఏంచేసినా వారి ఋణం తీర్చులేనిది. వారి పట్ల నాకున్న శ్రద్ధ ఎన్నో రెట్లు బలపడింది. అలాగే అభ్యాసీల కళ్ళల్లో ఆ 3 రోజుల్లో ఉన్న ఆనందాన్ని చూసి మరింత తన్మయుడినయిపోయాను. ఇది గాక కాన్హా శాంతి వనం నుండి పెద్ద-పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నవారందరూ వచ్చి వారి సహకారాన్ని అందించడం మరింత కనువిందుగా అనిపించింది. మొత్తానికి ఈ మొట్టమొదటి ధ్యానోత్సవం (తెలుగులో), కరీంనగర్ అభ్యాసీలకు ఒక మారువరాని జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఈ ఉత్సవ ఫలితం ఏమిటంటే, ఇందులో పాల్గొన్న ఇద్దరు సాధకులు ప్రస్తుతం మన సంస్థలో పరాశిక్షకులుగా సేవాలనందిస్తున్నారు. 


ఆ తరువాత ఖమ్మంలో కూడా ఇదే ఎత్తులో ధ్యానోత్సవం జరిగింది. అక్కడ కూడా నిర్వహించే అవకాశం లభించింది. అలా తెలంగాణా మొత్తం సుమారు 60-70 ధ్యానోత్సవాలు నిర్వహించే అవకాశం, నా జన్మకు ధన్యతను చేకూర్చింది. 

26, ఫిబ్రవరి 2026, గురువారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 3

 

కొత్తగూడెం, సింగరేణి కొల్లరీస్ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్ పరిచయ కార్యక్రమంలో  గౌరవనీయ సోదరులు ఎ. పి. దురై గారితో 
తెలంగాణాలో 
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 
నా ప్రస్థానం - 3 

జోన్ కో-ఆర్డినేటర్ గా నాకు పూజ్య గురుదేవులు అందించిన ప్రశిక్షణ ద్వారా,  నా ఆధ్యాత్మిక అవగాహనకు, నా ఆధ్యాత్మిక ఉన్నటికి  తోడ్పడే అంశాలు అనేకం చెప్తే కూడా నేర్చుకోలేనివెన్నో  ప్రత్యక్షంగా బోధపడే అవకాశాన్ని కలిగించారు. పూజ్య చారీజీ చాలా సార్లు, "సహజ మార్గంలో వివిధ సంస్థ నిర్వహణా బాధ్యతలను అభ్యాసులకు అప్పగించేది, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమేనని" అన్న మాటలలోని నిజం, పని చేస్తున్నప్పుడు అర్థమయ్యింది. ఇదే హార్ట్ఫుల్నెస్ లో స్వచ్ఛంద సేవలోని రహస్యం. బహుశా సాధన ద్వారా కూడా అంతా తీవ్ర పురోగతి సాధ్యంకాదేమో! 

కొత్తగూడెంలో సింగరేణి కొల్లరీస్ వారు తమ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్  పరిచయం చెయ్యాలని పూజ్యశ్రీ  చారీజీ మహారాజ్ కు ప్రియ శిష్యులలో ఒకరైన, మన సంస్థకు దాదాపు 15 సంవత్సరాలు చారీజీకి ప్రైవేట్  సెక్రటరీగా పని చేసిన కీ. శే. శ్రీ ఎ. పి. దురై (ఐ. పి. ఎస్.) గారిని  ఆహ్వానించడం జరిగింది. వారు పదవి విరమణకు పూర్వం కర్ణాటక రాష్ట్ర డి. జి. ఆఫ్ పోలీస్ గానూ, నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్  డైరెక్టర్ గానూ, ఆర్. పి. ఎఫ్. డి. జి. గానూ అద్భుతమైన సేవలనందించిన క్రమశిక్షణతో కూడిన వ్యక్తి. 

ఆ సందర్భంలోనే అక్కడ చుట్టు ప్రక్కల ఉన్న 8 కేంద్రాలను 2 రోజుల్లో సందర్శించడం, అక్కడున్న అభ్యాసులకు ప్రేరణ-స్ఫూర్తులను కలిగించడం జరిగింది. వారితో ప్రయాణించడంలో ఈ 2 రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలలో నేర్చుకోవాలసినవి నేర్చుకున్నట్లుగా అనిపించింది. వారితో ప్రయాణిస్తున్నప్పుడు చారీజీతో ప్రయాణిస్తున్నట్లనిపించిన అనుభూతి కలిగింది. వారి క్రమశిక్షణ, వారు తనను తాను నిర్వహించుకునే విధానం, తన గురుదేవుల పట్ల వారికున్న నిష్ఠ, ప్రేమ, భక్తి, పూజ్య భావం, జీవితాన్ని, సహజ మార్గాన్ని గురించిన నిగూఢమైన అవగాహన, అనుభవం, వారి సంభాషణా పటిమ, అందరి అభ్యాసులతోనూ వారు మెలగిన తీరు, ఆ నిరాడంబరత, చారీజీతో వారికున్న అనుబంధం, ఇన్ని ఉన్నా, అస్సలు గర్వం లేశమాత్రం కూడా తొణికిసలాడకపోవడం, అంతా వినమ్రంగా ఉండగలగడం, సంస్థను నిర్వహించడంలో వారి నైపుణ్యం - ఇవన్నీ ఒక్క వ్యక్తిలో అతి దగ్గరగా దర్శించగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించిన పూజ్య దాజీకి శతకోటి నమస్సులు. దురైగారు తన అనుభవాలను నా వంటి అల్పునితో పంచుకుంటూ, యే విధంగా నిర్వహించాలో అన్న మెళకువలు నాకు నేర్పుతూ వారితో నేను గడిపిన రోజులు, సమయం నా హృదయ ఫలకం మీద శాశ్వతంగా ఉండిపోతాయి. వారు చారీజీతో అనుభవాలను అనేక గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఒక రెండు గ్రంథాలను నాకు బహూకరించారు కూడా. 

ఈ ప్రయాణంపై పూజ్య దాజీని నేను రిపోర్టు వ్రాసి, దూరాయిగారికి కూడా ఒక కాపీ పెట్టినప్పుడు పూజ్య దాజీ స్పందిస్తూ, దూరాయిగారిని ఎంతగానో ప్రశంసించారు. అలాగే దురైగారు దానికి స్పందిస్తూ నాకు వ్రాస్తూ నేను రిపోర్టు వ్రాసిన తీరు, విధానాన్ని ప్రశంశిస్తూ, ఒక ఫంక్షనరీ ఈ మాత్రంగా వ్రాయడం సెక్రటరీగా ఉన్న నా ఈ అనుభవంలో చూడలేదు, ఒప్పవకోవలసిందే. కీప్ ఈట్ అప్ అన్నారు. నాకు భారత రత్న అవార్డు లభించినంత ఆనందం కలిగింది. వెంటనే గురుదేవులకు మరొక్కసారి మనసులో కృతజ్ఞతలను వ్యక్తం చేసుకుంటూ సర్దుకున్నాను. కానీ ఇది ఒక్క చక్కని జ్ఞాపకం. 
(సశేషం .... )

సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం

సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం  ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కనీ, విని ఎరుగని, యే పవిత్ర ఆధ్యాత్మిక సాహిత్యంలో ...