28, ఫిబ్రవరి 2026, శనివారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

 


జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం 

తెలంగాణాలో 

శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 5


పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనసాగుతూ మహబూబాబాద్ జిల్లా లోని జయ్యారం అనే ఒక చిన్న గ్రామంలో మన ఆశ్రమ నిర్మాణ పనిలో కూడా ఒక చిరు పాత్ర లభించింది.
 
ఇక్కడ సుమారు 30 అభ్యాసులున్నారు.  ఈ కేంద్రం విశేషం ఏమిటంటే వాతావరణం ప్రేమతో నిండి ఉంటుంది. అభ్యాసులందరూ ప్రేమపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమ నిర్మాణ వర్కర్ల పట్ల వీరు కనబరచిన ఆతిథ్యం, ప్రేమ అద్వితీయం. ఈ అభ్యాసులందరూ ఆశ్రమం కోసం, నిర్మాణ లేబర్ తో సమానంగా (నిర్మాణ సమయం అంతా) శ్రమించడం హృదయాన్ని ద్రవించింది.   ఇక్కడ చుట్టు-ప్రక్కల ఉన్న అభ్యాసీలు కూడా ఎంతో సహృదయంతో తమ విరాళాలతో సునాయాసంగా ఆశ్రమ నిర్మాణానికి తోడ్పడ్డారు. వీళ్ళు అజ్ఞాతంగా ఉండటానికే ఇష్టపడే అభ్యాసులు.  జయ్యారం బృందమే గాక బంగ్లా, ఖమ్మం బృందాలు కూడా  గొప్ప సహకారాన్ని అందించారు. 10 మాసాల్లోనే  ఈ నిర్మాణం వీళ్ళందరి సహకారంతో చక్కగా తీర్చి దిద్దబడింది. పూజ్య గురుదేవులు రిమోట్ గా సత్సంగాన్ని నిర్వహించి ప్రారంభించడం జరిగింది. 

దీని చరిత్ర చాలా ఆసక్తికరమైనది. 1976 లో ఈ గ్రామానికి చెందిన మన ప్రశిక్షకులు, ఉపాధ్యాయులు అయిన  కీ.శే. భిక్షమయ్యగారు 15 మంది అభ్యాసులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. 1981 లో 436 రూపాయలతో చిన్న భూమి కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 10,1983 న పూజ్య బాబూజీ మహారాజ్ ఎంతో కరుణతో ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికని 6000 రూపాయలు అనుగ్రహించడం జరిగింది. ఆ భూమిని కొంచెం పెద్దది చేసి ఈ నాడు ఈ ఆశ్రమ నిర్మాణం జనవరి, 2023 లో పునరుద్ధరించబడి, ప్రారంభించబడింది. 

ఈ ఆశ్రమ నిర్మాణ క్రమంలో సామరస్యం, పరస్పర గౌరవం, ప్రేమ ఉంటే పనులు ఎంత త్వరగా జరుగుతాయో ప్రత్యక్షంగా నేర్చుకోవడం జరిగింది. 
 


27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 4

 

ఫిబ్రవరి 22-24, 2019 కరీంనగర్ మొట్టమొదటి ధ్యానోత్సవం 

తెలంగాణాలో

 శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 4 

మనిషిలో సహజంగా పరివర్తన, ఆధ్యాత్మిక పరిణతిని   తీసుకురాగలిగే ప్రాణాహుతి శక్తిని, భూమ్మీదున్న ప్రతీ గుండెకీ అందించే పవిత్ర కార్యాన్ని విశ్వవ్యాప్తి చేయడం కోసం పూజ్య దాజీ అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాల్లోనూ, కార్పొరేట్లలోనూ, పోలీసులకు, డాక్టర్లకు, ఇంజనీయర్లకు, లాయర్లకు, గృహస్థులకు, ఇలా అన్ని వర్గాల వారికి, కులమత రంగు, భాష, జాతి వివక్ష లేకుండా హార్ట్ఫుల్నెస్  ధ్యాన పరిచయం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే సాధారణ ప్రజలకు విస్తృతంగా ఈ పరిచయ కార్యక్రమం అందించాలని సంకల్పించారు. దీనికనుగుణంగా ఛత్తీశ్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఒక స్టేడియంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ గా ఈ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడం జరిగింది. దానికి 3000 కు పైగా ప్రజలు హాజరయ్యారట. అటువంటి కార్యకమాన్నే  కరీంనగర్ లో కూడా చేద్దామని సూచించడం జరిగింది. అది పూజ్య దాజీ స్వయంగా నిర్వహించవలసిన కార్యక్రమం. అప్పుడే కానహాలో బసంత్ కార్యక్రమం పూర్తయ్యింది. వారి కంఠంలో ఇబ్బంది కలిగి మాట్లాడలేని స్థితిలో ఉన్నానన్నారు. ఎలాగూ నేను తెలుగులో మాట్లాడలేని కదా, మీరే తెలుగులో నిర్వహించమనడం జరిగింది. ఆ విధంగా కృష్ణను 3 రోజులూ పద్ధతిని గురించి పరిచయం ఇవ్వమని కోరడం జరిగింది. ఆ విధంగా ఆ గురువాజ్ఞ, నాకు మొట్టమవదాటుసారిగా తెలుగులో పబ్లిక్ గా మన పద్ధతిని పరిచయం చేసే మహద్భాగ్యం, వారి అనుగ్రహం కలిగింది. కానీ నా గుండెల్లో గుబులు కూడా బయల్దేరింది. మరలా వారినే బలంగా స్మరించుకుని కార్యక్రమానికి ఉపక్రమించడం జరిగింది. 


ఆ సమయంలో కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత మన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అప్పుడే మన కార్యక్రమానికి "ధ్యాయణోత్సవం" అన్న పేరు మనసులో మెదిలింది. అందరూ ఆ పేరును స్వీకరించిన తరువాత ఆ పేరుపైన బ్యానర్లు, ఫ్లయర్లు, తయారు చేసేసిన తరువాత గురుదేవులకు చూపించడం జరిగింది, అమాయకంగా. ప్రింట్ చేయక ముందు అనుమతి తీసుకోవలసింది, తరువాత వారి ముందుంచడం జరిగింది. వారి అపార అనుగ్రహం, వారికి ఆ పేరు బాగా నచ్చింది. అప్పటి నుండి ఇటువంటి కార్యక్రమాలను ధ్యానోత్సవాలని పిలవడం జరుగుతోంది. గ్రామాల్లో చేసే కార్యక్రమాలను గ్రామ ధ్యానోత్సవం పేరున నిర్వహించడం జరుగుతోంది. 


ఇక నిర్వహించిన తీరు చాలా అమాయకంగా జరిగింది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంపూర్ణ సామరస్యంతో నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ అభ్యాసీలందరూ ఎంతో ప్రేమగా సహకరించడం జరిగింది. మన సోదరీమణులు ఇంటింటికీ కుంకుమ భరణితో వెళ్ళి బొట్టు పెట్టి ఎంతో ఆదారంగా ఆహ్వానించడం జరిగింది. ఇంచుమించు లక్ష మందిని పిలవడం జరిగింది. ఆ 3 రోజులూ కరీంనగర్ పట్టణం అంతా హార్ట్ఫుల్నెస్ పండుగలా ఉండింది వాతావరణం. మన ఆహ్వానానికి 5000 మందికి పైగా స్పందించి విచ్చేయడం జరిగింది. బి. ఆర్.  అంబేద్కర్ స్టేడియం కళాకళలాడింది. వచ్చిన జనం ఓపికగా కూర్చున్నారు. ప్రసాదం తీసుకుని వెళ్ళారు. అలా 3 రోజులూ 5000 సంఖ్య తగ్గలేదు. 


వ్యక్తిగతంగా నాకు మొట్టమొదటిసారిగా 5000 మందికి పద్ధతిని గురించి పరిచయం చేసే అవకాశం, అంత మందికి ధ్యానం నిర్వహించే అవకాశం, ఆ అద్భుత లోపలి వాతావరణం, బయట వాతావరణం, వ్యక్తం చేయలేని విధంగా నా హృదయాన్ని ద్రవింపజేశాయి. పూజ్య గురుదేవులు గంట-గంటకీ ఇక్కడ రిపోర్ట్ తెలుసుకుంటూ వారి దృష్టి అంతా కరీంనగర్ పైనే ఉంచడం చూసి గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహం, ఏంచేసినా వారి ఋణం తీర్చులేనిది. వారి పట్ల నాకున్న శ్రద్ధ ఎన్నో రెట్లు బలపడింది. అలాగే అభ్యాసీల కళ్ళల్లో ఆ 3 రోజుల్లో ఉన్న ఆనందాన్ని చూసి మరింత తన్మయుడినయిపోయాను. ఇది గాక కాన్హా శాంతి వనం నుండి పెద్ద-పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నవారందరూ వచ్చి వారి సహకారాన్ని అందించడం మరింత కనువిందుగా అనిపించింది. మొత్తానికి ఈ మొట్టమొదటి ధ్యానోత్సవం (తెలుగులో), కరీంనగర్ అభ్యాసీలకు ఒక మారువరాని జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఈ ఉత్సవ ఫలితం ఏమిటంటే, ఇందులో పాల్గొన్న ఇద్దరు సాధకులు ప్రస్తుతం మన సంస్థలో పరాశిక్షకులుగా సేవాలనందిస్తున్నారు. 


ఆ తరువాత ఖమ్మంలో కూడా ఇదే ఎత్తులో ధ్యానోత్సవం జరిగింది. అక్కడ కూడా నిర్వహించే అవకాశం లభించింది. అలా తెలంగాణా మొత్తం సుమారు 60-70 ధ్యానోత్సవాలు నిర్వహించే అవకాశం, నా జన్మకు ధన్యతను చేకూర్చింది. 

26, ఫిబ్రవరి 2026, గురువారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 3

 

కొత్తగూడెం, సింగరేణి కొల్లరీస్ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్ పరిచయ కార్యక్రమంలో  గౌరవనీయ సోదరులు ఎ. పి. దురై గారితో 
తెలంగాణాలో 
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 
నా ప్రస్థానం - 3 

జోన్ కో-ఆర్డినేటర్ గా నాకు పూజ్య గురుదేవులు అందించిన ప్రశిక్షణ ద్వారా,  నా ఆధ్యాత్మిక అవగాహనకు, నా ఆధ్యాత్మిక ఉన్నటికి  తోడ్పడే అంశాలు అనేకం చెప్తే కూడా నేర్చుకోలేనివెన్నో  ప్రత్యక్షంగా బోధపడే అవకాశాన్ని కలిగించారు. పూజ్య చారీజీ చాలా సార్లు, "సహజ మార్గంలో వివిధ సంస్థ నిర్వహణా బాధ్యతలను అభ్యాసులకు అప్పగించేది, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమేనని" అన్న మాటలలోని నిజం, పని చేస్తున్నప్పుడు అర్థమయ్యింది. ఇదే హార్ట్ఫుల్నెస్ లో స్వచ్ఛంద సేవలోని రహస్యం. బహుశా సాధన ద్వారా కూడా అంతా తీవ్ర పురోగతి సాధ్యంకాదేమో! 

కొత్తగూడెంలో సింగరేణి కొల్లరీస్ వారు తమ ఉద్యోగులకు హార్ట్ఫుల్నెస్  పరిచయం చెయ్యాలని పూజ్యశ్రీ  చారీజీ మహారాజ్ కు ప్రియ శిష్యులలో ఒకరైన, మన సంస్థకు దాదాపు 15 సంవత్సరాలు చారీజీకి ప్రైవేట్  సెక్రటరీగా పని చేసిన కీ. శే. శ్రీ ఎ. పి. దురై (ఐ. పి. ఎస్.) గారిని  ఆహ్వానించడం జరిగింది. వారు పదవి విరమణకు పూర్వం కర్ణాటక రాష్ట్ర డి. జి. ఆఫ్ పోలీస్ గానూ, నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్  డైరెక్టర్ గానూ, ఆర్. పి. ఎఫ్. డి. జి. గానూ అద్భుతమైన సేవలనందించిన క్రమశిక్షణతో కూడిన వ్యక్తి. 

ఆ సందర్భంలోనే అక్కడ చుట్టు ప్రక్కల ఉన్న 8 కేంద్రాలను 2 రోజుల్లో సందర్శించడం, అక్కడున్న అభ్యాసులకు ప్రేరణ-స్ఫూర్తులను కలిగించడం జరిగింది. వారితో ప్రయాణించడంలో ఈ 2 రోజుల్లోనే, కొన్ని సంవత్సరాలలో నేర్చుకోవాలసినవి నేర్చుకున్నట్లుగా అనిపించింది. వారితో ప్రయాణిస్తున్నప్పుడు చారీజీతో ప్రయాణిస్తున్నట్లనిపించిన అనుభూతి కలిగింది. వారి క్రమశిక్షణ, వారు తనను తాను నిర్వహించుకునే విధానం, తన గురుదేవుల పట్ల వారికున్న నిష్ఠ, ప్రేమ, భక్తి, పూజ్య భావం, జీవితాన్ని, సహజ మార్గాన్ని గురించిన నిగూఢమైన అవగాహన, అనుభవం, వారి సంభాషణా పటిమ, అందరి అభ్యాసులతోనూ వారు మెలగిన తీరు, ఆ నిరాడంబరత, చారీజీతో వారికున్న అనుబంధం, ఇన్ని ఉన్నా, అస్సలు గర్వం లేశమాత్రం కూడా తొణికిసలాడకపోవడం, అంతా వినమ్రంగా ఉండగలగడం, సంస్థను నిర్వహించడంలో వారి నైపుణ్యం - ఇవన్నీ ఒక్క వ్యక్తిలో అతి దగ్గరగా దర్శించగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించిన పూజ్య దాజీకి శతకోటి నమస్సులు. దురైగారు తన అనుభవాలను నా వంటి అల్పునితో పంచుకుంటూ, యే విధంగా నిర్వహించాలో అన్న మెళకువలు నాకు నేర్పుతూ వారితో నేను గడిపిన రోజులు, సమయం నా హృదయ ఫలకం మీద శాశ్వతంగా ఉండిపోతాయి. వారు చారీజీతో అనుభవాలను అనేక గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఒక రెండు గ్రంథాలను నాకు బహూకరించారు కూడా. 

ఈ ప్రయాణంపై పూజ్య దాజీని నేను రిపోర్టు వ్రాసి, దూరాయిగారికి కూడా ఒక కాపీ పెట్టినప్పుడు పూజ్య దాజీ స్పందిస్తూ, దూరాయిగారిని ఎంతగానో ప్రశంసించారు. అలాగే దురైగారు దానికి స్పందిస్తూ నాకు వ్రాస్తూ నేను రిపోర్టు వ్రాసిన తీరు, విధానాన్ని ప్రశంశిస్తూ, ఒక ఫంక్షనరీ ఈ మాత్రంగా వ్రాయడం సెక్రటరీగా ఉన్న నా ఈ అనుభవంలో చూడలేదు, ఒప్పవకోవలసిందే. కీప్ ఈట్ అప్ అన్నారు. నాకు భారత రత్న అవార్డు లభించినంత ఆనందం కలిగింది. వెంటనే గురుదేవులకు మరొక్కసారి మనసులో కృతజ్ఞతలను వ్యక్తం చేసుకుంటూ సర్దుకున్నాను. కానీ ఇది ఒక్క చక్కని జ్ఞాపకం. 
(సశేషం .... )

24, ఫిబ్రవరి 2026, మంగళవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 2

 

జైపూర్ - తెలంగాణా ఆశ్రమంలో పూజ్య దాజీతో 
తెలంగాణాలో 
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 
నా ప్రస్థానం - 2

తెలంగాణా అభ్యాసులు సరళస్వభావులు, మర్యాద-గౌరవం గలవారు, ఆతిథ్యం ఎంతో ప్రేమతో చేస్తారు, ఆత్మగౌరవం మెండుగా గలవారు, దైవం పట్ల మంచి సహజంగానే నమ్మిక గలవారు, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపిస్తే నిండుగా నిబద్ధతతో నిర్వహిస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో పని చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. నేను చెప్పినవాటికి నిదర్శనం ఇక్కడ మన సంస్థ యొక్క స్వంత ఆశ్రమాల సంఖ్యే. హైదరాబాదులో నాలుగు (దోమల్ గుడా, బి. హెచ్. ఈ. ఎల్. రామచంద్రాపురం,  తూముకుంట, కాన్హా శాంతి వనం) ఆశ్రమాలు గాక, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలవంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, జయ్యారం, నల్గొండ, మిర్యాలగూడా, పెద్దపల్లి, ఆదిలాబాద్, చిత్తనూర్, అమరచింత, మందమర్రి, భద్రాచలం, అశ్వాపురం, గోపాల్రావుపేట్ (కరీంనగర్ వద్ద), భూపాలపల్లి, గోదావరిఖని, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మహబూబ్ నగర్,  ఇలా ఇంచుమించు 20 ఆశ్రమాలకు పైగా సందర్శించడం జరిగింది. ఇవిగాక అనేక కేంద్రాలు - గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సందర్శించడం జరిగింది. కొన్ని కొత్త కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. నూతన ప్రశిక్షకులను అవసరమైన చోట, సహజ్ మార్గ్ వ్యాప్తి కోసం గురుదేవులకు సిఫార్సు చేసే అవకాశం కలిగింది. అలాగే సెంటర్ కో-ఆర్డినేటర్లను, జోన్ కో-ఆర్డినేటర్లను, సిఫార్సు చేసే అవకాశం కూడా కలిగింది. అన్నీ కేంద్రాల్లోనూ అభ్యాసుల సహకారం, ఆప్యాయతలు సంపూర్ణంగా లభించాయి. ఎప్పటికప్పుడు పూజ్య గురుదేవులకు రిపోర్టులు పంపించడం జరుగుతూ ఉండేది. ఇవి గాక, అభ్యాసులకు  ప్రేరణాదాయకమైన శిక్షణా కార్యక్రమాలు, అలాగే ప్రశిక్షకులకు తెలుగులో ప్రిసెప్టర్ వర్క్ గురించిన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ ప్రిసెప్టర్ వర్క్ గురించిన కార్యక్రమాన్ని పూజ్య గురుదేవుల అనుమతితో ఒకసారి కరీంనగర్ లోనూ, ఒకసారి ఒంగోలు కేంద్రంలోనూ, ఒకసారి జూమ్ కాల్ ద్వారానూ కూడా నిర్వహించే అవకాశం లభించింది.  
(సశేషం .... )

23, ఫిబ్రవరి 2026, సోమవారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 1

 


కరీంనగర్ ఆశ్రమంలో పూజ్య దాజీ - 2018 
తెలంగాణాలో 
శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 
నా ప్రస్థానం - 1 

శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో తెలంగాణా ప్రాంతంలో జోన్-కో ఆర్డినేటర్ గా, ఒక స్వచ్ఛంద సేవకుడిగా,  ఒక దశాబ్ద కాలం పూర్తయ్యింది. తర్వాతి తరం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిన్నటి రోజున లాంఛనంగా నా వారసునికి బాధ్యతలను అప్పగించి వచ్చిన సందర్భాన, తెలంగాణాలో నా ఈ ప్రస్థాన అనుభవాలను, నేర్చుకున్న అంశాలను, పూజ్య గురుదేవుల అదృశ్య అభయ హస్తం, బాహ్యాంతరంగాల ద్వారా వారి నుండి అందిన  మార్గదర్శనం, వారు వర్షించిన కృపను, వారి పట్ల అపార కృతజ్ఞతతో ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను.  

2016 లో నాతోపాటు నా మరో సన్నిహిత సోదరుడైన డా. సాయి రామ్ ను ఒకేసారి పిలిచి ఈ బాధ్యతలను, మాకు పూజ్య డాజేఏయే స్వయంగా కాన్హా శాంతి వనంలో  తెలియజేయడం జరిగింది. ఇరువురికీ ఒకే రకమైన సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలి ఇలా ఉన్నాయి:  "మీరిద్దరూ బాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వెళ్ళిన ప్రతీ చోట ఉన్న అభయాసులను సాధ్యమైనంత వరకూ ప్రతీ ఒక్కరితో పరిచయం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వినమ్రంగా ఉంటూ మీ పనులు మీరు చెయ్యండి. చేస్తారా?" అని ప్రశ్నించారు. "మీరు కేప్పింది చెప్పినట్లే చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం అన్నాం మేము. ఆ విధంగా మా  ఈ జోన్-కో ఆర్డినేటర్ ప్రస్థానం ప్రారంభమయ్యింది.

దాజీ గదిలో నుండి బయటకు రాగానే, ఉత్సాహం బాగానే ఉంది కానీ, నా గుండెల్లో ఒకరకమైన  దిగులు బయల్దేరింది. పని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా తిరగాలి? మాట అయితే ఇచ్చేసాము గాని ఈ ప్రశ్నలు ఒక్కసారిగా కమ్మేసి కొంచెం గందరగోళంలో పడేలా చేశాయి. అక్కడే నాకు ఆదర్శ సోదరుల్లో ఒకరైన మధు కొత్తపల్లి గారు ఎదురయ్యారు. ఆయన స్థానంలోనే నేను పని చేయబోయేది కాబట్టి, భయ్యా, మీరే నాకు సాయం చేయాలి, అన్నాను.  దానికి వారు, "పిచ్చోడివా కృష్ణా, సాక్షాత్తు ఆయనను కలసి వచ్చి నా సహాయం కోరుతున్నావేంటి ?" అన్నారు.  ఒక్కసారిగా నాలో ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పారు. ఆ క్షణం నేనెప్పుడూ మరచిపోలేను. ఆ వాక్యం నాలో ధర్యం నింపడమే గాక, మధు గారికి తన గురువుపై ఉన్న అపార విశ్వాసాన్ని చూసి నాలో నా గురువుపై గల విశ్వాసం మరో దశకు చేరుకుంది; మధు గారిపై నా గౌరవం ఎన్నో రేట్లు పెరిగిపోయింది. 

 ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసింది లేదు, అధైర్య పడింది లేదు. ఆత్మ విశ్వాసం, గురుదేవులపై గురి నూతన శిఖరాలకు చేరుకున్నట్లనిపించింది. 
(సశేషం .... )


14, ఫిబ్రవరి 2026, శనివారం

శ్రీ రాము మహంతి నిష్క్రమణ - అశ్రు నివాళి

 


శ్రీ రాము మహంతి నిష్క్రమణ - అశ్రు నివాళి 

శ్రీ రాము మహంతి నా జ్యేష్ట సోదర సమానులు. నాకు ఆత్మీయుడు. 36 యేళ్ళ సాన్నిహిత్యం. తోటి ఆధ్యాత్మిక యాత్రికుడు. అందరమూ శ్రీరామ చంద్ర మిషన్ లో ఆప్యాయంగా రాము భయ్యా అని పిలుచుకునే వాళ్ళం. భయ్యా ఈ నెలలో తన యాత్రలో ముందకు సాగుతూ ఈ భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించారు. వారికప్పటికి 76 సంవత్సరాలు. అందులో 40 సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనకు వెచ్చించారు. చాలా కాలం శ్రీ రామ చంద్ర మిషన్ లో ప్రశిక్షకునిగా, సహజ మార్గ ఆధ్యాత్మిక శిక్షకునిగా పని చేయడం జరిగింది. చాలా కాలం తెలుగు అనువాద సంపాదక బృందంలో చాలా కృషి చేశారు. ఆయన గొప్ప ప్రేరకుడు; ఎంతో మంది యువకులను ప్రేరణ కలిగించి ఈ సాధనలో నిలదొక్కుకునేలా చేసిన వ్యక్తి. 1985 లో సాధన ప్రారంభించారు. ఆయన ఒక ప్రశిక్షకుడన్న మాటతో స్ఫూర్తిని పొంది ఈ సాధన చేపట్టానని నాతో పంచుకోవడం జరిగింది. ఆయన అన్నదేమిటి? - life has to be lived differently - అని అన్నారట. ఆ క్షణం నుండి నాకు తెలిసి రాము భయ్యా ఆ ఎరుకతో ఆ తరువాతి జీవితాన్ని చివరిదాకా కొనసాగించడానికి ప్రయత్నించారు. తన గురుదేవులైన పూజ చారీజీ మహారాజ్ అంటే ఎడతెగని ప్రేమ, శ్రద్ధ, విధేయత కలిగిన వ్యక్తి. అత్యంత శ్రమ జీవి. ఆయనకి పగలు, రాత్రి బేధం ఉండేది కాదు సంస్థ పని చేయడానికి. ఏది, చలి, వర్షం ఇవేవీ అస్సలు అడ్డు కావు అతను పని చేయడానికి. ఇక ఎక్కడాయికయినా వెళ్ళవలసి ఉంటే అస్సలు దూరంతో, సామ్యంతో సంబంధం ఉండేది కాదు. చేతి గడియారం ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. చూసే అలవాటు లేదు. 
ఆయన చుట్టూ ఎప్పుడూ సకారాత్మక వాతావరణమే ఉండేది. పాజిటివ్ వాతావరణం. ఎన్ని రకాల కస్టాలు చుట్టూ ముట్టి ఉన్నా అలాగే ఉండేవాడు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం అంటే ఎలాగో ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను. గుండెపోటును అధిగమించాడు, గొంతు క్యాన్సర్ ను అధిగమించాడు; ఎలా అధిగమిమచ్చాడో ఒక పుస్తకం కూడా వ్రాయడం జరిగింది. As  a man thinketh - James Allen వ్రాసిన పూస్తాన్ని తెలుగులో అనువదించడం కూడా చేశారు రాము భయ్యా. సోదర భావాన్ని పెంపొందించే కల అతనిలో చూడట జరిగింది. అతి సరళంగా మనుషులతో కలిసిపోయేవాడు. ఒక కప్పు చాయ్ - టీ ఉంటే చాలు ఎంత పనైనా చేసేసేవాడు. భోజనం కూడా అక్కర్లేదు. రాము భయ్యా చాయ్ కి పర్యాయపదంగా మారిపోయాడు మాలో చాలా మందికి. ఇప్పటికీ చాయ్ త్రాగుతున్నప్పుడల్లా, ముఖ్యంగా దోమలగూడా ఆశ్రమంలో టీ త్రాగితిన్నప్పుడల్లా ఆయన స్మరణలోకి రాక మానడు నాకు. సోదరభావం పెంచడానికి ఆయన వాడే ఒక నెపంగా అనిపించేది నాకు.  
వినమ్రుడు, నిగర్వి, సరళుడు, స్వచ్ఛ హృదయుడు రాము భయ్యా. తప్పక మన గురుపరంపర దివ్య సాన్నిధ్యంలో ఈ పాటికి వాళ్ళు అప్పగించిన యేదో పనిలో నిమగ్నమైపోయి ఉంటాడు. నేను వ్యక్తిగతంగా  గొప్ప ఆసరాను కోల్పోయాను. 
ఓం శాంతిః శాంతిః శాంతిః  

31, జనవరి 2026, శనివారం

పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 4

 
పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం-4 

మన వంతుగా చేయవలసిన కృషి 

పూజ్య గురుదేవుల సందేశాల నుండి ఏడు మాసాలలోనే సంపూర్ణ యాత్ర పూర్తి చేయడానికి పూజ్య దాజీ సూచించిన మార్గదర్శక సూత్రాలు :

1) ప్రతి మనిషిలోనూ ఉన్న పసిహృదయాన్ని నిలుపుకునే ప్రయత్నం 

2) నిర్దేశించిన విధంగా సంపూర్ణ అభ్యాసాన్ని అనుసరించడం - ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం, నిరంతర స్మరణను అభ్యాసం చేయడం అనగా ఎ. ఇ. ఐ. ఒ. యు. పద్ధతిని అభ్యసించడం, అంటే ధ్యానం తరువాత కలిగిన ఆధ్యాత్మిక స్థితిని  గుర్తించడం, ఆస్వాదించడం, రోజంతా నిలుపుకునే ప్రయత్నంలో ఉండటం. 

3) తీవ్ర అభ్యాసం (ఇంటెన్స్ అభ్యాస్) చేయడం అంటే ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా సాధన చేయడం. రోజు-రోజుకీ మరింత మరింత సూక్ష్మమైన భావనతో, మరింత మెరుగైన లోతైన, అవగాహనతో (అంటే మిషన్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) సాధన చేయడం.  

4) సహజమార్గ సిద్ధాంతాలను అనుసరించడం. అంటే బాబూజీ దశ నియమాలు, చారీజీ జోడించిన 2 నియమాలు మన దైనందిక జీవన విధానంగా మారిపోయేలా జీవించే ప్రయత్నంలో నిమగ్నమవడం. 


తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...