మా అమ్మగారు ధ్యాన ముద్రలో ...
(అక్టోబర్ 22, 1942 - సెప్టెంబర్ 28, 2024)
మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి
మా తల్లిగారు నడుపల్లె రాజేశ్వరిగారు, సెప్టెంబర్ 28, 2024న హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో కాలం చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. విధి విలాసం ఎలా ఉందంటే, ఆవిడను ఆసుపత్రిలో జేర్చిన 2 రోజులకే నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో మరొక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. శాస్త్ర చికిత్సలకు లోను కావలసి వచ్చింది. దానితో మా అమ్మగారు కాలం చేసినపుడు నేను అందుబాటులో లేకుండా పోవడమే గాక దహన ప్రక్రియలు కూడా నిర్వర్తించలేకపోయాను. ఇది నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన ఘట్టం ఇప్పటివరకూ. ఇవి చాలవన్నట్లుగా మేముండే 4 వ అంతస్తులో, మా అపార్టుమెంటులో లిఫ్ట్ పని చేయడం లేదు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా!
మాతృమూర్తిని కోల్పోవడం వ్యక్తి జీవితంలో హృదయంలో ఒక పూడ్చలేని వెలితిని సృష్టిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు అని చిన్నప్పుడు, కాపీ పుస్తకాలలో వ్రాసేవాళ్ళం. అప్పుడు అర్థం తెలియదు, కేవలం స్కూల్లో మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ లా ఉండేదంతే. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు. కానీ ఆమెను కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఆమె మన పట్ల చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందుంటాయి. ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టామో గుర్తుకు వస్తుంది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో గుర్తొస్తుంది. క్షమించమని అడిగిన దాఖలాలు ఒకవేళ ఉంటే అవి చాలా తక్కువ. ఎన్నో అవమానాలు మన కోసం భరించినప్పుడు యేమీ చేయలేని సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు, బాధ వర్ణనాతీతం. తల్లి ఎటువంటిదైనప్పటికీ తల్లి మనసును బాధపెట్టడమూ అంటే భగవంతుని బాధపెట్టినట్లే అని పూజ్య చారీజీ అంటూండేవారు. తల్లి కళ్ళకెదురుగా కదలాడే నిస్స్వార్థ జీవి.
అయితే సంతృప్తికరమైన రోజులు మా అమ్మగారితో బొత్తిగా లేవని కాదు. మా నాన్నగారు 1996 లో పరమపదించిన తరువాత 28 యేళ్ళు నాతోనే ఉండటం నా అదృష్టం ఆమెను చేతనైన జాగ్రత్తగా చూసుకో గలిగాను. నా గురుదేవులు నన్ను హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునిగా చేసినప్పుడు మొట్టమొదటి ధ్యాన సిట్టింగ్ ఆమెకే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి చివరి వరకు నిత్యమూ ధ్యాన సిట్టింగులు ఇవ్వగలిగాను. నా దృష్టిలో తల్లి రుణం కొంతైనా తీర్చుకోగలిగే మహత్తర అవకాశం నా గురుదేవులు నాకు ప్రసాదించారనిపించింది. ఆధ్యాత్మిక సేవనందించగలిగాను. ఆవిడ క్రమం తప్పక తన సాధన చేసుకుంటూ ఉండేవారు. మన గురుపరంపర పట్ల అపార భక్తి ఉండేది. ధ్యానం అంటే గొప్ప గురి ఉండేది. మా చెల్లెళ్ళను, తన కోడలిని సమదృష్టితో చూడటానికి ప్రయత్నించేది. ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడేది కాదు. తనను గురించిన ఆలోచన లేకుండా జీవించిన మహాసాధ్వి.
ఈ ఉపద్రవ సమయంలో నాకు ఆసరాగా నిలిచినది నా సహజ మార్గ పరివారం. అన్నిటి కంటే మించి గురుదేవుల రక్షణ, అభయహస్తం మాపై ఉండటం. 13 రోజులు ఆమె ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా కొనసాగడానికి కోసం ప్రార్థన-ధ్యానం చేయమని గురుదేవులు ఆదేశించడం మన అభ్యాసులు, ప్రశిక్షకులు పాల్గొనడం జరిగింది.
మా అమ్మను సదా నా హృదయంలో స్మరిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రేమను కొనసాగిస్తూ నా శేషజీవితాన్ని గురుదేవుల సేవలో వెచ్చిస్తానని మా అమ్మకు మాటిస్తూ, ఇదే నా కృతజ్ఞతాపూర్వక అశ్రునివాళి!
హృదయపూర్వక నమస్సులు 🙏💐
రిప్లయితొలగించండి