17, డిసెంబర్ 2024, మంగళవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024 ఐక్యరాజ్య సమితి ప్రకటన

 


ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024  
ఐక్యరాజ్య సమితి ప్రకటన 

ధ్యాన ప్రేమికులకు, ధ్యాన సాధకులకు ఒక శుభవార్త!
ఈ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరమూ డిశంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం గా యావత్ ప్రపంచం అంతా జరుపుకోబోతోంది. శారీరక, మానసిక సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడేదిగా ధ్యానాన్ని ఐక్య రాజ్య సమితి ఏకగ్రీవంగా గుర్తించడం జరిగింది. 

ఈ మేరకు డిశంబర్ 15 న హార్ట్ఫుల్నెస్ - శ్రీరామ చంద్ర మిషన్  అధ్యక్షులు పూజ్య దాజీ, ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను జూమ్ ద్వారా, దిల్ సే కార్యక్రమం ద్వారా  ముచ్చటిస్తూ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని, తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో, హైదరాబాదులోని గచ్చి బౌలీ స్టేడియంలో డిశంబర్ 21, న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకూ జరుగబోతున్నదని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్య దాజీ స్వయంగా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను, ధ్యానం పట్ల ఆసక్తి గలవారందరినీ బంధిమిత్ర సమేతంగా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అభ్యాసులను ముఖ్యంగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో పాల్గొని వాతావరణాన్ని మార్చమన్నారు దాజీ. 

కావున అభ్యాసులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి: మానందరమూ సాధ్యమైనంత అధిక సంఖ్యలో శ్రద్ధాసక్తులతో, ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య దాజీ సంకల్పాన్ని దిగ్విజయం చేద్దాం. 

9, డిసెంబర్ 2024, సోమవారం

డిజైనింగ్ డెస్టినీ - విధి రూపకల్పన గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు

 


డిజైనింగ్ డెస్టినీ  - విధి రూపకల్పన 
గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు 

హార్ట్ఫుల్నెస్ మార్గం ద్వారా విధి రూపకల్పన (Designing Destiny the heartfulness way) అనే గ్రంథాన్ని పూజ్య దాజీ శ్రీ కమలేష్ డి. పటేల్ గారు వ్రాయడం జరగింది. 

ఈ శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతుందేమోనన్న ఆశ కలిగిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇందులో చాలా సూక్ష్మయలున్నాయి; మన ఇచ్ఛాశక్తిని అంటే సంకల్ప శక్తిని (Will Power) సరైన దిశలో వినియోగించుకుంటే తప్ప సాధ్యం కాదని అర్థమవుతుంది. ఈ గ్రంథం, మనందరిలో ఉదయించే ఎన్నో ప్రశ్నలకు  సమాధానాలు సూచిస్తుంది. మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. 

మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో యేదొక దశలో విధికి సంబంధించిన ప్రశ్నలు అనేకం వస్తూంటాయి. వాటిల్లో కొన్ని ఈ ఈ విధంగా ఉండవచ్చు: 
 అసలు విధి అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? రెండూ ఒకటేనా?
మనిషి యొక్క విధి, నుదుటివ్రాత, లేక ప్రారబ్ధం పూర్వమే నిర్ధారించబడిందా? మనిషికి గతంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఇంతకు ముందే లిఖించబడిందా?
లేక మన విధిని మనమే స్వయంగా వ్రాసుకున్నామా? అలా స్వయంగా  రూపకల్పన (డిజైన్)  చేసుకోగలమా? మన నుదుటి  వ్రాతను మనమే వ్రాసుకుంటామా? మన తలరాతను మార్చుకోగలమా?
మార్చుకోగలిగితే ఎంత వరకూ మార్చుకోగలం? మార్చలేని భాగం యేదైనా ఉందా? మన ప్రమేయం ఎంతవరకూ ఉంది, ఎంత వరకూ లేదు? ఈ పరివర్తన జరగాలంటే మార్గాలేమిటి?
హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలు ఈ క్రమంలో యే విధంగా ఉపయోగపడతాయి? 
జరిగే మార్పులు యే స్థాయిలో జరుగుతాయి, శరీర స్థాయిలోనా, మానసిక స్థాయిలోనా, ఆత్మ స్థాయిలోనా? అంటే స్థూల స్థూలశరీరపరంగానా, సూక్ష్మశరీర పరంగానా, కారణ శరీరపరంగానా?
జరగవలసిన మార్పుకు ఎంత కాలం పడుతుంది, త్వరితంగా జరగాలంటే మార్గాలున్నాయా?
మొత్తంఈ విధి రూపకల్పనలో గురువు పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి?

తరువాయి వ్యాసంలో సమాధానాలు/పరిష్కారాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కూడా ఈ గ్రంథంలో నుండి శోధించాలని సవినయ విజ్ఞప్తి. 

7, డిసెంబర్ 2024, శనివారం

ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు - అభ్యాసులు

 



ఆధ్యాత్మిక జిజ్ఞాసులు - అభ్యాసులు 

ధ్యానం చేయడానికి వచ్చేవారు, లేక ఆధ్యాత్మిక సాధన చేయాలని వచ్చేవారు, ఎవరినైతే మనం జిజ్ఞాసులని, అభ్యాసులని, సాధకులని పిలుస్తూ ఉంటామో, వాళ్ళు రకరకాల లక్ష్యాలతో వస్తూంటారు. ముఖ్యంగా ఒక గురువును ఆశ్రయించాలనుకున్నవారు మనసుల్లో వివిధ గమ్యాలు పెట్టుకుని వస్తూంటారు. 

ఉదాహరణకు ఒకప్పుడు ప్రాచీనకాలంలో చాలా వరకూ కేవలం భగవత్సాక్షాత్కారం కోసం గురువును ఆశ్రయించేవారు. ఆ తరువాతి కాలంలో ఎక్కువమంది మోక్షసాధన కోసం వచ్చేవారు గురువు వద్దకు. ఆ తరువాత కేవలం మనశ్శాంతి కోసం వచ్చేవారు ధ్యానానికి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి వస్తున్నారు. 

బాబూజీ తన సహజ్ మార్గ్ ధ్యాన విధానానికి, వాళ్ళ మనసుల్లో  ఎటువంటి లక్ష్యమున్నా స్వాగతిస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కష్టాలు పోవాలని, ఇలా రకరకాలుగా ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎలా మొదలుపెట్టినప్పటికీ క్రమక్రమంగా యదార్థ లక్ష్యం సహజంగా స్థిరంగా ఏర్పడే అవకాశం ఈ సహజ మార్గ్ సాధన వల్ల కలుగుటుందంటారు బాబూజీ. అందుకే అభ్యాసుల హృదయాలలో లక్ష్యం స్థిరంగా, స్పష్టంగా ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. అందుకే మన ప్రార్థనలోని మొదటి పంక్తి, ప్రతి రోజూ మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. 

ఆసక్తిని బట్టి లక్ష్యం ఏర్పడుతుంది, లక్ష్యాన్ని బట్టి తపన ఉంటుంది, తపనను బట్టి, సాధన క్రమబద్ధం అవుతుంది, ఆ విధంగా పురోగతి జరుగుతూ ఉంటుంది.  




6, డిసెంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం

 సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం 
సహజమార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి, పూజ్య బాబూజీ మహారాజ్ మానవాళి ఉద్ధరణకు అందించిన ఒక విప్లవాత్మకమైన ధ్యాన పద్ధతి. రాజయోగ ధ్యాన పద్ధతిని పునర్వ్యవస్థీకరించి, ఆధునిక మానవుల అవసరాలకు తగినట్లుగా, ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరళంగా దైవత్వాన్ని సాక్షాత్కరించుకునే మార్గం; మానవ పరిపూర్ణతను సిద్ధించుకునే సాధనం. 

దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న ప్రాణాహుతి ప్రసరణతో కూడిన రాజయోగ బ్రహ్మ విద్యా విధానం, ఈ సహజ మార్గం. ఈ ఋషి పేరును కూడా పూజ్య దాజీ సూచించడం జరిగింది. ఆయన పేరు ఋషభ్ నాథ్. దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం అంటే బహుశా రాముడి కాలంలో గాని కృష్ణుడి కాలంలో గాని ఈ ప్రాణహుతితో కూడిన ఆధ్యాత్మిక విద్య  ప్రాచుర్యంలో లేదు. 

పూజ్య లాలాజీ ఆధునిక మానవాళిని అత్యంత త్వరితంగా మోక్షానికి తీసుకువెళ్ళగలిగే మార్గాన్ని తన యోగశక్తి ద్వారా శోధించినప్పుడు, కాలగమనంలో అంత వెనక్కి (దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం) వెళ్ళినప్పుడు తెలుసుకున్న విద్యయే  ఈ ప్రాణాహుతి ప్రసరణ విద్య. కాబట్టి దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న విద్యను ప్రస్తుత కాలానికి తీసుకు వచ్చినది పూజ్య లాలాజీ మహారాజ్. 

ఆ ప్రాణాహుతితో కూడిన ధ్యాన పద్ధతికి అదనంగా సంస్కారాలను దగ్ధం చేసే శుద్ధీకరణ ప్రక్రియను ఆవిష్కరించి, ప్రార్థన అనే యౌగిక ప్రక్రియని జోడించి, ఈ రాజయోగపద్ధతికి పరిపూర్ణతను పూజ్య బాబూజీ చేకూర్చడం  జరిగింది. ఈ మూడు యౌగిక ప్రక్రియలను అనుసరించడం ద్వారా యోగసిద్ధి సహజంగా జరుగుతుంది కాబట్టి, ఈ ధ్యాన పద్ధతికి సహజ మార్గ్ అనే నామకరణం చేయడం జరిగింది. 

ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల మనిషిలో మనసు క్రమశిక్షణలో ఉండటమే గాక, మనసుకు అతీతంగా ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడం ద్వారా అడుగడుగునా జీవిత దృక్పథం మారుతూ వ్యక్తిని మరింత మరింత మెరుగైన విధంగా మారుస్తుంది. క్రమక్రమంగా పద్ధతిగా సాధన కొనసాగించడం ద్వారా ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధించే అవకాశం ఉన్నది. 

ఈ సాధన చేస్తే అందరూ మహాత్ములయిపోతారా? అన్న ప్రశ్న అమదరికీ రావచ్చు. దానికి చారీజీ ఒకసారి సమాధానమిస్తూ, అందరూ మహాత్ములు కాకపోవచ్చు, కానీ 80 శాతం మహాత్ములుగా పరిశుద్ధ జీవనం సాగించగలుగుతారని చెప్పడం జరిగింది. బంగారు పతాకం ఒక్కరికే రావచ్చునేమో గాని, పట్టభద్రులు ఎవరైనా కాగలగడం ఎలా సాధ్యమో, అందరూ చాలా వరకూ మరింత మెరుగైన విలువలతో కూడిన మనుషులయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు చారీజీ. దీనికి మన అనుభవమే నిదర్శనం అవుతుంది. కేవలం కొన్నాళ్ళు ప్రయత్నించి చూడాలంతే. 

సహజ మార్గ్ అన్నీ మతాలకు అతీతమైనది. ఎవ్వరైనా ఈ సాధన ప్రయత్నించవచ్చు. ఈ సాధన వల్ల హిందువు మరింత మెరుగైన హిందువుగానూ, క్రైస్తవుడు మరింత మెరుగైన క్రైస్తవుడుగానూ, ఇలా యే మతానికి చెందినవారైనా మరింత మెరుగైన వ్యక్తిగా మారడమే గాక, సంకుచిత మనస్తత్వం పోయి, విశాలమైన హృదయంతో వారి వారి మతాగ్రంథాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, మానవాళిలో సామరస్యం, ప్రేమ పెరగడానికి తోడ్పడటం జరుగుతుంది. ఆ విధంగా భూతల స్వర్గం ఏర్పడే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడవలసిన యోగసాధన సహజ్ మార్గ్. 


22, నవంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

https://www.youtube.com/watch?v=9VeumJifoJY

 సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

సహజ మార్గ ధ్యాన ప్రక్రియలు విశ్వజనీనమైనవి, అంటే అన్నీ రకాల వ్యక్తులు అనుసరించగలిగేవి. ఎటువంటి అర్హతలూ చూడరు. కేవలం ప్రయత్నించడానికి సంసిద్ధత ఉండాలి అంటే. నమ్మకం, విశ్వాసం వంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనుభవం ద్వారానే కలుగుతుంది గనుక. అనుభవం మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే సాధ్యం. 

ఎటువంటి విద్యార్హతలు గాని, ఎటువంటి నేపథ్యం గాని, కులమత రంగు,  జాతీయతలతో సంబంధం లేదు. శాస్త్రజ్ఞులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అంగవైకల్యం ఉన్నవారైనా, ఎవ్వరైనా ఈ ధ్యాన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలు హృదయ లోలోతుల్లోకి తీసుకువెళ్ళి మన చేతన స్థాయినే చేసిన ప్రతీశారీ మార్చగలిగే సామర్థ్యం ఉన్న పద్ధతి సహజ మార్గ ధ్యాన పద్ధతి. ఎవ్వరికైనా తెలియజేయవచ్చు, తనను తాను మార్చుకోవాలన్న తపన కలిగిన ప్రతీ వ్యక్తికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే ప్రక్రియలివి; సత్యాన్ని యథాతథంగా దర్శింపజేసి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తద్వారా జీవన ప్రమాణాలు, విలువలు సహజంగా ఉన్నతస్థాయిలో ఉండేలా చేస్తుంది. విలువలను నిజంగా గుర్తింపజేసి ఆ దిశలో జీవితాన్ని నడిపిస్తుంది ఈ మార్గం. 

కాబట్టి ఇది అందరికీ అవసరం, ముందు మనం అనుభవాన్ని సాధించి, ఆ తరువాత అందరికీ తెలియజేయదగ్గ మార్గం, సహజ మార్గం. అవసరమైనడల్లా పరివర్తన కోసం తపించే హృదయం. అనుభవాన్ని పంచుకోవడం ద్వారానే దీన్ని ఇతరులకు తెలియజేయగలం. 

 అయితే ఈ సందర్భంలో పూజ్య చారీజీ అడిగిన ఒక ప్రశ్న గుర్తుకొస్తున్నది. ఒక ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజ మార్గ పద్ధతిని తెలియజేయాలంటే ఒక గ్రుడ్డి, మూగ, చెవుడు మూడూ ఉన్న వ్యక్తికి తెలియజేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశ్చర్యం వేసింది. దానికి వారు, యేమీ లేదు, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశిక్షకుడు ప్రాణాహుతినివ్వడమేనన్నారు. అది హృదయాన్ని స్పృశిస్తుంది కాబట్టి జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం జరుగుతుందన్నారు. అంతే కాదు, అన్నీ అవయవాలున్నవాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గ్రుడ్డి, మూగ, చెవుడు ఉన్నట్లుగా కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే తప్ప, హృదయ గళాన్ని వినిపించుకోలేమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ధ్యానంలో జరిగేది అదే మనకు యేమీ కనిపించదు, వినిపించదు, మాట్లాడటం ఉండదు. అందరూ మననం చెయ్యవలసిన అంశం ఇది. 

19, నవంబర్ 2024, మంగళవారం

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? 

 ఆధ్యాత్మికత అంటే మతం కాదు. 

ఆధ్యాత్మికత అంటే బాహ్యారాధన కాదు.

ఆధ్యాత్మికత విడదీసేది కాదు.  

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే మతానికి అతీతమైనది. 

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమై తెలుసుకునేది. 

ఆధ్యాత్మికత అంటే కలిపేది, విడదీసేది కాదు. 



6, నవంబర్ 2024, బుధవారం

మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి

 


మా అమ్మగారు ధ్యాన ముద్రలో ... 
(అక్టోబర్ 22, 1942 - సెప్టెంబర్ 28, 2024)
మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి 
మా తల్లిగారు నడుపల్లె రాజేశ్వరిగారు, సెప్టెంబర్ 28, 2024న హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో కాలం చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. విధి విలాసం ఎలా ఉందంటే, ఆవిడను ఆసుపత్రిలో జేర్చిన 2 రోజులకే నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో మరొక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. శాస్త్ర చికిత్సలకు లోను కావలసి వచ్చింది. దానితో మా అమ్మగారు కాలం చేసినపుడు నేను అందుబాటులో లేకుండా పోవడమే గాక దహన ప్రక్రియలు కూడా నిర్వర్తించలేకపోయాను. ఇది నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన ఘట్టం ఇప్పటివరకూ. ఇవి చాలవన్నట్లుగా మేముండే 4 వ అంతస్తులో, మా అపార్టుమెంటులో లిఫ్ట్ పని చేయడం లేదు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా!

మాతృమూర్తిని కోల్పోవడం వ్యక్తి జీవితంలో హృదయంలో ఒక పూడ్చలేని వెలితిని సృష్టిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు అని చిన్నప్పుడు, కాపీ పుస్తకాలలో వ్రాసేవాళ్ళం. అప్పుడు అర్థం తెలియదు, కేవలం స్కూల్లో మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ లా ఉండేదంతే. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు. కానీ ఆమెను కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఆమె  మన పట్ల చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందుంటాయి. ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టామో గుర్తుకు వస్తుంది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో గుర్తొస్తుంది. క్షమించమని అడిగిన దాఖలాలు ఒకవేళ ఉంటే అవి చాలా తక్కువ. ఎన్నో అవమానాలు మన కోసం భరించినప్పుడు యేమీ చేయలేని సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు, బాధ వర్ణనాతీతం. తల్లి ఎటువంటిదైనప్పటికీ తల్లి మనసును బాధపెట్టడమూ అంటే భగవంతుని బాధపెట్టినట్లే అని పూజ్య చారీజీ అంటూండేవారు. తల్లి కళ్ళకెదురుగా కదలాడే నిస్స్వార్థ జీవి. 
అయితే సంతృప్తికరమైన రోజులు మా అమ్మగారితో బొత్తిగా లేవని కాదు. మా నాన్నగారు 1996 లో పరమపదించిన తరువాత 28 యేళ్ళు నాతోనే ఉండటం నా అదృష్టం ఆమెను చేతనైన జాగ్రత్తగా చూసుకో గలిగాను. నా గురుదేవులు నన్ను హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునిగా చేసినప్పుడు మొట్టమొదటి ధ్యాన సిట్టింగ్ ఆమెకే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి చివరి వరకు నిత్యమూ ధ్యాన సిట్టింగులు ఇవ్వగలిగాను. నా దృష్టిలో తల్లి రుణం కొంతైనా తీర్చుకోగలిగే మహత్తర అవకాశం నా గురుదేవులు నాకు ప్రసాదించారనిపించింది. ఆధ్యాత్మిక సేవనందించగలిగాను. ఆవిడ క్రమం తప్పక తన సాధన చేసుకుంటూ ఉండేవారు. మన గురుపరంపర పట్ల అపార భక్తి ఉండేది. ధ్యానం అంటే గొప్ప గురి ఉండేది. మా చెల్లెళ్ళను, తన కోడలిని సమదృష్టితో చూడటానికి ప్రయత్నించేది. ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడేది కాదు. తనను గురించిన ఆలోచన లేకుండా జీవించిన మహాసాధ్వి. 
ఈ ఉపద్రవ సమయంలో నాకు ఆసరాగా నిలిచినది నా సహజ మార్గ పరివారం. అన్నిటి కంటే మించి గురుదేవుల రక్షణ, అభయహస్తం మాపై ఉండటం. 13 రోజులు ఆమె ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా కొనసాగడానికి కోసం ప్రార్థన-ధ్యానం చేయమని గురుదేవులు ఆదేశించడం మన అభ్యాసులు, ప్రశిక్షకులు పాల్గొనడం జరిగింది. 
మా అమ్మను సదా నా హృదయంలో స్మరిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రేమను కొనసాగిస్తూ నా శేషజీవితాన్ని గురుదేవుల సేవలో వెచ్చిస్తానని మా అమ్మకు మాటిస్తూ, ఇదే నా కృతజ్ఞతాపూర్వక అశ్రునివాళి! 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...