ధ్యానానికి సమయం లేదు
దినచర్యలో భాగమై ఉండవలసిన ధ్యానం చేయమంటే, ఆధునిక సమయంలో చాలా మంది సమయం లేదని అంటూంటారు. "సమయం లేదు"- అంటే జీవితం ఇంకా ఎంతో కాలం లేదని అర్థం. ఇది నిజం కూడా. అందుకే సమయం లేదు కాబట్టే ధ్యానానికి సమయం దొరికేలా మన దినచర్యను సవరించుకోవలసి ఉంది. "ధ్యానానికి సమయం లేదు" అనడం కన్నా "టైము మేనేజ్ చేసుకోలేకపోతున్నాను "అనడం నయం.
విచిత్రంగా నిత్యం ధ్యానం చేసినట్లైతే మరింత సమయం దొరుకుటుందంటారు పూజ్య దాజీ. ఇది అనుభవంలో అందరికీ తెలుస్తుంది. ఉదయాన్నే ధ్యానంలో కూర్చున్నప్పుడు రోజులో మనం చేయవలసిన పనుల లిస్టు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. ఆఅ ధ్యానంలోనే ప్రాధాన్యత ప్రకారం పనులను అమార్చుకోవడం, అనవసరమైన పనులను ప్రక్కకు పెట్టేయడం వంటివి వాటంతటవే జరిగిపోవడం మనం గమనించవచ్చు. ఆఅ విధంగా ఆ రోజు పనులన్నీ సజావుగా సమయం వృథా అవకుండా అర్థవంతంగా నాణ్యంగా గడుస్తుంది. ప్రతి నిత్యం ఆ విధంగా జీవించడం అలవడటం వల్ల జీవితమే నాణ్యమైన జీవితంగా మారే అవకాశం ఉంటుందంటారు పూజ్య దాజీ.
అలాగే తనను తాను "కాలోస్మి.." అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే కాలం అంటేనే భగవంతుడు. అంటే కాలాన్ని వ్యర్థం చేయడం అంటే భగవంతుని నిర్లక్ష్యం చేసినట్లే, భగవంతుని వృథా చేసినట్లే - అన్నారు పూజ్య చారీజీ.
ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినా, దానికి సమయం లేదనడం ఒక ప్యారడాక్స్ (వైరుధ్యం). మనలో ఉన్న శక్తి అన్నీ రకాలుగా ఖర్చైపోయే సోషల్ మీడియాకు, ఫోన్లకు, అంతులేని చేయవలసిన పనుల జాబితాలకు, రీల్స్ చూడటానికి దొరికే సమయం ధ్యానానికి లేకపోవడం గమనార్హం. అంటే మన ప్రాధాన్యతలు తలక్రిందులైపోయాయి. ధ్యానంలో సమయం ఆదాయ అవుతుంది, శక్తి పుంజుకుంటాం, మనోబుద్ధ్యహంకారాలు శుద్ధి అవుతాయి, జీవితం అర్థవంతంగా గడుస్తుంది.
ఇవన్నీ కనీసం ఆలోచిద్దాం. మన జీవితాలను మరింత మెరుగుపరచుకుందాం.