ఆధ్యాత్మిక పథం ద్వారా చేసే ప్రయాణం ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్ర భూమిపైన చేసే ప్రయాణం లాంటిది కాదు; ఆకాశంలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; నీటిలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; ఆఖరికి అంతరిక్షయానం లాంటిది కూడా కాదు. మరి ఈ యాత్ర ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ యాత్ర చేస్తున్నదెవరు?
ఇక్కడ యాత్ర చేస్తున్నది 'నేను' అనే జీవుడే. జీవుడంటే ఒక చేతనం. తన ప్రస్తుత చేతనంలో ఉన్న వెలితి వల్ల మరింత ఉన్నత చేతనం పొందాలన్న తపనతో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ఈ యాత్ర చేతనాపరమైన యాత్ర అన్నమాట. ఈ చేతననే మనం ఎరుక, స్పృహ, చైతన్యం అన్నపదాలతో కూడా సంభోదయిస్తూ ఉంటాం. ఈ యాత్రను అందుకే చైతన్య వికాస యాత్ర అని కూడా అంటాం. ఈ వికాసం చరమ స్థాయికి చేరుకునే వరకూ, అంటే ఇక వికాసం చెందడానికి, పరిణామం చెందడానికి అవకాశం లేని అవస్థకు చేరుకునేంత వరకూ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు, తాపిస్తూనే ఉంటాడు. ఈ యాత్ర ద్వారా జీవుడు తన అస్తిత్వాన్ని, తన ఉనికిని, కొంచెం-కొంచెంగా యాత్ర కొనసాగుతున్న క్రమంలో యథాతథంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ యాత్రలో కొన్ని ప్రధాన మైలురాళ్ళే - ముక్తి, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, లయావస్థ, అలా యాత్ర అనంతంగా కొనసాగే యాత్ర.
ఈ యాత్ర పూర్తవడానికి ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఎన్ని జనమలైనా పట్టచ్చు, క్షణంలో అయిపోవచ్చు, కొన్ని మాసాలలో అయిపోవచ్చు; అంతా జీవుడి తపన, శ్రద్ధాసక్తులపై, తన నిష్ఠపై, ఎంచుకున్న మార్గంపై, అన్నిటికంటే ముఖ్యం ఎంచుకున్న గురువుపై ఆధారపడి ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి