హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 2
ఈ యాత్ర కొనసాగడానికి ప్రేరణ ఏమిటి?
సంపూర్ణ స్పృహతో చేసే యాత్ర ఈ ఆధ్యాత్మిక అనంత యాత్ర. దీనికి ప్రేరణ ఆసక్తి లేకపోతే ప్రయాణం కుంటుపడుతుంది. అయితే ఈ ప్రేరణ ప్రతి ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా తపన రూపంలో, సహజ ఆసక్తి రూపంలో, నిద్రాణ స్థితిలో ఉంది. అందుకే సాధకులు తపనను తీవ్రతరం చేసుకోవడం చాలా అవసరం. తపనే సాధనకు ఇంధనం.
ఈ యాత్ర ఎంత కాలం నుండి కొనసాగుతూ ఉంది?
ఎంత కాలం తెలియదు కానీ, మన శాస్త్రాల ప్రకారం ఒక అంచనా మాత్రం ఉంది. పరమాత్మలో అంశాలైన ఈ ఆత్మలన్నీ విడిపోయిన క్షణం నుండి 84 లక్షల యోనుల గుండా ప్రవేశిస్తే గాని మానవ జన్మ రాదట. ఈ మానవ జన్మ ఇలాగే కొనసాగితే కూడా పునరపి జననం, పునరపి మరణం అన్నట్లుగా ప్రతీ జన్మలోనూ కొంచెం-కొంచెంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆత్మ, ఆ పరమాత్మలో సంపూర్ణంగా లయమయ్యే వరకూ; లేదా మహాప్రళయం జరిగే వరకూ, సాధారణంగా ప్రతీ ఆత్మ ఈ యాత్రను కొనసాగిస్తూ ఉంటుంది. ఈ యాత్ర ఆత్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. మహాప్రళయం వరకూ ఆగకుండా కొన్ని ఆత్మలు విసిగిపోయి ఈ యాత్రను కుదించాలనుకున్న ఆత్మలు యాత్రను వేగవంతం చేయాలని సంకల్పించుకుంటాయి. అలా యాత్రను తీవ్రతరం చేసుకునే ఆత్మలే ఒక ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరిస్తూ, ఒక సమర్థ గురువును ఆశ్రయించడం జరుగుతుంది.
మానవ జన్మ, మోక్షం పొందాలన్న ఇచ్ఛ, సమర్థ గురువు ఈ మూడూ దొరకడం దుర్లభం అంటారు కదా!
అవును, ఈ యాత్ర సాఫీగా, త్వరితంగా, సురక్షితంగా కొనసాగడానికి ఆదిశంకరులవారు ఈ మూడూ దుర్లభం అని తన వివేకచూడామణి అనే గ్రంథంలో సెలవిచ్చారు.
దుర్లభం త్రయం యేవ ఏతద్ దేవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సమాశ్రయః ||
పూజ్య బాబూజీ దీనికి మరో కీలకాంశం జోడించినట్లుగా అనిపిస్తుంది. అటువంటి సమర్థ గురువు చెప్పింది చేయకపోయినట్లయితే ఈ మూడూ ఉన్నా కూడా సరిపోదన్నారు బాబూజీ.
కాబట్టి ఈ యాత్ర యొక్క గంభీరతను, ఆవశ్యకతను అందరూ గుర్తించాలని, దానికి తగినట్లుగా యథాశక్తి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తారని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి