16, ఏప్రిల్ 2026, గురువారం

నిరంతర స్మరణ

 

నిరంతర స్మరణ 
అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి?
బాబూజీ: నిరంతర స్మరణ. 

నిరంతర స్మరణ అంటే ఏమిటి? 
సహజ మార్గ గురువులు నలుగురూ తమ అభ్యాసులకు నిరంతర స్మరణ అంటే ఏమిటో, ఎలా అభ్యాసం చేయాలో ఎప్పటికప్పుడు తమ ప్రశంగాల ద్వారా, సంభాషణల్లోనూ, తెలియజేస్తూనే ఉన్నారు. 
నిరంతర స్మరణ అంటే అంతరాయం లేకుండా అంతర్యామిగా హృదయంలో ఉన్న ఆ దివ్య వెలుగు యొక్క స్మరణలో ఉండటం. దివ్యత్వం యొక్క సాన్నిధ్యాన్ని ప్రయత్నం లేకుండా అనుభూతి చెందుతూ ఉండటం. 
నిరంతర స్మరణ అంటే హృదయంలోని దివ్యత్వం యొక్క పరిమళాన్ని సూక్ష్మంగా అనుభూతి చెందుతూ ఉండటం. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ అనుభూతి చెందేది.  
జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా అప్రయత్నంగా జరిగే ప్రక్రియ.

ఆకలి వేసినప్పుడు కడుపు యే విధంగా ఆహారాన్ని స్మరిస్తుందో, దాహం వేసినప్పుడు గొంతుక యే విధంగా నీరును స్మరిస్తుందో, అదే విధంగా హృదయం దివ్యత్వం కోసం పరితపించడమే నిరంతర స్మరణ. - చారీజీ 

మరి ఈ నిరంతర స్మరణను అభ్యాసం చేసేదెలా? 
హార్ట్ఫుల్నెస్ (సహజ్ మార్గ్) పద్ధతిలోని ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం అనే మూడు యౌగిక ప్రక్రియలను అభ్యాసం చేయగా, చేయగా సహజంగా ఆ సాధన నిరంతర స్మరణకు దారి తీస్తుంది. 
ముఖ్యంగా ఉదయం ధ్యానం పూర్తయిన తరువాత కలిగిన ధ్యాన స్థితిని గుర్తించి, ఆస్వాదిస్తూ, (దాజీ చెప్పిన a,e,i,o,u) పద్ధతి ద్వారా రోజంతా ఆ స్థితిని నిలుపుకునే ప్రయత్నం ద్వారా ఈ నిరంతర స్మరణ సిద్ధిస్తుంది. 
ప్రారంభ దశలో, నిరంతర స్మరణను అభ్యాసం చేసే మార్గం బాబూజీ సూచించినది ఇలా ఉంది: మనం చేస్తున్న ప్రతీ పని, ప్రతీ ఆలోచన, మన స్థానంలో  ఆయనే స్వయంగా చేస్తున్నారన్న భావనలో నిర్వర్తించడానికి ప్రయత్నించమన్నారు. 

నిరంతర స్మరణ అంటే యేది కాదు? 
నిరంతర స్మరణ అంటే "మాస్టర్, మాస్టర్  ... " అనుకోవడం కాదు. స్మరణ అంటే మాస్టర్ తో జ్ఞాపకాలు కూడా కావు. కానీ ఆఅ జ్ఞాపకాలను పునరజీవించగలిగితే అది స్మరణ అవుతుందన్నారు, చారీజీ.  

నిరంతర స్మరణ వల్ల సిద్ధించేదేమిటి?
నిరంతర స్మరణ, సాధకుడిని దివ్యత్వానికి చేరువ చేస్తుంది. శుద్ధ చైతన్య స్థితి మనకు కవచంలా పని చేస్తుంది. నిరంతర స్మరణ పరిపక్వ దశలో దైవం పట్ల దివ్యప్రేమగా మారుతుంది. ఆ దివ్యప్రేమ శరణాగతికి దారి తీస్తుంది. శరణాగతి మానవ జీవిత యదార్థ లక్ష్యమైన ఆ దివ్యత్వంలో ఐక్యమయ్యేలా చేస్తుంది.

Stages of Constant Remembrance
First, we forget to remember.
Then we remember to remember.
Then we remember to forget. 
- Babuji  

నిరంతర స్మరణలో దశలు 
మొదట్లో మనం స్మరించడం మరచిపోతాం. 
ఆ తరువాత, స్మరించాలని గుర్తుంచుకుంటాం. 
ఆ తరువాత , మరచిపోవాలని గుర్తుంచుకుంటాం.
- బాబూజీ   


15, ఏప్రిల్ 2026, బుధవారం

కన్నీళ్ళు

 


కన్నీళ్ళు 

కన్నీళ్ళు లేకుండా మనిషి జీవితం ఉండదు. కన్నీళ్ళకి హృదయ స్థితికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి కన్నీళ్ళు వచ్చినప్పుడు రానివ్వాలి - మగవారైనా, ఆడువారైనా. కన్నీళ్ళు బలవంతంగా ఆపినప్పుడు హృదయం జడంగా, బండగా తయారవుతుంది.  

మనిషి పుట్టగానే ఏడుస్తాడు; ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది; పట్టలేని ఆనందం కలిగినపుడు కన్నీళ్ళొస్తాయి. కృతజ్ఞత లోలోతుల్లో నుండి ఊరుతున్నప్పుడు కన్నీళ్ళొస్తాయి; పసికందు ఆకలి వేస్తే ఏడుస్తుంది; పక్క తడిపినప్పుడు ఏడుస్తుంది; ఇబ్బంది కలిసినప్పుడు ఏడుస్తుంది. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు ఏడుపొస్తుంది.  ఉల్లిపాయ తరిగినప్పుడు కూడా కన్నీళ్ళొస్తాయి. కళ్ళకు చాలా మంచిదని కూడా చెప్తారు. భయం వేస్తే కూడా కన్నీళ్ళొస్తాయి. ఇతరుల కష్టాలు చూసినప్పుడు నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా దగ్గర వాళ్ళు మరణించినప్పుడు కన్నీళ్ళు తిరుగుతాయి.  ప్రేమను లోతుగా అనుభూతి చెందినప్పుడు కూడా కన్నీరవస్తుంది. భక్తి పారవశ్యంలో కూడా వస్తాయి కన్నీళ్ళు. హృదయం ద్రవించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. 

వన్నీ కన్నీళ్ళు గుండె బరువెక్కిస్తాయి. భయం, కష్టాలు, దుఃఖం, నొప్పి కలిగినప్పుడు వచ్చిన కన్నీళ్ళు గుండెను బరువెక్కిస్తాయి. 
 మరికొన్ని కన్నీళ్ళు హృదయాన్ని ద్రవింపజేసి గుండెను తేలికపరుస్తాయి. ప్రేమ వల్ల, ఆనందం వల్ల, కృతజ్ఞత వల్ల, భక్తి పారవశ్యం వల్ల, పశ్చాత్తాపం వల్ల  వచ్చే కన్నీళ్ళు హృదయాన్ని కరిగిస్తాయి. శాంతిని చేకూరుస్తాయి. 

కన్నీళ్ళు మనిషిలో మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషి వివిధ సందర్భాలలో స్పందించే విధానం. కన్నీరు బలహీనత కాకూడడంటారు మన మహర్షులు. అందుకే సాధన. కానీ మహాత్ములు రెండు సందర్భాల్లో వచ్చే కన్నీరు శ్రేష్ఠమైనవి అని అంటారు - ఒకటి, గుండె అంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, రెండు, భగవంతుని పట్ల, గురువుపైన నిజమైన ప్రేమ కలిగినప్పుడు.   

ధ్యానం, చదవడం, నవ్వులు, సంగీతంతో కూడిన ఆరోగ్యకర జీవితం

 


 ధ్యానం, చదవడం, నవ్వులు, సంగీతం తో కూడిన ఆరోగ్యకర జీవితం 

ఎంత ధ్యానం చేసినా, ఎంత సాత్త్విక జీవితం గడపాలని చూసినా, జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడం తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇది మహాత్ముల జీవనంలో కూడా కనిపిస్తుంది. జీవితం ఎంత విచిత్రమైనదో గదా!

దీనికి పెద్దలు సూచించిన శ్రేష్ఠమైన ఉపాయం, ఒత్తిడిని సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించుకుంటూ ఆరోగ్యకరంగా జీవించడానికి చదవడం, ధ్యానం, నవ్వులు, సంగీతం - వీటికి తగిన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని కొనసాగించినట్లయితే జీవితం ఆరోగ్యకరంగా ఉండటమే గాక, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కోవచ్చు, జీవితాన్ని ఆస్వాదించవచ్చు కూడా. 

చదవడం 
చిన్న వయసు నుండి చదవడం అలవరచుకున్నట్లయితే, ముఖ్యంగా ఆత్మ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మహాత్ముల జీవిత చరిత్రలకు, మేధో వికాసానికి, సృజనాత్మకతాకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే సూక్ష్మ శరీరాలకు చాలా ఆరోగ్యం చేకూరుతుంది.

ధ్యానం 
ధ్యానం కూడా ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ ధ్యానం వంటిది 15 సంవత్సరాలకే ప్రారంభించి, కొనసాగించగలిగితే జీవితం అద్భుతంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ధ్యానం వల్ల మనసు క్రమశిక్షణలో ఉండటం, ఏకాగ్రత పెరగడం, ఆలోచనలో స్పష్టత రావడం తద్వారా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, చాలా అవసరమైన వివేకం వృద్ధి చెందడం, మానసిక ప్రశాంతత పెరగడం, మనసు నిశ్చలంగా తయారవడం, ఇలా అసంఖ్యాకంగా ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. జీయితం ఎక్కడికక్కడ తనంతటదే  సర్దుకుంటుంది.  

నవ్వులు 
ధ్యానం చేసేవాళ్ళు, చదువుకునేవారు, ఎప్పుడూ గంభీరంగా ఉండనవసరం లేదు. అలా ఉంటే సమతౌల్యతను కోలపోయ, వ్యక్తిత్వాలు అదో రకంగా తయారవడం వల్ల ఎవ్వరూ వద్దకు రావడానికి ఇష్టపడరు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జీవితంలో నవ్వుకు చాలా ముఖ్య ప్రాధాన్యతనివ్వాలి. నవ్వు భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరం. నవ్వడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడొక మహానుభావుడు. యోగం కాబట్టే నవ్వితే, హృదయం తేలికపడుతుంది. 

సంగీతం 
 మనిషి మాత్రమే ఎక్కువగా ఆస్వాదించగలిగే మరొక కల సంగీతం. సంగీతం కూడా ఒక యోగమే. మనసును ఆహ్లాదపరచడమే గాక, పరవశింప జేస్తుంది; మయిమరిపిస్తుంది; అలౌకిక సుఖాన్నిస్తుంది. సంగీతం విన్నా, పాడుకున్నా, సంగీతం తెలిసినా, తెలియకపోయినా మనిషిలో ఆఅ రసాస్వాదన సహజంగా జరుగుతుంది. సాంప్రదాయ సంగీతం, భక్తి సంగీతం అయితే ఆధ్యాత్మిక లక్ష్యాలున్నవారికి భక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి కూడా. సంగీతం వల్ల భాష శుద్ధి జరుగుతుంది, సంస్కృతి పెరుగుతుంది. మనసు పవిత్రమయ్యే అవకాశం కూడా ఉంది. 

ఈ విధంగా ప్రతీ మనిషి తన జీవితంలో ఈ నాలుగు సముచితమైన స్థానాన్ని గ్రహిస్తే జీవితం ఆరోగ్యంగా ఉండటమే గాక, జన్మ తరించే అవకాశం కూడా ఉంటుంది. 

11, ఏప్రిల్ 2026, శనివారం

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉల్లేఖించిన సాధకుడు అనుభూతి చెందే వివిధ ఆధ్యాత్మిక అవస్థలు (స్థితులు)



భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉల్లేఖించిన సాధకుడు అనుభూతి చెందే వివిధ ఆధ్యాత్మిక అవస్థలు (స్థితులు)


ఆధ్యాత్మిక అధిరోహణలో సాధకుడు తాను ఉన్న స్థితి నుండి అత్యున్నత స్థితి వరకూ ఉండే అవస్థలను శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో అర్జునుడికి, అర్జునుడి ద్వారా మానవాళికి  ఉల్లేఖించడం జరిగింది. అత్యున్నత స్థితినే హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ పద్ధతిలో సహజ సమాధి అంటారు. అంటే చంచలంగా అశాంతితో కూడిన మనసు నుండి మనిషి ఆధ్యాత్మికంగా  ఏకత్వ స్థితిని సాధించే క్రమంలో ఎదురయ్యేటువంటి భగవానుడు తెలియజేసిన అవస్థలను/స్థితులను పరిశీలిద్దాం.  వీటిని సహజ్ మార్గ్ లో ప్రతీ సాధకుడు తన అనుభవంలోకి రావడం గమనించగలుగుతాడు. 

1. విక్షిప్త మనస్సు: చంచల మనస్సు, అన్నీ దిశల్లోనూ అడుపులేకుండా తిరుగుతూ ఉండే మనస్సు. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 34)

2. ఏకాగ్ర మనస్సు: చంచలమైన మనస్సు నిశ్చల ఏకాగ్ర స్థితికి చేరుకోవడం. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 26)  

3. స్థితప్రజ్ఞ స్థితి: సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా చలించకుండా, మనస్సు కదలని స్థితి; సమస్థితి. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 56) 

4. యుక్త స్థితి: జ్ఞానంతోనూ, అనుభవంతోనూ తృప్తితో ఉండే స్థితి యుక్త స్థితి. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 8)

5. బ్రహ్మభూత స్థితి:  బ్రహ్మభూత స్థితిలో మనస్సు దుఃఖించదు, ఆశించదు, అందరి పట్ల సామాన్య దృష్టితో వ్యవహరిస్తుంది. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 54)

6. పరాభక్తి స్థితి: ఎవరి పట్ల ద్వేషం లేకుండా స్నేహంతోనూ, కారుణతోనూ ఉండే మనఃస్థితి.(భగవద్గీత అధ్యాయం 12, 13, ) 

7. తురీయ స్థితి: మనిషి జీవించే మూడు అవస్థలకతీతంగా (జాగృత, స్వప్న, సుషుప్తావస్థలు) ఉండే నాల్గవ స్థితే తురీయావస్థ. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 20,)

8. తామరాకుపై నీటి బొట్టులా ఉండటం: నీటిలో ఉంటూ కూడా తామరాకు నీటి బొట్టు అంటకుండా యే విధంగా ఉంటుందో, అలాగే మానవుడు కూడా సంసారంలో ఉంటూ కూడా సంసారం అంటకుండా జీవించగలడు. (భగవద్గీత అధ్యాయం 5, శ్లోకం 10)

9. నిష్కామ కర్మ: యే ఫలితమూ ఆశించకుండా తన కర్మలను తాను ఈశ్వరార్పణ భావంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ పోవడం. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 47) 

10. శరణాగతి: అన్ని ధర్మాలూ విడిచిపెట్టేసి, సంపూర్ణ భారం ఆయణపైనే ఉంచి జీవించడం. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 66)

11. పరమ గమ్యం: అక్కడ సూర్యని వెలుగు కానీ, చంద్రుని వెలుగు కానీ, మరే రకమైన వెలుగూ ఉండదు. అక్కడికి చేరుకున్నవాడు ఇక తిరిగి రావడం ఉండదు. (భగవద్గీత అధ్యాయం 15, శ్లోకం 6)

భగవద్గీత మార్గాన్ని చూపిస్తుంది, హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ ఆఅ మార్గంలో నడిపిస్తుంది, అనుభవాన్నిస్తుంది.  

9, ఏప్రిల్ 2026, గురువారం

మానవ శరీర వ్యవస్థలో 3 శరీరాలు - పంచ కోశాలు


మానవ శరీర వ్యవస్థలో 
3 శరీరాలు - 5 కోశాలు 

మన మహర్షులు మన అస్తిత్వానికి, మన చుట్టూ ఉన్న అస్తిత్వానికి గల మూల కారణం ఏమిటో తెలుసుకునే క్రమంలో, వాళ్ళ తపోధ్యానాదుల ద్వారా ఈ మానవ శరీరాన్ని ఈ విధంగా దర్శించారు. 

మనందరికీ కనిపించే మానవ శరీరం, నిజానికి 3 శరీరాల వ్యవస్థ అని మహర్షులు దర్శించారు. వాటినే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని చెప్తారు. అలాగే ఈ శరీర వ్యవస్థను పంచ కోశాల వ్యవస్థగా కూడా దర్శించడం జరిగింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు. ఈ 5 కోశాలకు అతీతమైనది శుద్ధ చైతన్యం లేక ఆత్మ అని అంటాం. 


స్థూల శరీరం
 ఇది కనిపించే భౌతిక శరీరం. అంటే  బయటున్న అవయవాలు, లోపలున్న అవయవాలు, యముకలు, రక్తం, నరాలు, రక్తనాళాలు, కండరాలు ఉతయాదివన్నీ కలిపిస్తే స్థూల శరీరం అవుతుంది. అన్నమయ కోశం స్థూల శరీరానికి సంబంధించినది. 

సూక్ష్మ శరీరం
 5 కరమేమదరుయాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 వాయువులు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. మొత్తం కలిపి 19 సూక్ష్మ శరీరాలంటారు మన శాస్త్రకారులు. సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక పథంలో ప్రధానంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము అనే నాలుగ సూక్ష్మ శరీరాలపైనే పని జరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు సూక్ష్మ శరీరాలను అంతఃకరణ అని కూడా అంటారు. అంతఃకరణ శుద్ధి అనే పద్యం వాడుతూ ఉంటాం; దీని అర్థం ఈ 4 సూక్ష్మ శరీరాల శుద్ధి జరగటమే. అప్పుడే మనిషిలో ఆత్మ పరివర్తన జరుగుతుందని సహజ్ మార్గ్ బోధిస్తుంది. 
సూక్ష్మ శరీరంలోనే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలుటాయి.  

కారణ శరీరం
  ఆత్మకు అతి సమీపమైన ఆవరణను ఆనందమయ కోశం అని లేక అతి సమీపంగా ఉండే శరీరాన్ని కారణ శరీరం  అని అంటారు. మూడ్ శరీరాలకు అతీతమైనది ఆత్మ; లేక శుద్ధ కైతన్యం. అలాగే 5 కోశాలకు అతీతమైనది ఆత్మ ఇనికి లేక శుద్ధ కజాయితన్యం ఉనికి. దీని స్పర్శ కేవల ధ్యానం వల్లనే సాధ్యం. 

భగవద్గీత 7 వ అధ్యాయం, 7 వ శ్లోకం 
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥
భావం 
హృదయంలో ఉన్న ఆ ఆత్మే, ఆఅ శుద్ధ చైతన్యమే, ఆ అంతర్యామియే, ఆ దివ్యత్వమే, ఆ “సూత్రం”, ఆ దారం మనం ధ్యానం ద్వారా ఆ అంతర్యామిని అనుభవిస్తాము.  అన్ని హృదయాలను (మణులను)  ఒకే దైవ శక్తి (సూత్రం) కలిపి ఉంచుతుంది. 

7, ఏప్రిల్ 2026, మంగళవారం

గురు తేజ్ బహాదుర్ (1621-1675)

 



గురు తేజ్ బహాదుర్ (1621-1675) 

హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్ 29 - మే 1 తేదీ వరకూ జరుపుకునే పూజ్య బాబూజీ మహారాజ్  జయంత్యుత్సవాలతో పాటుగా, సిక్కు ధర్మానికి సంబంధించిన మన తోటి సాధకులతో ప్రత్యేకంగా గురు తేజ్ బహాదుర్, సిక్కుల 9 వ గురువు జయంత్యుత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. మనం ప్రతీ సంవత్సరం ఈ భండారా సమయంలో టుకడోజీ మహారాజ్ జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. 

ఈ సందర్భంగా సిక్కు ధర్మానికి చెందిన 9 వ గురువైన గురు తేజ్ బహాదుర్ గురించి చిరు పరిచయం చేసుకుందాం. 

గురు తేజ్ బహాదుర్, 1621 ఏప్రిల్ 1 వ తేదీన అమృత్సర్  లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండి ధైర్యసాహసాలు కనబరచేవారు. సరళమైన వ్యక్తిత్వం, ధ్యానం అంటే ప్రత్యేక మక్కువ కనబరచేవారు. వీరు ఆనందపూర్ సాహెబ్ గురుద్వారాలో ఉంటూ సిక్కు మాట బోధనలను వ్యాపింపజేస్తూండేవారు. ఉత్తర భారతం అంతా విస్తృతంగా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలనందిస్తూ ప్రజలను ఉద్ధరించే పనిలో జీవితంలో చాలా కాలం వెచ్చించారు. వీరి ముఖ్య బోధనలు - నిర్భయత్వం, వైరాగ్యం, సమత్వం, కరుణ, సరళయత్వం, ధ్యానమయ జీవనాన్ని బోధించేవారు. 

బలవంతపు ధర్మ పరివర్తన విషయంలో  మొగల్ సామ్రాజ్యాధినేతల ఆగడాలు, భరించలేక, కాష్మీరీ పండితులు,  వీరి సహాయం కోరితే, వెంటనే అంగీకరించారు. అందరికీ ఎవరికి నచ్చిన మతం వారు  అనుసరించే స్వేచ్ఛ అందరికీ ఉండాలని నమ్మేవారు. బలవంతం చేస్తున్నవారికి ఎదురు తిరిగేవారు.  ఆ సందర్భంలో ఔరంగజేబ్, అప్పటి మొగల్ చక్రవర్తి, ఆజ్ఞ మేరకు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు గురు తేజ్ బహాదుర్ తలను బహిరంగంగా నరికేయడం జరిగింది. ఆ విధంగా 1675 లో, ఢిల్లీలో వారి దుర్మరణం సంభవించింది, మత స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రాణాలు అర్పించి అమర వీరుడయినాడు. మత స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం పోరాడటంలో ప్రపంచానికే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారు. 

మన సిక్కు సోదర సోదరీమణులందరితో కలిసి పూజ్య దాజీ సమక్షంలో గురు తేజ్ బహాదుర్ గారిని మనసారా స్మరించుకుందాం. 

6, ఏప్రిల్ 2026, సోమవారం

నిశ్శబ్దం

 


నిశ్శబ్దం 

శబ్దం అంటే సంస్కృతంలో తరంగం అని అర్థం. ఆంగ్లంలో వైబ్రేషన్ అంటారు. ఈ సృష్టిలో, పరికించి చూసినట్లయితే  ప్రతీదీ శబ్దమే, ప్రతీదీ వైబ్రేషనే. సృష్టే ఒక శబ్దం, ప్రతీ జీవి ఒక శబ్దమే, మాట శబ్దం, భాష శబ్దం, అణువు శబ్దం, పరమాణువు శబ్దం, పదార్థం శబ్దం, ఆలోచన శబ్దం, ఉద్వేగం శబ్దం, భావం శబ్దం, కోరిక శబ్దం, వికారాలు శబ్దాలు ఇలా అన్నీ శబ్దాలని అర్థం అవుతుంది. ఈ శబ్దాలు కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని అంతరంగంలో ఉన్నాయి. 

మరి నిశ్శబ్దం అంటే ఏమిటి? బహుశా ఈ శబ్దాలన్నీటినీ దాటిన స్థితి అయి ఉండాలి, శబ్దాతీత స్థితి. అందులో నుండే ఈ శబ్దాలన్నీ ఆవిర్భవించి ఉండవచ్చు. నిశ్శబ్దం అంటే శూన్యమా? శూన్యంలో కూడా ఓంకార శబ్దం వినిపిస్తుందంటారు మన మహర్షులు. బహుశా అస్సలు యే శబ్దమూ పరమ శూన్య స్థితి కూడా ఉందేమో. అదే మనం అనుకునే దైవత్వం కావచ్చు. సమస్తానికి మూలం. అటువంటి అస్సలు శబ్దం లేని నిశ్శబ్దమే భగవంతుని బాష అని మన మాస్టర్లు అంటూ ఉంటారు. 

మరి ఈ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందగలమా? అంటే తప్పకుండా అనుభూతి చెందవచ్చునంటారు మన మహర్షులు, మహాత్ములు. దానికి ధ్యాన సాధనే మార్గం. బాహ్య శబ్దాలను కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అంతరంగ శబ్దాలను (ఆలోచనలు, ఉద్వేగాలు, కోరికలు, వికారాలు, సంస్కారాలు) తగ్గించుకోవడం కష్టసాధ్యమే. మనలో చాలా మందిమి ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాం. 

అయితే వీటిని, ఈ అంతరంగ శబ్దాలను (గోలను) తగ్గించుకునే ఉపాయం ఏమిటి? బాబూజీ చెప్పిన చక్కని సరళమైన ఉపాయం: హృదయంలో దివ్యవెలుగు ఉంది అనే భావనపై ప్రాణాహుతి అనే దివ్యశక్తితో కూడిన ధ్యానం చేయమన్నారు. అటువంటి ధ్యానం వల్ల కలిగిన ధ్యానస్థితిని ఆస్వాదిస్తూ సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలుపుకోమన్నారు. నెమ్మదిగా, క్రమక్రమంగా  మనసు లక్షణమే సూక్ష్మంగా మారుతుంది. నిజమైన నిశ్శబ్ద స్థితి అనతికాలంలోనే అనుభూతి చెందగలుగుతారు. ఈ నిశ్శబ్ద శితి యొక్క స్పర్శ మొట్టమొదటి రోజు నుండి అనుభూతి చెందడం కొంతమంది గమనించగలుగుతారు. 

కాబట్టి ధ్యానం ద్వారానే గాకుండగా మనందరమూ ప్రయత్న పూర్వకంగా లోపల, బయట కూడా నిశ్శబ్దాన్ని పాటించడానికి ప్రయత్నించినట్లయితే మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గంగా పరిణమించడం మనం గమనించగలుగుతాం. ఈ నిశ్శబ్దానికి అతీతమైన దివ్యవెలుగు దిశగా చేసే యాత్రే  ఆధ్యాత్మిక యాత్ర. 





నిరంతర స్మరణ

  నిరంతర స్మరణ  అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి? బాబూజీ: నిరంతర స్మరణ.  నిరంతర స్మరణ అంటే ఏమిటి?   సహజ మార్గ గురువులు...