కన్నీళ్ళు
కన్నీళ్ళు లేకుండా మనిషి జీవితం ఉండదు. కన్నీళ్ళకి హృదయ స్థితికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి కన్నీళ్ళు వచ్చినప్పుడు రానివ్వాలి - మగవారైనా, ఆడువారైనా. కన్నీళ్ళు బలవంతంగా ఆపినప్పుడు హృదయం జడంగా, బండగా తయారవుతుంది.
మనిషి పుట్టగానే ఏడుస్తాడు; ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది; పట్టలేని ఆనందం కలిగినపుడు కన్నీళ్ళొస్తాయి. కృతజ్ఞత లోలోతుల్లో నుండి ఊరుతున్నప్పుడు కన్నీళ్ళొస్తాయి; పసికందు ఆకలి వేస్తే ఏడుస్తుంది; పక్క తడిపినప్పుడు ఏడుస్తుంది; ఇబ్బంది కలిసినప్పుడు ఏడుస్తుంది. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు ఏడుపొస్తుంది. ఉల్లిపాయ తరిగినప్పుడు కూడా కన్నీళ్ళొస్తాయి. కళ్ళకు చాలా మంచిదని కూడా చెప్తారు. భయం వేస్తే కూడా కన్నీళ్ళొస్తాయి. ఇతరుల కష్టాలు చూసినప్పుడు నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా దగ్గర వాళ్ళు మరణించినప్పుడు కన్నీళ్ళు తిరుగుతాయి. ప్రేమను లోతుగా అనుభూతి చెందినప్పుడు కూడా కన్నీరవస్తుంది. భక్తి పారవశ్యంలో కూడా వస్తాయి కన్నీళ్ళు. హృదయం ద్రవించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి.
వన్నీ కన్నీళ్ళు గుండె బరువెక్కిస్తాయి. భయం, కష్టాలు, దుఃఖం, నొప్పి కలిగినప్పుడు వచ్చిన కన్నీళ్ళు గుండెను బరువెక్కిస్తాయి.
మరికొన్ని కన్నీళ్ళు హృదయాన్ని ద్రవింపజేసి గుండెను తేలికపరుస్తాయి. ప్రేమ వల్ల, ఆనందం వల్ల, కృతజ్ఞత వల్ల, భక్తి పారవశ్యం వల్ల, పశ్చాత్తాపం వల్ల వచ్చే కన్నీళ్ళు హృదయాన్ని కరిగిస్తాయి. శాంతిని చేకూరుస్తాయి.
కన్నీళ్ళు మనిషిలో మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషి వివిధ సందర్భాలలో స్పందించే విధానం. కన్నీరు బలహీనత కాకూడడంటారు మన మహర్షులు. అందుకే సాధన. కానీ మహాత్ములు రెండు సందర్భాల్లో వచ్చే కన్నీరు శ్రేష్ఠమైనవి అని అంటారు - ఒకటి, గుండె అంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, రెండు, భగవంతుని పట్ల, గురువుపైన నిజమైన ప్రేమ కలిగినప్పుడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి