28, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 3

 


ధీశక్తి - ధ్యానం - 3 

సంకల్పం 
(Will, Suggestion)  
ఆధ్యాత్మిక సందర్భంలో సంకల్పం అంటే ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచన. 
ఆలోచన + ఇచ్ఛాశక్తి = సంకల్పం 
సంకల్పాలు లేనిదే యేమీ జరగవు జీవితంలో. ఈ సూత్రం మామూలు సాంసారిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా వర్తిస్తుంది. వాడుక భాషలో చెప్పుకోవాలంటే సంకల్పం అంటే మనసులో అనుకోవడం. మనసులో అనుకోకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు ఉదయం  గంటలకు లేవాలి అని మనసులో రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటేనే మనం ఆ సమయానికి లేవగలుగుతాం. మన శరీర వ్యవస్థ లేదా ప్రకృతి విచిత్రంగా ఈ సంకల్పానికి స్పందిస్తుంది. ఇది మనందరి అనుభవమే. అనుకుంటే జరిగి తీరుతుంది. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే , ఎంత పవిత్రమైనదైతే  అంతా త్వరగా నెరవేరుతుంది. 
సాంసారిక జీవనంలో Think, Do, and  Achieve అంటారు. అంటే సంకల్పించుకోవడం, సంకల్పం పనిగా తర్జుమా కావడం, ఆ తరువాత సంకల్పించినదాన్ని సాధించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనంలో Think and Achieve అంటే సంకల్పం చేసుకోగానే, సాధించడం జరుగుతుంది అని అనేవారు చారీజీ. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధనలో ధ్యానం ప్రారంభించే ముందు ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పమే ధ్యానంగా మారిపోతుంది. 

అయితే ఈ సంకల్పం ఎంత సూక్ష్మంగా చేసుకోగలిగితే అంత శక్తివంతంగా, అంతా త్వరితంగానూ సాకారమవుతుంది. సంకల్పం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లయితే అటువంటి సంకల్పాన్ని దివ్య సంకల్పం అని అంటాం. అటువంటి సంకల్పాలు వెనువెంటనే సాకారమవుతాయి. మన సాధన అంతా కూడా మన సంకల్పాలు దివ్య సంకల్పాలుగా మారే దిశగానే కొనసాగాలి. 

సంకల్పంలో పవిత్రతా భావం, సూక్ష్మ ఆలోచనా శక్తి, తగినంత  ఇచ్ఛాశక్తి కీలకం. మనిషి సంకల్పం, దైవసంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి ఆధ్యాత్మిక సాధన కీలకం. అప్పుడు జీవితమే దైవసంకల్పానికి అనుగుణంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది. 

(సశేషం ...)


27, డిసెంబర్ 2024, శుక్రవారం

ధీశక్తి - ధ్యానం - 2

 


ధీశక్తి  - ధ్యానం - 2 

ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
ఆలోచనల మూలం ఏమిటి? ఆలోచనలు మన సంస్కారాల మూలాన లేక మన కర్మల వల్ల, వాసబాల వల్ల వస్తూంటాయి. ఇవి మామూలు ఆలోచనలు అవే చర్యలుగా మారి అవే ముద్రల్లా  ఏర్పడి, పదే పదే  అవే పనులు చేయడం వల్ల ప్రవృత్తుల్లా, లేక సంస్కారాలుగా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కారాలే మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఇలా మనం సంస్కారాల బరువును తగ్గించుకవడం పోయి పెంచుకుంటూ ఉంటాం. తద్వారా ఇవన్నీ ఖర్చవడం కోసం మళ్ళీ-మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటాం. కాబట్టి సంస్కారాల వల్లే ఆలోచనలు వస్తాయి, ఆలోచనల వల్లే సంస్కారాలు ఏర్పడటం, జరుగుతూ ఉంటుంది. మొక్క ముందా, విత్తు ముందా అనే పరిస్థితి. కొత్త సంస్కారాలు ఏర్పడకుండా కాపాడే కవచమే ధ్యాన స్థితి. ఇది ధ్యానం అల్లే సాధ్యం. ఆలోచనలకు అతీతంగా తీసుకువెళ్ళేదే ధ్యానం.

స్థూల ఆలోచనలు, సూక్ష్మ ఆలోచనలు, దివ్య ఆలోచనలు 
మనిసజీకవచ్చే ఆలోచనలు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. 1) స్థూల ఆలోచనలు అంటే బరువైన ఆలోచనలు, నకరాత్మకమైన ఆలోచనలు, సాంసారిక ఆలోచనలు, 2) సూక్ష్మ ఆలోచనలు అంటే తేలికైన ఆలోచనలు, శాంతిని కలిగించేవి, హాయిని కలిగించేవి, సృజనాత్మకమైన ఆలోచనలు, 3) దివ్య ఆలోచనలు అంటే పై రెండూ ఆలోచనలు కంటే అత్యంత తేలికైనవి, అలౌకిక ఆనందాన్ని, ఆత్మసుఖాన్ని కలిగించేవి. 
అందుకే ఎప్పుడూ దివ్య ఆలోచనలు కలిగేటువంటి వాతావరణాన్ని అంతరంగంలో సృష్టించుకునే ప్రయత్నంలో ఉండాలి మనిషి. ధ్యానం ద్వారాన్నే ఈ అంతరంగ వాతావరణాన్ని మార్చవచ్చు. 
 
(సశేషం ...)


21, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 1

 


ధీశక్తి  - ధ్యానం - 1  

ప్రతి మనిషికి అందుబాటులో ఉండే అత్యద్భుత శక్తి ధీశక్తి లేక ఆలోచనా శక్తి. ఆలోచన లేకపోతే సృష్టి లేదు; ఆలోచన లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఆలోచన లేకపోతే యే  పనీ చేయలేము. 

ఆలోచన కాంతి కంటే వేగమైనది; మనోవేగం అంటాం. యే వస్తువుతోనైనా, ఆ వస్తువు మన అనుభవంలో ఉన్నా ఉండకపోయినా, చూసినా చూడకపోయినా ఆ వస్తువుతో ఆలోచన ద్వారా వెంటనే సంపర్కం ఏర్పరచుకోవచ్చు. అది వస్తువే కానక్కర్లేదు, భావమైనా కావచ్చు. ఉదాహరణకు మనం ఎప్పుడూ దైవాన్ని అనుభూతి చెందకపోయినా కూడా, ఆలోచన ఆ దైవ భావంతో అనుసంధానం ఏర్పరుస్తుంది. 

ఆ ఆలోచనను తదేకంగా అటువంటి భావంపై గాని, వస్తువుపై గాని దృష్టిని నిలపడమే ధ్యానం. దీన్నే ధ్యాన వస్తువు అని కూడా అంటారు. ఈ ప్రక్రియ వల్ల, దీన్ని పద్ధతిగా కొనసాగించడం వల్ల  ధ్యాన వస్తువు యొక్క సిద్ధి కలుగుతుంది. ఇదీ ఆలోచనకు, ధ్యానానికీ ఉన్న సంబంధం. 

అయితే ఆలోచనలకు స్వతహాగా యే శక్తి ఉండడంటారు బాబూజీ. మనం వాటిపై దృష్టిని నిలిపినప్పుడే వాటికి శక్తి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాటిపై దృష్టి నిలపడం మానేస్తామో అవి వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయమటారు బాబూజీ. 

దృష్టిని నిలపడం 
మనం మన జీవితంలో గమనిస్తే అనేక సమస్యలుంటూ ఉంటాయి. సమస్యపై తగిన దృష్టిని నిలపడం ద్వారానే మనం ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటాం. ఆ విధంగా దృష్టి పెట్టనట్లయితే ఆ సమస్య అలాగే ఉండిపోవడమే గాక క్రమంగా జటిల సమస్యగా తయారవుతుంది. కాబట్టి సమస్య పరిష్కారానికి దానిపై దృష్టి నిలపడం అనివార్యం. 

అయితే జీవిత సమస్యకు పరిష్కారం కావాలంటే, దేనిపై దృష్టి నిలిపితే ఇది పరిష్కారమవుతుందో దానిపై నిలపవలసి ఉంది. ఆ ధ్యాన వస్తువునే హృదయంలో దివ్యమైన వెలుగు ముందే స్థితమై ఉందన్న భావం, అని అంటారు బాబూజీ. అందుకే సహజ మార్గ రాజయోగ ధ్యాన పద్ధతిలో జీవిత సమస్య పరిష్కారానికి హృదయంలో ఉన్న దివ్య ఉనికి అనే భావం పై ధ్యానిస్తాం. 

(సశేషం ...)



20, డిసెంబర్ 2024, శుక్రవారం

పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014


(జూలై 24, 1927 - డిశంబరర్ 20, 2014)
పూజ్య చారీజీ పుణ్యతిథి - డిశంబర్ 20, 2014 

ఈ రోజు, సహజ మార్గ గురుపరంపరలోని మూడవ గురువులు  పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీ పుణ్యతఇతి, 10 వ వర్ధంతి. 
స్మరణ అంటే, ముఖ్యంగా ఇటువంటి మహాత్ములను స్మరించడం అంటే కేవలం జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కాదు, ఆ జ్ఞాపకాలను పునరజీవిమహయడం అన్నారు చారీజీ. అటువంటి స్మరణ వల్ల నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనం, స్మరించుకుంటున్న వ్యక్తిత్వం యొక్క ప్రత్యేక అనుగ్రహం, ప్రేమ వర్షించే అవకాశం ఉంటుంది. నిజమైన స్మరణగా పరిణమిస్తుంది. మానందరమూ వారి నుండి అందుకున్న, ఇప్పటికీ అందుకుంటున్న ప్రేమను, మార్గదర్శనాలను, బోధలు, ఆధ్యాత్మిక సేవలను, వారి సాన్నిధ్యాన్ని, వారి అపార కృపను, ప్రత్యేకంగా పునశ్చరణ చేసుకోవలసిన రోజు, ఈ రోజు. ఒక్కొక్కరికీ ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు ఉండి ఉంటాయి, వాటన్నిటినీ సమీకరించుకుంటూ ఎవరికి వారు కృతజ్ఞతా పూరిత హృదయంతో పునర్జీవించడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు. ముఖ్యంగా మన గురుపరంపరలోని మాస్టర్ల స్మరణ ఈ విధంగా చేయడానికి ప్రయత్నించాలని అనేవారు చారీజీ. 

ఆజానుబాహుడు, దివ్యమనోహర విగ్రహం అంటే ఏమిటో తలపించే స్వరూపం, అద్భుతమైన గంభీరమైన కంఠం, మనసులను అలవోకగా గెలుచుకోగలిగే వ్యక్తిత్వం, వారి ప్రత్యక్ష సన్నిధిలో అందుకున్న ధ్యాన స్థితులు అతి నిగూఢమైనవి, మాటల్లో వ్యక్తం చేయలేనివిగా ఉండేవి. వారి ప్రసంగాలు, రచించిన గ్రంథాలు, సంభాషణలు  వారి దైవత్వాన్ని వెల్లడించే మాధ్యమాలు. వారు మానవాళికి నిర్విరామంగా చేసిన ఆధ్యాత్మిక కృషి అంచనా వేయలేనిది. కులమత రంగుజాతి విభేధాల్లేకుండా, తన జీవిత కాలంలో 3000 కు పైగా వివాహాలు వ్యక్తిగత బాధ్యతతో నిర్వహించారు. బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అయి ఉండాలి. ఇంచుమించుగా వాఋ సమక్షంలో వివాహం చేసుకున్నఅన్ని  జంటలూ సుఖంగా ఉన్నాయి. ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు జనానికి, ఎక్కడా తెలియనిచ్చేవారు కాదు. తన గురుదేవులైన బాబూజీ పట్ల ఆయనకున్న ప్రేమ, సమర్పణ, విధేయత, వారి జీవితంలో, వారు చేస్తున్న ప్రతీ పనిలోనూ అనుక్షణమూ కనిపిస్తూ ఉండేది. ఆయన ప్రశంగాల్లో ప్రతీ మూడో మాట బాబూజీ అనే పదం ఉండేది. బాబూజీని దర్శించని ఎందరో అభ్యాసులు బాబూజీని వారిలో దర్శించడం ద్వారా, బాబూజీని చూడలేదన్న వెలితిని పోగొట్టుకున్నారు. అదీ మన గురపరంపర మహత్యం. ప్రతీ గురువు బాబూజీని డర్షియప జేస్తూ ఉంటారు, మనం చూడలేకపోయినా. 
వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేద్దాం। 
 

17, డిసెంబర్ 2024, మంగళవారం

ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024 ఐక్యరాజ్య సమితి ప్రకటన

 


ప్రపంచ ధ్యాన దినోత్సవం డిశంబర్ 21, 2024  
ఐక్యరాజ్య సమితి ప్రకటన 

ధ్యాన ప్రేమికులకు, ధ్యాన సాధకులకు ఒక శుభవార్త!
ఈ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరమూ డిశంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం గా యావత్ ప్రపంచం అంతా జరుపుకోబోతోంది. శారీరక, మానసిక సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడేదిగా ధ్యానాన్ని ఐక్య రాజ్య సమితి ఏకగ్రీవంగా గుర్తించడం జరిగింది. 

ఈ మేరకు డిశంబర్ 15 న హార్ట్ఫుల్నెస్ - శ్రీరామ చంద్ర మిషన్  అధ్యక్షులు పూజ్య దాజీ, ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను జూమ్ ద్వారా, దిల్ సే కార్యక్రమం ద్వారా  ముచ్చటిస్తూ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని, తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో, హైదరాబాదులోని గచ్చి బౌలీ స్టేడియంలో డిశంబర్ 21, న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకూ జరుగబోతున్నదని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్య దాజీ స్వయంగా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యాసులను, ధ్యానం పట్ల ఆసక్తి గలవారందరినీ బంధిమిత్ర సమేతంగా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అభ్యాసులను ముఖ్యంగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో పాల్గొని వాతావరణాన్ని మార్చమన్నారు దాజీ. 

కావున అభ్యాసులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి: మానందరమూ సాధ్యమైనంత అధిక సంఖ్యలో శ్రద్ధాసక్తులతో, ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య దాజీ సంకల్పాన్ని దిగ్విజయం చేద్దాం. 

9, డిసెంబర్ 2024, సోమవారం

డిజైనింగ్ డెస్టినీ - విధి రూపకల్పన గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు

 


డిజైనింగ్ డెస్టినీ  - విధి రూపకల్పన 
గ్రంథ అవగాహనలో కొన్ని భావాలు 

హార్ట్ఫుల్నెస్ మార్గం ద్వారా విధి రూపకల్పన (Designing Destiny the heartfulness way) అనే గ్రంథాన్ని పూజ్య దాజీ శ్రీ కమలేష్ డి. పటేల్ గారు వ్రాయడం జరగింది. 

ఈ శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతుందేమోనన్న ఆశ కలిగిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇందులో చాలా సూక్ష్మయలున్నాయి; మన ఇచ్ఛాశక్తిని అంటే సంకల్ప శక్తిని (Will Power) సరైన దిశలో వినియోగించుకుంటే తప్ప సాధ్యం కాదని అర్థమవుతుంది. ఈ గ్రంథం, మనందరిలో ఉదయించే ఎన్నో ప్రశ్నలకు  సమాధానాలు సూచిస్తుంది. మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. 

మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో యేదొక దశలో విధికి సంబంధించిన ప్రశ్నలు అనేకం వస్తూంటాయి. వాటిల్లో కొన్ని ఈ ఈ విధంగా ఉండవచ్చు: 
 అసలు విధి అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? రెండూ ఒకటేనా?
మనిషి యొక్క విధి, నుదుటివ్రాత, లేక ప్రారబ్ధం పూర్వమే నిర్ధారించబడిందా? మనిషికి గతంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఇంతకు ముందే లిఖించబడిందా?
లేక మన విధిని మనమే స్వయంగా వ్రాసుకున్నామా? అలా స్వయంగా  రూపకల్పన (డిజైన్)  చేసుకోగలమా? మన నుదుటి  వ్రాతను మనమే వ్రాసుకుంటామా? మన తలరాతను మార్చుకోగలమా?
మార్చుకోగలిగితే ఎంత వరకూ మార్చుకోగలం? మార్చలేని భాగం యేదైనా ఉందా? మన ప్రమేయం ఎంతవరకూ ఉంది, ఎంత వరకూ లేదు? ఈ పరివర్తన జరగాలంటే మార్గాలేమిటి?
హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలు ఈ క్రమంలో యే విధంగా ఉపయోగపడతాయి? 
జరిగే మార్పులు యే స్థాయిలో జరుగుతాయి, శరీర స్థాయిలోనా, మానసిక స్థాయిలోనా, ఆత్మ స్థాయిలోనా? అంటే స్థూల స్థూలశరీరపరంగానా, సూక్ష్మశరీర పరంగానా, కారణ శరీరపరంగానా?
జరగవలసిన మార్పుకు ఎంత కాలం పడుతుంది, త్వరితంగా జరగాలంటే మార్గాలున్నాయా?
మొత్తంఈ విధి రూపకల్పనలో గురువు పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి?

తరువాయి వ్యాసంలో సమాధానాలు/పరిష్కారాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కూడా ఈ గ్రంథంలో నుండి శోధించాలని సవినయ విజ్ఞప్తి. 

7, డిసెంబర్ 2024, శనివారం

ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు - అభ్యాసులు

 



ఆధ్యాత్మిక జిజ్ఞాసులు - అభ్యాసులు 

ధ్యానం చేయడానికి వచ్చేవారు, లేక ఆధ్యాత్మిక సాధన చేయాలని వచ్చేవారు, ఎవరినైతే మనం జిజ్ఞాసులని, అభ్యాసులని, సాధకులని పిలుస్తూ ఉంటామో, వాళ్ళు రకరకాల లక్ష్యాలతో వస్తూంటారు. ముఖ్యంగా ఒక గురువును ఆశ్రయించాలనుకున్నవారు మనసుల్లో వివిధ గమ్యాలు పెట్టుకుని వస్తూంటారు. 

ఉదాహరణకు ఒకప్పుడు ప్రాచీనకాలంలో చాలా వరకూ కేవలం భగవత్సాక్షాత్కారం కోసం గురువును ఆశ్రయించేవారు. ఆ తరువాతి కాలంలో ఎక్కువమంది మోక్షసాధన కోసం వచ్చేవారు గురువు వద్దకు. ఆ తరువాత కేవలం మనశ్శాంతి కోసం వచ్చేవారు ధ్యానానికి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి వస్తున్నారు. 

బాబూజీ తన సహజ్ మార్గ్ ధ్యాన విధానానికి, వాళ్ళ మనసుల్లో  ఎటువంటి లక్ష్యమున్నా స్వాగతిస్తారు. కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కష్టాలు పోవాలని, ఇలా రకరకాలుగా ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎలా మొదలుపెట్టినప్పటికీ క్రమక్రమంగా యదార్థ లక్ష్యం సహజంగా స్థిరంగా ఏర్పడే అవకాశం ఈ సహజ మార్గ్ సాధన వల్ల కలుగుటుందంటారు బాబూజీ. అందుకే అభ్యాసుల హృదయాలలో లక్ష్యం స్థిరంగా, స్పష్టంగా ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. అందుకే మన ప్రార్థనలోని మొదటి పంక్తి, ప్రతి రోజూ మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. 

ఆసక్తిని బట్టి లక్ష్యం ఏర్పడుతుంది, లక్ష్యాన్ని బట్టి తపన ఉంటుంది, తపనను బట్టి, సాధన క్రమబద్ధం అవుతుంది, ఆ విధంగా పురోగతి జరుగుతూ ఉంటుంది.  




6, డిసెంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం

 సహజ మార్గము - మానవాళికి బాబూజీ మహాప్రసాదం 
సహజమార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి, పూజ్య బాబూజీ మహారాజ్ మానవాళి ఉద్ధరణకు అందించిన ఒక విప్లవాత్మకమైన ధ్యాన పద్ధతి. రాజయోగ ధ్యాన పద్ధతిని పునర్వ్యవస్థీకరించి, ఆధునిక మానవుల అవసరాలకు తగినట్లుగా, ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరళంగా దైవత్వాన్ని సాక్షాత్కరించుకునే మార్గం; మానవ పరిపూర్ణతను సిద్ధించుకునే సాధనం. 

దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న ప్రాణాహుతి ప్రసరణతో కూడిన రాజయోగ బ్రహ్మ విద్యా విధానం, ఈ సహజ మార్గం. ఈ ఋషి పేరును కూడా పూజ్య దాజీ సూచించడం జరిగింది. ఆయన పేరు ఋషభ్ నాథ్. దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం అంటే బహుశా రాముడి కాలంలో గాని కృష్ణుడి కాలంలో గాని ఈ ప్రాణహుతితో కూడిన ఆధ్యాత్మిక విద్య  ప్రాచుర్యంలో లేదు. 

పూజ్య లాలాజీ ఆధునిక మానవాళిని అత్యంత త్వరితంగా మోక్షానికి తీసుకువెళ్ళగలిగే మార్గాన్ని తన యోగశక్తి ద్వారా శోధించినప్పుడు, కాలగమనంలో అంత వెనక్కి (దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం) వెళ్ళినప్పుడు తెలుసుకున్న విద్యయే  ఈ ప్రాణాహుతి ప్రసరణ విద్య. కాబట్టి దశరథ మహారాజుకు 72 తరాల పూర్వం ఉన్న విద్యను ప్రస్తుత కాలానికి తీసుకు వచ్చినది పూజ్య లాలాజీ మహారాజ్. 

ఆ ప్రాణాహుతితో కూడిన ధ్యాన పద్ధతికి అదనంగా సంస్కారాలను దగ్ధం చేసే శుద్ధీకరణ ప్రక్రియను ఆవిష్కరించి, ప్రార్థన అనే యౌగిక ప్రక్రియని జోడించి, ఈ రాజయోగపద్ధతికి పరిపూర్ణతను పూజ్య బాబూజీ చేకూర్చడం  జరిగింది. ఈ మూడు యౌగిక ప్రక్రియలను అనుసరించడం ద్వారా యోగసిద్ధి సహజంగా జరుగుతుంది కాబట్టి, ఈ ధ్యాన పద్ధతికి సహజ మార్గ్ అనే నామకరణం చేయడం జరిగింది. 

ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల మనిషిలో మనసు క్రమశిక్షణలో ఉండటమే గాక, మనసుకు అతీతంగా ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళడం ద్వారా అడుగడుగునా జీవిత దృక్పథం మారుతూ వ్యక్తిని మరింత మరింత మెరుగైన విధంగా మారుస్తుంది. క్రమక్రమంగా పద్ధతిగా సాధన కొనసాగించడం ద్వారా ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధించే అవకాశం ఉన్నది. 

ఈ సాధన చేస్తే అందరూ మహాత్ములయిపోతారా? అన్న ప్రశ్న అమదరికీ రావచ్చు. దానికి చారీజీ ఒకసారి సమాధానమిస్తూ, అందరూ మహాత్ములు కాకపోవచ్చు, కానీ 80 శాతం మహాత్ములుగా పరిశుద్ధ జీవనం సాగించగలుగుతారని చెప్పడం జరిగింది. బంగారు పతాకం ఒక్కరికే రావచ్చునేమో గాని, పట్టభద్రులు ఎవరైనా కాగలగడం ఎలా సాధ్యమో, అందరూ చాలా వరకూ మరింత మెరుగైన విలువలతో కూడిన మనుషులయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటారు చారీజీ. దీనికి మన అనుభవమే నిదర్శనం అవుతుంది. కేవలం కొన్నాళ్ళు ప్రయత్నించి చూడాలంతే. 

సహజ మార్గ్ అన్నీ మతాలకు అతీతమైనది. ఎవ్వరైనా ఈ సాధన ప్రయత్నించవచ్చు. ఈ సాధన వల్ల హిందువు మరింత మెరుగైన హిందువుగానూ, క్రైస్తవుడు మరింత మెరుగైన క్రైస్తవుడుగానూ, ఇలా యే మతానికి చెందినవారైనా మరింత మెరుగైన వ్యక్తిగా మారడమే గాక, సంకుచిత మనస్తత్వం పోయి, విశాలమైన హృదయంతో వారి వారి మతాగ్రంథాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, మానవాళిలో సామరస్యం, ప్రేమ పెరగడానికి తోడ్పడటం జరుగుతుంది. ఆ విధంగా భూతల స్వర్గం ఏర్పడే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడవలసిన యోగసాధన సహజ్ మార్గ్. 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...