26, సెప్టెంబర్ 2023, మంగళవారం

పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 2

 

ఆధ్యాత్మికంగా గురువుకు "అందుబాటులో ఉండటం"అనే అంశానికి సంబంధించి దాజీ చెప్పిన అద్భుత ఉదాహరణలు 

పరమపూజ్య బాబూజీ (దాజీ చెప్పినట్లుగా హుక్కా పీలుస్తూ, లాలాజీకి అందుబాటులో ఉంటూ  ఉన్నత స్థితుల్లో పనిచేస్తున్న సన్నివేశం)  
మదర్ హెలీన్ పైరే (బాబూజీ నుండి, ఇతర మహాత్ముల నుండి మన విస్పర్స్ సందేశాలను అందుకున్న లేఖిని, దాజీ మామ్  అని సంబోధిస్తూంటారు)


పూజ్య దాజీ, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సత్సంగాల తరువాత తన సందేశాన్ని చదువుతూ మధ్య-మధ్యలో అదనంగా కొన్ని వ్యాఖ్యలు, విపులీకరణలు చేయడం జరిగింది. అలాగే వారి సందేశంలో ఉటంకించిన 4 విస్పర్ సందేశాలను కూడా పూర్తిగా చదవడం చేశారు. ఈ సందేశం అంతా కూడా శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండటాన్ని గురించే. గత వ్యాసంలో వీటిల్లో కొన్ని భావాలను మనం మననం చేసుకున్నాం. ఈ వ్యాసంలో అదనంగా వారు చెప్పినవాటిని మననం చేసుకుందాం. 
ముఖ్యంగా అందుబాటులో ఉండటాన్ని గురించి ఉల్లేఖిస్తూ, తనకు జరిగిన ఒక  అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. ఒక రోజు దాజీ, ఫ్రాన్స్ లోని మోంప్లే ఆశ్రమంలో ఉన్నప్పుడు, మన లేఖిని మదర్ హెలీన్ పైరే ను కలుసుకున్నప్పుడు, ఆమె దాజీని మరునాడు ఉదయం 10 గంటలకు బాబూజీతో మీటింగ్ ఉంది ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. ఈ సందేశాలను ఆంగ్లంలోకి అనువదించే సోదరుడు మిచేల్ ఆతని భార్య జనేట్ దాజీని కలిసి ఆమెకు బాబూజీతో మీటింగ్ ఉంది కాబట్టి, మనం ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పగానే ఆయన మదర్ ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన 10.45 గంటలకు మదర్ ఇంటికి వెళ్ళిన తరువాత మదర్, "చెప్పాను కదా నీకు బాబూజీతో 10 గంటలకు మీటింగు ఉందని, ఎందుకు రాలేదు?" అని ప్రశ్నిస్తారు. అప్పుడు దాజీ, తాను బాబూజీకి అందుబాటులో ఉండలేకపోయానే, అవకాశాన్ని కోల్పోయానే అని బాధపడ్డారట. జరిగినది చెప్పినప్పుడు మదర్ దాజీని ఓదారుస్తారట. 

పూజ్య దాజీ పలికిన కొన్ని అద్భుత వాక్యాలు; శ్రవణం, మననం, నిధిధ్యాసనం ద్వారా సాక్షాత్కరించుకోవాలసిన వాక్యాలు:

1) విజ్ఞత అంటే సంపూర్ణంగా భగవంతుని పనిలో నిమగ్నమై ఉండటం. 
"నేను మళ్ళీ మళ్ళీ అనుభవంలో చూసిందేమిటంటే, ఎన్ని ఇబ్బందులున్నా ఎలాగో అలాగ, మనం చేయవలసిన ధర్మానికి అనుగుణంగా బలవంతంగా అయినా పని చేసినప్పుడు, ప్రకృతి ఏర్పరచిన అవరోధాలు లేక పరీక్షలన్నీ ఆధిగమించగలుగుతాం. తలనొప్పనో, లేక మరే కారణం చేతనో మనం చేయవలసిన ధ్యానం చేయడం వంటి పనులు చేయకపోతే, మనం ఇబ్బందులపాలవుతాం. అస్తమానూ వాయిదా వేస్తూనే ఉండటం వల్ల మనం వికాసపథంలో ఉండం. అందుబాటులో ఉండటమూ అంటే, సంపూర్ణ సమర్పణ భావంతో, చేయవలసిన పనిని ఏమి జరిగినా స్వీకరిస్తూ పని చేయడమే. ఇలా పనిచేయడానికి పూర్తిగా అందుబాటులో ఉండటమే దైవత్వం. భగవంతుని సేవకు సంపూర్ణంగా అందుబాటులో ఉండటమే విజ్ఞత. దీనికి ఏ  నెపమూ పనికి రాదు.. అందుబాటులో లేకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు, కానీ అందుబాటులో ఉండటానికి ఉన్నది కేవలం ఒకే ఒక్క కారణం - నా పట్ల నేను చేసుకోవలసిన ధర్మం. 
2) నిజంగా అందుబాటులో ఉండటం, అహం యొక్క పాత్ర 
సంస్కారాలు అందుబాటులో ఉండటం అనేదాన్ని వడాపోస్తున్నట్లుగా వ్యవహరిస్తాయి. సంస్కారాలు గతానికి సంబంధించినవి. మన కోరికలు, అహంకారం ఇప్పటికే ముద్రల ద్వారా ఏర్పడిన చట్రాలకు తోడవుతాయి. అహం అంటే ఏమిటి? అహం తన అథమ స్థితిలో, జడంగానూ, మంకుపట్టు పట్టడం, దబాయించి ఆడగటం, ఈ విధంగా ఉంటుంది. ఈ ధోరణి అందుబాటులో ఉండటానికి విరుద్ధమైనది.  
 

23, సెప్టెంబర్ 2023, శనివారం

పూజ్య దాజీ 68 వ జన్మదినోత్సవ సందేశ మననం - 1




పరమ పూజ్య గురుదేవులు దాజీ 68 వ జన్మదినోత్సవ సందర్భంగా, హార్దిక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. 
వారు దీర్ఘాయుష్కులై, ఆరోగ్యంగా, భూమ్మీదకు తాను వచ్చిన కార్యసిద్ధి  జరగాలని, వారి ఆశయసిద్ధిలో విజయం చేకూరాలని, మానవాళిలో వారు ఆపేక్షిస్తున్న పరివర్తన త్వరితంగా సంభవించాలని, హృదయపూర్వకంగా మన గురుపరంపరలోని మహానీయులందరినీ వేడుకుందాం. 
 అలాగే వారి అభ్యాసులుగా, భక్తులుగా, శిష్యులుగా, స్వచ్ఛంద సేవకులుగా, కృతజ్ఞతాపూర్వకంగా అందుబాటులో ఉంటూ  స్వయం పట్ల, సంస్థ పట్ల మనం మన వంతుగా చేయవలసిన కృషిని,  బాధ్యతను,  నెరవేరుస్తామని మనకు మనమే త్రికరణశుద్ధిగా వాగ్దానం చేసుకుందాం.  


(పూజ్య దాజీ ఈ సందర్భంగా "అందుబాటులో ఉండటం" అనే విషయంపై ఇచ్చిన సందేశాన్ని పైన వీడియో ద్వారా వినవచ్చు, చూడవచ్చు.)

సందేశ మననం 
విషయం - అందుబాటులో ఉండటం. భౌతికంగానూ, ఆధ్యాత్మికపరంగానూ కూడా శిష్యుడు గురువుకు  అందుబాటులో ఉండటం అని ముఖ్యంగా దీని అర్థం. అంటే వారికి వ్యక్తిగత సేవాలని కాదు అర్థం;  శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండేది, కేవలం తన ఆధ్యాత్మిక పరిణతి కోసం, చైతన్య వికాసం కోసం, దివ్యయచేతన దిశగా జీవనం కొనసాగడం కోసం, నిష్కారణ ప్రేమ పెంపొందడం కోసం, ఇంకా చెప్పాలంటే ప్రేమగా మారడం కోసం, గురువు చేసే కార్యంలో సహకరించడం కోసం, గురుసేవలో ఉండటం కోసం, ఇంకా చెప్పలేనివెన్నో..
ఈ సందేశంలో బాబూజీ పలికిన 3  విస్పర సందేశాల్లోని వాక్యాలతోనూ, ఒక వాక్యం ది వెనరబుల్ అనే మాస్టరు పలికిన వాక్యంతోనూ, 2  కథలతోనూ మనందరికీ అందుబాటులో ఉండటాన్ని గురించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మానాకేదో సందేశాన్నివ్వడం జరిగింది. ఈ సందేశం ద్వారా పూజ్య దాజీ మనందరికీ ఒక్కొక్కరికీ వారికి వర్తించే సందేశం ప్రత్యేకంగా ఒక్కటైనా ఉండుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అవునో కాదో, ఎవరికి వారు శోధించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఫలితంగా మన సంస్థ సేవాలనందించడంలో గణనీయమైన మార్పు సంభావిస్తుందనిపిస్తున్నది. ఇది ఆయన ఇచ్చే ప్రతి సందేశానికి వర్తించినా, ముఖ్యంగా ఈ సందేశానికి వర్తిస్తుందనిపిస్తోంది. .   
బాబూజీ విస్పర్స్ లో వ్రాసిన వాక్యంతో ప్రారంభిస్తారు;  "సేవ అంటే, ఇక తన జీవితం తనది కానట్లే.. " అంటారు. విస్పర్స్ అందుకున్న మదర్ హెలీన పైరే గారు ఎన్ని వ్యక్తిగత విపత్కర పరిస్థితులున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా బాబూజీ సందేశాలందుకోడానికి, తనను తాను యే విధంగా అందుబాటులో ఉంచుకునేదో  ఊహిస్తే మనకు ప్రేరణ కలగాలి. అలా అందుబాటులో ఉండటం మూలంగానే ఆమె అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుందని చెప్తున్నారు దాజీ. 
అందుబాటులో ఉండటం అనే అద్భుత లక్షణానికి అద్వితీయ నిదర్శనం, ఉదాహరణాల్లో పరాకాష్ఠ సాక్షాత్తు బాబూజీ మహారాజే. వారు యే విధంగా నిరంతరం లాలాజీకి అందుబాటులో ఉండేవారో, వారి ఆజ్ఞలకు ఎంత అప్రమత్తంగా ఉండేవారో, యే విధంగా హుక్కా పీలుస్తూనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల్లో లాలాజీకి  అందుబాటులో ఉంటూ పని చేసేవారో చాలా మంది అభ్యాసులు గమనించారని కూడా గుర్తు చేశారు. 
కానీ మనలాంటి మామూలు జనం యే విధంగా అనవసరమైన విషయాలకు అందుబాటులో ఉంటూ నష్టపోతూ ఉంటామో కూడా విడమర్చి చెప్పడం జరిగింది ఈ సందేశంలో. 
బావిలో కప్ప కథ ద్వారా, యే విధంగా సముద్రపు కప్ప, బావిలో కప్పకూ సముద్రం గురించి చెప్పడంలో కష్టపడుతుందో, అయినా దానికి అర్థం కాకపోవడం చెప్పడం జరిగింది. ఇక్కడ సముద్రపు ఒక రకంగా గురువు, బావిలో కప్పలా ఉన్నది మనం. బావిలో కప్పను సముద్రపు కప్పగా మార్చాలంటే మనం వ్యక్తిగతంగా  సృష్టించుకున్న లోకాన్ని నాశనం చేసుకోవాలి, మన బావి అన్నాడానిలో నుండి బయట పడాలి; దీనికి సహజమార్గం సహకరిస్తుందన్నారు. 
సహాజమార్గ ధ్యాన-శుద్ధీకరణాలు ఏ విధంగా విజ్ఞతకు దారి తీస్తాయో, ఏ విధంగా విజ్ఞత కూడా బావిగా మారుతుందో, అక్కడి నుండి తప్పించుకునే మార్గం అధిచేతనా స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమంటారు దాజీ. ఆ స్ఫూర్తి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. 

ఎత్తైన దృష్టికోణంతో చూసే వ్యక్తి యే విధంగా గతాన్ని, భవిష్యత్తును స్పష్టంగా వర్తమానంలో చూడగలుగుతాడో అని చెప్పడానికి మరో కథ దాజీ చెప్పడం జరిగింది. ఇది వికసించిన చేతనం వల్లే సాధ్యపడుతుంది.

అలాగే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద అన్ని రోజులు ప్రయాణం పోకుండా  పడుకోవలసి రావడాన్ని గురించిన కారణం 100 జన్మలకు పూర్వం తాను చేసిన కర్మేనని తెలుసుకునేలా శ్రీకృష్ణుడు వరం ఇవ్వడం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు గాని భీష్ముని మనసుకు శాంతి కలుగదు. భగవానుడికి అందుబాటులో ఉన్నప్పుడే మనసుకు శాంతి కలుగుతుందని మరోసారి తేటతెల్లమయ్యింది. 


(ఇంకా ఉంది ..)

  
 

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 2






సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ

పాయింట్ ఎ, పాయింట్ బి 

(పైన చిత్రం: రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథంలోనీది.)

పూజ్య బాబూజీ చేసిన అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణల్లో పాయింట్ ఎ, పాయింట్ బి  అనే ఉపబిందువులు చాలా ప్రధానమైనవి.  బాబూజీ ప్రకారం అనేక ఉపబిందువులున్నాయి కానీ, అభ్యాసి సాధనకు సంబంధించినంత వరకూ ఇవి చాలా ముఖ్యం అన్నారు. ఈ బిందువులు ప్రతి మనిషికీ ఎక్కడుంటాయో చెప్పడం జరిగింది. ఎడమ చనుమొన నుండి 2 వేళ్ళ వెడల్పు కుడివైపుకు తీసుకుని, అక్కడి నుండి 3 వేళ్ళ  వెడల్పు నిటారుగా క్రిందకు తీసుకుంటే ఉండేది పాయింట్ ఎ ఉపబిందువు. అక్కడి నుండి 2 వేళ్ళ వెడల్పు క్రిందకు వస్తే ఉండేది పాయింట్ బి ఉపబిందువు. 

సహజమార్గ ఆధ్యాత్మిక పథం ప్రకారం పాయింట్ ఎ పై ధ్యానం కొద్ది నిముషాలు, పాయింట్ బి శుద్ధీకరణ కొద్ది నిముషాలు ప్రతి రోజూ సాధకుడు చేయవలసి ఉంటుంది. 

పాయింట్ ఎ వద్ద ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి; పాయింట్ బి వద్ద ఇంద్రియాకర్షణకు సమబంధించిన ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాడు అభ్యాసి. పైన చెప్పిన సాధన వల్ల యే  రోజుకారోజు  ఏర్పడిన ముద్రలను తొలగించుకోవడం వల్ల ఒక ఉన్నత కోవకు చెందిన చేతనం సహజంగా పెంపొందడం జరుగుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యపడుతుందని చెప్తారు బాబూజీ. సహజమార్గ సాధనలో ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం. 

మరిన్ని వివరాలకు పైన చెప్పిన బాబూజీ వ్రాసిన రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే  గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు. 

 

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ - 1


(పైన చిత్రం: బాబూజీ ఆవిష్కరించిన నూతన ఆధ్యాత్మిక పథము ; మన ఆధ్యాత్మిక యాత్ర జరిగే 13 తీర్థ స్థానాలు, బిందువులు, గ్రంథులు, క్షేత్రాలు  - మూలం: "అనంతం వైపు" గ్రంథం)

సహజమార్గ ఆధ్యాత్మిక పథము - పూజ్య బాబూజీ ఆవిష్కరణ

భగవంతునితో సంపూర్ణ ఐక్యం చెందడమే ఆధ్యాత్మిక పథం యొక్క పరమగమ్యం, అని బాబూజీ చెప్పడం జరిగింది. ఈ గమ్యాన్ని అతి సరళంగా, చేరుకునే మార్గం, అతి దగ్గర మార్గం సహజమార్గమని బాబూజీ తన స్వీయ అనుభవంలో సాక్షాత్కరించుకున్నారు. ఆ పాఠాన్ని మానవాళికి సహజమార్గ పథంగా అందజేయడం జరిగింది. 

భగవంతునితో సంపూర్ణ ఐక్యము అంటే ఆ పరమపవిత్ర చైతన్యంలో లయమైపోవడమే. ఆత్మ మూలం నుండి విడిపోయినప్పుడు, ఆ పరమ పవిత్ర చైతన్యం నుండి దూరమయ్యింది; క్రమక్రమంగా ఆ దివ్య చైతన్యం నుండి దిగి వచ్చినప్పుడు 13 ప్రధాన చైతన్య గ్రంథులుగా ఏర్పడినావి. వాటినే గ్రంథులని, బిందువులని, చక్రాలని, తీర్థ క్షేత్రాలని మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చక్రం దిగిన కొద్దీ ఆ చైతన్యతలో నాణ్యత తగ్గుతూ వచ్చింది. అలా మనిషి హృదయ చక్రం వరకూ దిగిపోవడం జరిగింది. హృదయ చక్రం నుండి 13 చక్రాలు కేవలం మనుషుల్లోనే ఉంటాయి. ఇవి గాక మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠాన చక్రాలు కూడా ఉంటాయి. ఇవి జంతువులలో కూడా ఉంటాయి. ఈ చక్రాల చతన్యంలో ఇరుక్కుపోయిన జీవులు కేవలం బ్రతకడం కోసమే వాటి జీవనం సరిపోతుంది. కేవలం తనను తాను కాపాడుకోవడానికి, ఆహారం, నిద్ర, ఇంద్రియపరమైన సుఖం, భయం వీటి చుట్టూనే  అల్లుకుని ఉంటుంది వీటి జీవనం. 

సహజమార్గ ఆధ్యాత్మిక పథము హృదయ చక్రం నుండి ప్రారంభమై, మన గమ్యమైన  13 చక్రమ వరకూ కొనసాగుతుంది. 

ఆధ్యాత్మిక యాత్ర అంటే ఒక చక్రం నుండి మరొక చక్రానికి ఆత్మ యొక్క కదలిక. ఆత్మ కదులుతుందా? ఆత్మ యొక్క చైతన్యం కదులుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. దాన్నే ఆత్మ యొక్క యాత్ర అని అంటాం. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన చేతనం ఉండటం వలన, సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు చేతన కదులుతున్నట్లుగానూ, విస్తరిస్తున్నట్లుగానూ, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదుగుతూ, ఆధ్యాత్మిక ఆకాశంలో ఎత్తుగా విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. మానవ జన్మ యొక్క యదార్థమైన లక్ష్యం ఇదే.  ఈ యాత్రను సమర్థుడైన గురువును ఆశ్రయించి, ప్రారంభించి, కొనసాగించి, ఈ జన్మలోనే పూర్తి చేసుకోవాలి. ఈ  యాత్ర ఫలితంగానే, బాబూజీ చెప్పినట్లుగా మనిషిలో యాదార్థమైన పరివర్తన సంభవిస్తుంది. జీవితాన్ని సమగ్రమైన దృష్టితో, స్పష్టతతో లోతుగా అర్థం చేసుకునే ఎరుక ఏర్పడుతుంది. విజ్ఞత కలుగుతుంది. వ్యక్తిత్వం మరింత మరింత  సూక్ష్మతరంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ  యాత్రకు అంతుండదు. అందుకే ఈ గ్రంథానికి, అనంతం వైపు అని పేరు పెట్టడం జరిగింది. 

ఈ సహజమార్గ పాఠాన్ని పూజ్య బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ మార్గదర్శనంలో తన "అనుభవ శక్తి" ద్వారా ప్రత్యక్షానుభవం ఆధారంగా ఆవిష్కరింపబడిన వినూత్న రాజయోగ పద్ధతి. ఈ  ఆధ్యాత్మిక శిక్షణ, ప్రాణాహుతి  అనే దివ్య శక్తిని సంసిద్ధుడైన సాధకుని హృదయంలోకి ప్రసరించడం ద్వారా ఇచ్చే శిక్షణ. ప్రాణాహుతిని ప్రసరణ చేయగలిగే గురువును సమర్థ గురువు అంటారు; ప్రాణాయాహుతి అంటే కేనోపనిషత్తులో ఉల్లేఖించిన ప్రాణస్య ప్రాణః అంటే ప్రాణానికే ప్రాణం అంటే, ప్రాణ తత్త్వం అన్నమాట. దేని వల్ల ప్రాణానికే ప్రాణం వచ్చినట్లవుతుందో అదే ప్రాణాహుతి. ఈ ప్రాణాహుతి ప్రసరణ వల్ల యాత్రలో చాలా సమయం ఆదా అవడమే గాక, ఒక చక్రం నుండి మరో చక్రానికి యాత్ర సహజంగా జరుగుతుంది.అయితే సిద్ధులు, శక్తులు  పొందాలనుకున్నవారికి, ఇది అనుకూలమైన మార్గం కాదని, వాటికి, ఆధ్యాత్మికతకూ ఎటువంటి సంబంధమూ లేదని మన గురుపరంపర బోధన.  ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలనుకున్నవారికి, చైతన్య వికాసం పొందాలనుకున్నవారికి, తనను తాను మార్చుకోవాలనుకున్నవారికి, మానవ చేతనం నుండి దివ్య చేతనంగా పరివర్తన కావాలనుకున్నవారికి, దైవానుభూతి  చెందాలనుకున్నవారికి ఈ మార్గం ప్రశస్తం.  

బాబూజీ ఈ యాత్రను, వారు వ్రాసిన సత్యోదయం అనే గ్రంథంలో 24 వృత్తాలుగానూ, సహజమార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం అనే గ్రంథంలో 3 క్షేత్రాలుగానూ, అనంతం వైపు అనే గ్రంథంలో 13 బిందువులు, లేక గ్రంథులు లేక చక్రాలుగానూ అభివర్ణించడం జరిగింది.  సాధకులు తప్పక ఈ గ్రంథాలను తమ వ్యక్తిగత సాధనను కొనసాగిస్తూ అధ్యయనం చేసుకోవాలి. లేకపోతే అవగాహన ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉండే అవకాశాలే ఎక్కువ; ఎందుకంటే ఈ గ్రంథాలలో వ్రాసినవన్నీ యదార్థ ఆధ్యాత్మిక సూక్ష్మ అనుభవాలకు సంబంధించినవి కాబట్టి.

మొదటి 5 బిందువులను హృదయ క్షేత్రం అని, 6 నుండి 12  బిందువులను  మనోక్షేత్రమని, 13 వ బిందువును కేంద్ర క్షేత్రం అని అంటారు బాబూజీ. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక రకమైన చైతన్య వికాసం జరిగి, తదనుగుణమైన సహజమైన పరివర్తన సాధకునిలో సంభవిస్తుంది. ఆ మేరకు అంతఃకరణ అంటే 4 ప్రధాన సూక్ష్మ శరీరాలు (మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము) శుద్ధి చేయబడతాయి; ఇదంతా ఒక్క జన్మలోనే సాధించే అవకాశం ప్రతీ అభ్యాసికి ఉంది. కనీసం ప్రతీ అభ్యాసి  ఈ  జన్మలోనే హృదయ క్షేత్రాన్ని దాటి మోక్షాన్ని పొందాలన్నది మన గురుపరంపర యొక్క ఆకాంక్ష. 

తదుపరి వ్యాసంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

 
 

20, సెప్టెంబర్ 2023, బుధవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 4

 



నూతన అవగాహనలు

శ్రమ - కర్మ 

పూజ్య దాజీ శ్రమకూ కర్మకు గల వ్యత్యాసం చెప్పడం జరిగింది. శ్రమ అంటే ఫలితం కోసం చేసేది. ఉదాహరణకు ఉద్యోగం చేసేది జీతం కోసం; కూలి చేసేది డబ్బుల కోసం; దీన్ని శ్రమ అంటారు. కర్మ అంటే భగవత్సాక్షాత్కారం కోసం చేసే పని, బ్రహ్మవిద్య కోసం చేసే పని, ఫలితం ఆశించకుండా చేసే పని. 

శ్రీకృష్ణుడి కాలంలో అంటే సుమారు 7000 కు పైగా సంవత్సరాలు గడచిపోయాయి; ఆ కాలంలో వాడిన కర్మ అనే పదానికి అర్థం దైవసాక్షాత్కారం కోసం చేసే పని అని అర్థం. ఆ కాలంలో అందరూ సుమారుగా అదే ధోరణిలో జీవించేవారు. కాలానుగుణంగా పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఆంగ్లంలో "gay" అనే పదానికి ఉల్లాసం, ఆనందం అనే అర్థం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అదే పదానికి వేరే అర్థం వచ్చేసింది.

శ్రమ వల్ల కచ్చితంగా సంస్కారాలు ఏర్పడతాయి; కర్మ వల్ల సంస్కారాలు ఏర్పడవు. నేను 30 రోజులు పని చేశాను, జీతం ఇవ్వాలి అని యాజమానిని అడుగవచ్చు కానీ 20 సంవత్సరాలు నీ కోసం ధ్యానం చేశాను, కాబట్టి దర్శనం ఇవ్వాలని  భగవంతుడిని  గట్టిగా అడుగలేము, ఆడగకూడదు కూడా; ఆత్మసమర్పణ ద్వారా మాత్రమే భగవంతుడు లభించేది, అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది. 

 కాబట్టి మనం కర్మకు, శ్రమకూ గల పూజ్య దాజీ తెలియజేసిన ఈ వ్యత్యాసాన్ని  తెలుసుకోవలసి ఉంది.  ఈ  నూతన అవగాహనను మననం చేసుకోవలసి ఉంది. 





18, సెప్టెంబర్ 2023, సోమవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 3

 



నూతన అవగాహనలు, ఆవిష్కరణలు - పరిచయం  

పూజ్య లాలాజీ, దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం ఉన్న ఈ ప్రాణాహుతి ఆధారితమైన రాజయోగ విద్యను, కాలగర్భంలో కనుమరుగైపోయిన ఈ విద్యను వెలికి తీస్తే, పూజ్య బాబూజీ మహారాజ్ ఈ  విద్యకు పరిపూర్ణతను చేకూర్చి, సహజమార్గం అన్న పేరుతో మానవాళికి పరిచయం చేయడం జరిగింది. ఈ విద్యను పరమపదిలంగా స్వచ్ఛతను కాపాడుకుంటూ, పవిత్రంగా ఉంచుతూ పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ మహారాజ్ కు అందజేస్తే, వారు 100 దేశాలలో ఈ పద్ధతిని విస్తరింపజేశారు; ఆ తరువాత పూజ్య దాజీకి ఈ సహజమార్గ కాగడాను 2014 లో కొనసాగించమని అందజేయడం జరిగింది. దాజీ భూమ్మీద ఉన్న ప్రతి ఇంటికి ఈ పద్ధతి యొక్క అవగాహనను అందిస్తూ ప్రతి గుండెకూ ప్రాణాహుతి అనుభూతిని అందించే ప్రయత్నంలో ఉన్నారు; హార్ట్ఫుల్నెస్  అనే వైశ్విక నామకరణం చేసి ఈ సహాజమార్గ ఆధ్యాత్మిక పద్ధతిని విశ్వమంతటికీ అందుబాటులో ఉండేలా  ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరమూ ఉడతాభక్తిగా మన వంతు తోడ్పాటునందించే  ప్రయత్నంలో మనం ఉన్నాం. 
1945 లో పూజ్య బాబూజీచే ప్రారంభింపబడిన ఈ ఉద్యమం ప్రతీ మాస్టరు ద్వారా  కొంత పరిణామం చెందుతూ వస్తోంది. ఈ సంస్థ ఆశయం - ప్రపంచంలో ప్రబలియున్న  అనాధ్యాత్మికత  స్థానంలో ఆధ్యాత్మికతను నెలకొల్పడం; ఆధునిక మానవుని అవసరాలకు తగినట్లుగా యోగాన్ని ప్రవేశపెట్టడం. ఈ క్రమంలో ఈ సహజమార్గ సాంప్రదాయంలో నలుగురు మాస్టర్లు పరంపరగా వచ్చారు. ప్రస్తుతం పూజ్య దాజీ నాల్గవ మాస్టరుగా ఉన్నారు. మానవాళి వికాసం విషయంలోఒక్కొక్క మాస్టరుకు ఒక్కొక ప్రత్యేకమైన పాత్ర ఏర్పరచడం జరిగింది.  లాలాజీ ఈ సాంప్రదాయానికి  ఆద్యులైతే, బాబూజీ, చారీజీలు పటిష్ఠమైన పునాదులను ఏర్పరచారు. ఇప్పుడు పూజ్య దాజీ ఆ పునాదులపై విశిష్ఠమైన ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిస్తున్నారు. 
సహజమార్గంలో జన్మతః మాస్టర్లుగా ఉండరని చారీజీ ఒకసారి చెప్పడం జరిగింది,  కొన్ని సంప్రదాయాలలో ఉన్నట్లుగా. ప్రకృతి లేక భగవంతుని ఆధ్వర్యంలో అటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తులు చాలా తీవ్రంగా ఎంతో నిబద్ధతతో సహజమార్గ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంతో కాలంగా సాధన చేస్తూంటారు. ఆ క్రమంలో ఆయా కాలానికి తగినట్లుగా ఉత్కృష్ఠ ఆధ్యాత్మిక స్థితులు సిద్ధించడం, సూక్ష్మాలు తెలియడంతో వినూత్న అవగాహనలకు, నూతన ఆవిష్కరణలకు, వారి సాధన దారి తీస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు గాని అటువంటి వ్యక్తి వెలుగులోకి రారు. చివరికి ఆ సమయంలో ఉన్న మాస్టరుకు కూడా తెలియకపోవచ్చు. సారాంశం ఏమిటంటే మన గురుపరంపరను నిర్దేశించేది పై లోకాల నుండే;  అత్యున్నత ఊర్ధ్వలోకాల్లో ఉన్న మహాత్ముల కూటమి ద్వారానే అన్నమాట.   

ఆ క్రమంలో పూజ్య దాజీ తన సాధన 1976 లో ప్రారంభించినప్పటి నుండి చాలా గంభీరంగా, తీవ్రతపనతో సాధన చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పటికీ తనను తాను ఒక యోగసాధకుడిగానే భావించుకుంటారు, ప్రపంచానికి తనను తాను అలాగే పరిచయం చేసుకుంటారు కూడా. తన మొట్టమొదటి ధ్యాన సిట్టింగులో కలిగిన అనుభూతిని ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఎంత అద్భుతమైనదో చెబుతూ ఉంటారు. ఇలా తీవ్రంగా నిబద్ధతతో కొనసాగుతూ ఉన్న తపస్సు ద్వారా, నిగూఢమైన ధ్యాన స్థితుల్లో కలిగిన అవగాహనలను, ఆవిష్కరణలను పూజ్య దాజీ ఎప్పటికప్పుడు వారు మనతో తన ప్రసంగాల ద్వారా, వ్యాసాల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, పత్రికల ద్వారా, హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్ల ద్వారా, ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని ఆయనే స్వయంగా ఈ మధ్యన ఆగష్ట్ 13, 2023 న ఆదివారం సత్సంగం తరువాత వెల్లడించడం జరిగింది. వాటినే మనం, ఆ  వెల్లడించిన విషయాలనే ఇక నుండి ఒక్కొక్కటిగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 



వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం





|| వశిష్ఠ వామదేవాది వందిత || 
|| మహాగణపతిం, మనసా స్మరామి ||

వినాయకుడు మానవ పరిపూర్ణతకు చిహ్నం 

వినాయకుడి రూపం మనిషి పరిపూర్ణతను సాధించాలంటే ఉండవలసిన లక్షణాలను సూచించే స్వరూపం; ప్రేరణను కలిగించే ఆకారం; ఆచరణకు నిత్యస్ఫూర్తినిచ్చే గొప్ప తత్త్వం ఈ రూపం; చూడగానే మనసుకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించే సమ్మోహన రూపం, వినాయకుడు. 
ఆధ్యాత్మిక సాధకులు ఈ స్వరూపాన్ని పరిశీలనగా గమనిస్తే బోలెడంత స్ఫూర్తి కలుగుతుంది. 
తొండంతో ప్రారంభిద్దాం; ఏనుగు తొండంలో చాలా సున్నితత్త్వం ఉంటుందంటారు; సూదిని కూడా ఎత్తగలదంటారు ఆ తొండంతో. అలా మనిషి కూడా అంతా సున్నితత్త్వం కలిగి ఉండాలి. అలాగే విశాలమైన నుదురు, జ్ఞానానికి ప్రతీక; చిన్న కళ్ళు; అంటే దూరదృష్టి, సూక్ష్మదృష్టి గలవాడని అర్థం; పెద్ద చెవులు; అంటే బాగా వినాలని సంకేతం; పెద్ద ఉదరం అంటే, ఎన్ని అవమానాలు పడినా స్పందించకుండా కడుపులో పెట్టుకోగలిగినవాడు; అంత బరువైన శరీరంలా కనిపించినా చిన్ని ఎలుక మోయగలిగేంత తేలికగా ఉండేవాడు; ఎలుక కోరికలను సూచిస్తుంది; ఎలుకపై అంటే కోరికలపై ఆధిపత్యం సంపాదించినవాడు అంత తేలికగా ఉంటాడని సంకేతం. ఇలా ఇటువంటి లక్షణాలన్నీ అలవరచుకుంటే మనిషి దైవంగా మారతాడని వినాయకుడి రూపం మనకు తెలియజేస్తున్నది. ఈ లక్షణాలన్నీ సాధన ద్వారా అలవరచుకొని మనిషి దివ్యంగా పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారాలన్న ఆదర్శాన్ని సూచిస్తుంది ఈ దివ్యమంగళ విగ్రహం. 
ఒక చేతిలో దుష్ట శక్తులను నాశనం చేసే ఆయుధాలు, అంటే మనిషిలోని మలినాలను, అరిషడ్వర్గాలను తొలగించే శక్తులు; మరొక చేతి ద్వారా అభయం. 

అంతేగాక పూజ్య దాజీ చెప్పినట్లుగా, ఆయనలో కొంత భాగం పశువుది, కొంతభాగం మనిషిది, మరికొంత భాగం దివ్యమైనది - అంటే పాశవికత నుండి మానవత్వం; మానవత్వం నుండి దివ్యత్వం వరకూ చేసే మన ఆధ్యాత్మిక యాత్రను సూచిస్తున్నది. ఇలా సూక్ష్మదృష్టితో పరికించి చూసినప్పుడు మరిన్ని సూక్ష్మాలు మనకు స్ఫురించవచ్చు. అంతర్ముఖులై ధ్యానించినప్పుడే సూక్ష్మదృష్టి కలిగే అవకాశం, తద్వారా మనిషి పరిపూర్ణుడుగా మారే అవకాశం ఉంటుంది. 



 

13, సెప్టెంబర్ 2023, బుధవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు - 2

 


దాజీ తన నిగూఢ ధ్యాన స్థితుల్లో బాబూజీ నుండి అందుకున్న 
దివ్య సందేశాల వెల్లడి 

పూజ్య దాజీ ఆగష్టు 29, 2021 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఒక గొప్ప సందేశాన్ని చాలా మామూలుగా వెల్లడి చేయడం జరిగింది. పూజ్య బాబూజీ మహారాజ్, వారి జీవితకాలంలో ఒక సత్యాన్ని వెల్లడి చేశారు. కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు తన బంధుమిత్రులను, గురుజనులతో యుద్ధం చేయలేనని విషాదంలో మునిగిపోవడం మనదరికీ తెలుసు. ఆ విషాదం నుండి అర్జునుడిని బయటకు తీసుకురావడానికి శ్రీకృష్ణ  భగవానుడు చేసిన బోధను ఇప్పుడు మనం భగవద్గీతగా చదువుకుంటున్నామని తెలుసు. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలున్నాయి. ఇన్ని శ్లోకాలు వల్లించడానికి యుద్ధానికి ఇరువైపులా సన్నద్ధంగా ఉన్న సమయంలో అంత వ్యవధి ఉందా అన్న ఆలోచన అందరికీ వస్తుంది. చాలా కాలంగా అభ్యాసులందరూ ఆధ్యాత్మిక కుతూహలంతో వేచి ఉన్న ఈ ప్రశ్నకు పూజ్య బాబూజీ మహారాజ్ వెల్లడి చేసిన నిజం ఏమిటంటే, శ్రీకృష్ణుడు నిజానికి కేవలం 7 శ్లోకాల ద్వారా మాత్రమే చేయవలసిన బోధ చేయడం జరిగిందని, తక్కినదంతా ప్రాణాహుతి ప్రసరణ ద్వారా హృదయంలో నేరుగా ఆధ్యాత్మిక స్థితుల అనుభూతిని ప్రసాదించడం జరిగిందని బాబూజీ వెల్లడించడం జరిగింది. 
ఆ ఏడు శ్లోకాలను ఈ రోజున కాన్హా శాంతి వనంలో, సత్సంగం తరువాత పూజ్య దాజీ వెల్లడి చేయడం జరిగింది. వీటిని ఏడు రత్నాలుగా అభివర్ణించారు. ఇవి గాక మరో మూడు శ్లోకాలను కూడా వెల్లడి చేయడం జరిగింది. ఆ మూడు శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు, మొదటి రోజు యుద్ధం పూర్తయిన తరువాత అర్జునుడిని ఓదారుస్తూ చెప్పిన 3 రహస్యాలు ఆని దాజీ సూచించారు. ఆ శ్లోకాలు ఈ క్రింది విధంగా అర్థంతో సహా చెప్పడం జరిగింది:

 శ్లోకం  1

ప్రజాహాతి  యదాకామాన్ సర్వాన్  పార్థ  మనోగతాన్

ఆత్మన్యేవాత్మనాతుష్ఠః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.  //2:55//

ఓ పార్థామనసులో ఉద్భవించే కోరికలన్నిటినీ  ఎవరైతే త్యజిస్తాడోఆత్మసంతృప్తి కలిగి ఉంటాడోఆత్మలో సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి  వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.

 శ్లోకం 2

ధ్యాయతో  విషయాంపుంసః సంగస్తేషూపజాయతే

సంగాత్సంజాయతే  కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//

ఇంద్రియాలపైనే  దృష్టిని  సారించినవాడు  వాటికి  ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ 

 

నుండి  కోరిక  పుడుతుందికోరిక  నుండే  కోపం పుడుతుంది. 

శ్లోకం 3

క్రోదాద్భవతి  సమ్మోహః సమ్మోహాత్  స్మృతివిభ్రమః 

స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//

కోపం మనసును గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుందిఫలితంగా జ్ఞాపక

 శక్తి నశిస్తుందిబుద్ధి నశిస్తుందిబుద్ధి నాశనమవడంతో మనిషి

 అథోగతిపాలవుతాడు. 

 శ్లోకం 4

రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ 

ఆత్మవశ్యైవిధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి. //2:64//

మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల  (ఇష్టాయిష్టాల)నుండి

 ఇంద్రియములతో వస్తువులను వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి

 విముక్తుడవుతాడుభగవదనుగ్రహాన్ని పొందుతున్నాడు.

 శ్లోకం 5

నాస్తి  బుద్ధిరుక్తస్య న చా యుక్తస్య భావనా

భావనాన చా  భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్. //2:66//

సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదుసామరస్యం లేకుండా ధ్యానం

 కుదరదుధ్యానించకుండా శాంతి  రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి

 సంతోషం ఎక్కడుంటుంది?

  శ్లోకం 6

శ్రేయాన్ స్వధర్మో  విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్ 

స్వధర్మే  నిధనం  శ్రేయః పరధర్మో  భయావః //3:35//

పరధర్మాన్ని  ఎంతబాగా  నిర్వర్తించినప్పటికీ గుణము  లేనిదైనా  స్వధర్మమే 

మేలుపరధర్మాన్ని  నిర్వహించడం  కంటే  కూడా స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు

  సంభవించినా  మంచిదేక్లుప్తంగా  చెప్పాలంటే,  “నీ  పని  నువ్వు  చూసుకో” 

అని అనుండేవారు  బాబూజీ.

 శ్లోకం 7

నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే 

న చ సన్నన్యసనాదేవ సిద్ధిం  సమాధిగచ్ఛతి. //3:04//

కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి విముక్తి కలగదు. కేవలం


 కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం  సాధ్యపడదు.  


రహస్యం 1

యదా యదా హి  ధర్మస్య గ్లానిర్భవతి  భారత 

అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4:7॥ 

 తాత్పర్యం: ధర్మానికి ఎప్పుడు  కలుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఓ అర్జునా, అప్పుడు నేను ఈ భూమ్మీద అవతరిస్తూ ఉంటాను. 

రహస్యం 2

 పరిత్రాణాయ  సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4:8॥

 తాత్పర్యం:శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని

 స్థాపించడం కోసం నేను భూమిపై మళ్ళీ  మళ్ళీ అవతరిస్తూ ఉంటాను.

రహస్యం 3

ఇది  చాలా ముఖ్యమైన శ్లోకం,  18వ  అధ్యాయంలోనిది, 66వ  శ్లోకం:

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం  వ్రజ

అహం త్వా  సర్వపాపేభ్యో మోక్షయిష్యామి  మా  శుచః 18 :66॥ 

తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేదినట్లయితే, నీ  సమస్త పాపాల  నుండి విముక్తిని కలిగిస్తాను; భయపడకు. 

ఈ ఏడు  రత్నాలను,  ఈ  మూడు  రహస్యాలను  తరువాయి  భాగాల్లో  అధ్యయనం  చేసే  ప్రయత్నం  చేద్దాం. 








12, సెప్టెంబర్ 2023, మంగళవారం

పూజ్య దాజీ సందేశాల మననం - ఆధ్యాత్మికతలో నూతన అవగాహనలు, నూతన ఆవిష్కరణలు


పూజ్య దాజీ (కమలేష్ డి. పటేల్ గారు) 
పూజ్య గురుదేవులు. శ్రీరామ చంద్ర మిషన్ సజీవ మాస్టర్ అయిన దాజీ 68 వ జన్మదినోత్సవం ఈ సెప్టెంబర్ 28, 2023 న ఆసన్నమవుతున్న సందర్భంగా, వారు 2015 నుండి ఇప్పటి వరకూ నిర్వహించిన బృహత్తర కార్యాలను, నూతన ఆవిష్కరణలను నెమరు వేసుకునే అల్ప ప్రయత్నం చేస్తున్నాను.  
నా మొదటి గురుదేవులు పరమపూజ్యులు శ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ మహారాజ్, డిశంబరు 20, 2014 న చెన్నైలో మహాసమాధి పొందిన ఉత్తర క్షణం నుండి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ వారు అపారమైన ఆధ్యాత్మిక కార్యనిర్వహణను, వారికి దివ్య ఆధ్యాత్మిక ధ్యాన స్థితుల్లో వెల్లడి అయిన నూతన ఆవిష్కరణలు, ఇక్కడ క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 
1945 లో ప్రారంభమైన సహాజమార్గ ఆధ్యాత్మిక ఉద్యమానికి, వైశ్వికంగా ప్రపంచమంతటా ఈ సంస్థ సేవలను అందుబాటులో ఉంచేందుకు, 2015 జనవరిలోనే హార్ట్ఫుల్నెస్ అని ఈ ఉద్యమానికి నూతనంగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి దాజీ వైశ్విక మార్గదర్శిగానూ, ఆప్యాయంగా అందరికీ  దాజీగానూ, ప్రపంచానికి పరిచయమయ్యారు. ఈ సంస్థ అనుయాయులు అనుసరించే ఆధ్యాత్మిక పద్ధతి పేరు సహజమార్గము. 
ఆ తరువాత జనవరి, ఫిబ్రవరి నెలలలోనే ప్రిసెప్టర్లందరికీ, వాళ్ళు నిర్వర్తించవలసిన విధుల్లో నూతన అనుమతులు మన గురుపరంపర అందించారని వెల్లడి చేయడం జరిగింది. అప్పటి వరకూ ప్రిసెప్టర్  ఒక్కొక్కరికే ముఖా-ముఖి ధ్యాన సిట్టింగులు ఇస్తూండేవారు; ఇప్పుడు గురుపరంపర, ఎంతమందికైనా ఒకేసారి సిట్టింగులు ఇవ్వచ్చునని అనుమతులివ్వడం జరిగింది. అలాగే రిమోట్ సిట్టింగులు, ఆబ్సెన్షియా సిట్టింగులు, సామూహిక సిట్టింగులు ఇలా అనేక విధాలుగా ప్రిసెప్టర్లందరికీ మరింత సాధికారత కలుగజేయడం జరిగింది.  
ఈ పనులు నిర్వహిస్తూనే బంజరు భూమిగా ఉన్న కాన్హా శాంతి వనాన్ని పచ్చదనంగా మార్చే పని కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఆ తరువాత బాబూజీ విగ్రహాన్ని కాన్హా శాంతి వనంలోని నక్షత్ర నిర్మాణంపై ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తరువాత మరల దాన్ని ఇప్పుడున్న వేరే ప్రదేశానికి తరలించడం జరిగింది. 
ఆ తరువాత 2019 లో ధ్యానోత్సవాలు పరిచయం చేశారు. మొదటగా మధ్య ప్రదేశ్ లోని రాయ్ పూర్ లో ప్రారంభించి, దేశమంతటా, ఆ తరువాత ఇతర దేశాలలో కూడా ఈ ధ్యానోత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ధ్యానోత్సవం అనేది సాధారణ ప్రజలకు హార్ట్ఫుల్నెస్ ప్రక్రియలను పరిచయం చేసే 3 రోజుల ఉచిత కార్యక్రమం. 
అక్టోబర్ 19, 2019 న ఒక అద్భుత ఘట్టం జరిగింది. మహారష్ట్రలో టుకడోజీ మహారాజ్ సంస్థ అని ఒకటున్నది. ఆయన ఈ సంస్థను నడిపిస్తూ సమాజానికి ఎనలేని సేవలనందిస్తూ వచ్చారు. 1968 లో పరమపదించడం జరిగింది. వీరు   ఏప్రిల్ 30, 1909 న జన్మించడం జరిగింది. వీరిని అందరూ శ్రద్ధతో రాష్ట్రసంత్  అని పిలుస్తారు. మహారాష్ట్ర రాష్ట్రమంతటా వ్యాపించిన ఆధ్యాత్మిక సంస్థ. పూజ్య దాజీ పైన తెలిపిన తేదీన వీరి ఆశ్రమాన్ని సందర్శించడం, అక్కడ ధ్యానం నిర్వహించడం, ఆ తరువాత చేసిన ప్రసంగంలో ఒక ప్రకటన మన అభ్యాసులందరినీ విస్మయానికి గురి చేస్తుంది.  కొన్ని వేలమంది టుకడోజీ మహారాజ్ పుణ్యతిథి సందర్భంగా సమావేశమయిన తరుణంలో పూజ్య దాజీ ఈ విధంగా ప్రకటించడం జరిగింది: "శ్రీకృష్ణుడు తో మొదలుకొని లాలాజీ, బాబూజీ, స్వామి వివేకానంద, పరమహంస శ్రీరామకృష్ణ, చైతన్య మహాప్రభు, కబీర్ దాస్, గౌతమ బుద్ధుడు, గురు నానక్, లతో కూడుకున్న మన గురుపరంపర జాబితాలో పూజ్య టుకడోజీ  మహారాజ్ కూడా చేరుకున్నారని ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నారు. 
ఆ తరువాత ఫిబ్రవరి 2, 2020 న బసంత్ పంచమినాడు, కాన్హా శాంతి వనం, ఒకేసారి లక్ష మంది కూర్చొని ధ్యానం చేసుకోగలిగే,  ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని  అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది శ్రీరామ చంద్ర మిషన్ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. పతంజలి పీఠ అధ్యక్షులు యోగర్షి రామ్ దేవ్ బాబా కూడా ఇందులో పాల్గొనడం విశేషం. 
ఆ తరువాతి రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి తాండవించిన గడ్డు కాలంలో కూడా పూజ్య దాజీ తన అనుయాయులను  కంటికి రెప్పలా కాపాడుతూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకొనే ఏర్పాటు చేస్తూ, లైవ్ గా సత్సంగాలను నిర్వహించారు; ప్రసంగాలు చేశారు; ఆరోగ్య జాగ్రత్తలను మనందరికీ ఎప్పటికప్పుడు తెలియజేశారు; దిల్ సే కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని అన్ని  రాష్ట్రాల అభ్యాసులతో జూమ్ మీటింగుల ద్వారా పలుకరిస్తూ ఎన్నో సాధనపరమైన విషయాలను, జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలను చెబుతూ ఆ కష్టకాలాన్ని దాటించేశారు; ఈ సమయంలో శ్రామికులకు ఉచిత భోజన సేవలు, ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మాస్కుల పంపిణీ, ఇంకా అనేక సామాజిక సేవలనందించింది ఈ సంస్థ. ఈ గడ్డుకాలాన్ని పూజ్య దాజీ దాటించిన విధానం అద్వితీయం. మనందరి జీవితాల్లో ఎప్పటికీ కృతజ్ఞులై ఉండవలసిన ఘట్టం.

(ఇంకా ఉంది..)  




 

7, సెప్టెంబర్ 2023, గురువారం

పూజ్య దాజీ సందేశాలపై మననం - శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7, 2023



దాజీ సందేశాలపై మననం - శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం

శ్రీకృష్ణాష్టమి మనందరికీ  గొప్ప పర్వదినం; ఆయన యుగపురుషుడే కాదు, యోగేశ్వరుడు కూడా; అంటే యోగానికి ఈశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా. 

పూజ్య లాలాజీకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎనలేని భక్తి, పూజ్యభావం, శ్రద్ధ గలవారు. ఆయన ఇప్పటివరకూ ఉన్న భారతీయ ఆధ్యాత్మిక చరిత్రనంతా తిరగేసి శోధించినప్పుడు, శ్రీకృష్ణుడు అందరిలోకీ భిన్నంగా ప్రకాశిస్తూ ఉన్నదని తన గ్రంథాలలో వ్రాసుకోవడం జరిగింది. అలాగే బాబూజీ మహారాజ్ కూడా శ్రీరాముడిని గురించి అలాగే, నైతికతకు, సత్ప్రవర్తనకు, సంస్కృతికీ పునాదులు వేసిన వ్యక్తిగా విశ్వసించేవారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగాన్ని శాసించే యుగపురుషుడు. నైతికత, సత్ప్రవర్తన లను పునాదులుగా ఏర్పరచుకుని శ్రీకృష్ణ భగవానుడు మానవ జీవిత గమనంలో భక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. భగవంతుని పట్ల ప్రేమను ఆధ్యాత్మిక యోగసాధనలో భక్తిని ప్రవేశ పెట్టడం జరిగింది. 

సహజమార్గ పద్ధతి ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే, మనం నిత్యం చేసే కర్మలను,  ప్రేమ లేకుండా, ఉత్సాహం లేకుండా  కేవలం భౌతికంగా, మానసికంగా మాత్రమే చేసినట్లయితే బ్రతుకు ఈడుస్తున్నట్లుగా ఉంటుంది. అలా గాకుండగా  మనం చేసే పనులను గనుక కాస్త భగవంతుని పట్ల ప్రేమతో చేసినట్లయితే అది ఒక విధమైన భక్తిగా మారుతుంది, జీవితం ధన్యంగా మారుతుంది. లేకపోతే ఎప్పుడూ శ్రమగానే మిగిలిపోతుంది. అలాగే మనం సంపాదించుకున్న జ్ఞానం కూడా పాడైపోతుంది; పాలు పాడైతే పెరుగుగా మారినట్లే;  అలాగే జ్ఞానం కూడా అహం వల్ల కలుషితమైపోతుంది; ఆ జ్ఞానానికి భగవంతుడు కేంద్ర బిందువుగా ఉంటే తప్ప; భగవంతుని ప్రభావం ప్రబలంగా ఉంటూ భగవంతుడు కేంద్ర స్థానాన్ని గ్రహిస్తే  తప్ప. అప్పుడే జ్ఞానం భక్తిగా పరివర్తన చెందుతుంది; లేకపోతే ఆ  జ్ఞానం మూర్ఖత్వంగా మిగిలిపోతుంది

శ్రీకృష్ణుని జీవితంలో మరొక ముఖ్యమైన పాత్ర ఏమిటంటే, మనందరికీ  ఈ రోజున తెలిసిన సహజమార్గ పద్ధతి ద్వారా ప్రసరించే ప్రాణాహుతి పద్ధతి, ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రసరణను గురించి. అర్జునుడికి అంత జ్ఞానాన్ని, 18 అధ్యాయాలలోనీ 700 శ్లోకాలు, మౌఖికంగా  అందజేయడం అనేది అసాధ్యమైన విషయం; ముఖ్యంగా యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో, అన్నీ దిక్కుల నుండి శంఖాలు పూరించిన తరువాత; ఆ క్షణంలో అర్జునుడు విషాదంలో మునిగి ఇక నేను యుద్ధం చేయలేనని చతికిల పడిపోయినప్పుడు; ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ  జ్ఞానాన్నంతటినీ ప్రాణాహుతి ప్రసరణ ద్వారా కొన్ని క్షణాల్లోనే అర్జునుడికి అందజేయడం జరిగింది; వేదవ్యాస మహర్షి ఈ ప్రక్రియనంతటినీ  సాక్షిగా ఉన్నాడు; కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ క్షణాలలో ప్రాణాహుతి ద్వారా  అందించిన జ్ఞానాన్ని తర్జుమా చేసినదే  మనం ఈ రోజున చదువుకుంటున్న 700 శ్లోకాల భగవద్గీత. కేవలం ఆధునిక మానవుడు మాత్రమే ఈ ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతాడు; ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేయడం జరుగుతుందో. కొన్ని గిగా బైట్ల మెమరీని ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో ఎలా డౌన్ లోడ్ చేయవచ్చో ఈ  ఆధనిక మానవుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. ఈనాటి ప్రపంచం మాత్రమే ఏ విధంగా ఈ జ్ఞానాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చునో అర్థం చేసుకోగలడు.

ఆయన జీవితకాలంలోనే దివ్యలోకాలకు తరలి వెళ్ళాలని సంకల్పించినప్పుడు, ఉద్ధవుడు తెలుసుకొని, స్వామీ, మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి? మీరు మాతో ఏమీ పంచుకోలేదు అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వే అందరికీ బోధించాలి; భక్తిని గురించి గోపికలకు బోధించు; భక్తిని గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేయి అంటాడు. ఆ సాంప్రదాయమే ఈరోజుకీ కొనసాగుతూ ఉంది. 

శ్రీకృష్ణుని ప్రకారం భక్తి అంటే, కేవలం బాహ్య ఆరాధనే కాదు; మనం చేసే అన్నీ పనులకు వర్తిస్తుంది; వాటన్నిటినీ స్వామికి అంకితం చేస్తాం; జీవితంలోని ప్రతీ అంశమూ ఆ పరతత్త్వం పట్ల ఉన్న ప్రేమ తరంగాలతో కంపించాలి; అప్పుడే దాన్ని నిజమైన భక్తి అనగలుగుతాం.

చక్కని పాలలో ఒక నిమ్మరసం యొక్క చుక్క పడితే పాలు పాడైపోయినట్లు, భక్తి అనేది కలుషితమైపోయేది, భక్తికి మచ్చలేర్పడేది, ఎప్పుడంటే దురాశ ఏర్పడినప్పుడు, ఏదైనా ఆడగాలనుకున్నప్పుడు, చివరికి బ్రహ్మ విద్యను గురించి గాని, మోక్షాన్ని గురించి గాని, ఒక ఆలోచన మెదిలినా కూడా; భగవంతుడా నేనింత తపస్సు చేస్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను, కొంచె మనశ్శాంతినిస్తావా? అనేటువంటి వ్యాపార ధోరణి భక్తిని పాడుచేస్తుంది. ఎందుకంటే భక్తి దేన్నీ కోరదు  గనుక. భక్తి అంటే కేవలం ప్రేమ కోసం ఉండే ప్రేమ మాత్రమే; కేవలం భగవంతుని కోసం ఉండేది. మన ఉనికి ఉన్నదే భగవంతుని కోసం. కేవలం ఆయన సేవ కోసం మాత్రమే. 

ఆయన జీవితం ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక వెలుగుకూ కాంతిపుంజమై భాసిస్తూ ఉంటుంది. మనం వాటిని ఆకళింపుచేసుకోవాలి. ఆయన తత్త్వాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలి. 

సహజమార్గ మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణ భాగవానునితో ప్రారంభమవుతుంది. అది కొనసాగుతూ ఉంది కూడా; మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చును. మన మాస్టర్ల గురుపరంపర శ్రీకృష్ణుడు, శ్రీరాధతో ప్రారంభమవుతుంది; ఆ తరువాత చైతన్య మహాప్రభువు, గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్, చారీజీ మహారాజ్, ఇలా కొనసాగుతూ ఉంది; ఒక్కోసారి ఈ  పేర్లన్నీ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది; దయచేసి క్షమించండి. నేను అన్ని పేర్లూ చెప్పకలేకపోవచ్చు; అన్నీ  పుస్తకాలలో ఉన్నాయి. చెప్పలేకపోతే కూడా ఏమిటి నష్టం? కృష్ణుడి పేరు ముందా, లాలాజీ పేరు ముందా, అసలు ఏ పేరూ లేదా? ఒకవేళ వాళ్ళ పేర్లన్నీ చెప్పినా, వాళ్ళను గురించి మనకేమి తెలుస్తుంది? వారి దివ్య తత్త్వాలను గురించి ఎలా తెలుస్తుంది? మనం కూడా అటువంటి తత్త్వాలుగా మారితే తప్ప. కాబట్టి గురుపరంపర యొక్క పిలుపు ఒక్కటే - వాళ్ళల్లా తయారవ్వండి; తయారైన తరువాత ఆ తయారైన తత్త్వాన్ని వారికే అర్పించండి; ఆ విధంగా తయారై మిమ్మల్ని మీరు పూర్తిగా లేకుండా చేసుకోండి; మిమ్మల్ని మీరు లేకుండా చేసుకోవడం అంటే, మిమ్మల్ని మీరు కాల్చుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు; ఈ తయారైన తత్వానికి అతీతంగా ఎడగండి; అప్పుడొక నూతన అస్తిత్వం ప్రారంభమవుతుంది; అప్పుడు మనకు ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. కనీసం వారిలా తయారవ్వాలన్న దిశగా ఆసక్తి కనబరచండి, దానికి అవసరమైన లక్షణాలను మీలో పెంపొందించుకోండి; వాళ్ళకి మన జీవితాల్లో స్థానం కల్పించండి; మనం  వారికి అందుబాటులో ఉందాం; ఇలా మనలను మనం, మన ఆత్మలను, మన హృదయాన్ని, మన కృషి వారికి అందుబాటులో ఉంచడం అనేది చాలా కీలకం. ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నాం ఇక్కడ; వాళ్ళు మనపై పని చేయగలరు; మీరొక్క సమూహంగా ఇక్కడ అందరూ ధ్యానంలో కూర్చున్నారనుకోండి - దీన్నే అందుబాటులో ఉండటం అంటారు; వారి దివ్యకృపకు, దివ్య ప్రాణాహుతికి పాత్రులవడం; అప్పుడు మనకీ, వారికీ మధ్య జరుగవలసిన విలీన ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది; అలాగే మన ఇళ్ళల్లో కూడా మనం ఈ ప్రాణాహుతికి, పై నుండి వర్షిస్తున్న ఈ దివ్యకృపకు అందుబాటులో ఉంటున్నామా? మీరు అందుబాటులో లేనట్లయితే, మీరు వాటిని అందుకొనే పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, మీలో పరివర్తన ఎలా వస్తుంది? కాబట్టి ఆధ్యాత్మిక పరివర్తనకు, అందుబాటులో ఉండటం అనేది కీలకమైనది. భౌతికంగా అందుబాటులో ఉన్నా హృదయం మూసుకొని ఉంటే? ఎవరైతే అందుబాటులో ఉండాలనుకోవడం లేదో వాళ్ళకి చాలా అవరోధాలుంటాయి. ఎవరైతే నిజంగా, నిజంగా, నిజంగా పురోగమించాలనుకుంటున్నారో, వాళ్ళకు ఎటువంటి సాకులూ ఉండటానికి వీల్లేదు. కాబట్టి మనం ఇక మనకు ఈ అందుబాటులో ఉండటం కోసం, ఎటువంటి కారణాలూ, సాకులూ ఉండవన్న నిబద్ధత కలిగి ఉందాం. ధన్యవాదాలు. 


(పైన హైలైట్ చేసిన వాక్యాలు, మనం మరలా-మరలా, మనలో జీర్ణమయ్యే వరకూ మననం చేసుకోవలసిన వాక్యాలు. గమనించగలరు. )



5, సెప్టెంబర్ 2023, మంగళవారం

యుగపురుషుడు, జగద్గురువు, యోగీశ్వరుడు - శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో - శ్రీకృష్ణ ధ్యానం

 

        
శ్రీకృష్ణ ధ్యానం
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం యుగపురుషుడైనటువంటి, సహాజమార్గ గురుపరంపరలోని ఆదిపురుషుడైన  శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకునే ప్రయత్నంలో ఉన్నాం. 
అసలు ఇటువంటి వ్యక్తిత్వాలపై ధ్యానించడం ఎలా? అనే ప్రశ్న అందరికీ వస్తుంది; వాళ్ళ జీవిత చరిత్రలను, వ్యక్తిత్వాలను, వారు వారి జీవితకాలంలో చేసిన అద్భుత కార్యాలను, వారి బోధనలను, వారి జీవించిన తీరును, వారి వైభవాన్ని గుర్తు చేసుకోవడమా, అధ్యయనం చేయడమా, ఆకళింపు చేసుకోవడమా?  స్మరణలో ఇవన్నీ భాగమైనప్పటికీ ధ్యానించేది మాత్రం వీటన్నిటికీ మూలకారణమైన ఆ మహానీయుడి తత్త్వంపై ప్రత్యేకంగా ధ్యానించాలని మన గురువుల ద్వారా నాకర్థమయ్యింది. వారి-వారి జన్మదినాలలో ఆయా వ్యక్తిత్వాలను ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉంటాం. ప్రస్తుతం శ్రీకృష్ణపరమాత్మ తత్త్వంపై మనం ధ్యానిద్దాం.

నిజమైన స్మరణ, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక తృష్ణ సంతృప్తి చెందుతుంది. అదే నిజమైన స్మరణ కేవలం మేధోపరంగా జ్ఞాపకాలు నెమరువేసుకోవడం కాదు;  అటువంటి తత్త్వాన్ని మేధోపరంగా గాక హృదయపరంగా, ఆత్మపరంగా స్మరించడమే ధ్యానం, నిజమైన స్మరణ. పూజ్య చారీజీ అద్భుతంగా మనదరికీ అర్థమయ్యేలా వివరించారు స్మరణ అంటే: కడుపుకు ఆకలి వేస్తున్నప్పుడు, కడుపు ఆహారాన్ని స్మరించే స్థితే స్మరణ అంటే; దాహం వేసినప్పుడు గొంతుక నీటి కోసం స్మరించే స్థితి; మేధస్సు జ్ఞానం కోసం పరితపించే స్థితి; ఆత్మ దేని కోసం పరితపిస్తుందో ఆ స్థితే స్మరణ; దేన్ని స్మరిస్తే ఆత్మ సంతృప్తి చెందుతుందో అదే అసలైన స్మరణ; ఆత్మ దైవ తత్త్వాన్ని స్మరించినప్పుడు సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆకలిని, తృష్ణను తీర్చడమే గాక మరింతగా పరితపించేలా చేస్తుంది. ఈ  దృష్టికోణంతో మనం అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తత్త్వం పై ధ్యానిద్దాం; 
శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిత్వంలో అనేక దైవిక పార్శ్వాలున్నాయి: జన్మించినప్పటి నుండి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా లేడు; ఆయనలో బోధకుడున్నాడు, ప్రేమికుడున్నాడు; యోధుడున్నాడు; రక్షకుడున్నాడు; ఆపద్బాంధవుడున్నాడు; మంచి స్నేహితుడున్నాడు; ఆదర్శ వ్యక్తిత్వం ఉంది; తపోధనుడున్నాడు; సంభాషణా చాతుర్యం ఉన్నవాడు; మంచి రాయబారి ఉన్నాడు; అందరికీ అలౌకిక ఆనందాన్ని కలిగించే తత్త్వం ఉన్నవాడు; సమ్మోహన శక్తి గలవాడు; సంభాషణాల్లో అపస్వరాలు లేనివాడు; అన్నిటి కంటే పుట్టినప్పటి నుండి స్థితప్రజ్ఞత్వం ఆయన వ్యక్తిత్వంలో ప్రతీ క్షణమూ కనిపిస్తూనే ఉంటుంది; వీటన్నిటి కారణమైన ఆయనలో ఉన్న ఆ దివ్య చేతనపై ధ్యానించడమే శ్రీకృష్ణ ధ్యానం. దాన్నే శ్రీకృష్ణ చైతన్య ధ్యానం అనవచ్చు. 

ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ విధంగా ధ్యానించే ప్రయత్నంలో ఉందాం. 





4, సెప్టెంబర్ 2023, సోమవారం

నా ఆదర్శ ఉపాధ్యాయిని - శ్రీమతి విద్యాధరిగారు

నా ఆదర్శ ఉపాధ్యాయిని - శ్రీమతి విద్యాధరిగారు 
|| ఆచార్యదేవో భవ || 

ఈ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా నాకు విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులు గాక, ఉపాధ్యాయులందరికీ, ప్రవచనాల ద్వారా,  ప్రసంగాల ద్వారా, ఆధ్యాత్మిక శిక్షణనందించిన నా ప్రశిక్షకులందరికీ, నాకు సంస్కృతంలో ప్రవేశం కల్పించిన పండిత ధర్మానంద శాస్త్రిగారికి, ఇంకా ఎన్నో రకాలుగా విద్యనందించిన పెద్దలందరికీ పేరు-పేరునా, నా గుండెలోతుల్లో ఉండే కృతజ్ఞతను పూజ్యభావంతో వ్రాస్తున్న వ్యాసం ద్వారా వినమ్రతతో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నాను. 
 
వీరందరిలోనూ నా స్మృతిలో లోతుగా నాటుకుపోయిన ఉపాధ్యాయురాలు, నా  ఆదర్శ స్త్రీమూర్తి, శ్రీమతి విద్యాధరిగారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె నిజంగా విద్యా ధరి, విద్యను ధరించినవారు. ఈమె వద్ద నేను 4 సంవత్సరాలు మాత్రమే చదువుకున్నాను. 1973 నుండి 1977 వరకు. అంటే నా వయసు ఆ స్కూల్లో చేరినప్పుడు పదేళ్ళు. ఆ సమయంలో వారు న్యూఢిల్లీలోని, రామకృష్ణాపురంలోని, సెక్టార్ 2 లో ఉన్న తెలుగు స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ గా పని చేసేవారు. ఆమె ఏమి చదువుకున్నారో నాకిప్పటికీ తెలియదు; నేపథ్యమేమిటో నాకిప్పటికీ తెలియదు; ఆవిడ మాకు టీచరు, హెడ్ మిస్ట్రెస్ అని మాత్రమే తెలుసు.
 
ఈమధ్యనే అమెరికాలో ఉన్న వారి అబ్బాయిని (శ్రీధర్ గారు) సంప్రదించి, వారి చిత్రాన్ని సంపాదించాను. ఆ చిత్రం చూసిన వెంటనే అప్రయత్నంగా అరగంటసేపు కృతజ్ఞతతో కూడిన ఆశృధారలు చాలా సేపు కారుతూనే ఉన్నాయి. ఆమే నా మనసులో అంతా లోతుగా చెరగని ముద్ర వేశారనడానికి, నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పడానికి చెబుతున్నాను. చాలా సమయం పట్టింది మామూలు అవడానికి. ఇంత లోతైన ముద్ర ఆమె వేశారని నాకూ కూడా అప్పుడే అర్థమయ్యింది. 46 సంవత్సరాల తరువాత ఆమె చిత్రం చూసిన తరువాత ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్న అనుభూతి కలిగింది. 

ఆమె నాకు మొదటిసారిగా క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక మేమందరమూ ఆచరించేలా కూడా చేశారు. నా స్వభావం న్యూనతా భావంతో కూడినది; ఆంగ్లంలో ఇంట్రావర్ట్ అంటారు; ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు; అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండేది కాదు; చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది; మా తల్లిదండ్రులకు  కూడా ఏమి చేయాలో తెలిసేది కాదు. 

అటువంటివాడి చేత, బొమ్మలు వేయించింది, కవితలు, ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ, హిందీ భాషలో కూడా వ్రాసేలా ప్రోత్సహించారు; ఆరోగ్యసూత్రాలను పాటించేలా చేశారు; ప్రతీ సోమవారం, మా గోళ్లను చెక్ చేసేవారు; (ఇప్పటికీ  నేను ప్రతీ సోమవారం గోళ్ళు తీసుకుంటాను); ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేసుకోవడం నేర్పించారు; వక్తృత్వ పోటీల్లో మూడు భాషలలో పాల్గొనేలా తర్ఫీదునిచ్చేవారు; పెద్ద-పెద్ద నాటకాలు వేయించారు; రేడియో నాటకాలతో సహా; 3 సంవత్సరాలు స్కూల్ లీడరుగా నిలబెట్టారు;  పాటలు పాడించేవారు; ఎన్నో రకాల ఆటలు ఆడించేవారు; స్కూల్లో చిన్న-చిన్న  బాధ్యతలిచ్చేవారు; అలాగే చదువులో కూడా మంచి మార్కులు వచ్చేలా చూసేవారు; ఆ విధంగా ఎన్నో విలువలు మాకు తెలియకుండానే మాలో అబ్బేలా చేశారు. నా చేత మొట్టమొదటగా ఢిల్లీలోని రామకృష్ణా మఠంలో స్వామి వివేకానంద సాహిత్యంలో నుండి తీసిన ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని మాట్లాడేలా చేశారు. అలాగే అప్పుడప్పుడు ప్రేమతో కూడిన కఠినత్వం కూడా చూపించేవారు; వారు కోపం చూపిస్తే అందరమూ భయపడేవాళ్ళం, వెంటనే తప్పులు సరిదిద్దుకునేవాళ్ళం. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థమయ్యింది. కానీ ఆమె నేపథ్యం ఏమిటో ఇప్పటికీ తెలియదు. మా నాన్నగారికి హైదరాబాదు బదిలీ అవడంతో 1978 లో హైదరాబాదు వచ్చేశాం; ఇక్కడికి రాగానే ఒక రకమైన బెంగతో ఒక ఉత్తరం వ్రాస్తే ఆమే ఎంతో ఆప్యాయంగా వెంటనే జవాబు వ్రాయడం జరిగింది. నా ఆనందానికి అవధుల్లేవు. 1973 నుండి 1977  వరకూ గడచిన సంవత్సరాలు నా జీవితంలో అతి మధురమైన క్షణాలు, నా జీవితానికి గొప్ప పునాదులు ఏర్పడిన సంవత్సరాలు.  ఆమె వ్యక్తిత్వం అంత గొప్పది. తలచుకుంటున్న కొద్దీ ఇంకా వ్రాయాలనే అనిపిస్తోంది. కానీ ఇది తరగనిది. విద్యాధరి టీచర్ గారి పట్ల నా కృతజ్ఞత, నా హృదయంలో ఎప్పటికీ ఊరుతూనే ఉంటుంది. 

 వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. విద్యాధరి టీచర్ ఏ లోకాల్లో ఉన్నా,  వారికి నా గురుదేవుల ఆశీస్సులు సదా ఉండాలని, ఊర్ధ్వలోకాలలో వారి పయనం ఇంకా ముందుకు-ముందుకు కొనసాఘాట్ ఉండాలని, ఎప్పటికీ వారు నన్ను ప్రేమతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఆ సర్వశక్తిమంతుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.  


 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...