22, నవంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

https://www.youtube.com/watch?v=9VeumJifoJY

 సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

సహజ మార్గ ధ్యాన ప్రక్రియలు విశ్వజనీనమైనవి, అంటే అన్నీ రకాల వ్యక్తులు అనుసరించగలిగేవి. ఎటువంటి అర్హతలూ చూడరు. కేవలం ప్రయత్నించడానికి సంసిద్ధత ఉండాలి అంటే. నమ్మకం, విశ్వాసం వంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనుభవం ద్వారానే కలుగుతుంది గనుక. అనుభవం మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే సాధ్యం. 

ఎటువంటి విద్యార్హతలు గాని, ఎటువంటి నేపథ్యం గాని, కులమత రంగు,  జాతీయతలతో సంబంధం లేదు. శాస్త్రజ్ఞులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అంగవైకల్యం ఉన్నవారైనా, ఎవ్వరైనా ఈ ధ్యాన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలు హృదయ లోలోతుల్లోకి తీసుకువెళ్ళి మన చేతన స్థాయినే చేసిన ప్రతీశారీ మార్చగలిగే సామర్థ్యం ఉన్న పద్ధతి సహజ మార్గ ధ్యాన పద్ధతి. ఎవ్వరికైనా తెలియజేయవచ్చు, తనను తాను మార్చుకోవాలన్న తపన కలిగిన ప్రతీ వ్యక్తికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే ప్రక్రియలివి; సత్యాన్ని యథాతథంగా దర్శింపజేసి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తద్వారా జీవన ప్రమాణాలు, విలువలు సహజంగా ఉన్నతస్థాయిలో ఉండేలా చేస్తుంది. విలువలను నిజంగా గుర్తింపజేసి ఆ దిశలో జీవితాన్ని నడిపిస్తుంది ఈ మార్గం. 

కాబట్టి ఇది అందరికీ అవసరం, ముందు మనం అనుభవాన్ని సాధించి, ఆ తరువాత అందరికీ తెలియజేయదగ్గ మార్గం, సహజ మార్గం. అవసరమైనడల్లా పరివర్తన కోసం తపించే హృదయం. అనుభవాన్ని పంచుకోవడం ద్వారానే దీన్ని ఇతరులకు తెలియజేయగలం. 

 అయితే ఈ సందర్భంలో పూజ్య చారీజీ అడిగిన ఒక ప్రశ్న గుర్తుకొస్తున్నది. ఒక ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజ మార్గ పద్ధతిని తెలియజేయాలంటే ఒక గ్రుడ్డి, మూగ, చెవుడు మూడూ ఉన్న వ్యక్తికి తెలియజేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశ్చర్యం వేసింది. దానికి వారు, యేమీ లేదు, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశిక్షకుడు ప్రాణాహుతినివ్వడమేనన్నారు. అది హృదయాన్ని స్పృశిస్తుంది కాబట్టి జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం జరుగుతుందన్నారు. అంతే కాదు, అన్నీ అవయవాలున్నవాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గ్రుడ్డి, మూగ, చెవుడు ఉన్నట్లుగా కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే తప్ప, హృదయ గళాన్ని వినిపించుకోలేమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ధ్యానంలో జరిగేది అదే మనకు యేమీ కనిపించదు, వినిపించదు, మాట్లాడటం ఉండదు. అందరూ మననం చెయ్యవలసిన అంశం ఇది. 

19, నవంబర్ 2024, మంగళవారం

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? 

 ఆధ్యాత్మికత అంటే మతం కాదు. 

ఆధ్యాత్మికత అంటే బాహ్యారాధన కాదు.

ఆధ్యాత్మికత విడదీసేది కాదు.  

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే మతానికి అతీతమైనది. 

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమై తెలుసుకునేది. 

ఆధ్యాత్మికత అంటే కలిపేది, విడదీసేది కాదు. 



6, నవంబర్ 2024, బుధవారం

మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి

 


మా అమ్మగారు ధ్యాన ముద్రలో ... 
(అక్టోబర్ 22, 1942 - సెప్టెంబర్ 28, 2024)
మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి 
మా తల్లిగారు నడుపల్లె రాజేశ్వరిగారు, సెప్టెంబర్ 28, 2024న హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో కాలం చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. విధి విలాసం ఎలా ఉందంటే, ఆవిడను ఆసుపత్రిలో జేర్చిన 2 రోజులకే నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో మరొక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. శాస్త్ర చికిత్సలకు లోను కావలసి వచ్చింది. దానితో మా అమ్మగారు కాలం చేసినపుడు నేను అందుబాటులో లేకుండా పోవడమే గాక దహన ప్రక్రియలు కూడా నిర్వర్తించలేకపోయాను. ఇది నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన ఘట్టం ఇప్పటివరకూ. ఇవి చాలవన్నట్లుగా మేముండే 4 వ అంతస్తులో, మా అపార్టుమెంటులో లిఫ్ట్ పని చేయడం లేదు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా!

మాతృమూర్తిని కోల్పోవడం వ్యక్తి జీవితంలో హృదయంలో ఒక పూడ్చలేని వెలితిని సృష్టిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు అని చిన్నప్పుడు, కాపీ పుస్తకాలలో వ్రాసేవాళ్ళం. అప్పుడు అర్థం తెలియదు, కేవలం స్కూల్లో మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ లా ఉండేదంతే. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు. కానీ ఆమెను కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఆమె  మన పట్ల చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందుంటాయి. ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టామో గుర్తుకు వస్తుంది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో గుర్తొస్తుంది. క్షమించమని అడిగిన దాఖలాలు ఒకవేళ ఉంటే అవి చాలా తక్కువ. ఎన్నో అవమానాలు మన కోసం భరించినప్పుడు యేమీ చేయలేని సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు, బాధ వర్ణనాతీతం. తల్లి ఎటువంటిదైనప్పటికీ తల్లి మనసును బాధపెట్టడమూ అంటే భగవంతుని బాధపెట్టినట్లే అని పూజ్య చారీజీ అంటూండేవారు. తల్లి కళ్ళకెదురుగా కదలాడే నిస్స్వార్థ జీవి. 
అయితే సంతృప్తికరమైన రోజులు మా అమ్మగారితో బొత్తిగా లేవని కాదు. మా నాన్నగారు 1996 లో పరమపదించిన తరువాత 28 యేళ్ళు నాతోనే ఉండటం నా అదృష్టం ఆమెను చేతనైన జాగ్రత్తగా చూసుకో గలిగాను. నా గురుదేవులు నన్ను హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునిగా చేసినప్పుడు మొట్టమొదటి ధ్యాన సిట్టింగ్ ఆమెకే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి చివరి వరకు నిత్యమూ ధ్యాన సిట్టింగులు ఇవ్వగలిగాను. నా దృష్టిలో తల్లి రుణం కొంతైనా తీర్చుకోగలిగే మహత్తర అవకాశం నా గురుదేవులు నాకు ప్రసాదించారనిపించింది. ఆధ్యాత్మిక సేవనందించగలిగాను. ఆవిడ క్రమం తప్పక తన సాధన చేసుకుంటూ ఉండేవారు. మన గురుపరంపర పట్ల అపార భక్తి ఉండేది. ధ్యానం అంటే గొప్ప గురి ఉండేది. మా చెల్లెళ్ళను, తన కోడలిని సమదృష్టితో చూడటానికి ప్రయత్నించేది. ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడేది కాదు. తనను గురించిన ఆలోచన లేకుండా జీవించిన మహాసాధ్వి. 
ఈ ఉపద్రవ సమయంలో నాకు ఆసరాగా నిలిచినది నా సహజ మార్గ పరివారం. అన్నిటి కంటే మించి గురుదేవుల రక్షణ, అభయహస్తం మాపై ఉండటం. 13 రోజులు ఆమె ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా కొనసాగడానికి కోసం ప్రార్థన-ధ్యానం చేయమని గురుదేవులు ఆదేశించడం మన అభ్యాసులు, ప్రశిక్షకులు పాల్గొనడం జరిగింది. 
మా అమ్మను సదా నా హృదయంలో స్మరిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రేమను కొనసాగిస్తూ నా శేషజీవితాన్ని గురుదేవుల సేవలో వెచ్చిస్తానని మా అమ్మకు మాటిస్తూ, ఇదే నా కృతజ్ఞతాపూర్వక అశ్రునివాళి! 

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?

 


తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?

ఆధ్యాత్మిక పురోగతిని మందుకు సాగేలా నడిపించే శక్తి ఈ తపన; యాత్రను ముందుకు సాగించే ఇంధనం తపన; చైతన్య వికాసానికి దారి తీసేది ఈ తపన; ఆధ్యాత్మిక పరిణతికి కీలకమైనది తపన; సమయాన్ని ఆదాయ చేసేది తపన; తపన ఉంటేనే ఆసక్తి పెరుగుతుంది; తపన లేకుండా చేసే ఆధ్యాత్మిక సాధన ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం లాంటిది; దాహం లేకుండా నీరు గరాగడంలాంటిది; గడించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీర్ణమయ్యేలా చేసి, తపనను మరింత తీవ్రతరం చేసేది కూడా తపనే. తపనే దైవాన్ని ఆకర్షించేలా చేస్తుంది. తపనే ప్రేమను పెంపొందిస్తుంది. వెరసి ఆధ్యాత్మిక ప్రగతిని వేగవంతం చేసేది తపనే. 

అయితే మనుషులలో తపనల్లో వ్యత్యాసాలుండటానికి కారణాలు అనేకం కావచ్చు. ముఖ్యంగా కోరికలు, వికారాలు, వాసనలు (సంస్కారాలు), అహంకారము. ఇవే తపన తీవ్రతను తగ్గించే నకారాత్మక శక్తులు. స్వతఃసిద్ధంగా ఆత్మలో ఉండే ఈ తపనను పెంచగలిగేది మన ఇచ్ఛాశక్తి (Will Power). ఈ ఇచ్ఛాశక్తిని పెడత్రోవను పట్టించేవే మనం ఇంతకు ముందు చెపుకున్నవి. అందుకే ఈ శక్తిని దైవాన్ని ఆకర్షించే విధంగా ప్రయత్నపూర్వకంగా మరల్చాలి. అక్కడే హార్ట్ఫుల్నెస్-సహజ మార్గ్  ధ్యాన ప్రకరొయ్యల వంటి ఆధ్యాత్మిక పద్ధతులు, స్వాధ్యాయం, ఆత్మవికాస సాహిత్య అధ్యయనం, సజ్జన సాంగత్యం, స్వచ్ఛందంగా ఇతరుల సేవలో ఉండటం, ఇవన్నీ సహకరిస్తాయి. క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి జరుగుతూ, ఈ అపన అనే అగ్ని ఎడతెగకుండా ప్రజ్వరిల్లుతూనే  ఉంటుంది. 

కాబట్టి ప్రతి జిజ్ఞాసువు, త్రికరణ శుద్ధిగా పరమసత్యాన్ని అన్వేషించే ముముక్షువులు, సాధకులు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ తమ తపనను తీవ్రతరం చేసుకునే పనిలో నిమాగ్నమైపోవాలి. తథాస్తు.

తపన , ఆధ్యాత్మిక తృష్ణ

తపన , ఆధ్యాత్మిక తృష్ణ 


స్వతః సిద్ధంగా ప్రతీ ఆత్మలోనూ దేని కోసమో తెలియని ఆరాటం, తపన, ఒకరకమైన ఆకలి, దాహం ఉంటుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక తృష్ణ అని అంటాం. ఇది హృదయంలో ఒక విధమైన అశాంతిని కలిగిస్తుంది. వన్నీ హృదయాలు దీన్ని స్పష్టంగా అనుభూతి చెందుతాయి; చాలామందిలో ఇది నిద్రాయణ స్థితిలో గాని, బలహీనంగా గాని ఉంటుంది. కానీ తప్పక ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. 

ఈ దాహం యొక్క తీవ్రతను బట్టి ఆయా ఆత్మల దాహం తీరే వరకు వాటి మార్గాలు అవి వెతుక్కుంటూ ఉంటాయి. దీన్నే మనం జీవితం అంటాం. ఆత్మ యొక్క తీవ్రతకు అనుగుణంగానే జీవితం అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమయ్యే క్రమంలోనే కోరికలు, స,మస్కారాయాఉ, అహంకారాల పాత్ర ఉంటుంది. 

గాయితమ బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా, శ్రీ రామకృష్ణ పరమ హంస అయినా, లాలాజీబాబూజీలయినా, సామాన్య సాధకుడైనా అందరిలో ఉండే ఆధ్యాత్మిక దాహం ఒక్కటే. కేవలం తీవ్రతల్లో వ్యత్యాసం ఉంది అంటే. కానీ ఆ వ్యత్యాసం మాత్రం విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ దాహం పూర్తిగా తీరే వరకూ నిద్ర పట్టేది కాదట, మనకు నిద్ర పడుతోంది. ఆ తేడా తపనలో  ఊహించలేనంత ఉంది. 

ఈ తపనే గమ్యాన్ని చేరువ చేసేది. ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే ఆహారానికి అంతా దగ్గరగా ఉంటాం; అలాగే దాహం ఎంత ఎక్కువగా ఉంటే నీరు అంతా చేరువవుతుంది. పరమ గమ్యం చేరే వరకూ మనలను నడిపించేది ఈ తపనే. ఈ తపన యే గమ్యాన్ని చేరుకోవాలన్నా అవసరమే. 

మన మహాత్ముల జీవితాల్లో ఈ తపన-ఘట్టాన్ని పరిశీలిస్తే కొంతవరకైనా అర్థమవుతుంది, వాళ్ళు యే విధంగా ఆ పరమాత్ముని కోసం పరితపించేవారో. 

బుద్ధుడు సిద్ధారథుడిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని, ఒక వ్యాధిగ్రస్త వ్యక్తిని చూసి, ఆయన మనసు యే విధంగా చలించిపోయిందో, తాను మహా సామ్రాజ్యానికి రాజునన్న విషయం కూడా మరచిపోయి, భార్య, తనయుడు ఉన్నారన్న స్పృహ లేకుండా, కేవలం ఆతను చూసిన వాటి వెనుక ఉన్న పరమ సత్యం ఏమిటో, మానవుడి కష్టాలకు అసలు కారణం ఏమిటో కనుగొనాలన్న తపనతో అంతర్ముఖుడై శోధించి సమాధానాలను కనుగొనడం జరిగింది. ఆయనకు ఆయనలో కలిగిన ప్రశ్నలకు సమాధానం దొరికే వరకూ మరేమీ ఆయన మనసులోకి రాలేదు. ఆ విధంగా ఉండింది వారి తపన, వారి జిజ్ఞాస. మనం కూడా ఆయన చూసినవన్నీ చూస్తున్నాం కానీ ఆ తీవ్రత మనలో ఎందుకు కలగడం లేదు? ఇది మనలను మనం ప్రశ్నించుకోవాలి.

అలాగే స్వామి వివేకానంద 18 యేళ్ళ యువకుడిగా ఉన్నప్పుడే దారిలో వెళ్ళే ప్రతీ వ్యక్తిని, "మీరు దేవుడిని చూశారా? మీరు దేవుడిని చూశారా?" అని అడిగేవారట.  అలా దేవుడిని చూసిన వ్యక్తిని కలిసే వరకూ ఆయన నిద్ర పోయేవారు కాదట. మనకూ కూడా ఇదే ప్రశ్న ఉంది. కానీ మనకు ఇంకా నిద్ర పడుతోంది. ఇదే తపణలో తీవ్రతలో తేడా అంటే. 

ఇక శ్రీ రామకృష్ణ పరమహంస వారి విషయానికొస్తే, వారు సాధన చేసుకునే రోజుల్లో ప్రతీ రోజు చీకటి పడేసరికి, ఏకాంతంలో భగవంతుడిని చూడకుండా మరో రోజు గడిచిపోయిందేనని కన్నీరు పెట్టుకునేవారట. వారి సాధనా ప్రకరణం అంత దీక్షగా, తీక్షణంగా గడచింది. 

అలాగే బాబూజీ మహారాజ్ వారి చిన్నప్పటి నుండి దైవాన్ని అనుభూతి చెందడం కోసం ఆ వయసు నుండే అనేక ప్రయోగాలు చేసేవారట. ఆ అన్వేషణలో లాలాజీ పాదాల చెంత చేరే వరకూ ఆ దాహం తీరలేదు. 

ఇలా మనం మహాత్ముల జీవితాల్లో ఈ ఘటాలను పరిశీలిస్తే మన అపన తీవ్రమవడానికి దోహదపడువచ్చునేమోనని నా అభిప్రాయం. కావున తపన అందరిలో తీవ్రతరమవుగాక. గమ్యము చేరుకునేంత వరకూ విశ్రమింపకుందురుగాక. 

 


11, సెప్టెంబర్ 2024, బుధవారం

సాధనా పంచకం - ఆది శంకరాచార్యులవారు

సాధనా పంచకం 

ఆదిశంకరులవారు సాధకులు పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఎక్కవలసిన 40 మెట్లను ఈ చిన్ని 5 శ్లోకాల గ్రంథంలో నిక్షిప్తం చేశారు. దీన్నే సాధనా పంచకం అంటారు. గంభీర సాధకులకు అద్భుత మార్గదర్శకాలివి: 

1. నిత్యం వేదాధ్యయనం చెయ్యండి. అంటే మన శాస్త్రాలను అధ్యయనం చెయ్యండి.  

2. మన శాష్టరాలు నిర్దేశించిన విధంగా మీ ధర్మాలను, మీ కర్మలను మీరు జాగారూకతతో నిర్వర్తించండి. 

3. ఈ కర్మలన్నీటినీ భగవంతునికి అర్పించి ఆరాధించండి. 

4. మనసులో ఉన్న కోరికాలన్నీటినీ తొలగించేయండి. 

5. గుండెల్లో దాచుకున్న పాపాల భారాన్ని కడిగివేయండి. 

6. సాంసారిక విషయాల వల్ల కలిగే సుఖాలన్నీ వేదనపూరితమైనవని గుర్తించండి. 

7. నిత్యానుష్ఠానం ద్వారా పరమాత్మ కోసం తపించండి. 

8. గృహము అనే బంధం నుండి తప్పించుకోండి. అంటే మీ చేతనను గృహానికే పరిమితం గాకుండగా మరింత విస్తృతంగా విస్తరింపజేయండి. 

9. వివేకవంతుల సాంగత్యం కోసం పరితపించండి. 

10. భగవంతుని పట్ల భక్తిలో మిమ్మల్ని మీరు సుస్థిరపరచుకోండి. 

11. శాంతి వంటి సుగుణాలను మీలో పెంపొందించుకోండి. 

12. కోరికతో కూడిన చర్యలన్నీ నివారించుకోండి. 

13. పరిపూర్ణుడైన మాస్టరు పట్ల శరణాగతి కలిగి ఉండండి. 

14. నిత్యం గురువును సేవించండి. 

15. పరివార్తనకు ఆస్కారం లేని ఓంకారం పై ధ్యానించండి. 

16. ఉపనిషత్తుల్లో ఘోషించిన అంశాలను లోతుగా విని అర్థం చేసుకోండి. 

17. ఉపనిషత్తుల్లో నిర్దేశించిన వాటి భావాన్ని నిత్యం మననం చేసుకుంటూ ఉండండి. 

18. బ్రహ్మపదార్థం అనేది సత్యము అన్న సత్యాన్ని ఆశ్రయించండి. 

19. వితండవాదాలకు దూరంగా ఉండండి. 

20. శ్రుతులు నిర్దేశించే వివేకపూరిత విధానాన్ని అనుసరించండి. 

21. 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో ఎప్పుడూ నిమగ్నమై ఉండండి. 

22. దర్పాన్ని విడిచేపెట్టేయండి. 

23. 'నేను శరీరం' అన్న భావాన్ని విడిచి పెట్టేయండి. 

24. విజ్ఞులతో వాదనలు చేయకండి. 

25. ఆకలిని, వ్యాధిని తగిన విధంగా చూసుకోండి. 

26. నిత్యం భిక్ష ద్వారా పొందిన ఆహారం అనే ఔషధాన్ని గ్రహించండి. 

27. రుచికరమైన ఆహారాన్ని యాచించకండి. 

28. లభించినడానితో సంతుష్టులయి భగవంతునిచ్చే ప్రసాదింపబడినట్లుగా స్వీకరించండి. 

29. శీతోష్ణ, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలన్నీటినీ సహనంతో భరించండి. 

30. అర్థంలేని ప్రశంగాలకు దూరంగా ఉండండి. 

31 చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి; వాటిని పట్టించుకోకుండా ఉండండి, 

32. ఇతరుల దాయకు పాత్రులు గాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. 

33. ఏకాంతంలో ఆనందంగా జీఈమచండి. 

34. ఆ పరమాత్మునిలో మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. 

35. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించి సాక్షాత్కరించుకోండి. 

36. పరింతమైన ప్రపంచం పరమాత్మ యొక్క మితయేనని గుర్తించండి. 

37. గత జన్మలలో చేసిన కర్మల (సంచిత) ప్రభావాలపై ప్రస్తుతం చేసే సరైన కర్మల ద్వారా జయం సాధించండి. 

38. వివేకం సహాయంతో భవిష్యత్ కర్మల నుండి (ఆగామి నుండి) మామత్వాన్ని పోగొట్టుకోండి. 

39।  గతలోని కర్మల ప్రభావాన్ని (మొదలైన ప్రారబద్ధాన్ని) 

అనుభవించడం ద్వారా పూర్తిగా అవగొట్టండి. 

40. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో లీనమై జీవించండి. 


ఆచార్య వినోబా భావే



ఆచార్య వినోబా భావే 
(1895-1982)
ఈ రోజు భారత రత్న ఆచార్య వినోబా భావే జన్మదినోత్సవం. ఆయన సెప్టెంబర్ 11, 1895 న ఒక బ్రాహ్మణ కుటుంబంలో, మహారాష్ట్రలో  జన్మించారు. వీరి అసలు పేరు వినాయక నరహరి. డబ్బు సంపాదించడం కోసం ఆయనకు చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. అందుకే వారు బనారస్ వెళ్ళి, సంస్కృతంలో పట్టు సాధించి, మన శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం జరిగింది. అలాగే కొరాన్ అధ్యయనం చేయడం కోసం వారు అరబిక్ నేర్చుకొని మూలాన్ని చదివి పట్టు సంపాదించారు. అలాగే బైబిల్ చదువుకున్నారు. 
 
వీరు సంఘ-సంస్కర్తగానూ, స్వాతంత్ర్య  సమర యోధుడుగానూ,  ఆధ్యాత్మిక ఆచార్యులుగానూ భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి పొందినవారు. వీరు మానవ హక్కుల కోసం, పోరాడిన వ్యక్తి; అహింసను ఆయుధంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. 

అంతే కాదు, ఆచార్య వినోబా భావే అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర్యం సాధించిన తరువాత, 1951 లో  వారు నేతృత్వం వహించిన భూదాన్ ఉద్యమం. ఈ ఉద్యమ లక్ష్యం భూమి సేకరణ - భూమి ఎక్కువగా ఉన్నవారు, భూమి లేని వారికి భూదానం చేయడం. దీని కోసం వారు కొన్ని వేల కిలోమీటర్లు నడవడం జరిగింది.  మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటంటే, ఈ ఉద్యమాన్ని, తెలంగాణాలోని హైదరాబాదు శివార్లలో ఉన్న పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ ఊరును భూదాన్  పోచంపల్లి అని కూడా అంటారు. 

1940 లో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చేసినవారు వీరే; ఆ తరువాతే నెహ్రూగారు చేయడం జరిగింది. ఈ పోరాటంలో 7 సార్లు ఖైదులో ఉన్నారు. 1958 లో వారు రేమన్ మ్యాగ్సాసే పురస్కారం, మరణానంతరం 1983 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. 
1932 లో, మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, ఆరు నెలలు ఖైదీగా ఉండవలసి వచ్చినప్పుడు, ఆశువుగా భగవద్గీత మీద, 700 శ్లోకాలపై మరాఠీలో ఇతర ఖైదీలనుద్దేశించి అనర్గళంగా అద్భుతంగా, సమాధి స్థితిలో ఉంటూ ప్రవచనాలివ్వడం జరిగింది.  అవే Talks on the Gita అనే పేరుతో ఆంగ్లంలో ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం అన్ని  భారతీయ భాషలలోనూ, అనేక విదేశీ భాషలలో కూడా ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథాన్ని భారతీయ సంపదగా భావిస్తారు. 

ఈ గ్రంథాన్ని గురుదేవులు పూజ్య దాజీ  2019 లో మన సంస్థ ప్రచురణగా విడుదల చేయడం జరిగింది. దాజీ ఈ గ్రంథాన్ని గురించి ముందుమాటలో, ఈ గ్రంథాన్ని గురించి వినోబా భావే స్వయంగా పలికిన మాటలను  సంస్మరించుకున్నారు: "నేను గీతను గురించి వ్రాసిన వ్యాసాలు గాని, ప్రవచనాలు గాని జైల్లో గాక మరెక్కడైనా అయితే అంతా అద్భుత ప్రభావం కలిగి ఉండేవి కావేమో; ఈ ఖైదు మా స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఒక యుద్ధ క్షేత్రం అవడం వల్ల ఇంతటి  ప్రభావం కలిగి ఉన్నాయనిపిస్తుంది."

ప్రతి ఒక్కరూ ఈ అద్భుత గ్రంథాన్ని, చక్కటి కథలా చెప్పిన ఈ 18 ప్రసంగాలను ఆస్వాదించి భగవద్గీత యొక్క గొప్ప ప్రయోజనాన్ని సిద్ధించుకొందురుగాక. 


 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...