స్పిరిచ్యువల్ అనాటమి - ఆధ్యాత్మిక శరీర నిర్మాణం - 3
అయాన్ ఎ. బేకర్, పూజ్య దాజీతో సంభాషణ
అయాన్ బేకర్ అమెరికా దేశస్థుడు, ఎంతో చదువుకున్నవాడు, గొప్ప పేరు-ప్రఖ్యాతులు గాంచిన భూమ్మీద ఎన్నో సాహసయాత్రలు చేసే వ్యక్తి. ఎన్నో గ్రంథాలు రచించిన వ్యక్తి. బాహ్యమైన సాహస యాత్రలే గాక అంతరంగ సాహసయాత్రలో కూడా రుచి గలవాడు, ఇటువంటి అంశాలపై కూడా పుస్తకాలు రచించిన లోతైన వ్యక్తి. ఆయన పూజ్య దాజీతో స్పిరిచ్యువల్ అనాటమీకి సంబంధించి సంభాషించడం జరిగింది. పైన ఉన్న వీడియో వీక్షించగలరు.
ఇందులోని ముఖ్యాంశాలు కొన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం.
దాజీ పలికిన గొప్ప అంశాలు: సాహస స్ఫూర్తి జీవించడానికి చాలా అవసరం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే సాహస స్ఫూర్తి ఎలా అవసరమో అలాగే మహా సముద్ర అడుగుభాగం చేరుకోవాలంటే కూడా ఎంతో ధైర్యం సాహస స్ఫూర్తి అవసరం. అంతరంగ యాత్ర చేయాలంటే, మరింత ఎక్కువగా ఈ సాహసస్ఫూర్తి అవసరం. అంతరంగ లోలోతుల్లోకి వెళ్ళాలంటే కూడా ఎన్నో వదులుకోవాలి, దానికి సాహసం కావాలి; దురభిమానాలు వీడాలి; పక్షపాత వైఖరులు వదులుకోవాలి; ఇప్పటి వరకూ మనం నేర్చుకున్నవి వదులుకోవాలి; లేకపోయినట్లయితే ఆధ్యాత్మికతలో విజయం సాధించలేం. ఆ విధంగా ఒకరకమైన తటస్థ భావానికి, ఒక తటస్థ స్థితికి చేరుకోగలిగితేనే నిజమైన అనుభవం కలిగే అవకాశం ఉంటుంది.
బేకర్: మీరు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ (రహస్య దినుసు) అనే అధ్యాయం ఒకటి వ్రాసారు. ఏమిటది?
దాజీ: మనోవైఖరి, భావం - ఎటువంటి వైఖరితో మనం సాధన చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఆధ్యాత్మికతలో విజయానికి చేరువ చేసేది భావం; సాధన చేస్తున్నప్పుడు మనకుండే భావం చాలా ప్రధానం.
మృత్యువు గురించి: మృత్యువు సంభవించినప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క చక్రం కరిగిపోవడం జరుగుతుంది. ముందు మూలాధార చక్రం మూసుకుపోతుంది - మూల ఆధారం (అంటే భూతత్త్వం) పోయినప్పుడు అన్నీ పడిపోతాయి. ఇదొక భూకంపంలా ఉంటుంది. తరువాత జల చక్రం మూసుకున్నప్పుడు ఒళ్ళంతా చల్లబడిపోతుంది; ఆ తరువాత మణిపూర చక్రం శరీరం కొంచెం వేడెక్కుతుంది; కాస్సేపు చలి, కాస్సేపు వేడి అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని క్షణాల తరువాత ఈ చక్రం లయమైపోతుంది. ఆ తరువాత వాయు చక్రం లయమైపోయినప్పుడు శరీరం వణకడం మొదలెడుతుంది; ఆ తరువాత ఆకాశ తత్త్వం; ఈ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఆత్మ గనుక తన జీవితకాలంలో మోక్షాన్ని పొందకపోయినట్లయితే, ప్రాణం లేక ఆత్మ నవరంధ్రాల్లో ఏదోక రంధ్రం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది; మోక్షం సాధించిన వ్యక్తికి శిఖ ఉండే స్థానం నుండి, 10 వ చక్రం నుండి, బ్రహ్మ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రవేశించేది కూడా ఈ బ్రహ్మరంధ్రంలో నుండే గర్భం దాల్చిన మూడవ మాసంలో ప్రవేశిస్తుంది.
మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక శూన్యస్థితిని అనుభూతి చెందుతూ ఉంటాం. ఈ స్థితి మృత్యు స్థితిని పోలి ఉండే స్థితి. ఈ స్థితి మన ధ్యానంలో అలవాటైపోయినవారికి ఇక మృత్యు భయం ఉండదు; మృత్యు సమయంలో నిర్భయంగా ఆ తరువాతి లోకానికి తమ ప్రయాణాన్ని హాయిగా కొనసాగిస్తారు.
స్త్రీలు సహజంగా పురుషుల కంటే వికాసం చెందినవారై ఉంటారు; అది ప్రకృతి వరం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, చేతలు వాళ్ళ అనుభూతిని బట్టి ఉంటాయి. పురుషుల ఆలోచనలు, చేతలు కేవలం మేధోపరంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి స్త్రీలు పురుషులతో సమానత్వం కోరుకోకూడదు; అలా చేస్తే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నట్లే.
adbhutham. namaskaaram.
రిప్లయితొలగించండి