28, జూన్ 2025, శనివారం

ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి?

 ఆధ్యాత్మిక సాధన ఎందుకు చెయ్యాలి? 

ఒక్కసారి సమర్థ గురువు తటస్థమయిన తరువాత, గురుదేవులు  చేయమన్నారు కాబట్టి చెయ్యాలి, అంతే. 

తక్కిన కారణాలేమయినా ఉంటే, అవి ఆ తరువాతే. ఎందుకంటే చెప్పింది చెప్పినట్లుగా చేయడమే విధేయత. ఈ లక్షణం అలవడటానికే గురువు సాధన చేయమనేది. విధేయత సాధించిన సాధకుడికి గురువు అనుగ్రహం లభించడం అతి తేలిక; గురువుకు సాధకుని గమ్యానికి జేర్చడం అతి తేలికట. ఆంగ్లంలో దీన్నే Obedience అంటారు. 







19, జూన్ 2025, గురువారం

హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ సాహిత్యం చదివే విధానం - పూజ్య దాజీ సూచనలు

 


హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ సాహిత్యం చదివే విధానం 
- పూజ్య దాజీ సూచనలు  

శుక్రవారం, సెప్టెంబర్ 4, 2015 న పూజ్య దాజీ ఒక అభ్యాసి బులెటిన్ ద్వారా పూజ్య బాబూజీ రచించిన "రియాలిటీ ఎట్ డాన్" అనే గ్రంథం ఎలా చదవాలో కొన్ని సూచనలివ్వడం జరిగింది. ఈ సూచనలే ప్రతీ పుస్తకానికీ వర్తిస్తాయి. అవి ఈ విధంగా ఉన్నాయి: 
చదివే విధానం 
రోజుకొక అధ్యాయం చదవండి. 
  • చదువుతున్నప్పుడు ఒక పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. మీకు ముఖ్యమని తోచిన ప్రతి పదాన్ని అండర్లైన్ చేసుకోండి. దీన్ని మనం కీలక పదం అందాం.  
  • కేవలం కీలక పదాలను మాత్రమే అండర్లైన్ చేయండి. మీకు ఆ పదం కీలక పదం అని అనిపించినంత వరకూ ఎన్నయినా ఉండవచ్చు అటువంటి కీలకపదాలు. కీలకపదం అంటే కేవలం ఒక్క పదమే.  ఢబ్భై రెండు తరాలు లాంటి పదాలు తప్ప. 
  • ఒక అధ్యాయం చదవడం పూర్తయిన తరువాత, ఈ కీలకపదాలన్నీటినీ మీ డైరీలో వ్రాసుకోండి. ఈ పదాల మధ్య కాస్త ఖాళీ ఉండేలా వ్రాసుకోండి 
  • మీకు సమయం ఉంటే, అదే అధ్యాయాన్ని రెండవ సారి, మూడవ సారి చదవండి పెన్సిల్ అక్కర్లేకుండా. 
  • ఆ తరువాతి రోజు మీఋ డైరీలో వ్రాసుకున్న కీలకపదాలన్నిటినీ మనసులో ఉంచుకుంటూ, ఆ ఆధ్యాయాన్ని గురించిన మీ అవగాహనను డౌరీలో వ్రాయండి. ఇది వ్రాస్తున్నప్పుడు ఎ క్రింది అంశాలపై దృష్టి పెట్టండి:
  • ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకేమి అర్థమయ్యింది? హృదయంలో ఏమనిపించింది?
  • ఈ అధ్యాయం చదివిన తరువాత నా అంతరంగ స్థితి (కండిషన్) ఎలా ఉంది? 
  • దృష్టిలో పెట్టుకోవాలసిన మరికొన్ని అంశాలు:
  • మరీ ఎక్కువగా వివరించకండి. 
  • వ్రాస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పుస్తకం చూడకండి 
కేవలం కీలక పదాలను దృష్టిలో పెట్టుకుని ఆ అధ్యాయం మీలో ఎటువంటి భావాలు కలిగించిందో వ్రాయండి. 
  • ప్రతీ అధ్యాయానికి ఇదే ప్రక్రియను అనుసరించండి. 
చదువుతున్నప్పుడు ప్రశ్నలోస్తే ఏం చెయ్యాలి?
పుస్తకం చదువుతున్నప్పుడు ఏమైనా ప్రశ్నలొస్తే, వాటిని మీ డైరీలో వ్రాసుకోండి. 
నిజమైన అవగాహన వ్యక్తిగతమైనది. కాబట్టి సమాధానం లోపలి నుండి రానివ్వండి. ఈ ప్రశ్నలవచ్చినప్పుడు వాటిపై కాస్త ధ్యానించడానికి ప్రయత్నించండి. 
ఇది ప్రయత్నించండి: ధ్యానానికి ముందర, రాత్రి నిద్రకు ఉపక్రమించే పూర్వం, ఈ ప్రశ్నను మాస్టరుకు నివేదించండి. సమాధానం లోపలి నుండి రానివ్వండి. ఒక్కోసారి దీనికి సమాధానం పుస్తకంలోని మరో భాగం నుండి రావచ్చు, లేక మరో పుస్తకం నుండి రావచ్చు. ఒక్కోసారి తరువాత ఎప్పుడో రావచ్చు. సహజంగా రానీయండి. 

దయచేసి అభ్యాసులందరూ ఈ సూచనలను పాటించి పుస్తకం పఠనం ప్రయత్నించెదరుగాక. 


18, జూన్ 2025, బుధవారం

హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 2

  


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 2 

ఈ యాత్ర కొనసాగడానికి ప్రేరణ ఏమిటి?
సంపూర్ణ స్పృహతో చేసే యాత్ర ఈ ఆధ్యాత్మిక అనంత యాత్ర. దీనికి ప్రేరణ ఆసక్తి లేకపోతే ప్రయాణం కుంటుపడుతుంది. అయితే ఈ ప్రేరణ ప్రతి ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా తపన రూపంలో, సహజ ఆసక్తి రూపంలో, నిద్రాణ స్థితిలో ఉంది. అందుకే సాధకులు తపనను తీవ్రతరం చేసుకోవడం చాలా అవసరం. తపనే సాధనకు ఇంధనం. 

ఈ యాత్ర ఎంత కాలం నుండి కొనసాగుతూ ఉంది? 
ఎంత కాలం నుండో తెలియదు కానీ, మన శాస్త్రాల ప్రకారం ఒక అంచనా మాత్రం ఉంది. పరమాత్మలో అంశాలైన ఈ ఆత్మలన్నీ విడిపోయిన క్షణం నుండి 84 లక్షల యోనుల గుండా ప్రవేశిస్తే గాని మానవ జన్మ రాదట. ఈ మానవ జన్మ ఇలాగే కొనసాగితే కూడా పునరపి జననం, పునరపి మరణం అన్నట్లుగా ప్రతీ జన్మలోనూ కొంచెం-కొంచెంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆత్మ, ఆ పరమాత్మలో సంపూర్ణంగా లయమయ్యే వరకూ; లేదా మహాప్రళయం జరిగే వరకూ, సాధారణంగా ప్రతీ ఆత్మ ఈ యాత్రను కొనసాగిస్తూ ఉంటుంది. ఈ యాత్ర ఆత్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. మహాప్రళయం వరకూ ఆగకుండా కొన్ని ఆత్మలు విసిగిపోయి ఈ యాత్రను కుదించాలనుకున్న ఆత్మలు యాత్రను వేగవంతం చేయాలని సంకల్పించుకుంటాయి.  అలా యాత్రను తీవ్రతరం చేసుకునే ఆత్మలే ఒక ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరిస్తూ, ఒక సమర్థ గురువును ఆశ్రయించడం జరుగుతుంది.

మానవ జన్మ, మోక్షం పొందాలన్న ఇచ్ఛ, సమర్థ గురువు  ఈ మూడూ దొరకడం దుర్లభం అంటారు కదా! 
అవును, ఈ యాత్ర సాఫీగా, త్వరితంగా, సురక్షితంగా  కొనసాగడానికి ఆదిశంకరులవారు ఈ మూడూ దుర్లభం అని తన వివేకచూడామణి అనే గ్రంథంలో సెలవిచ్చారు. 
దుర్లభం త్రయం యేవ ఏతద్ దేవానుగ్రహ హేతుకం |
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సమాశ్రయః || 
పూజ్య బాబూజీ దీనికి మరో కీలకాంశం జోడించినట్లుగా అనిపిస్తుంది. అటువంటి సమర్థ గురువు చెప్పింది చేయకపోయినట్లయితే ఈ మూడూ ఉన్నా కూడా సరిపోదన్నారు బాబూజీ. 
కాబట్టి ఈ యాత్ర యొక్క గంభీరతను, ఆవశ్యకతను అందరూ గుర్తించాలని, దానికి తగినట్లుగా యథాశక్తి  చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తారని ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నాను. 


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 1

 


హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ - అనంత ఆధ్యాత్మిక యాత్ర - 1 

ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమవుతుంది?
నిజానికి పైన చిత్రంలో కనిపించినట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందో సరిగ్గా చెప్పడానికి ఉండదనిపిస్తుంది. పూర్వ జన్మలలోనే ఎక్కడో ప్రారంభమైనట్లు కనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి సృష్టి ఆది నుండే ప్రారంభమయ్యిందేమో ఈ యాత్ర అనిపిస్తుంది. 

యాత్ర గమ్యం ఏమిటి?
ఏ మూలం నుండి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవడమే మన గమ్యం. విచిత్రం ఏమిటంటే అప్పటి వరకూ మనలో ఆత్మ పదార్థంగా ఉన్నది అశాంతిగా, నిరాశగా ఉంటుంది; నిద్రపోనివ్వదు. అందుకే గమ్యం చేరుకునేంత వరకూ ఎన్ని జన్మలకైనా సిద్ధమే అన్నట్లుగా ఉంటుంది ఆత్మ స్వభావం. గమ్యం చేరుకునే వరకూ తపిస్తూనే ఉంటుంది. 

ఏమి యాత్ర ఇది?
ఇది శారీరక యాత్రా? మానసిక యాత్రా? ఆధ్యాత్మిక యాత్రా? అంటే నిజానికిది ఆధ్యాత్మిక యాత్రే; కానీ శరీరం, మనసుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తుంది.  

ఈ ప్రయాణం తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా?
ఈ ఆత్మ చేసే యాత్ర అతి సూక్ష్మ స్థాయిలో జరుగుతుంది. దీని ప్రభావాలు కణస్థాయిలో కనిపిస్తాయి కణస్థాయిలో ఉన్న చేతనం మనకు అందుబాటులో ఉంటే. ఆ ప్రభావాలు మానసిక స్థాయికి, శారీరక స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ యాత్ర మనకు తెలిసినా తెలియకపోయినా జరుగుతూ ఉంటుంది. ఈ స్పృహతో యాత్ర చేసే సాధకులను ఆధ్యాత్మిక సాధకులంటారు. వీళ్ళు ఏదోక ఆధ్యాత్మిక సాధనను అనుసరిస్తూ ఉంటారు. 

(ఇంకా ఉంది...)




17, జూన్ 2025, మంగళవారం

ఇంటెన్స్ అభ్యాసి - తీవ్ర సాధకుడు

 


    Meditate like never before          Clean like never before                    Pray like never before


ఇంటెన్స్ అభ్యాసి - తీవ్ర సాధకుడు 

పూజ్య చారీజీ మహారాజ్ ఒక సందర్భంలో సహజ్ మార్గ్ లో గమ్యాన్ని చేరే సోపానం ఏమిటో ఇలా సూచించారు. 
అభ్యాసి -> సరైన అభ్యాసి -> ఇంటెన్స్ అభ్యాసి -> గమ్యం. 
ప్రశిక్షకుడు (ప్రిసెప్టర్) అంటే ఇంటెన్స్ అభ్యాసి అని తెలిపారు. మూడు పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు తీసుకున్నవాడు అభ్యాసి; ప్రతి రోజూ అభ్యాసం చేసేవాడు సరైన అభ్యాసి; ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాధన చేసేవాడు ఇంటెన్స్ అభ్యాసి. 


ఇంటెన్స్ అభ్యాసి అంటే పూజ్య దాజీ ఒక్క వాక్యంలో చెప్పేశారు:
Practice like never before 

అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభ్యాసం చేయడం.  అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ధ్యానించడం 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శుద్ధీకరణ చేసుకోవడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రార్థించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిరంతర స్మరణలో ఉండటం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సేవలో పాల్గొనడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా దశనియమాలను పాటించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శీలనిర్మాణ పనిలో నిమగ్నమవడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మన కర్మలలో కుశలత కనిపించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాహిత్యాన్ని చదవడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంభాషించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రేమించగలగడం; 
వెరసి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జీవించడం.  

16, జూన్ 2025, సోమవారం

జన్మదినం ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకోవాలి?

 



జన్మదినం ఎందుకు జరుపుకుంటారు?
 ఎందుకు జరుపుకోవాలి? 

చాలా మంది జన్మదినాన్ని వేడుకగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. కొందరు కొవ్వొత్తి ఆర్పుతారు; కొందరు దీపం వెలిగిస్తారు, శుభసూచకంగా. కేక్ లు కోస్తారు లేక పిండివంటలు చేసుకుంటారు.
 
మరో రకం జన్మదిన వేడకలు - మహాత్ముల జయంతులుగా వారి గొప్పదనాన్ని స్మరించుకుంటూ, వారి బోధలు జ్ఞాపకం చేసుకుంటూ, పూజ్య భావంతో వారి ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటాం. 

అలాగే మరో రకం జన్మదిన వేడుకలు - దేశానికి త్యాగం చేసినవారిని, మరచిపోలేని సేవలనందించిన వారిని, ఆదర్శ వ్యక్తులుగా ఆరాధిస్తూ కూడా వేడుకలు జరుపుకుంటూ ఉంటాం.

కానీ మన జన్మదినం మనమే ఎందుకు జరుపుకుంటామో నాకార్థమయ్యేది కాదు. నేనెప్పుడూ జరుపుకోలేదు కూడా. తల్లిదండ్రులు మన జన్మ దినం జరుపుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు; మన పిల్లలు మన జన్మదినం కృతజ్ఞతతో చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు; కానీ మన జన్మదినం మనమే చేసుకోవడంలో అర్థం ఏమిటో అని అనుకుంటూ ఉండేవాడిని. 
 
భారతీయ సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం, మానవ జన్మ కలిగినందుకు, అంటే మోక్షసాధన చేసుకోగలిగే వీలు కల్పించినందుకు, ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం కలిగినందుకు, అంతరంగంలో కలిగిన ఆనందంతో ఆ పరమాత్మకు కృతజ్ఞతతో జరుపుకుంటామని స్ఫురించింది. 

అయితే ఈ స్ఫూర్తితో, కృతజ్ఞతతో జన్మదినం జరుపుకోవడమేగాక ఈ లక్ష్యాని కోసమే జీవితాన్ని వెచ్చించాలన్న నూతన సంకల్పంతో ప్రతి సంవత్సరమూ నిరాశ పడకుండా సకారాత్మకంగా ఆలోచిస్తూ చేతనైనంత కృషి చేయాలి. అట్లే జరుగుగాక. 


13, జూన్ 2025, శుక్రవారం

ఆధ్యాత్మిక ఎదుగుదల - ఆధ్యాత్మిక ప్రగతి - ఆధ్యాత్మిక వికాసం

 



ఆధ్యాత్మిక ఎదుగుదల - ఆధ్యాత్మిక ప్రగతి - ఆధ్యాత్మిక వికాసం

ఈ మూడు పదాలకర్థం ఒకటే. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఇంచుమించు ప్రారంభించిన వెంటనే దీన్ని గురించిన జిజ్ఞాస మనసులో మెదలడం మొదలైపోతుంది. షట్చక్రాల యాత్ర అయితే యే చక్రంలో ఉన్నామో అని, సహజ్ మార్గ్ యాత్ర అయితే 13 గ్రంథుల యాత్రలో యే గ్రంథి దాకా వచ్చామని, యే స్థాయిలో ఉన్నామని, జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది. ఇది సమంజసమే కొంతవరకూ. మరి కొంతమంది కొన్ని గ్రంథాలు చదివి ఆయా స్థాయిలకు అప్పుడే చేరుకున్నామని కూడా భ్రమల్లో పడిపోతూ ఉంటారు. అలాగని తెలుసుకోలేమనీ కాదు నా అభిప్రాయం. ఇది భ్రమా, నిజమా అన్న సందేహం అస్సలు ఏర్పడకుండా ఉన్న క్షణంలో అది సత్యమవుతుంది. ఇది ఎవరి మనస్సాక్షి వారికే వెల్లడిస్తుంది. 

అయితే నిజానికి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటి? శరీరం ఎదుగుతున్నదనడానికి ఎటువంటి సూచనలున్నాయో, మనసు ఎదుగుతోందనడానికి ఎటువంటి సూచనలున్నాయో, అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామనడానికి ఏమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. వాటినే ఆధ్యాత్మిక విలువలు అంటాం. ఏమిటవి? మానసిక ప్రశాంతత, మనసు నిశ్చలంగా ఉండటం, శాంతి, ఆనందము, మౌనం, ప్రేమ, విశ్వాసము, సరళత్వం, శుచిగా ఉండటం, త్రికరణ శుద్ధి - మనసా, వాచా, కర్మణా శుద్ధిగా ఉండటం, ఇతరుల మనసులను బాధపెట్టని మనస్తత్త్వం, ధైర్యం, నిర్భయత్వం, ఏకాగ్రత, సూక్ష్మత్వం, హృదయంలోని తేలికదనం, వాక్శుద్ధి, ఇత్యాదివి. ఇవి సాధన చేస్తున్న కొద్దీ రోజురోజుకీ పెరుగుతూండటం (ఈ పెరగడానికి నిజానికి అంటూ లేకపోయినప్పటికీ) గమనించగలిగితే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే. ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ సాధకుని చేతనంలో పరివర్తన కలిగి, శుద్ధి జరుగుతూ ఉంటుంది. అలా చైతన్య శుద్ధి జరుగుతుంది. దీన్నే చైతన్య వికాసం అని, ఆధ్యాత్మిక వికాసం అని చెప్పుకోవచ్చు.  

ఇక చక్రాలపరంగా ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఏమిటి? ఒక్కొక్క చక్రానికి తనకు సంబంధించిన ఒక్కొక్క  రకమైన చేతనం ప్రబలంగా ఉంటుంది. సాధకుడి సాధన ద్వారా ఒక్కొక్క చక్రం శుద్ధి జరిగినప్పుడు ఆయా చక్రానికి సంబంధించిన చైతన్యం వ్యక్తిలో ప్రబలంగా ఉంటుంది గమనిస్తే. గురువు దీన్ని స్పష్టంగా గమనించగలుగుతాడు. అన్ని చక్రాల శుద్ధి జరిగినప్పుడు, ఆధ్యాత్మిక ప్రయాణం సమగ్రంగా జరిగినప్పుడు, గురువులా పరిపూర్ణ వ్యక్తిత్వంగా మారడం లేక పరిపూర్ణ వ్యక్తిత్వంగా పరివర్తన చెందడం జరుగుతుంది.  

ఈ చైతన్య శుద్ధి ఎలా జరుగుతుంది? మనసు, బుద్ధి, అహంకారము శుద్ధి జరిగినప్పుడు.
 
మనసు, బుద్ధి అహంకారము ఎలా శుద్ధం అవుతాయి?
ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన, దశనియమాల జీవన శైలిని అవలంబించడం వల్ల వీటి శుద్ధి జరుగుతుంది. 

కాబట్టి అభ్యాసం, అభ్యాసం, అభ్యాసమే మనం అనుసరించవలసినవాటిల్లో కీలకమైన అంశం. 
తథాస్తు. 

11, జూన్ 2025, బుధవారం

"నేను" అంటే ఎవరు?

 


"నేను" అంటే ఎవరు?

"నేను" అంటే ఎవరు? అద్భుతమైన తాత్త్విక ప్రశ్న. సమాధానం దొరికే వరకూ మనిషిని దొలిచివేసే ప్రశ్న. ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని అనుష్ఠానాలు చేసినా, అర్థమయినట్లుగా అనిపించి, పట్టు దొరకకుండా, మనిషి తెలివి తేటలకందకుండా జారిపోయే ప్రశ్న. చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సమాధానం కనుక్కునే వరకూ అంతరంగంలో అంతర్లీనంగా శాంతి లేకుండా చేసే ప్రశ్న.  
"నేను" అంటే ఈ శరీరం కాదు; మనసూ కాదు; బుద్ధీ కాదు; అహంకారమూ కాదు; చేతనమూ కాదు; వీటన్నిటినీ ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్న వస్తువు ఆత్మ అనే ఒక ఉనికి;  ఈ సత్యం అనుభవంలోకి రావడమే "నేను" అంటే ఏమిటో అనుభూతి చెందడం అని, ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు తెలియజేస్తూ ఉంటారు.
ఇది సిద్ధించడానికి చంచలంగా ఉండే మనసును ప్రశాంతపరచాలి, నిశ్శబ్దం చేయాలి. మనసు ఎటువంటి  తరంగాలూ లేకుండా, నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సత్యస్థితి అనుభవంలోకి వస్తుంది. మనసుకు అతీతంగా వెళ్ళగలిగే  పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు జీవితంలో యథాతథంగా సర్వమూ కానవస్తాయి;  ఈ "నేను" అనే యదార్థ స్పృహతో ఉండటం వల్ల మనిషి భూమ్మీద ఉన్నంత సేపూ అత్యంత వివేకంతో మనుగడ కొనసాగించగలుగుతాడు; ఇది ఇహంలో కలిగే ప్రయోజనం. అలాగే పరంలో కూడా దీనికి ఆవల ఉన్న ఉన్నతోన్నత లోకాల ప్రయాణం చేస్తూ, ఈ అనంత యాత్రను  సాఫీగా కొనసాగించగలుగుతాడు జీవుడు.    
"నేను" లో ఎటువంటి వికారాలు గాని, అహం గాని, కోరికలు గాని ఉండవు; పరిశుద్ధమైన ఉనికి. అయితే ఈ అనంత యాత్ర ఎక్కడికి? "నేను" ను చూసే పరమ సాక్షి కూడా ఉన్నది. దాన్నే అధిష్ఠానం అని, పరతత్త్వం అని అంటారు. ఈ "నేను" ఆ పరతతత్వంలో సంపూర్ణంగా లయమై కరిగిపోయే వరకూ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. 
ఈ "నేను" గురించి ప్రస్తావిస్తూ ఒకసారి బాబూజీ మహారాజ్ ఇలా అన్నారు: "నేను "నేను" అన్నప్పుడు అది నన్ను సూచిస్తున్నదో, లేక నా గురుదేవులను సూచిస్తున్నదో లేక ఆ పరమాత్మనే సూచిస్తున్నదో నాకు తెలియదు" అన్నారు. ఇది నా దృష్టిలో బాబూజీ పలికిన వాక్యాల్లో ఒక మహావాక్యం. అందరూ ధ్యానించదగ్గ వాక్యం.
కాబట్టి ఈ "నేను" కూడా సంపూర్ణంగా కరిగిపోయి శుద్ధచేతనంగా  మారిపోవడమే మన లక్ష్యం; పరమసాక్షి అనుభూతి చెందడమే మన పరమ లక్ష్యం.  నీటి చుక్క మహాసముద్రంలో కలిసి ఒక్కటైపోవడమే పరమ లక్ష్యం. ఈ విధంగా ఆత్మ పరమాత్మలో లాయమైతేనే ఆత్మ యొక్క సంపూర్ణ సాక్షాత్కారం జరిగే అవకాశం ఉంది. 
ఇది నా అవగాహన మాత్రమే. ఎవరికి వారు సరి చూసుకోగలరు.  

7, జూన్ 2025, శనివారం

హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో ధ్యానం

 


హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో ధ్యానం

హార్ట్ఫుల్నెస్  సహజ్ మార్గ్ అనే రాజయోగ ధ్యానపద్ధతిలో, హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో కూర్చోని  ధ్యానించమంటారు. ఇంకా చెప్పాలంటే దివ్యవెలుగు యొక్క మూలమే హృదయంలో ఉందన్న భావంతో ధ్యానించమంటారు. ఈ వెలుగును మరల సూర్యకాంతిగానో, చంద్రకాంతిగానో, దీపపు కాంతిగానో, కొవ్వొత్తి కాంతిగానో మరే విధంగానూ ఊహించవద్దంటారు. 

పూజ్య బాబూజీ మహారాజ్ మరే పదం ఏ భాషలోనూ కనిపించక ఈ Divine Light అనే పదాన్ని వాడారట. ఆ మూల దివ్య వెలుగుకు అతి సమీప పదం Light, అంటే వెలుగు జ్యోతి  అన్నమాట. నిజానికిది Light without luminosity అంటారు బాబూజీ అంటే వెలుతురు లేని వెలుగు అన్నమాట. దీనికి రూపం లేదు, నిజానికి పేరు లేదు, తత్త్వం కూడా కాదు; అన్నిటికీ అతీతమైన వస్తువు ఈ ధ్యానవస్తువు. సూక్ష్మాతిసూక్ష్మ ధ్యానవస్తువు. హృదయంలో దివ్య వెలుగు ఉందన్న ఆలోచనపై ధ్యానించడానికి ప్రయత్నించాలి. 
 
అందుకే చాలా మందికి మొదట్లో ధ్యానం ఎలా చేయాలో సరిగ్గా అర్థం కాదు. అయినా సరే మనకర్థమైన విధంగా చేస్తూ చేస్తూండగా, సాహిత్యం చదవగా చదవగా, ఇతరులు చెప్పింది వినగా వినగా  మనకు తెలియకుండా చేయగలుగుతాం. ఇది అత్యంత ప్రభావపూరితమైన పద్ధతి మనకు ప్రత్యక్షానుభవంతో చేస్తున్న కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. మరింత మరింత స్పష్టత వస్తూంటుంది. 

భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడని, ఆయన్ని చేరుకోవాలంటే సాధకుడిలో కూడా అంత సూక్ష్మత్వమూ రావాలని బాబూజీ చెప్తారు. ఈ ధ్యానం మనలో అటువంటి సూక్ష్మత్వం కొంచెం-కొంచెంగా పెంచుతూ ఉంటుంది. దీనికి కావలసినది ఓపికతో కూడిన, విశ్వాసంతో కూడిన పట్టుదల. Perseverance అంటారు ఆంగ్లంలో. తప్పక ఫలితం కనిపిస్తుంది. 

మన శాస్త్రాలలో దీనికి ఆధారం కావాలంటే మన అష్టాదశ పురాణాల్లో ఒకటైన పద్మపురాణంలో కనిపిస్తుంది. ఇందులో ఒక అధ్యాయంలో లక్ష్మీనారాయణుల సంభాషణలో, లక్ష్మీదేవి నారాయణుడిని అడుగుతుంది: "స్వామి మీరెప్పుడూ శేషసయనంపై నిద్రలో ఉన్నట్లు కనిపిస్తారు, మరి స్థితికారులైన మీఋ ఈ సృష్టిని ఎప్పుడు నడిపిస్తున్నారు?" అని ప్రశ్న వేస్తుంది అమ్మవారు. దానికి ఆ శ్రీమన్నారాయణుడు: "నేను యోగనిద్రలో నా అసలు స్వరూపంపై ధ్యానిస్తూ ఉంటాను" అంటాడు. "అదేమిటి? మీ అసలు స్వరూపం ఏమిటి?" అని అడుగుతుంది లక్ష్మీ దేవి. "నేను ధ్యానించేది నామరూపరహితమైన దివ్య తత్త్వంపై ధ్యానిస్తూ ఉంటాను; అదే మూలం; అక్కడి నుండే నాకు అవసరమైన వ్వవేకం లభిస్తుంది" అని నారాయణుడు సమాధానమిస్తాడట. ఈ మధ్యనే ఒక ప్రసంగంలో వినడం జరిగింది. 

కాబట్టి బ్రహ్మ,విష్ణు మహేశ్వరులందరూ కూడా ధ్యానించేది దీనిపైనే కావచ్చు కూడా. ధ్యానం చేసిన మహాత్ములందరి ధ్యాన వస్తువు ఇదే కావచ్చును కూడా. అందుచేత ఈ ధ్యానం చేసే అవకాశం మనకు కలిగినందుకు మహాదృష్టవంతులుగా తమను తాము భావించుకుంటూ త్రికరణ శుద్ధిగా దీని అభ్యాసం కొనసాగిద్దాం.

4, జూన్ 2025, బుధవారం

చతుర్విధ పురుషార్థాలు - ధర్మార్థకామమోక్షాలు


          
          చతుర్విధ పురుషార్థాలు - ధర్మార్థకామమోక్షాలు

ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాల్గిటిని చతుర్విధ పురుషార్థాలంటారు. పురుషార్థం అంటే ఆత్మ యొక్క ప్రయోజనం లేక ధర్మం. ఇక్కడ పురుష అంటే ఆత్మ అని అర్థం. ఈ భూమ్మీద ఆత్మ ఈ నాలుగు పురుషార్థాల్లో పాల్గొనవలసి ఉంది. బృందావన వైష్ణవ సంప్రదాయం ప్రకారం, ఐదవ పురుషార్థం ప్రేమ

ధారయతి ఇతి ధర్మః 
అని ధర్మానికి నిర్వచనం చెప్తున్నాయి మన శాస్త్రాలు. పడకుండా నిలబెట్టేది ధర్మం. ధరించేది ధర్మం. ఇది మొట్టమొదటి పురుషార్థం, ఆత్మ మనుగడకి పునాది - ధర్మాన్ని తెలుసుకోవడం, ఆచరించడం. తక్కిన పురుషార్థాలు ధర్మాన్ని ఆధారంగా ఉంచుకొని నిర్వర్తించాలి. అంటే ధర్మంగా అర్థాన్ని అంటే ధనాన్ని ఆర్జించాలి. కామం కూడా ధర్మానికి అనుగుణంగా నిర్వర్తించాలి. అటువంటి ధర్మ జీవనం మోక్షానికి దారి తీస్తుందని మన శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. 

2, జూన్ 2025, సోమవారం

సంక్లిష్టతలు (Complexities) - మాలిన్యాలు (Impurities)

 


చిక్కుపడిన ఆలోచనలు (సంక్లిష్టతలు) పోయినప్పుడు సరళత్వం సంభవిస్తుంది 



మాలిన్యాలు (భయము, బద్ధకాలతో పాటు కామక్రోధ ..) పోయినప్పుడు స్వచ్ఛత ఏర్పడుతుంది. 

సంక్లిష్టతలు (Complexities) - మాలిన్యాలు (Impurities)

సాధకులు నిత్యం చేసుకునే హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక రాజయోగ ధ్యాన పద్ధతిలోని రెండవ యౌగిక ప్రక్రియ జీవుడిలో గతంలోనూ, వర్తమానంలోనూ ఏర్పడిన ముద్రలను/సంస్కారాలను/వాసనలను/కర్మలను, క్రమమక్రమంగా కొంచెం-కొంచెంగా తొలగిస్తుంది. తద్వారా ఆత్మశుద్ధి జరుగుతుంది. సాధకుడు సరళంగానూ, పవిత్రంగానూ తయారావుతాడు. సహజ్ మార్గ్ పదజాలంలో ఈ సంస్కారాలనే సంక్లిష్టతలు-మాలిన్యాలని కూడా వాడతారు. 

సంక్లిష్టతలంటే ఏమిటి? పైన చిత్రంలో చూపించినట్లుగా, చిక్కుపడిన దారంలా, చిక్కుపడిన ఆలోచనల వలలో ఇరుక్కుపోయి తత్ఫలితంగా వచ్చే ఆలోచనాధోరణులనే సంక్లిష్టతలంటారు. ఇవే జటిలమైన మనస్తత్వాలుగా ఏర్పడటం జరుగుతుంది. మనసు ఈ చిక్కుపడిన ఆలోచనల వలలో ఇరుక్కుపోయి అక్కడక్కడే తిరుగుతూ, బయట పడలేకపోతూంటాడు. ఫలితంగా అదో రకమైన మనస్తత్వాలలో ఇరుక్కుపోవడం వల్ల, స్పష్టంగా గ్రహించలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వ్యక్తిత్వం జటిలంగా తయారవడం జరుగుతూ ఉంటుంది. ఈ శుద్ధీకరణ లేక నిరమాలీకరణ ప్రక్రియను గనుక నిర్దేశించిన విధంగా ప్రతి నిత్యం అనుసరించినట్లయితే ఈ చిక్కుమూడులు క్రమక్రమంగా విడిపోయి, ఆలోచనా విధానంలో సరళయత్వం ఏర్పడటం, వ్యక్తిత్వం సరళంగా తయారవడం ఎవరికి వారే గమనించవచ్చు.  

మాలిన్యాలంటే, బద్ధకం, భయం, కామ క్రోధ లోభ మోహ మద్య మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు. మాలిన్యాలంటే మనలో ఉండే అశుద్ధ తత్త్వాలు. ఈ అశుద్ధ తత్త్వాలు పోతున్న కొద్దీ సాధకునిలో ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది.

మనిషి ఆలోచన, ఈ మాలిన్యాలచే ప్రభావితం అవడం చేత, ఈ ఆలోచనల వాలల్లో చిక్కుపడిపోవడం, ఫలితంగా ఈ సంక్లిష్టతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది.

మనందరికీ శరీరాన్ని రోజూ స్నానంచేయడం ద్వారా, కనీసం వారానికొకసారి తలంటు పోసుకోవడం ద్వారా శుచిగా  ఉంచుకోవడం తెలుసును గాని, మన మనసును కూడా అదే విధంగా శుచిగా ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఈ శుద్ధీకరణ లేక నిర్మలీకరణ ప్రక్రియ ఈ వెలితిని పోగొడుతుంది. ఎవరికి వారు అనుభవంలో తెలుసుకోవాడమే దీనికి నిదర్శనం.     

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం

దాజీజూలై భండారా సందేశం చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం