22, ఆగస్టు 2026, శనివారం

గురుపరంపర ప్రాముఖ్యత - సహజ్ మార్గ్ గురుపరంపర

 


గురుపరంపర ప్రాముఖ్యత, 
సహజ్ మార్గ్ గురుపరంపర 

పరంపర అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం  వారసత్వం, కొనసాగింపు, ఒక గురువు నుండి ప్రధాన శిష్యునికి జ్ఞాన సిద్ధిని ప్రసరణ చేయడం. ఆ విధంగా గురుపరంపర అనేది వివిధ తరాల  గురువుల వారసత్వం. గురుపరంపర ద్వారా ఆధ్యాత్మిక ప్రజ్ఞను, ఆధ్యాత్మిక సిద్ధిని భద్రంగా పదిలపరచడం, అందించడం (ప్రసరించడం) జరుగుతూ ఉంటుంది. గురుపరంపర అంటే ఆది గురువు ఆర్జించిన పరమ ఆధ్యాత్మిక సిద్ధులను, ప్రజ్ఞను, తన ప్రధాన శిష్యుడికి అందజేయడం ద్వారా తరువాతి తరానికి సజీవంగా ప్రసరించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అనుభవాన్ని, యౌగిక సాధనా ప్రక్రియలను, అనుగ్రహాన్ని, అంతరంగ పరివర్తననను  గురువు శిష్యునికి ప్రసరించడం. 

రకరకాల గురుపరంపరలు, వారి-వారి సాంప్రదాయాలను బట్టి మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే 
సహజ్ మార్గ్ గురుపరంపర కూడా ఉన్నది. మొట్టమొదటి గురువును మన సాంప్రదాయంలో ఆదిగురువు అని సంబోధిస్తూ ఉంటాం. సహజ్ మార్గ్ గురుపరంపరలో ఆదిగురువు - పూజ్య లాలాజీ మహారాజ్. ఆఅ తరువాత బాబూజీ మహారాజ్ - చారీజీ మహారాజ్ - ప్రస్తుతం సజీవ గురువు దాజీ మహారాజ్. 

మన గురువుల ప్రకారం అప్పుడప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో ఉల్లేఖించినడాన్ని బట్టి పూజ్య లాలాజీకి పూర్వం కూడా కొందరు గురువుల పరంపర ఉందని తెలుస్తున్నది. పైన చిత్రంలో ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడితోనూ, రాధా మాతతో ప్రారంభమై బుద్ధ భగవానుడు, చైతన్య మహాప్రభు, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస ఇంకా ఎందరో ఉన్నారట.

గురుపరంపర ప్రాముఖ్యత యేమిటంటే గురువు పొందిన ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని కేవలం గ్రంథాల  ద్వారా  సంపూర్ణంగా అందించడం సాధ్యపడదు, దివ్య ప్రేమను సజీవంగా సజీవంగా అందించడం సాధ్యపడదు, అది కేవలం పరిశుద్ధ హృదయం అంటే పవిత్రంగా శుద్ధీకరింపబడిన సూక్ష్మ శరీరాల ద్వారా మాత్రమే యథాతథంగా అందించడం సాధ్యపడుతుంది. అదే సజీవ గురువు యొక్క ప్రాముఖ్యత. అదే గురుపరంపర యొక్క ప్రాముఖ్యత.  

14, ఆగస్టు 2026, శుక్రవారం

లాలాజీ మహాసమాధి - 14

 


లాలాజీ మహాసమాధి - 14 ఆగష్ట్ 1931

శ్రీ రామ చంద్ర మిషన్, ఆదిగురువులైనటువంటి సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్రజీ మహారాజ్, కాలగర్భంలో కనుమరుగైపోయిన ప్రాణాహుతి-ప్రసరణ విద్యను, క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి, జీవితగమనాన్ని దారి తెలియక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆధునిక మానవుల త్వరిత విముక్తి కోసం, అతిస్వల్ప కాలపరిధిలో, ఒకే జన్మలో  మానవ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునే మహడవకాశాన్ని,  ఈ విద్యను,  కాలగర్భంలో నుండి తన యోగశక్తితో వెలికి తీసి పునరుద్ధరించి మానవాళిని ఉద్ధరించిన మహనీయుడు పూజ్య లాలాజీ మహారాజ్. 

వారి మహాసమాధి రోజు ఈ రోజు. ఫిబ్రవరి 2, 1873 న బసంత్ పంచమి నాడు జన్మించి, ఆగష్ట్ 14, 1931 న మహాసమాధిని పొడడం జరిగింది. ఇప్పటికీ వారు దివ్యలోకాల నుండి సందేశాల ద్వారా మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు, మన బాబూజీతో పాటుగా. 

ఈ సందర్భంగా వారి సచ్ఛీలతను, వారు అందించిన సంభాషణా సూత్రాలు, జీవిత పరమార్థాన్ని తెలుసుకునే జీవన విధానాన్ని, సంసార జీవితాన్ని కొనసాగిస్తూ అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకునే జీవన విధానాన్ని, బోధలను మనం పునః స్మరించుకుని, ప్రత్యేకమైన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఎంతో భక్తిశ్రద్ధలతో ధ్యానించుకోవలసిన సందర్భం ఈ రోజు. 

మనందరమూ వారి అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాలను సార్థకం చేసుకోవాలని పూజ్య లాలాజీని ప్రార్థిస్తూ...    

4, ఆగస్టు 2026, మంగళవారం

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

 


అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు 

ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అనే అద్భుత ఆంగ్ల గ్రంథం విడుదల చేయడం జరిగింది.  భగవద్గీత సాక్సక్షాత్తు  శ్రీకృష్ణ భగవానుడికి మానవ శ్రేష్ఠుడైన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమయితే , అష్టావక్ర గీత ఇద్దరు జ్ఞానుల మధ్య, ఇద్దరు ఆధ్యాత్మిక దిగ్గజాల మధ్య జరిగిన సంవాదం - అష్టావక్ర మహర్షికి, మిథిలాపురిని శాసించే రాజైన జనక మహారాజుకు మధ్య జరిగిన సంవాదం.  

20 అధ్యాయాలు, 298 శ్లోకాలతో కూడిన ఈ మాహాగరంతంలో పూజ్య దాజీ కేవలం 2 శ్లోకాలను  మాత్రమే ప్రత్యేకంగా నిశితంగా, వివరించడం, నిజమైన జ్ఞానాన్ని పొందడం కోసం, మోక్షం సిద్ధించాలంటే , వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం అనే ముఖ్య ప్రశ్నల ప్రాముఖ్యతను విస్తృతంగా వివరించారు. 

దాజీ వ్రాసిన ఈ గ్రంథం అష్టావక్ర మహాగీతలోని మొదటి రెండు వాక్యాలను గురించే. మొదటి శ్లోకంలో జనక మహారాజు 3 ప్రశ్నలను వేయడం జరుగుతుంది:

కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిరభవిష్యతి |
వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో ||

నిజమైన జ్ఞానం పొందడం ఎలా?
మోక్షాన్ని సాధించడం ఎలా?
వైరాగయాన్ని పెంపొందించుకోవడం ఎలా?

ఈ ప్రశ్నలకు అష్టావక్రుడు సూటిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 

ముక్తిమిచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ |
   క్షమార్జవదయాతోషసత్యం పీయూషవద్భజ ||  

నువ్వు మోక్షాన్ని సాధించాలనుకుంటే ఇంద్రియపరమైన విషయాలను విషంగా తిరస్కరించు. క్షమ, ఆర్జవం, దయ, సంతోషం, సత్యం అనే అయిదు గుణాలను  అమృతంగా భావించి అభ్యాసం చెయ్యి. 

కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి హృదయానికి అవసరమైన 5 ఔషధాలను అష్టావక్రుడు సూచించడం జరిగింది. ఒక్కొక్క మందు తరువాతి దానికి రంగం సిద్ధం చేసుకుంటూ పోతుంది. ఆ వరుస క్రమంలోనే పని చేయడం ప్రారంభిస్తాయి. 

తప్పక గంభీరంగా సాధన చేసే ప్రతీ సాధకుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి తన వ్యక్తిగత సాధనలో త్వరితంగా ఈ లక్ష్యాలను చేరుకుందురుగాక. 







సత్సంగ్ ప్రాశస్త్యం

సత్సంగ్ ప్రాశస్త్యం    సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...