4, ఆగస్టు 2026, మంగళవారం

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

 


అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు 

ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అనే అద్భుత ఆంగ్ల గ్రంథం విడుదల చేయడం జరిగింది.  భగవద్గీత సాక్సక్షాత్తు  శ్రీకృష్ణ భగవానుడికి మానవ శ్రేష్ఠుడైన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమయితే , అష్టావక్ర గీత ఇద్దరు జ్ఞానుల మధ్య, ఇద్దరు ఆధ్యాత్మిక దిగ్గజాల మధ్య జరిగిన సంవాదం - అష్టావక్ర మహర్షికి, మిథిలాపురిని శాసించే రాజైన జనక మహారాజుకు మధ్య జరిగిన సంవాదం.  

20 అధ్యాయాలు, 298 శ్లోకాలతో కూడిన ఈ మాహాగరంతంలో పూజ్య దాజీ కేవలం 2 శ్లోకాలను  మాత్రమే ప్రత్యేకంగా నిశితంగా, వివరించడం, నిజమైన జ్ఞానాన్ని పొందడం కోసం, మోక్షం సిద్ధించాలంటే , వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం అనే ముఖ్య ప్రశ్నల ప్రాముఖ్యతను విస్తృతంగా వివరించారు. 

దాజీ వ్రాసిన ఈ గ్రంథం అష్టావక్ర మహాగీతలోని మొదటి రెండు వాక్యాలను గురించే. మొదటి శ్లోకంలో జనక మహారాజు 3 ప్రశ్నలను వేయడం జరుగుతుంది:

కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిరభవిష్యతి |
వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో ||

నిజమైన జ్ఞానం పొందడం ఎలా?
మోక్షాన్ని సాధించడం ఎలా?
వైరాగయాన్ని పెంపొందించుకోవడం ఎలా?

ఈ ప్రశ్నలకు అష్టావక్రుడు సూటిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 

ముక్తిమిచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ |
   క్షమార్జవదయాతోషసత్యం పీయూషవద్భజ ||  

నువ్వు మోక్షాన్ని సాధించాలనుకుంటే ఇంద్రియపరమైన విషయాలను విషంగా తిరస్కరించు. క్షమ, ఆర్జవం, దయ, సంతోషం, సత్యం అనే అయిదు గుణాలను  అమృతంగా భావించి అభ్యాసం చెయ్యి. 

కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి హృదయానికి అవసరమైన 5 ఔషధాలను అష్టావక్రుడు సూచించడం జరిగింది. ఒక్కొక్క మందు తరువాతి దానికి రంగం సిద్ధం చేసుకుంటూ పోతుంది. ఆ వరుస క్రమంలోనే పని చేయడం ప్రారంభిస్తాయి. 

తప్పక గంభీరంగా సాధన చేసే ప్రతీ సాధకుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి తన వ్యక్తిగత సాధనలో త్వరితంగా ఈ లక్ష్యాలను చేరుకుందురుగాక. 







11, జులై 2026, శనివారం

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం


హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం 

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని లేదా ఆశ్రమాన్ని వ్యక్తిగత తపస్సుకు, సామూహిక తపస్సుకు పవిత్రమైన సాధనా క్షేత్రంగా వినియోగించుకోవాలి.

అలసి–సొలసిన ఆత్మకు విశ్రాంతి లభించే ఆధ్యాత్మిక నిలయంగా అక్కడ కొంత సమయాన్ని గడపాలి. ఆశ్రమంలో అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పరాశిక్షకుల (Preceptors) ద్వారా వ్యక్తిగత సిట్టింగులు పొందడానికి సమయాన్ని కేటాయించాలి. ఆశ్రమాన్ని మన స్వంత గృహంగా భావించి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేయాలి. అభ్యాసుల మధ్య పరస్పర ప్రేమ, స్నేహం, సామరస్యం, సహకార భావాలు పెంపొందించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.

ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న కొత్తవారిని ఆశ్రమానికి ఆహ్వానించి, వారికి ధ్యానం నేర్పించే ఏర్పాట్లు చేయాలి. ఈ విధంగా ప్రతి అభ్యాసి ఆధ్యాత్మిక సేవలో భాగస్వామి కావాలి.

మన గురువులు ఒక అద్భుతమైన భావాన్ని తెలియజేశారు—“ఆశ్రమానికి లేదా సత్సంగానికి వెళుతున్నప్పుడు, మాస్టర్ సన్నిధికి వెళుతున్నామనే భావంతో వెళ్లాలి.” అటువంటి వినయపూర్వకమైన, పవిత్రమైన భావంతో ఆశ్రమంలో గడిపిన ప్రతి క్షణం మన ఆధ్యాత్మిక ప్రగతికి బలమైన పునాది అవుతుంది.


 

8, జులై 2026, బుధవారం

ధ్యానానికి సమయం లేదా ?

 


ధ్యానానికి సమయం లేదా?

దినచర్యలో భాగమై ఉండవలసిన ధ్యానం చేయమంటే, ఆధునిక సమయంలో చాలా మంది సమయం లేదని  అంటూంటారు.  "సమయం లేదు"- అంటే జీవితం ఇంకా ఎంతో కాలం లేదని అర్థం. ఇది నిజం కూడా.  అందుకే సమయం లేదు కాబట్టే ధ్యానానికి సమయం దొరికేలా మన దినచర్యను సవరించుకోవలసి ఉంది. "ధ్యానానికి సమయం లేదు" అనడం కన్నా "టైము మేనేజ్ చేసుకోలేకపోతున్నాను "అనడం నయం. 

విచిత్రంగా నిత్యం ధ్యానం చేసినట్లైతే మరింత సమయం దొరుకుటుందంటారు పూజ్య దాజీ. ఇది అనుభవంలో అందరికీ తెలుస్తుంది. ఉదయాన్నే ధ్యానంలో కూర్చున్నప్పుడు రోజులో మనం చేయవలసిన పనుల లిస్టు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. ఆఅ ధ్యానంలోనే ప్రాధాన్యత ప్రకారం పనులను అమార్చుకోవడం, అనవసరమైన పనులను ప్రక్కకు పెట్టేయడం వంటివి వాటంతటవే జరిగిపోవడం మనం గమనించవచ్చు. ఆఅ విధంగా ఆ రోజు పనులన్నీ సజావుగా సమయం వృథా అవకుండా అర్థవంతంగా నాణ్యంగా గడుస్తుంది. ప్రతి నిత్యం ఆ విధంగా జీవించడం అలవడటం వల్ల జీవితమే నాణ్యమైన జీవితంగా మారే అవకాశం ఉంటుందంటారు పూజ్య దాజీ. 

అలాగే తనను తాను "కాలోస్మి.." అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే కాలం అంటేనే భగవంతుడు. అంటే కాలాన్ని వ్యర్థం చేయడం అంటే భగవంతుని నిర్లక్ష్యం చేసినట్లే, భగవంతుని వృథా చేసినట్లే - అన్నారు పూజ్య చారీజీ. 

ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినా, దానికి సమయం లేదనడం ఒక ప్యారడాక్స్ (వైరుధ్యం). మనలో ఉన్న శక్తి అన్నీ రకాలుగా ఖర్చైపోయే సోషల్ మీడియాకు, ఫోన్లకు,  అంతులేని చేయవలసిన పనుల జాబితాలకు, రీల్స్ చూడటానికి దొరికే సమయం ధ్యానానికి లేకపోవడం గమనార్హం. అంటే మన ప్రాధాన్యతలు తలక్రిందులైపోయాయి. ధ్యానంలో సమయం ఆదాయ అవుతుంది, శక్తి పుంజుకుంటాం, మనోబుద్ధ్యహంకారాలు శుద్ధి అవుతాయి, జీవితం అర్థవంతంగా గడుస్తుంది. 

ఇవన్నీ కనీసం ఆలోచిద్దాం. మన జీవితాలను మరింత మెరుగుపరచుకుందాం. 

17, జూన్ 2026, బుధవారం

మానవ సేవే మాధవ సేవ

 


మానవ సేవే మాధవ సేవ 

ఈ వాక్యాన్ని మనందరం ఈ దేశంలో చిన్నప్పటి నుండి వింటున్నాం. మనందరికీ అర్థమైపోయిందని అనుకుంటాం  కూడా. చాలా తేలికగా వాడుకభాషలో వాడేస్తూ ఉంటాం. 

మానవునిలో మాధవుని దర్శిస్తూ చేసే సేవ మాధవ సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవ మాధవ సేవ.

చిన్నప్పుడు చిత్తూరు నాగయ్య గారి "భక్త పోతన" సినిమాలో  ఎటువంటి మానవ సేవ మాధవ సేవో ఒక పాటలో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది -
భోగ-భాగ్యముల రోసి 
ఆడంబరము తెగత్రోసి 
అహము మమత త్యాగము చేసి 
తనువు ధనము హరిపరముగ చేసే 
మానవ సేవ మాధవ సేవ. 
దీని భావాన్ని అందరూ గ్రహింతురు గాక. 

సహజ్ మార్గ్ ప్రకారం మనిషి చేయగల అత్యున్నత సేవ తనను తాను సంపూర్ణంగా దివ్యంగా పరివర్తన చెందేలా సాధన చేయడమే. పాశవిక మానవుడు, మానవత్వం గల మానవుడిగాను, మానవత్వం గల మానవుడు దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే మనిషి చేయగల అతి ఉత్కృష్ట సేవ అన్నారు చారీజీ. అదే అత్యున్నత గురుదక్షిణ కూడా. 

13, జూన్ 2026, శనివారం

చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం - ధ్యానం

 


చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం - ధ్యానం

ఒక వ్యక్తిలో చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం పూర్తిగా ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తికి ధ్యానం ఎలా చేయాలో చెప్పడం ఎలా? ఇది చాలా ఆలోచింపజేసే ప్రశ్న. దృష్టి దోషం ఉండేవాళ్ళు వాడే బ్రైలీ భాషలో చెప్పవచ్చు అని అనుకోవచ్చు. అసలు బ్రైలీ ఎలా నేర్పించడం? ఇలా ఆలోచిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి పట్ల అపారమైన సానుభూతి, నిస్సహాయత, దయ, ప్రేమ, ఉదాసీనత అన్నీ కాలగలపిన అనుభూతి యేదో కలుగుతుంది. 

ఈ ప్రశ్న ఒకసారి పూజ్య గురుదేవులు చారీజీ మహారాజ్ విశాఖపట్నంలో ఒక ప్రసంగంలో అడిగినట్లు గుర్తు. ఈ ప్రశ్న వినగానే నా మనసు అల్లకల్లోలమై పోయింది. కానీ వెంటనే మనసుకు హాయిని కలిగించే మాట కూడా చెప్పారు: ఆ వ్యక్తిని కూర్చోబెట్టి సిట్టింగ్ ఇస్తే సరిపోతుంది, అన్నారు. ఇంద్రియాల వైకల్యం కానీ, హృదయ వైకల్యం కాదు కదా, అన్నారు. హృదయంలో కలిగే అనుభూతి ద్వారా అటువంటి వ్యక్తిలో పరివర్తన త్వరగా వచ్చే అవకాశం ఉంటుందేమో. ఇది బహుశా హార్ట్ఫుల్నెస్ సాధనలో మాత్రమే సాధ్యం అవుతుందేమో. 

కాస్త ఆలోచిస్తే, నిజంగా ధ్యానంలో జరిగేది కూడా ఇదే కదా! చెవులు, కళ్ళు, నోరు మూసుకుని ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసుకున్నప్పుడే సరైన ధ్యానం కుదురుతుంది కదా!  

ఇది కేవలం ప్రాణాయాహుతి విద్య వల్లే సాధ్యపడుతుంది. ఇది అత్యున్నత స్థాయిలో జరిగే కమ్యూనికేషన్ విధానం. మనుష్యత్వం దైవత్వంగా పరివర్తన చెందేలా తోడ్పడే విధానం. అటువంటి ప్రాణాయాహుతిని ప్రసరించే సమర్థుడైన గురువు లభించడం ఎంత సుకృతమో కదా! 



20, ఏప్రిల్ 2026, సోమవారం

ఒత్తిళ్ళు

ఒత్తిళ్ళు 

ఒత్తిడి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మయం. పుట్టుకే ఒక ఒత్తిడి, తల్లి గర్భంలో ఒత్తిడి, తల్లికి ఒత్తిడి. బయట  పడ్డాక యేడ్చే దాకా ఒత్తిడి. పెరగడం ఒత్తిడి. చదవడం ఒత్తిడి. ఉద్యోగం దొరికే వరకూ ఒత్తిడి. ఉద్యోగం దొరికిన తరువాత ఉద్యోగ ఒత్తిడి. తరువాత వివాహ ఒత్తిడి. వివాహం తరువాత సంతాన ఒత్తిడి. సంసార ఒత్తిడి. ఈ క్రమంలో అనారోగ్య ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు,  సామాజిక ఒత్తిళ్ళు, బంధువుల ఒత్తిళ్ళు, ప్రభత్వ ఒత్తిళ్లు, ప్రకృతిపరమైన ఒత్తిళ్ళు. ఆ తరువాత ముసలితనం ఒత్తిళ్ళు, వ్యాధుల వల్ల వచ్చే ఒత్తిళ్ళు, రకరకాల భయాల వల్ల వచ్చే ఒత్తిళ్లు, మృత్యు భయం వల్ల ఒత్తిళ్ళు. మృత్యువు తరువాత యేం జరుగుతుందోనన్న ఒత్తిడి.

ఇవి గాక మగాడికుండే ఒత్తిళ్ళు, ఆడవారికుండే ఒత్తిళ్ళు, ఇరువురి మధ్య ఉండే ఒత్తిళ్ళు. ఈ ఒత్తిళ్ళ ప్రభావాలు ఎలా ఉంటాయో పైన చిత్రంలో గమనించవచ్చు. 

ఇన్ని ఒత్తిళ్ళతో సతమతమవుతూ, వీటన్నిటినీ దాటాలన్న సంకల్పం వల్ల వచ్చే ఒత్తిడిని అంగీకరిస్తూ మనిషి తన మనుగడను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు; ఈ భవసాగరాన్ని దాటాడానికి ప్రయత్నిస్తున్నాడు.

వీటి ప్రభావాలు మనిషి శరీరంపైన, మనసు పైన, హృదయం మీద కనిపిస్తూ ఉంటాయి. అనుభవించేది హృదయం లేక ఆత్మ. ఇది తట్టుకోలేనప్పుడు ముందు మనసుపైకి తోసేస్తుంది, అది తిరిగి శరీరంపైకి తోసేయడం వల్ల ముందు శారీరక వ్యాధుల రూపంలో ఈ ఒత్తిడి బయటకొస్తుంది. వీటికి ఎంతో కొంత చికిత్స ఉండవచ్చు. ఆ తరువాత మానసిక వ్యాధులొస్తాయి. వీటికి పరిష్కారం చాలా జటిలం. చాలా సమయం పట్టవచ్చు. పరిష్కారాలు తెలియకపోవచ్చు. ఆ తరువాత ఆధ్యాత్మిక రోగాలు వస్తాయి. అంటే నైతికపరమైన రోగాలు. మనస్సాక్షికి అనుకూలంగా జీవిస్తే ఈ నైతిక రోగాలుండవు. ఇలా జీవించాలంటే, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, చాలా సాహసం కావాలి. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం అన్నమాట. హృదయాన్ని అనుసరించాలంటే సాహసం కావాలి. అదీ లోపలి నుండి సహజంగా రావాలి. అందుకే దీనికి ధ్యానం ఒక్కటే పరిష్కారం. 

అసలు ఒత్తిడి అంటే ఏమిటి? 
ఒత్తిడి అంటే మన మనసు మీద, శరీరంలోని గుండె మీద, అవయవాల మీద, నరాల మీద, మెదడు మీద, కండరాల మీద ఎడతెగకుండా, పీడ కలగడం, ఒత్తిడి అంటే అది. ఈ పీడ భరింపరానిది. 

ఒత్తిడి ఎటువంటి పరిస్థితుల్లో కలుగుతుంది? 
జీవితం అంటేనే సమస్యలు. మన కంటే పెద్దదైనప్పుడే అది సమస్య. అప్పుడే సమస్య వల్ల ఒత్తిడి. మన కన్నా చిన్నదైతే అక్కడ ఒత్తిడి ఉండదు. సమస్య జటిల్యమైతే ఒత్తిడి. సమస్య పరిష్కరించే నైపుణ్యం లేకపోతే ఒత్తిడి. చేయవలసిన పని ఎక్కువ సమయం తక్కువ అయినప్పుడు ఒత్తిడి. ఈ ఒత్తిడి మోతాదు మించినప్పుడు మనిషికి అపకారం చేస్తుంది. మోతాదు మించకుండా ఉండే ఒత్తిడి మనిషికి అవసరం. అది సకారాత్మక ఒత్తిడి. మనిషిని చురుకుగా ఉండేలా బద్ధకం లేకుండా చేస్తుంది. 

అన్నిటికంటే పెద్ద ఒత్తిడి 
మనం ఇన్ని రకాల ఒత్తిళ్లు చూశాం. వీటన్నిటికంటే అతి పెద్ద ఒత్తిడేమిటో తెలుసా? మనస్సాక్షికి విరుద్ధంగా జీవించడం. నైతిక జీవనానికి దూరంగా జీవించడం. 

పరిష్కారం 

నైతికంగా, మనస్సాక్షికి అనుగుణంగా జీవించడమే దీనికి పరిష్కారం. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం. హృదయం మన్షి జీవితానికి దిక్సూచి. అది సరైన దీశాను మాత్రమే చూపిస్తుంది. హృదయ గళాన్ని వినాలి, వణ్ణదాన్ని అనుసరించాలి. ఇది సహజంగా జరగడం కోసమే ధ్యాన సాధన. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే సాహసాన్ని కూడా ఇచ్చేది  కూడా ఈ ధ్యానసాధనే. ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన సాధన.   మొట్టమొదటి రోజు నుండి, మనలో పేరుకుపోయిన  ఈ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని అనుభూతి చెందుతారు. అందరూ తప్పక ప్రయత్నింతురుగాక. 

18, ఏప్రిల్ 2026, శనివారం

ఏప్రిల్ 19, బాబూజీ మహాసమాధి రోజు

 


ఏప్రిల్ 19, బాబూజీ మహాసమాధి రోజు 

సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (షాజహాన్ పూర్, ఉ. ప్ర.), అందరూ ఆప్యాయంగా బాబూజీ మహారాజ్ అని పిలుచుకునేవారు. శ్రీరామ చంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థను తమ గురుదేవులైన సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (ఫతేగఢ్, ఉ. ప్ర.), అందరూ లాలాజీ మహారాజ్ అని పిలుచుకునేవారు, వారికి గురుదక్షిణగా ఈ సంస్థను 1945 లో షాజహాన్ పూర్ లో స్థాపించడం జరిగింది. సహజ్ మార్గ్ జన్మస్థానం షాజహాన్ పూర్.  అక్కడే ఏప్రిల్ 30, 1899 న జన్మించిన పూజ్య బాబూజీ మహారాజ్ ఏప్రిల్ 19, 1983 న మహాసమాధిని  కూడా పొందడం జరిగింది. 

మహాసమాధి అంటే మాస్టర్ భౌతిక దేహం చాలించి, ఆఅ పరతతత్వంలో లీనమైన రోజు; అయినా ఒక సూక్ష్మ స్థితిలో అభ్యాసులకు తమ-తమ అంతరంగం ద్వారా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. 
ప్రతీ సంవత్సరమూ అభ్యాసులు ఈ రోజున ఏప్రిల్ 19 న, వారి దివ్య స్మృతిలో ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం, వారి బోధనలను, వాక్కులను, జీవితాన్ని మరలా-మరలా నెమరువేసుకోవడం,  వారి సాహిత్యాన్ని చదువుకోవడం చేస్తూంటారు శ్రద్ధా-భక్తులు గల అభ్యాసులు.

మన పూజ్య గురుదేవులు, ప్రస్తుత సహజ్ మార్గ్ మాస్టర్ అయిన దాజీ మహారాజ్, రేపు ఉదయం 7.30 గంటలకు ఈ సందర్భంగా వారణాసి నుండి ధ్యానం నిర్వహించనున్నారు. అందరూ శ్రద్ధతో పాల్గొందురుగాక. 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...