7, ఏప్రిల్ 2026, మంగళవారం

గురు తేజ్ బహాదుర్ (1621-1675)

 



గురు తేజ్ బహాదుర్ (1621-1675) 

హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్ 29 - మే 1 తేదీ వరకూ జరుపుకునే పూజ్య బాబూజీ మహారాజ్  జయంత్యుత్సవాలతో పాటుగా, సిక్కు ధర్మానికి సంబంధించిన మన తోటి సాధకులతో ప్రత్యేకంగా గురు తేజ్ బహాదుర్, సిక్కుల 9 వ గురువు జయంత్యుత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. మనం ప్రతీ సంవత్సరం ఈ భండారా సమయంలో టుకడోజీ మహారాజ్ జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. 

ఈ సందర్భంగా సిక్కు ధర్మానికి చెందిన 9 వ గురువైన గురు తేజ్ బహాదుర్ గురించి చిరు పరిచయం చేసుకుందాం. 

గురు తేజ్ బహాదుర్, 1621 ఏప్రిల్ 1 వ తేదీన అమృత్సర్  లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండి ధైర్యసాహసాలు కనబరచేవారు. సరళమైన వ్యక్తిత్వం, ధ్యానం అంటే ప్రత్యేక మక్కువ కనబరచేవారు. వీరు ఆనందపూర్ సాహెబ్ గురుద్వారాలో ఉంటూ సిక్కు మాట బోధనలను వ్యాపింపజేస్తూండేవారు. ఉత్తర భారతం అంతా విస్తృతంగా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలనందిస్తూ ప్రజలను ఉద్ధరించే పనిలో జీవితంలో చాలా కాలం వెచ్చించారు. వీరి ముఖ్య బోధనలు - నిర్భయత్వం, వైరాగ్యం, సమత్వం, కరుణ, సరళయత్వం, ధ్యానమయ జీవనాన్ని బోధించేవారు. 

బలవంతపు ధర్మ పరివర్తన విషయంలో  మొగల్ సామ్రాజ్యాధినేతల ఆగడాలు, భరించలేక, కాష్మీరీ పండితులు,  వీరి సహాయం కోరితే, వెంటనే అంగీకరించారు. అందరికీ ఎవరికి నచ్చిన మతం వారు  అనుసరించే స్వేచ్ఛ అందరికీ ఉండాలని నమ్మేవారు. బలవంతం చేస్తున్నవారికి ఎదురు తిరిగేవారు.  ఆ సందర్భంలో ఔరంగజేబ్, అప్పటి మొగల్ చక్రవర్తి, ఆజ్ఞ మేరకు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు గురు తేజ్ బహాదుర్ తలను బహిరంగంగా నరికేయడం జరిగింది. ఆ విధంగా 1675 లో, ఢిల్లీలో వారి దుర్మరణం సంభవించింది, మత స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రాణాలు అర్పించి అమర వీరుడయినాడు. మత స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం పోరాడటంలో ప్రపంచానికే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారు. 

మన సిక్కు సోదర సోదరీమణులందరితో కలిసి పూజ్య దాజీ సమక్షంలో గురు తేజ్ బహాదుర్ గారిని మనసారా స్మరించుకుందాం. 

6, ఏప్రిల్ 2026, సోమవారం

నిశ్శబ్దం

 


నిశ్శబ్దం 

శబ్దం అంటే సంస్కృతంలో తరంగం అని అర్థం. ఆంగ్లంలో వైబ్రేషన్ అంటారు. ఈ సృష్టిలో, పరికించి చూసినట్లయితే  ప్రతీదీ శబ్దమే, ప్రతీదీ వైబ్రేషనే. సృష్టే ఒక శబ్దం, ప్రతీ జీవి ఒక శబ్దమే, మాట శబ్దం, భాష శబ్దం, అణువు శబ్దం, పరమాణువు శబ్దం, పదార్థం శబ్దం, ఆలోచన శబ్దం, ఉద్వేగం శబ్దం, భావం శబ్దం, కోరిక శబ్దం, వికారాలు శబ్దాలు ఇలా అన్నీ శబ్దాలని అర్థం అవుతుంది. ఈ శబ్దాలు కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని అంతరంగంలో ఉన్నాయి. 

మరి నిశ్శబ్దం అంటే ఏమిటి? బహుశా ఈ శబ్దాలన్నీటినీ దాటిన స్థితి అయి ఉండాలి, శబ్దాతీత స్థితి. అందులో నుండే ఈ శబ్దాలన్నీ ఆవిర్భవించి ఉండవచ్చు. నిశ్శబ్దం అంటే శూన్యమా? శూన్యంలో కూడా ఓంకార శబ్దం వినిపిస్తుందంటారు మన మహర్షులు. బహుశా అస్సలు యే శబ్దమూ పరమ శూన్య స్థితి కూడా ఉందేమో. అదే మనం అనుకునే దైవత్వం కావచ్చు. సమస్తానికి మూలం. అటువంటి అస్సలు శబ్దం లేని నిశ్శబ్దమే భగవంతుని బాష అని మన మాస్టర్లు అంటూ ఉంటారు. 

మరి ఈ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందగలమా? అంటే తప్పకుండా అనుభూతి చెందవచ్చునంటారు మన మహర్షులు, మహాత్ములు. దానికి ధ్యాన సాధనే మార్గం. బాహ్య శబ్దాలను కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అంతరంగ శబ్దాలను (ఆలోచనలు, ఉద్వేగాలు, కోరికలు, వికారాలు, సంస్కారాలు) తగ్గించుకోవడం కష్టసాధ్యమే. మనలో చాలా మందిమి ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాం. 

అయితే వీటిని, ఈ అంతరంగ శబ్దాలను (గోలను) తగ్గించుకునే ఉపాయం ఏమిటి? బాబూజీ చెప్పిన చక్కని సరళమైన ఉపాయం: హృదయంలో దివ్యవెలుగు ఉంది అనే భావనపై ప్రాణాహుతి అనే దివ్యశక్తితో కూడిన ధ్యానం చేయమన్నారు. అటువంటి ధ్యానం వల్ల కలిగిన ధ్యానస్థితిని ఆస్వాదిస్తూ సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలుపుకోమన్నారు. నెమ్మదిగా, క్రమక్రమంగా  మనసు లక్షణమే సూక్ష్మంగా మారుతుంది. నిజమైన నిశ్శబ్ద స్థితి అనతికాలంలోనే అనుభూతి చెందగలుగుతారు. ఈ నిశ్శబ్ద శితి యొక్క స్పర్శ మొట్టమొదటి రోజు నుండి అనుభూతి చెందడం కొంతమంది గమనించగలుగుతారు. 

కాబట్టి ధ్యానం ద్వారానే గాకుండగా మనందరమూ ప్రయత్న పూర్వకంగా లోపల, బయట కూడా నిశ్శబ్దాన్ని పాటించడానికి ప్రయత్నించినట్లయితే మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గంగా పరిణమించడం మనం గమనించగలుగుతాం. ఈ నిశ్శబ్దానికి అతీతమైన దివ్యవెలుగు దిశగా చేసే యాత్రే  ఆధ్యాత్మిక యాత్ర. 





31, మార్చి 2026, మంగళవారం

24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి

 



24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి 

ఈ రోజు 24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి. జైన సాంప్రదాయంలో, అనేక జన్మల తరువాత వారు చేసిన ఆధ్యాత్మిక సాధనాల వల్ల, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్న వ్యక్తిని తీర్థంకరుడు  అని అంటారు. ఆఅ అత్యున్నత స్థితిని కైవల్యం అంటారు. తీర్థంకర్ అనే పదానికి - అనేక జన్మ-మరణాల తరువాత ఈ సంసార దుఃఖ సాగరాన్ని దాటాడానికి ఏర్పరచిన తీర్థం లేక నీటి కాలువ అని అర్థం.

అటువంటి తీర్థంకరులు జైన సాంప్రదాయంలో 24 మంది ఉన్నారు. ఈ రోజు 24 వ తీర్థంకరుడైన వర్ధమాన్ మహావీర్ జయంతి. ఈ 24 తీర్థంకరులూ కూడా తలోక రకమైన వృక్షం క్రింద కూర్చొని ధ్యానించేవారట. అటువంటి వృక్షాన్ని దీక్షా వృక్షం అని అంటారు. 24 వ తీర్థంకరుడైన  వర్ధమాన్ మహావీరుడు సాళువ వృక్షం క్రింద ధ్యానించి కైవల్యాన్ని పొందారట. దీన్నే గుగ్గిలం చెట్టు అని కూడా అంటారు. 

ఈ 24 దీక్షా వృక్షాలను గురించి, 24 తీర్థంకరుల గురించి, ఈ మహాపురుషులకు పర్యావరణానికి మధ్య సన్నిహిత సంబంధం, తద్వారా మానవాళికి వారందించిన సందేశాన్ని చాలా విపులంగా మన పూజ్య గురుదేవులు దాజీ, మన ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు "హోలీ తీర్థంకర్స్" అనే గ్రంథంలో వివరించడం జరిగింది. తప్పక ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ అధ్యయనం చేయవలసిన గ్రంథం.  ఈ గ్రంథ రచన ద్వారా ఎన్నో ఇప్పటి వరకూ వెల్లడి కాని ఆధ్యాత్మిక సత్యాలు, రహస్యాలు పూజ్య దాజీ వారా ఆవిష్కరింపబడ్డాయి.

24 వ తీర్థంకరుడైన వర్ధమానుడికి "మహావీర్" అనే నామకరణం దేవతలకే రాజైన ఇంద్రుడే చేశాడట. వర్ధమానుడి అత్యద్భుత సాహసం, అమితమైన సహనం, అత్యద్భుతమైన యథాతథంగా స్వీకరించే   తత్త్వాన్ని చూసి, ఈ బిరుదు ప్రదానం చేయడం జరిగిందట. మహావీరుడి జీవితంలో ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి అనేక మంది అనేక రకాలుగా చిత్రావధాలకు గురి చేసినప్పటికీ, ఎన్నో అతి కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఊహించలేని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వారు ధ్యానానికి భంగం కలుగానీయ లేదు. అన్నిటినీ సహనంతో భరించడమే గాక ఇబ్బందులు పెట్టినవారందరి పట్ల ప్రతీకార భావం లేకుండా అందరినీ పూర్తిగా క్షమించేవారు కూడా. కలిగిన కష్టాలన్నీ తన కర్మలను నష్టం చేయడానికేనాని భావించేవారు. ఒక దేవత, ఆయన తపస్సుకు మెచ్చి, తనను శరీరంతో సహా స్వర్గానికి తీసుకువెడతానని, ఆఅ తరువాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తానని ప్రలోభ పెడితే కూడా లొంగక ఈ సమాధానం ఇస్తారాయన - "నాకు ఎవ్వరూ మోక్షం ఇవ్వలేరు. మనిషి తన కృషీ, ప్రయత్నాల వల్ల మాత్రమే మోక్షాన్ని పొందగలాడు. మొట్టమొదటగా దానికి అర్హత సంపాదించాలి, అప్పుడే మోక్షాన్ని అందుకోగలుగుతాడు" అని అన్నారట. వెంటనే ఆఅ దేవత తన పొరపాటును గ్రహించి, మహావీరుడి పాడాలపై పది క్షమాపణ  వేడుకుంటాడట. 

వారు కైవల్య స్థితిని పొందిన తరువాత పలికిన మాటలు ఇలా ఉన్నాయి - "నేను పరమ పవిత్ర ఆత్మను. నేను అంతటా చూస్తునది ఆ పరమ పవిత్ర ఆత్మనే. పరిస్థితులు శరీరానికి కష్టాలను, నొప్పిని కలిగించవచ్చు, కానీ ఇప్పుడు నేను సర్వత్ర ఆ పవిత్రాత్మనే చూడగలుగుతున్నాను."

ఆఅ దివ్య తీర్థంకరుని మన గురుదేవుల కృప వల్ల ఈ మాత్రం తెలుసుకో గలిగినందుకు, వారికి కృతజ్ఞతను అనుభూతి చెందుతూ, ఆధ్యాత్మిక సాధకులు తమ మార్గంలో వచ్చే ఇబ్బందులను, కష్టాలను యే విధంగా ధైర్యంగా ఎదుర్కొనే అవసరం ఉందో జీవించి చూపించిన ఈ దివ్య పురుషుని జన్మదినాన, కైవల్యం పొందిన దినాన కనీసం ఒకసారి హృదయపూర్వకంగా స్మరించుకుందాం. పూజ్య గురుదేవులు వ్రాసిన "హోలీ తీర్థంకర్స్" గ్రంథాన్ని చదువుకుందాం. 

30, మార్చి 2026, సోమవారం

అభ్యాసి దినచర్య

 


అభ్యాసి  దినచర్య

సహజ్ మార్గ్ పథంలో నడిచే అభ్యాసి దినచర్యలో మన మాస్టర్ల ప్రకారం ఉండవలసిన అంశాలు:
ఉదయం ధ్యానం (సూర్యోదయానికి ముందు పూర్తయ్యేలా సమయం ఎంచుకోవడం; అదే సమయంలో, అదే ఆశనంలో, అదే ప్రదేహంలో ప్రతి నిత్యం ధ్యానానికి కూర్చోవడం. )

సాయంకాల శుద్ధీకరణ/నిర్మలీకరణ ( ఆ రోజు పనంతా పూర్తయిన తరువాత సాధ్యమైనంత వరకూ రాత్రి భోజనానికి పూర్వం)

రాత్రి 9:00 గంటలకు విశ్వప్రార్థన

రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం 

వ్యక్తిగత సిట్టింగ్ (వారానికి ప్రశిక్షకుని వద్ద కనీసం రెండు సిట్టింగులు)

వారానికి రెండు సత్సంగాలు  (బుధవారం, ఆదివారం)

ప్రతి రోజూ ధ్యానం తరువాత ఆధ్యాత్మిక సాహిత్య పఠనం 

ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకూ బయట ప్రపంచంతో వ్యవహరించేప్పుడు దశ నియమాలను అనుసరించే ప్రయత్నంలో ఉండటం.

ఇతరులతో సంభాషించే సమయంలో పూజ్య లాలాజీ అందించిన సంభాషణా సూత్రాలను పాటించే ప్రయత్నంలో ఉండటం. 

అభ్యాసి దినచర్య పై విధంగా ఉంటూ జీవన విధానాన్ని కొనసాగించినట్లయితే మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుందంటారు మన మాస్టర్లు. మానవ జీవిత యదార్థ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అభ్యాసి. ఆత్మోద్ధరణ అనేది దేనినైతే అంటామో అది సిద్ధిస్తుంది.    

29, మార్చి 2026, ఆదివారం

మన ఆధ్యాత్మిక పథము - సహజ్ మార్గ్ పథము

 


హృదయ గుహ చివరిలో వెలుతురు  

మన ఆధ్యాత్మిక పథము - సహజ్ మార్గ్ పథము

సత్యాన్వేషి తన ప్రస్తుత స్థితి నుండి పరమ సత్య తత్త్వాన్ని, మూలాన్ని తెలుసుకోవడానికి అవలంబించే పథమే ఆధ్యాత్మిక పథం. మూలాన్ని లేక భగవంతుని కనుగొనడానికి ఎన్ని పుర్రెలున్నాయో అన్ని పథాలున్నాయంటారు. ప్రతీ హృదయమూ తనకు అనుకూలమైన పథం ఎన్నుకుంటూ తన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదంతా సంఘర్షణే. ఈ సంఘర్షణలో భాగంగానే అప్పుడప్పుడు రకరకాల పథాలను అవలంబిస్తూ ఉంటాడు కూడా సాధకుడు. 'ఇదీ నా అసలైన పథము, నేను వెతుకుతున్న పథం ఇదే' అని ఘంటాపదంగా మనసులో కచ్చితంగా అనిపించేమత వరకూ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక పథాలు  మారవలసి వస్తే మారడానికి సాధకుడు సంకోచించరాడు. సంకోచించడం వల్ల సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది. 

మూలానికి జేర్చే మార్గాలు అనేకం ఉండవచ్చు. కానీ అన్నిటికంటే దగ్గర మార్గం ఒక్కటే ఉంటుందని, అనేకం ఉండవని, అందరూ అంగీకరించవలసిందే. అన్నిటి కంటే చేరువైనది మనిషికి తన హృదయం. కాబట్టి హృదయం ద్వారా గమ్యాన్ని జేర్చే పథమే అతి దగ్గర పథము. అందుకే సహజ్ మార్గ్ అటువంటి అతి చేరువైన మార్గం. హృదయం మీద ధ్యానించే మార్గం. అందునా సహజమైన మార్గం, సరళమైన మార్గం. 

ఆధ్యాత్మిక పథం ద్వారా చేసే ప్రయాణం ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్ర భూమిపైన చేసే ప్రయాణం లాంటిది కాదు; ఆకాశంలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; నీటిలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; ఆఖరికి అంతరిక్షయానం  లాంటిది కూడా కాదు.  మరి ఈ యాత్ర ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ యాత్ర చేస్తున్నదెవరు? 


ఇక్కడ యాత్ర చేస్తున్నది 'నేను' అనే జీవుడే. జీవుడంటే ఒక చేతనం. తన ప్రస్తుత చేతనంలో ఉన్న వెలితి వల్ల మరింత ఉన్నత చేతనం పొందాలన్న తపనతో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ఈ యాత్ర చేతనాపరమైన యాత్ర అన్నమాట. ఈ చేతననే మనం ఎరుక, స్పృహ, చైతన్యం అన్నపదాలతో కూడా సంభోదయిస్తూ ఉంటాం. ఈ యాత్రను అందుకే చైతన్య వికాస యాత్ర అని కూడా అంటాం. ఈ వికాసం చరమ స్థాయికి చేరుకునే వరకూ, అంటే ఇక వికాసం చెందడానికి, పరిణామం చెందడానికి అవకాశం లేని అవస్థకు చేరుకునేంత వరకూ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు, తాపిస్తూనే ఉంటాడు. ఈ యాత్ర ద్వారా జీవుడు తన అస్తిత్వాన్ని, తన ఉనికిని, కొంచెం-కొంచెంగా యాత్ర కొనసాగుతున్న క్రమంలో యథాతథంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ యాత్రలో కొన్ని ప్రధాన మైలురాళ్ళే - ముక్తి, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, లయావస్థ, అలా యాత్ర అనంతంగా కొనసాగే యాత్ర. 


ఈ యాత్ర పూర్తవడానికి ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఎన్ని జనమలైనా పట్టచ్చు, క్షణంలో అయిపోవచ్చు, కొన్ని మాసాలలో అయిపోవచ్చు; అంతా జీవుడి తపన, శ్రద్ధాసక్తులపై, తన నిష్ఠపై, ఎంచుకున్న మార్గంపై, అన్నిటికంటే ముఖ్యం ఎంచుకున్న గురువుపై ఆధారపడి ఉంటుంది. 

25, మార్చి 2026, బుధవారం

నాలుగు మహావాక్యాలు

 


నాలుగు మహావాక్యాలు 

నాలుగు మహావాక్యాలు వేదోపనిషత్తుల ఉద్ఘోషలు.  మన ప్రాచీన ఋషుల ప్రత్యక్షానుభూతులు.  వీటిపై మహాభాష్యాలు వ్రాయడం ద్వారా ప్రాచుర్యంలోకి వీటిని తీసుకు వచ్చిన మహాత్ములు, శ్రీ ఆది శంకరాచార్యులవారు. జీవాత్మ, పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందడమనే మానవ జీవిత పరమార్థాన్ని, వెల్లడించే నాలుగు మహా వాక్యాలు ఇలా ఉన్నాయి:
1) ప్రజ్ఞానం బ్రహ్మ : ఐతరేయ ఉపనిషత్తులో నుండి గ్రహించినది, ఋగ్వేదానికి సంబంధించినది.  చైతన్యమే బ్రహ్మము అని దీని అర్థం. అందుకే బ్రహ్మ నిర్వచన వాక్యం, బ్రహ్మ లక్షణ వాక్యం అని కూడా సంభోదిస్తారు.  

2) అహం బ్రహ్మాస్మి : బృహదారణ్యక ఉపనిషత్తులో నుండి గ్రహించినది, యజుర్వేదానికి సంబంధించినది. దీన్ని అనుభవ వాక్యం అని కూడా అంటారు. 

3) తత్త్వమసి : ఛాందోగ్యోపనిషత్తు నుండి గ్రహించినది, సామవేదానికి సంబంధించినది. దీన్ని ఉపదేశ వాక్యం అని కూడా అంటారు. 

4) అయమాత్మ బ్రహ్మ : మాండూక్యోపనిషత్తులో నుండి గ్రహించినది, అథర్వ వేదానికి  సంబంధించినది. ఈ వాక్యం ప్రత్యక్షానుభవాన్ని  సూచిస్తుంది. సాక్షాత్కార వాక్యం అని కూడా అంటారు. 


24, మార్చి 2026, మంగళవారం

సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం


సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం

 ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కనీ, విని ఎరుగని, యే పవిత్ర ఆధ్యాత్మిక సాహిత్యంలో కనిపించనిది, నమ్మడానికి కూడా  కష్టసాధ్యమయ్యే సత్యం, ఒక అత్యద్భుత సంఘటన ఈ మార్చ్ 24, 1945 న చోటు చేసకుందట.  పూజ్య దాజీ ఇటీవల బసంత పంచమి మొట్టమొదటి సందేశంలో లాలాజీని స్మరిస్తూ వెల్లడించిన సత్యం ఇది. 

మనందరికీ ఒక గురువు తన శిష్యునికి దీక్షనివ్వడం విన్నాం, చదివ్యయం, మనలో కొంతమంది అనుభూతి కూడా చెంది ఉంటాం. దీన్నే ఉపదేశం అని కూడా అంటారు. ఈ దీక్ష అనేది అనేక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది; సాధకుడు ఎంతో ఆధ్యాత్మికోన్నతి, శరణాగతి, ప్రేమ, పవిత్రత వినమ్రత, వంటి అనేక అంశాలలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆయా స్థాయిల్లో దీక్షానివ్వడం జరుగుతూ ఉంటుందట. ఈ మార్చ్ 24, 1945 వ తేదీన మానవ జన్మలో ఉన్న ఒక శిష్యునికి తన గురువు గాక, సాక్షాత్తు ఆ పరతత్త్వమే, ఆ పరమాత్మే స్వయంగా, నేరుగా దీక్షనిచ్చారట. వారే పూజ్య మన బాబూజీ మహారాజ్.  ఈ మానవ ఊహకందని నిజాన్ని పూజ్య బాబూజీ తన ఆధ్యాత్మిక డైరీలో స్వయంగా వ్రాసుకున్నారు. ఈ సంఘటనను, శ్రీ కృష్ణ భగవానుడు, స్వామి వివేకానంద వారిని కీర్తిస్తూ, ఇటువంటి సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదని ప్రశంసిస్తారు. 

మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మహత్తర అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ విషయంపై బాబూజీని స్మరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో సుదీర్ఘ ప్రార్థనా పూర్వక ధ్యానం చేసి ప్రయత్నించడమే తప్ప మరో మార్గం లేదు. మేధస్సుతో అర్థం చేసుకునే విషయం అస్సలు కాదు. వారి అనుగ్రహం ద్వారా తప్ప అర్థం కాని నిగూఢ అంశం ఇది. వారి అపార అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మనలను మనం మలచుకునే ప్రయత్నంలో నిమగ్నులై ఉందాం. 

గురు తేజ్ బహాదుర్ (1621-1675)

  గురు తేజ్ బహాదుర్ (1621-1675)  హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్ 29 - మే 1 తేదీ వరకూ జరుపుకునే పూజ్య బాబూజీ మహారాజ్  జయంత్యుత్సవాలతో...