26, జులై 2023, బుధవారం

కృతజ్ఞత - పూజ్య దాజీ

పూజ్య గురుదేవులు దాజీ, పూజ్యశ్రీ చారీజీ జన్మదినోత్సవ సందర్భంగా (జూలై 23,24,25, 2023 తేదీల్లో) "కృతజ్ఞత" ను గురించి ఇచ్చిన సందేశంలో  నుండి కొన్ని అద్భుత వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి; ప్రతి ఒక్కరూ సత్సంగాల్లో మన గురుపరంపర అందించిన ఆధ్యాత్మిక స్థితులను కొనసాగించుకునే   ప్రయత్నంలో ధ్యానించుకోవలసిన మహావాక్యాలు:  

కృతజ్ఞత లేని వ్యక్తి బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత పట్ల మళ్ళాలంటే, ఈ కృతఘ్నతకు సంబంధించిన అలవాట్లను మానుకోవాలి. – లాలాజీ

పాపం అంటూ ఏదైనా ఉందీ  అంటే,  అది కృతజ్ఞతారాహిత్యమే. – బాబూజీ 

కృతజ్ఞతను ఎలా ఆపగలం? కృతజ్ఞత జీవితంలో కళ్ళల్లో నుండి హృదయ ప్రవాహం ధారగా వస్తున్నప్పుడు దాన్ని సంస్కృతంలో అశ్రుధార అంటారు. కళ్ళల్లో నుండి వచ్చే రెండు అశ్రుధారలను గంగాయమునలతో పోలుస్తారు. అటువంటి అశ్రులు పవిత్రమైనవి, ధన్యమైనవి. అటువంటి అశ్రులు హృదయ లోలోతుల్లో పాతుకుపోయిన అపరాధ భావానికి సంబంధించిన భారాన్ని తొలగించి, హృదయంలో ఆనకట్ట వేయబడిన కృతజ్ఞత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేలా చేస్తాయి. ఆ ఆనకట్ట పగిలినప్పుడు మనం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. ఇది చాలా గొప్ప అనుభవం.  అభ్యాసికి ఇటువంటి  అనుభవం జరుగుతున్నప్పుడు ఆపకండి, జరగనివ్వండి. – చారీజీ 

 కృతజ్ఞత. అఖలాఖ్ కు సంబంధించిన లక్షణాలైన స్వార్థరహితంగా ఉండటం, వినమ్రత, ఆ సర్వశక్తిమంతుని పట్ల సమర్పణ భావము,   పెంపొందిస్తుంది. - దాజీ

గుండె నిండా కృతజ్ఞత వరదలై పొంగాలంటే,  గుండె పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ఇంతకంటే ఏమాత్రం తక్కువగా ఉన్నా కుదరదు.- దాజీ

అద్భుతాలు సృష్టించే సామర్థ్యం అనుగ్రహంలో  ఉంటుంది. దివ్యలోకంలో ఉన్న మహనీయులు ఆనందంగా ఉండి, సూక్ష్మంగా మనతో ఉన్నప్పుడు ఈ కృప వర్షించడం జరుగుతుంది.= దాజీ

కృతజ్ఞత అనేది పువ్వు యొక్క పరిమళం లాంటిది, దానికి ప్రత్యేకమైన గమ్యం అంటూ ఏదీ  ఉండదు.  మీరు భగవంతుని నమ్మినా ఫర్వాలేదు, నమ్మకపోయినా ఫర్వాలేదు; మీరు కృతజ్ఞతను అనుభూతి చెందడమే ముఖ్యం.- దాజీ

నిజాయితీగా కృతజ్ఞతను  అనుభూతి చెందే స్థితిలో నుండి వెలువడే నిశ్శబ్ద ప్రార్థన తప్పక తన నిర్ధారిత గమ్యాన్ని చేరి తీరుతుంది, నిజానికి  అటువంటి  ఉద్దేశం లేకపోయినా సరే. - దాజీ

ఆ పరతత్వంతో అనునాదం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన కృతజ్ఞత ఆవిర్భవిస్తుంది; ఇక బాహ్య సంఘటనలపై గాని లేక ఆధ్యాత్మికపరమైన ఆశీస్సులపై గాని ఆధారపడటం ఉండదు. సమస్త రకాల కోరికలూ  అంతరించినప్పుడే ఆ పవిత్ర స్థితిలోకి ప్రవేశించగలుగుతాం.  - దాజీ 

పైన తెలిపిన ఒక్కొక్క వాక్యాన్ని మన ఆధ్యాత్మిక సాధనలో, శ్రవణ,మనన, నిధిధ్యాసనల ద్వారా మన జీవ వ్యవస్థలోని ప్రతీ కణంలోనూ శాశ్వతంగా ఇంకిపోయేలా చేసుకునే ప్రయత్నం చేద్దాం.  

21, జులై 2023, శుక్రవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 6



(జూలై 24, 1927 - డిశంబర్ 20, 2014)


గురోరంఘ్రి పద్మే మనస్చైన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్


తాత్పర్యం: గురు పాదపద్మముల యందు మనసు లగ్నం కాకపోతే ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? ఏమున్నా ఏమిటి ప్రయోజనం? 

Last Message from Beloved Chariji

Dear Brothers and Sisters, 

I regret I cannot be with you all but... but I am with you in spirit. And I hope you can feel it. Please believe me when I say that I shall be with you all, all the time, whether here or in your Russia or in other countries... does not matter... Distance does not make any difference... there is no difference... I pray for you all and wish you the best, blessings to all of you! 



ప్రియతమ చారీజీ చివరి సందేశం 

ప్రియమైన సోదరీసోదరులారా, 

నేను మీ అందరితో ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.. కానీ నేను మీతో స్ఫూర్తిగా ఉన్నాను. మీరు దాన్ని అనుభూతి చెందుతున్నారని ఆశిస్తున్నాను. నేను మీతో ఎప్పుడూ ఉంటాను అని అన్నప్పుడు నన్ను నమ్మండి.. అది ఇక్కడైనా, లేక మీ రష్యాలోనైనా, లేక ఇతర దేశాల్లోనైనా.. ఏమీ తేడా ఉండదు .. దూరంతో పని లేదు. దాని వల్ల ఏ తేడా రాదు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను, మీ అందరికీ శుభం జరగాలని కోరుతున్నాను. అందరికీ ఆశీస్సులు!






 

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 5

 


చారీజీ - దాజీ
గురుపరంపరలోని గురుద్వయం 

దుర్లభం త్రయం యేవ యేతత్  దేవానుగ్రహహేతుకం 
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయః 

గురుపరంపర ప్రాముఖ్యత 
ఏ ఆధ్యాత్మిక సాంప్రదాయానికైనా మానవాళికి తమ బోధలతో మార్గదర్శనం చేయడానికి, ఆయా ధ్యాన పద్ధతులను సంరక్షించుకోడానికి గురుపరంపర అవసరం. లేకపోతే అద్భుతమైన ధ్యాన పద్ధతులు కాలగర్భంలో కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. అలా ఎన్నో పద్ధతులు కనుమరుగయ్యాయో మనకు తెలియదు. 

అలా కాలగర్భంలో కనుమరుగైన విద్యే ప్రాణాహుతి ప్రసరణ విద్య. ఈ రాజయోగ  విద్య దశరథమహారాజుకు 72 తరాల పూర్వం వినియోగంలో ఉండేదట. అంటే రాముని కాలంలో లేదు, కృష్ణుని కాలంలో కూడా లేదన్నట్లే. అటువంటి విద్యను పూజ్య లాలాజీ పునరుద్ధరించడం జరిగింది. మానవాళికి అతి త్వరితంగా మోక్షసిద్ధి కలగాలంటే ఏమైనా మార్గం ఉండేమోనని వారు అన్వేషణ చేసినప్పుడు వెల్లడైన మహా సత్యం. ఆ అపూర్వ పద్ధతినే గురుపరంపర ద్వారా ఒకరి తరువాత ఒకరికి మరలా కోల్పోకుండా పదిలంగా సంరక్షిస్తూ అందజేయడం జరుగుతోంది. సాధకులు ఈ విద్యనభ్యాసం చేస్తేనే ఇది కాపాడబడుతుంది. 

ఆ విధంగా సహజమార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో ప్రస్తుతం గురుపరంపరలో నాల్గవ తరం గురువు పూజ్య దాజీ రూపంలో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. పూజ్య చారీజీ మూడవవారు.  ప్రత్యక్షానుభవమే  దీనికి నిదర్శనం. ప్రాణాహుతి విద్యతో కూడిన ఈ  రాజయోగ ధ్యానం మనిషిలో పరివర్తన తీసుకురావడం కొద్ది కాలం ధ్యానం చేసినవారందరికీ సుపరిచితమే. 

అయితే సహాజమార్గ గురుపరంపరలో ఇప్పటి వరకూ వచ్చిన గురువులు, ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్రను పోషించి మానవ కళ్యాణానికి కాలానుగుణమైన  సేవలనందించి ఆ తరువాతి మాస్టరుకు రంగం సిద్ధం చేసి వెడుతూ ఉంటారు; ఆ విధంగా లాలాజీ ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించినవారు; బాబూజీ, చారీజీ ఈ ఉద్యమానికి పటిష్ఠమైన పునాదులు ఏర్పరచడానికి వచ్చినవారు; పూజ్య దాజీ, వ్యాప్తి కోసం విస్తరణ కోసం వచ్చినవారు. వారి-వారి కర్తవ్యాలను బట్టి వారి కార్యాచరణను మనం గమనించవచ్చు, తదనుగుణంగా మన వంతు సహకారాన్ని స్పష్టమైన అవగాహనతో అందించవచ్చు. 

చారీజీ - దాజీ 
పూజ్య చారీజీ 1983 లో శ్రీరామ చంద్ర మిషన్ అధ్యక్షులుగా బాబూజీ తరువాత బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనేక అల్పమైన కారణాల వల్ల వారిని సంపూర్ణంగా సజీవ మాస్టరుగా స్వీకరించడానికి అభ్యాసులకు  కొంత వ్యవధి పట్టింది. అప్పటి నుండి వారి నిర్విరామ కృషితో చారీజీ 100 దేశాలకు పైగా తన గురుదేవుల సందేశాన్ని, సహాజమార్గ పద్ధతిని వ్యాపింపజేశారు. 2014 లో వారు మహాసమాధి పొందారు. 

కానీ పూజ్య చారీజీ 2011 లోనే పూజ్య దాజీని తన వారసునిగానూ, పూజ్య బాబూజీ యొక్క రెండవ ప్రతినిధిగానూ ప్రకటించడం జరిగింది. 2006 వ సంవత్సరం నుండే దాజీ చెన్నైలో చారీజీ ఆజ్ఞ మేరకు అమెరికాలోని తన వ్యాపారాలన్నీ తన పుత్రులకు  అప్పగించి చెన్నైలోనే ఉండిపోయారు. 2012 నుండి శ్రీరామచంద్ర మిషన్ వైస్-ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. 2011 నుండి చారీజీ ప్రతీ సమావేశంలోనూ, ప్రతీ నగరంలోనూ,  స్వయంగా అభ్యాసులందరికీ పరిచయం చేశారు. 

ఉభయులూ కలిసి ఆ తరువాత అనేక సత్సంగాలు అభ్యాసులకు నిర్వహించేవారు. ఆ గురుద్వయాన్ని  చూసి, వారిలో వారు చేసుకునే గుస-గుసలు చూసి అభ్యాసులు తన్మయత్వం చెందేవారు. ఇద్దరు మహాపురుషుల సాన్నిధ్యాన్ని అనుభూతి చెందిన అభ్యాసులందరూ ధన్యులు. 

2014, డిశంబర్ 20 న పూజ్య చారీజీ మహాసమాధిని పొందారు. అందరూ శోకాసముద్రంలో మునిగిపోయారు. ఇలా ఉండగా మరునాడు ఆ బ్రైటర్ వరల్డ్ నుండి పూజ్య చారీజీ నుండి ఒక సందేశం వస్తుంది - ... చివరికి నా కష్టాలన్నీ అయిపోయాయి, ఇక చేయవలసిన ఆఖరి లాంఛనాలు మిగిలాయి. అంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక నూతన జీవితం ప్రారంభమవుతోంది... - అంటూ ఒక విస్పర సందేశం డిశంబర్ 21, 2014 - 10 గంటలకు అందుకోవడం జరిగి ఒక్కసారిగా అభ్యాసులందరూ సేద తీరారు విచిత్రంగా. ఇది నాకు అబ్బురపరచే అనుభూతి - ఎప్పుడూ చరిత్రలో గాని ఎక్కడా వినలేదు, ఉన్నత లోకాలకు వెడలిన వ్యక్తి క్షేమంగా చేరాను అన్నట్లుగా ఒక జాబు వ్రాయడం. అటువంటి అద్భుత మాస్టర్ల సాంగత్యంలో మనం ఉన్నాం, అటువంటి అద్భుత సంస్థతో మనం కూడి ఉన్నాం, అటువంటి అద్భుత పద్ధతిని మనం అనుసరించే ప్రయత్నం చేస్తున్నాం. భువిపై ఉన్న ప్రజలందరూ ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుదురుగాక అని మనస్ఫూర్తిగా మన  గురుపరంపరను ప్రార్థిస్తున్నాను. 
                                                                                       (సశేషం ..)



20, జులై 2023, గురువారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 4


(1927-2014)

అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం ।
 వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥ 

కదిలించివేసే వారి ప్రసంగాలు, గ్రంథాలు 
వాస్తవానికి వారు వ్రాసిన అన్ని గ్రంథాలు, అన్ని ప్రసంగాలూ కదిలించివేసేవిగానే ఉంటాయి గాని, కొన్ని పుస్తకాలను ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నిజమైన మాస్టర్ల గ్రంథాలు శ్రద్ధతో చదువుతున్నప్పుడు మన చేతనావస్థనే మార్చేస్తాయి, ప్రాణాహుతి ప్రసరణను కూడా అనుభూతి చెందవచ్చు. 

మై మాస్టర్:  ముందుగా ఈ గ్రంథంలోని కొన్ని అంశాలు చూద్దాం. మొట్టమొదటిసారిగా సంస్థలో ఇటువంటి గ్రంథం ఉదయించింది. పూజ్య బాబూజీకి బాగా నచ్చిన గ్రంథం. చాలా సరళమైన భాష, అందరికీ అర్థమయ్యేలా వ్రాసిన గ్రంథం. ఈ గ్రంథం చదివితే, ఇద్దరు మాస్టర్లను గురించి తెలుసుకోవచ్చు, గురు-శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, ఒక శిష్యుడు తన గురువును ఏ విధంగా చూడాలి, ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఆయన సేవ ఏ విధంగా చేయాలి, ఇలా అనేక రకాలైన అవగాహనలు కలుగుతాయి. ముఖ్యంగా ఆయన మొట్టమొదటిసారి బాబూజీతో జరిగిన కలయికను గురించి వ్రాసిన ఘట్టం అందరినీ కదిలించివేస్తుంది, కళ్ళకు కట్టినట్లుగా మనం కూడా షాజహానుపూర్ లో బాబూజీతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే గురువును అన్ని స్థాయిల్లోనూ ఏ  విధంగా స్వీకరించాలో కూడా తెలియజేస్తారు - మానవ స్థాయిలోనూ, దివ్య స్థాయిలో, దైవంగా ఎలా చూడాలనేది అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంకా మాటలకందని అనేక అంశాలున్నాయి. 

ద రోల్ ఆఫ్ మాస్టర్ ఇన్ హ్యూమన్ ఇవల్యూషన్: మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాస యాత్రలో మాస్టర్ యొక్క పాత్ర ఏమిటో అద్భుతంగా వర్ణించారు. ఇందులో బాబూజీతో వారి సాంగత్యం ద్వారా తనలో ఇముడ్చుకున్నదంతా పండ్లన్నీ పిండి తీసిన రసం అందించినట్లు మనకందించారు. ఒక్క వాక్యం మచ్చుకి - సహజమార్గంలో మాస్టర్ బోధించకుండా బోధిస్తారు. (Master teaches us without teaching). ఈ  గ్రంథం చదవడం వల్ల మనకు జీవితం పట్ల, గురువు పట్ల, మన సాధన పట్ల, మన జీవిత లక్ష్యం పట్ల ఉన్న దృక్పథం సమూలంగా పరిణతి చెందుతుంది. తప్పక చదవవలసిన గ్రంథం. ఈ  పుస్తకం చదవడం వల్ల సహజమార్గ సాధకుడికి తన సాధనకు ఒక పటిష్ఠమైన పునాది ఏర్పడుతుంది. 

యాత్ర: 1) ఇండియా ఇన్ ది వెస్ట్, 2) సహజ్ మార్గ్ ఇన్ యూరోప్, 3) గార్డెన్ ఆఫ్ హార్ట్స్ , 4) బ్లాసమ్స్ ఆఫ్ ది ఈస్ట్ అనే 4 గ్రంథాల సంకలనం ఈ యాత్ర అనే గ్రంథం. చారీజీ, బాబూజీతో కలిసి విదేశీ పర్యటనల్లోని విశేషాలను వ్రాసుకున్న డైరీల ఆధారంగా వ్రాసినటువంటి గ్రంథం యాత్ర. ఈ గ్రంథం చదువుతూ ఉంటే మనం కూడా వారివురితోపాటు అన్ని దేశాలూ పర్యటిస్తున్నట్లు, బాబూజీ సమక్షంలో కూర్చొని మనం కూడా అన్నీ వింటున్నట్లు, చారీజీ  వివరణలు అర్థం చేసుకుంటున్నట్లు, బాబూజీ  లీలలు మనం నేరుగా వీక్షిస్తున్నట్లు, ఇలా అనేకరకాల అనుభూతులు పొందుతూ ఇద్దరు మాస్టర్ల సాంగత్యానుభవం కలుగుతుంది. తెలియకుండా సహాజమార్గ సంస్కృతి మనలో ఇంకిపోయే అవకాశం ఉంది. జీవితంలో మనసు బాగోలేనప్పుడు చదివితే తప్పక క్రుంగిపోకుండా కాపాడే అద్భుత గ్రంథం. 

ఇన్ హిజ్ ఫుట్ స్టెప్స్ : ఇది 3 సంపుటాలుగా ఉన్న గ్రంథం. ఇందులో ప్రియతమ చారీజీ  వ్రాసుకున్న డైరీ కనిపిస్తుంది. వారు సహజమార్గ సాధన ప్రారంభించినప్పటి నుండి ప్రతి రోజు వ్రాసుకున్న డైరీ ఇక్కడ కనిపితుమది; వారి యాత్ర ఏ విధంగా కొనసాగిందో రోజువారీగా మనం దర్శించవచ్చు. అంటే కాదు, ఇందులో వారు సంస్థను నడిపించిన విధానం, సంస్థలో ఏర్పడిన అడ్డంకులను, సమస్యలను ఏ  విధంగా ఎదుర్కొన్నదీ, వారి ఆలోచనలు, తన గురుదేవుల ఆశయానికి కార్యరూపం ఇచ్చచేటువంటి నేర్పు, ఇంకా ఎన్నో అంశాలు దర్శనమిస్తాయి. గంభీర సాధకుడు తప్పక చదవ వలసిన గ్రంథం. తన గురుపరంపరను, సంస్థ చరిత్రను, సహాజమార్గ ఆధ్యాత్మిక ఉద్యమం యొక్క వికాసాన్ని, తెలియజేసేటువంటి గ్రంథం.  

 డౌన్ మెమరీ లెన్:  పూజ్య చారీజీ తన స్వీయ చరిత్రను, రెండు సంపుటాలుగా వ్రాయడం జరిగింది. వారి జ్ఞాపక శక్తి అమోఘం, అద్వితీయం, అద్భుతం. ఇంచుమించు వారు పుట్టినప్పటి నుండి, వారి పూర్వీకుల వరకు తన స్మృతిపథంలోకి వెనక్కి వెళ్ళి వ్రాసిన గ్రంథం. ఇందులో అందరినీ బాగా కదిలించివేసే అధ్యాయం - మై  మదర్. చారీజీ తల్లిగారు జానకీగారు, చారీజీ  5 సంవత్సరాలుండగానే పరమపదించారు. అంతా చిన్న వయసులో ఆయన తన తల్లిని కోల్పోయారు. ఆ సమయంలో వారి తల్లిగారి పార్థివ శరీరాన్ని ఐసు మీద ఉంచితే, అమ్మకు చలి వేస్తుందని   బాధపడతారు, చారీజీ. వారికి ఆ చిరుప్రాయం నుండి తమ తల్లిగారి మీద ఉన్న ప్రేమ అలాగే ఎప్పటికీ ఉండిపోయింది. ఎంత ప్రేమ అంటే, బాబూజీ ఒకసారి ధ్యానంలో జానకీగారి చేత సిట్టింగ్ ఇప్పిస్తారు, చారీజీ  ఆమె స్పర్శను గుర్తించడం కూడా జరుగుతుంది; బాబూజీకి అశ్రువులతో కృతజ్ఞత వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఇలా అనేక అంశాలు మనకు ఈ గ్రంథం చదివితే తారసిల్లుతాయి. 

హి, హుక్కా అండ్ ఐ: ఈ ప్రసంగాల శ్రేణి వారు భౌతికంగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో రికార్డు చేసిన ప్రసంగాలు. ఈ  శీర్షికను విడుదలైన ప్రసంగాలు కూడా రెండు విడతలుగా, రెండు సంపుటాలుగా వెలువడింది. ఇందులో ఇచ్చిన ప్రసంగాలు చారీజీ, బాబూజీల సాంగత్యంలో, జరిగిన సంభాషణల ఆధారంగా అనేక అంశాల మీద ప్రసంగించడం జరిగింది. ఈ సి. డీ. లు మన మానసిక స్థితిని బట్టి ఏ సి. డీ. పెట్టుకున్నా ఆ క్షణానికి మన అవసరానికి తగ్గట్టుగా పరిష్కారం లభిస్తుందని, చీకట్లో ఉన్నప్పుడు, ఒక అగ్గిపుల్ల చేసే పని ఈ ప్రసంగాలు అభయాసులకు చేస్తాయని చారీజీ పరిచయ వాక్యాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యాసులు ఈ విధంగా ప్రయత్నించి చూడవచ్చు. 

ఇవిగాక వారు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ, చేసిన అనేక ప్రసంగాలు, అనేక శీర్షికలతో గ్రంథాలుగా వెలువడ్డాయి. చారీజీ గ్రంథాలు చదివితే  మనం ఆధ్యాత్మికతతోపాటుగా ఎన్నో వేల పుస్తకాల సారాంశాన్ని గ్రహించవచ్చు. ఇంగ్లీషు మాట్లాడటం, చక్కటి పదప్రయోగం, సున్నిత వ్యంగ్యం, హాస్యం, చక్కని భావవ్యక్తీకరణ వంటివెన్నో మనలో పెంపొందే అవకాశం ఉంది, ప్రాణాహుతి గాకుండగా.
                                                                                    (సశేషం ..)



 





19, జులై 2023, బుధవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 3

 

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ
(1927-2014)
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురూన్మీలితం  యేన తస్మై శ్రీ గురవే నమః. 

ప్రియతమ గురుదేవులతో కొన్ని ఉత్తర-ప్రత్యుత్తరాలు 
ఆ రోజుల్లో ఉత్తరాలు కాగితం మీద వ్రాసి కవర్ లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళం. 1990 లో నేను సహాజమార్గ సాధన ప్రారంభించిన క్రొత్తల్లో నాకు పరిచయం చేసిన ప్రశిక్షకులు, "కృష్ణా, నువ్వు కావాలంటే నీకేమైనా సందేహాలుంటే మాస్టర్ గారికి ఉత్తరం వ్రాయవచ్చు. వారు నీకు సమాధానం ఇస్తారు" అని చెప్పడం జరిగింది. అంతటి మహానుభావుడు నాలాంటి పరిపక్వత లేని కుర్రాడికి ఎందుకు సమాధానం ఇస్తారు, ఆయనకి ఎక్కడ అంతా తీరిక ఉంటుంది ,అని అనుకున్నాను. సరే, పెద్దాయన చెప్పారు కదా అని ఒక ప్రయత్నం చేద్దామని సాహసం చేశాను. మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మిక సంస్థ అధ్యక్షుడికి ఉత్తరం వ్రాసాను. అందులో నేను వ్రాసిన ప్రశ్న, నన్ను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్న:" పూజ్య మాస్టర్ కు ప్రణామాలు. నా మనసు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపే మొగ్గుతూ ఉంది, అసలు భౌతిక జీవితం మీద ఆసక్తే లేదు; మీరు పక్షి, రెండు రెక్కలు అంటున్నారు; నాకేమీ బోధపడటం లేదు; దయచేసి మార్గదర్శనం చేయగలరు." అని వ్రాసాను. 
దానికి వారు ఒక పది రోజుల్లోనే సమాధానం వ్రాయడం జరిగింది. నా ఆనందానికి అవధుల్లేవు. సమాధానం రాదనుకున్న వాడికి సమాధానం రావడమే గొప్ప ఆనందానికి కారణం అయ్యింది. ఒక నూతనోత్సాహం కలిగింది నాలో. అది టైపు చేసిన ఉత్తరం. క్రింద వారి సంతకం కనిపించింది. చాలా ఆనందించాను. వారు వ్రాసిన సమాధానం: "డియర్ బ్రదర్, నువ్వు నీ సమయాన్ని తగినట్లుగా సమానంగా  సర్దుకోగలగాలి. నీ  మనసు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపుగా మొగ్గుతున్నట్లయితే, దాన్ని భౌతిక జీవితం పైకి మళ్ళించు; నీ  మనసు భౌతిక జీవితం పైకి ఎక్కువగా మొగ్గుతూ ఉంటే ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించు. ఈ సమాధానం నీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నీ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను." అని వ్రాసారు. ఈ ఉత్తరం ద్వారా నాకు మార్గదర్శనం లభించింది. కానీ ఒక చిన్న అసంతృప్తి కూడా ఉండింది. ఎందుకంటే అది టైపు చేసిన ఉత్తరం; ఎవరో సమాధానం టైపు చేసి ఉంటారు, ఆయన కేవలం సంతకం పెట్టి ఉంటారేమోనన్న ఒక చిన్న మూర్ఖమైన అనుమానం కూడా ఉండింది మనసులో. ఆనందం-అనుమానం మిళితమైన అనుభవం. ఆ  తరువాత 1991 లో మరొక ఉత్తరం వ్రాసాను; ననను వేధిస్తున్న ప్రశ్నలు మరికొన్ని వ్రాయడం జరిగింది. నేను వ్రాసిన ప్రశ్నలు: "1) పర్ఫెక్షన్ అంటే ఏమిటి? 2) శివుడాజ్ఞ లేనిదే ఒక్క ఆకు కూడా కదలదంటారు, చీమ కూడా కుట్టదంటారు, ప్రతీదీ ముందే నిర్ణయింపబడినప్పుడు, ఇక మనం చేసే  ప్రయత్నంలో అర్థమేమిటి? నా మనసు గందరగోళంగా ఉంది మాస్టర్, దయచేసి సహాయపడగలరు. 3) మీరు సాక్షాత్కారం పొందిన వ్యక్తి అని నేను ఎలా తెలుసుకోగలను? " అని వ్రాసాను.  ఈసారి పూజ్య గురుదేవులు వారి స్వహస్తాలతో, ఒక తెల్ల కాగితం మీద సమాధానం వ్రాసి పంపించారు. ఆ ఉత్తరం చూసి ఎక్కెక్కి  ఏడ్చాను; అనవసరంగా అంతటి మహానుభావుని అనుమానించానే అని. వారు ఈ ప్రశ్నలకు  వ్రాసిన సమాధానం: "1) పర్ఫెక్షన్ అంటే నా గురుదేవుల ప్రకారం పర్ఫెక్ట్ ఇన్నర్ బ్యాలన్స్. అంటే పరిపూర్ణమైన అంతరంగ సమతౌల్యత. 2) ఈ ప్రశ్న విధికి సంబంధించినది. విధి అనేది ఎవరికి వర్తిస్తుందంటే, తమ విధిని మార్చుకోడానికి ఎవరైతే ఏ ప్రయత్నమూ చెయ్యరో, వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ సమాధానాలు నీకు ఉపయోగపడతాయనుకుంటున్నాను. నీ పురోగతికై ప్రార్థిస్తున్నాను. " అని వ్రాసారు. మూడవ ప్రశ్నకు సమాధానం వ్రాయలేదు. బహుశా ఏమీ సమాధానం ఇవ్వకపోవడమే సమాధానం అనిపించింది నాకు. నిజానికి మౌనంలోనే అన్ని సమాధానాలూ వస్తాయి. ఈ  సమాధానాలు నా జీవితాన్ని మార్చేసాయి; నేను జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చేసాయి. గాఢమైన మానసిక ప్రశాంతతను ఇప్పటికీ అనుభవిస్తున్నాను. 
 
ప్రియతమ గురుదేవులతో చిన్ని-చిన్ని అనుభవాలు పెద్ద-పెద్ద ప్రభావాలు
వారి సమక్షంలో నా జీవితాన్ని మార్చేసిన, వారి నుండి  నేరుగా విన్న కొన్ని గొప్ప పలుకులు:
1) To know where we are going wrong, we don't need a Guru.
మనం ఎప్పుడు తప్పులు చేస్తున్నామో తెలియడానికి మనకు గురువు అవసరం లేదు. 
2) Babuji said, "Deserve and then desire." Those who deserve generally do not desire; and those who desire generally do not deserve. 
"ముందు యోగ్యత సంపాదించి, ఆ తరువాత కోరుకో" అన్నారు బాబూజీ. యోగ్యత ఉన్నవారు సాధారణంగా కోరుకోరు; కోరుకునేవారికి సాధారణంగా యోగ్యత ఉండదు. 
3) Fate or destiny is only for those, who do nothing to change their destiny.
వీధి లేక ప్రారబ్ధం అనేది కేవలం ఎవరైతే తమ విధిని మార్చుకోవడానికి ఏమీ చెయ్యరో, వారికి మాత్రమే వర్తిస్తుంది.  
4) Even to say "I know nothing" is also a state of knowledge. We need to transcend that.
" నాకు తెలిసినది శూన్యం" అని అనడం కూడా జ్ఞాన స్థితే. దీన్ని కూడా అధిగమించవలసి ఉంది. 
పైన చెప్పిన ఈ  వాక్యాలు నా దృక్పథాన్ని సమూలంగా మార్చివేశాయి, నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి; నా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయి; జీవితంలో వచ్చే ఒడుదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేశాయి; సూక్ష్మత్వాన్ని నాలో పెంచాయి. 
ఇలా పంచుకోటానికి అనంతంగా ఉన్నాయి, కానీ ఇక్కడితో ప్రస్తుతానికి విరామం ఇద్దాం. 
                                                                                    (సశేషం ..)









18, జులై 2023, మంగళవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 2

 


బాబూజీతో చారీజీ 
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 

బాబూజీ చారీజీ అనుబంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం 
చారీజీకి తన గురుదేవులైన బాబూజీతో అనుబంధం, ఈ జన్మలో 1964 వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. వారి ప్రసంగాల్లోనూ, సంభాషణల్లోనూ వారు తెలియజేసినదేమంటే కనీసం అయిదారు జన్మలలో కలిసి జీవించారు; కాకభూషుండి మహర్షిగా  బాబూజీ ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగానూ, పతంజలి మహర్షిగా ఉన్నప్పుడు ఆయన శిష్యుడిగానూ, మరొక జన్మలో ఇద్దరూ వైశ్యులుగానూ జన్మించినట్లు తెలియజేయడం జరిగింది. అంతే కాదు, ఒక జన్మలో వారు సెయింట్ పాల్ గా (ఏసు క్రీస్తు శిష్యుడిగా) కూడా ఉన్నారట. ఆ విధంగా ఈ ఇద్దరి ఆధ్యాత్మిక దిగ్గజాల, మహాపురుషుల అనుబంధం ఇప్పటిది కాదు. 

చారీజీ మొట్టమొదటిసారిగా తన గురుదేవులను దర్శించుకుందామని ఉత్తర ప్రదేశ్ లోని షాజహానుపూర్ వెళ్ళినప్పుడు బాబూజీ, 5 అడుగులు కూడా సరిగ్గా లేని ఒక బలహీన ముదుసలి వ్యక్తి, ఒక మంచం మీద గోడకు తిరిగి పడుకొని ఉండటం చూశారు. ఎంతో చదువుకున్న, ఉత్కృష్ఠ వైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన, మహామేధావి, టి. టి. కె. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నతాధికారిగా  ఉన్న ఆధునిక వ్యక్తిత్వం, అది చూసి, "ఈయన నాకు గురువా" అని నిరాశ చెందారు. ఆ తరువాత కొంత సేపటికి బాబూజీ మేల్కొని చారీజీ వైపు చూసి, ఎవరు నువ్వు, ఎక్కడిని వచ్చావు? అని ప్రశ్నించినప్పుడు, వారి కళ్ళల్లోకి చారీజీ తదేకంగా చూసినప్పుడు, బాబూజీ  కళ్ళు అంతులేని  లోతుగా ఉన్న సాగరాల్లా  కనిపించాయట. వెంటనే శ్రీకృష్ణుని నోటిలో యశోదకు  సమస్త సృష్టీ కనిపించిందీ  అంటే ఆశ్చర్యం లేదని వెంటనే నమ్మేసారట. అంతే కాదు, ఈయన కాకపోతే మరెవరవుతారు నా గురువు అని సంభ్రమాశ్చర్యాలతో, కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆ క్షణం నుండి వారిని స్వంతం చేసేసుకున్నారు. వారి తదుపరి 50 సంవత్సరాల జీవితం ఈ అద్భుత క్షణం యొక్క కార్యరూపమే. తీవ్ర పరితప్త హృదయం గల జిజ్ఞాసువు, తన గురుదేవులతో మొట్టమొదటి కలయిక ఆ విధంగా జరిగినప్పుడు, అటువంటి  కలయిక ఎవరిలోనైనా క్షణకాలంలో  సంపూర్ణ పరివర్తనకు బీజం వేస్తుంది.  

మాస్టరును స్వంత చేసుకోవడంతో, ఆయన అందించిన  సహజమార్గ పద్ధతిని,  ఆయన ఆశయాన్ని, సంస్థను, అప్పుడే మానసికంగా స్వంతం చేసేసుకున్నారు. ఆ క్షణం నుండి వారు ఆవిశ్రాంతంగా, నిర్విరామంగా, రాత్రింబవళ్ళూ ఎంతో నిబద్ధతతో, ఎంతో కృతజ్ఞతతో, ఎంతో వినమ్రతతో, వారి వృత్తిని, సంసారాన్ని, సంస్థను ఎంతో నేర్పుతో నిర్వహిస్తూ వచ్చారు. 

బాబూజీ మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటన చేయాలనుకున్నప్పుడు చారీజీని తోడు రావాలని కోరడం జరిగింది బాబూజీ. అప్పటి నుండి విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా చారీజీ ఎప్పుడూ ప్రక్కనే ఉండేవారు. వ్యక్తిగతంగా గురుశుశ్రూష చేశారు; అప్పుడప్పుడు వండి పెట్టేవారు, హుక్కా తయారు చేసేవారు, వారి అవసరాలన్నీ చూసుకునేవారు; బాబూజీ విదేశీయులతో మాట్లాడిన మాటలను వాళ్ళకు అర్థమవడానికి వాటిని విశదీకరించేవారు; సహాజమార్గాన్ని గురించి, గురువు లేక మాస్టరు గురించి విదేశాల్లో తెలియజేసినది చారీజీ; ఈ రోజు ఇటువంటి సంస్కృతి విదేశీ అభ్యాసుల్లో కనిపించడానికి  వీరిరువురే కారణం. 

వారి ప్రసంగాల్లో ప్రతీ  వాక్యంలోనూ "మై మాస్టర్ బాబూజీ మహారాజ్" అన్న పదబంధం తప్పక వినిపించేది; వారి ప్రవర్తనలో అణువణువూ బాబూజీ స్పర్శ తొణికిసలాడేది; ఆయన "మై మాస్టర్ బాబూజీ మహారాజ్" అని అంటూంటే వింటున్న అభ్యాసులందరూ పులకించిపోయేవారు. ఆయన తన గురువును ఎంతగా తనలో లీనం  చేసుకున్నారో, లేక బాబూజీలో చారీజీ ఎంతగా లీనమైపోయారో, లేక ఇద్దరూ ఎలా ఏకమైపోయారో స్ఫురించేది.

బాబూజీని ప్రత్యక్షంగా చూడని అభ్యాసులు చాలా మంది చారీజీ సాంగత్యంలో బాబూజీని చూడలేదన్న లోటును శాశ్వతంగా పోగొట్టుకున్నారు. సహజమార్గ మాస్టర్ల గొప్పదనం అనుకుంటాను: సజీవ మాస్టరును మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మన గురుపరంపరలోని అందరి మాస్టర్ల సాన్నిధ్యయన్ని అనుభూతి చెందగలుగుతారు. ఇది నా ప్రగాఢమైన విశ్వాసం, అనుభవం. అంతెందుకూ మన పూజ్య దాజీ ఒక్కోసారి లాలాజీ లాగానూ, ఒక్కోసారి బాబూజీగానూ, ఒక్కోసారి చారీజీగాను ఒక్కోసారి దాజీగానూ స్ఫురిస్తూ ఉంటారు. అది మన అంతరంగ ఆధ్యాత్మిక స్థితి పైన కూడా ఆధారపడి ఉంటుందేమో నాకు తెలియదు. 
                                                                                (సశేషం ..)

17, జులై 2023, సోమవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో

 


పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ (నా మొదటి గురుదేవులు)
(1927-2014)
అఖండ మండలాకారం , వ్యాప్తం యేన చరాచారం 
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. 

శ్రీరామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక సంస్థ గురుపరంపరలోని మూడవ గురువుగా ఉన్న పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ, 96 వ జయంత్యోత్సవాలు, హైదరాబాదులోని కాన్హా శాంతి వనంలోనూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో ఉన్న  అభ్యాసులందరూ తమ తమ కేంద్రాల్లో ఈ  జూలై 24, 2023 న జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతతో నిండిన హృదయంతో ప్రత్యేకంగా వారిని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. 

భగవంతుని స్మరణ లేక గురువుల స్మరణ ఎందుకు? 
గురువుల స్మరణ ద్వారా వారి పట్ల అకారణ ప్రేమ జనిస్తుంది, దాని వల్ల నిజమైన శరణాగతి స్థితి ఏర్పడుతుంది, తద్వారా ఆయనలో లయమవడం జరుగుతుంది. భగవంతునిలో సంపూర్ణ ఐక్యమే మానవ జీవిత యదార్థ లక్ష్యం. 
మన సహాజమార్గ సాధన ప్రకారం మనం ఎప్పుడూ భగవంతుని స్మరణలో లేక గురుదేవుల స్మరణలో అంటే నిరంతర స్మరణలో ఉండాలి కదా? మరి ఈ జయంత్యుత్సవాల్లో మరలా స్మరించుకోవడం ఏమిటి? అని ఒక సాధకుడు గురుదేవులను ప్రశ్నించడం జరిగింది. 
దానికి గురుదేవులు సమాధానమిస్తూ, నిజమే మనం నిరంతరం వారి స్మరణలో ఉంటాం; కానీ  ఆ రోజున ప్రత్యేకంగా స్మరించుకుంటే నష్టమేమీ  లేదుగా! అని చక్కగా చెప్పడం జరిగింది. 

పూజ్య చారీజీ దివ్యమంగళ విగ్రహం 
పూజ్య పార్థసారథి రాజగోపాలాచారీజీ విగ్రహం కళ్ళు ప్రక్కకు త్రిప్పుకోలేని స్వరూపం. (పై చిత్రంలో కనిపించినట్లుగా) ఆరు అడుగుల ఆజానుబాహుడు; దివ్యత్వం అణువణువునా ఉట్టిపడేటువంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, చుట్టూ ఉన్నవారిని పరవశింపజేసే మంగళకరమైన విగ్రహం. వారి గంభీర స్వరం దైవత్వాన్ని తలపించే విధంగా ఉండేది; వారి అలవాట్లు పరిపూర్ణుడైన మానవుడు అంటే ఇలా ఉంటారేమో అన్నట్లుగా అనిపించేవి; వారి సంభాషణా విధానం మైమరిపించే విధంగా ఉండేది; వారు నవ్వితే చాలు, చుట్టూ ఉన్న వాతావరణ అంతా ఆహ్లాదంగా మారిపోయేది; వారి ప్రసంగాలు కనువిప్పు కలిగించేవిగానూ, మేలుకొల్పు కలిగించే విధంగానూ, సున్నితమైన మందలింపులుగానూ ఉండేవి. వారు మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా కొన్ని ప్రసంగాలు సింహగర్జనలా ఉండేది. వారి భావాలను, సుస్పష్టంగా, ఎటువంటి భయం లేకుండా తెలియజేయగలిగిన నేర్పు వారిలో కనిపించేది. వారి భాష చాలా సరళంగా, స్ఫటికం అంత స్పష్టంగా ఉండేది; చిన్న పిల్లవాడు విన్నా ఏదొకటి అర్థమయ్యేలా ఉండేది; పండితులకు, పామరులకూ అర్థమయ్యేలా ఉండేవి ఆయన ప్రసంగాలు. ఎంతో దూరదృష్టితో ఇచ్చిన ప్రసంగాలు వారివి. వారు వ్రాసిన గ్రంథాలు గాని, వారి ప్రసంగాలు గాని ఎప్పటికీ స్ఫూర్తినిచ్చేవిగానే ఉంటాయి; స్వామి వివేకానందను తలపిస్తాయి. వారి వ్యక్తిత్వం దైవం మానుష రూపేణా అన్న ఆర్ష వాక్యాన్ని తలపించేది. 

చారీజీ - బాబూజీ దివ్య కలయిక, గురుశిష్యుల అద్భుత సంబంధం 
చారీజీ తన గురుదేవులైన బాబూజీని మొట్టమొదటసారి కలిసినప్పుడు వారి అనుభూతిని "నా గురువర్యులు (My Master)" అనే తన గ్రంథంలో అభివర్ణించిన విధానం ప్రతీ సాధకుని మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ గ్రంథం ప్రతీ  ఆధ్యాత్మిక సాధకుడూ చదువవలసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం అధ్యయనం చేయడం వలన ఇద్దరు మాస్టర్లను గురించిన అవగాహన, ఒక శిష్యుడు తన గురువును ఏ  విధంగా చూడాలి, ఏ విధంగా భావించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా దర్శించాలి, గురు-శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఇంకా మరెన్నో రకాలుగా లోతుగా అర్థం చేసుకునే అవకాశం కలిగి పాఠకుడికి ఆధ్యాత్మిక సాధనలో లోలోతుల్లోకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. చారీజీ My Master కవరు పేజీలోనే ఒక్క లైనులో తన గురుదేవులను The Essence of Pure Love అని వర్ణిస్తారు. అంటే నా గురుదేవులు, పవిత్ర ప్రేమ యొక్క సారం అని అర్థం. మన వంటి వారికి ప్రేమే సరిగ్గా తెలియదు, పవిత్ర ప్రేమ అంటే అసలు తెలియదు, ఆ పవిత్ర ప్రేమ యొక్క సారంగా తన గురుదేవులను అభీవర్ణించడం, చారీజీ  బాబూజీని ఎంత లోతుగా దర్శించారో తెలియజేస్తుంది. 

ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో సంస్థను నెలకొల్పడం 
50 సంవత్సరాలుగా ఆవిశ్రాంతంగా, రేయింబవళ్ళూ కృషి చేస్తూ తన గురుదేవుల సందేశాన్ని, ఆశయాన్ని, ప్రపంచం అంతా తిరుగుతూ 100 దేశాలలో సహాజమార్గ పద్ధతిని అందించినటువంటి మహాత్ములు చారీజీ. అంతే కాదు భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాల్లోనూ స్థాపించిన మహనీయుడు. కొన్ని సంవత్సరాలు 6 నెలలు భారతదేశంలోనూ, 6 నెలలు విదేశాలు పర్యటిస్తూ అన్ని చోట్లా ఉన్న జిజ్ఞాసువులను కలుస్తూ, మార్గదర్శనం చేస్తూ సుదీర్ఘంగా పని చేశారు చారీజీ. 

3000 కు పైగా కుల, మత, రంగు, జాతి విభేదాలలేకుండా వివాహాలు జరిపి ఉత్కృష్ఠమైన ఆశయాలను సాకారం చేసిన మహనీయుడు 
 తన జీవితకాలంలో 3000 కు పైగా కుల, మత, రంగు, జాతి విభేదాల్లేకుండా సహాజమార్గ సాంప్రదాయం ప్రకారం వివాహాలు జరిపి, ఉన్నతమైన ఆశయాలను సాకారం చేసిన మహనీయుడు పూజ్య చారీజీ. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సుమారు అన్ని జంటలూ సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు, ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ఆ జంటలకు జన్మించిన పిల్లలకు నామకరణం కూడా చేశారు చారీజీ. వారందరూ ప్రస్తుతం వారి ఆశయాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.  

సహాజమార్గ సాధకుల హృదయాల్లో నిజమైన ప్రేమను పునాదిగా ప్రతిష్ఠించారు 
వారి శిక్షణ ప్రేమతో కూడినదిగా ఉండేది. అందరిలో ప్రేమను నింపడం, పరస్పరం ప్రేమతో వ్యవహరించేలా చేయడం, పరస్పరం జరిగే స్ఫర్థల్లో క్షమించుకోగలగడం, మరచిపోగలగడం నేర్పించారు. ఈ  పునాదితో సాధన కొనసాగించడం తేలికయ్యేలా చేశారు. తెలియకుండా మా అందరి వ్యక్తిత్వాలను సరిదిద్దారు, మలిచారు. జీవితానికి ఒక దిశను కల్పించారు; జీవితాన్ని అర్థవంతంగా మార్చారు; జీవిత ప్రయోజనాన్ని తెలుసుకునేలా చేశారు; జీవితంలో వచ్చే ఇబ్బందులను, సవాళ్ళను, ధైర్యంగా ఎదుర్కొనేలా శిక్షణనిచ్చారు; అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. 
(సశేషం ... )

 




 

హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు తరచూ ఉటంకించే సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు



హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు తరచూ ఉటంకించే సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు  
పైన ఉన్న వీడియోలో మన శీలనిర్మాణానికి ఉపయోగపడే విషయాలు, జీవిత పరమార్థాన్ని తెలిపేటువంటి మహత్తరమైన కొన్ని శ్లోకాలు, సుభాషితాలు కనిపిస్తాయి. భాగవద్గీతలోని పది ప్రధానమైన శ్లోకాలు కూడా కనిపిస్తాయి. వీటిని పిల్లలు, పెద్దలు కూడా కఠస్థం చేసి, ఆ తరువాత వాటి అర్థాన్ని కూడా తెలుసుకొని ధ్యానించగలిగితే పూజ్య గురుదేవులు చెప్పే చైతన్య వికాసం త్వరితగతిని జరిగి జీవితం సార్థకమవుతుంది, జీవితాన్ని విజ్ఞతతో జీవించగలుగుతాం. అందరూ సద్వినియోగపరచులోవాలని ప్రార్థన. 






 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...