30, అక్టోబర్ 2025, గురువారం

మూడు పరిచయాత్మక సిట్టింగుల ప్రాముఖ్యత ఏమిటి? - దాజీ

 


పైన వీడియో లింక్ ను క్లిక్ చెయ్యండి - దాజీ ఆంగ్ల ప్రసంగం 

మూడు పరిచయాత్మక సిట్టింగుల ప్రాముఖ్యత ఏమిటి? - దాజీ 
నా దృష్టిలో ఈ మూడు పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు మనలను ఎన్నో రకాలుగా తయారు చేస్తాయి. దిశానిర్దేశనం చేయడం లాంటిది ఈ ప్రక్రియ. మొదటి రోజు ధ్యానించడం ఎలాగో నేర్పించడం జరుగుతుంది. రెండవ రోజు మనలను మనం యే విధంగా శుద్ధీకరించుకోవాలి అనేది నేర్చుకుంటాం. మూడవ రోజు ఆ భగవంతునికి ప్రార్థన యే విధంగా నివేదించాలన్నది తెలుసుకుంటాం.

ధ్యానంలో మనం ఎప్పుడూ మాట్లాడుకునే ప్రాణాహుతిని ఎలా అందుకోవాలి, మన హృదయాన్ని ఆ ప్రసరణను అందుకునే విధంగా ఎలా ఉంచుకోవాలి? అయితే మన పరాశిక్షకులు, మన ట్రైనర్ మన హృదయం అవసరమైనప్పుడల్లా ఈ ప్రాణాహుతిని అందుకునేలా మనపై ఆధ్యాత్మిక కార్యాన్ని చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఈ ప్రక్రియ తనంతతానుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు అర్థరాత్రి రెండు గంటలకు మీకు ధ్యానం చేయాలనిపించిందనుకోండి. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రాణాహుతిని ఆవాహన చేశారనుకోండి. వెంటనే ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకోవడం ప్రారంభిస్తారు. ఇదంతా ఆ మూడు పరిచయాత్మక  సిట్టింగుల ప్రభావమే. రెండవ విషయం ఏమిటంటే ఈ సిట్టింగులు మనలను ఆ మూలంతో అనుసంధానం చేస్తాయి. మరొక విష్యయం ఏమిటంటే, మనం శుద్ధీకరణ చేసుకునే ముందు చేసుకునే సంకల్పం – “నాలోని జటిల తత్త్వాలు, మలినాలు నా వ్యవస్థలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాయన్న సంకల్పం పని చేయడం ప్రారంభిస్తుంది ఈ మూడు సిట్టింగుల వల్ల. ఆ విధంగా మనలను మనమే ఈ శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా సరళంగా, శుద్ధిగా తయారవ్వాలన్న ఆదేశాన్ని ఇచ్చుకోగలిగే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక ప్రార్థన. ప్రార్థన నా దృష్టిలో, సహజ్ మార్గ్, హార్ట్ఫుల్నెస్ దృష్ట్యా మనం భగవంతుడిని యేమీ అడగటం లేదు. కేవలం నీవే నా జీవిత యదార్థ లక్ష్యం అంటున్నాం అంతే. నన్ను లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా అడ్డు పడుతున్నది కేవలం నా కోరికలే. నాకు అవరోహయలుగా ఉన్నవి ఇవే. దానికి పరిష్కారం కేవలం నీవు మాత్రమే; నన్ను ఈ పరిస్థితి నుండి బయటకు తీయగల శక్తివి, దైవానివి నీవు మాత్రమే అంటున్నాం అంతే. తద్వారా మనలను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నావేమిటో మనం గుర్తిస్తున్నాం; అలాగే మనలను ఈ స్థితి నుండి విముక్తిని కలిగించడంలో భగవంతుని పాత్రను కూడా మనం గుర్తిస్తున్నాం. అలా మనం ముందుకు సాగుతూ ఉంటాం.

ప్రార్థన నా దృష్టిలో, శ్రేష్ఠంగా ఎప్పుడుంటుందంటే మన హృదయం శూన్యంగా ఉన్నప్పుడు; శూన్యం అంటే యేమీ లేనప్పుడు, యే కోరికాలూ లేనప్పుడు. నాకు భగవంతుని వద్ద నుండి యేమీ కోరడం లేదు; యేమీ వద్దు కూడా; కానీ నాకు కావలసినది కేవలం నువ్వు మాత్రమే; అది మాత్రం నిరాకరించకు ప్రభూ అని అనడం. అంతే. మనం గనుక అటువంటి అపరిమితమైన శూన్యాన్ని మన హృదయంలో సృష్టించుకున్నట్లయితే, ఆయన తనంతట తానే దిగి వస్తాడు. ఆ శూన్యం గనుక కొంచమే ఉన్నట్లయితే ఎంత ఆహ్వానించగలం? మనం గనుక భగవంతుని అపరిమితుడిగా భావించినట్లయితే, మనం సృష్టించుకునే శూన్యత కూడా అపరిమితంగానే ఉండాలి. ఇందులో కొంచెం కూడా రాజీ పడటానికి లేదు; కాస్త కూడా హృదయంలో చెత్త ప్రోగవకూడదు. చివరికి గాఢమైన భక్తి కూడా అడ్డు పడొచ్చు. అయినా అక్కడ మనం జోక్యం చేసుకోం. అవి ప్రారంభదశలో అనుసరించే మార్గాలు కాబట్టి. మనం వాళ్ళని ఆపం. మనం ప్రస్తుతం చేస్తున్న ధ్యానం కూడా చివరిలో అవరోధంగా మారుతుంది. కానీ మనం ఆ విషయానికి తరువాత వద్దాం. ప్రస్తుతాయికి ధ్యానం మనం అక్కడికి చేరుకునే సాధనంగా తీసుకుందాం; ఆ తరువాత చివరికి ధ్యానానికి కూడా వీడ్కోలు పలుకుతాం; మన యాత్రలో యేదొక దశలో అన్నీ ఆగిపోవలసిందే. మీఋ ఆ స్థాయికి చేరుకున్నప్పుడు మీకు తప్పక తెలుస్తుంది.

25, అక్టోబర్ 2025, శనివారం

గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం

 


నిరంతర భగవత్ స్మరణలో గృహస్త జీవనం కొనసాగిస్తే అది అత్యున్నత తపస్సు అవుతుంది. 


గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం
 
వైదిక జీవన విధానం ప్రకారం మనిషి 4 ఆశ్రమాల్లో తన జీవితాన్ని కొనసాగించాలి - బ్రహ్మచర్యం; గృహస్థ; వానప్రస్తం; సన్న్యాసం. అందులో గృహస్థ జీవనం మిగిలిన అన్నిటికీ మూల స్తంభంలాంటిది. 

గృహస్థు జీవనం అంటే కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలను నెరవేర్చే దశ, ప్రపంచంతో చురుకుగా, క్రియాశీలకంగా ఉండే దశ. అంటే కాదు చతుర్విధ పురుషార్థాలయిన ధర్మార్థకామమోక్షాలకు రంగం ఈ గృహస్థు జీవనం. 

గ్రుహస్థు జీవనం, ఇతరులను గురించి ఆలోచించేలా చేసే దశ. విద్యార్థి దశ తరువాత వివాహంతో  ప్రారంభమవుతుంది. ఒక్కరుగా ఉండే మనిషి ఇద్దరవుతారు. కనీసం మరో మనిషి గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ తరువాత సంతానం కలుగుతుంది; అలా సంతానాన్ని గురించి ఆలోచించడం వెరసి కుటుంబం గురించి క్రమక్రమంగా ఆలోచించడం, వారి పట్ల బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది; ఇవన్నీ ప్రేమ, త్యాగం నేర్పిస్తాయి. దురదృష్టవశాత్తూ అవన్నీ మనిషి తన కుటుంబానికి మాత్రమే పరిమితమై సేవాలనందిస్తాడు. నిజానికి ఈ ఇతరులకు సేవ చేసే భావం క్రమక్రమంగానైనా సమాజయంలోకి వ్యాపించాలి. ఆ తరువాత జగత్తునమతా మన ప్రేమ, త్యాగం వ్యాపించాలి. అంటే తనను గురించిన స్పృహ క్రమక్రమంగా పోవాలి; అదే దైవసాక్షాత్కార దిశగా మనిషిని తీసుకువెళ్ళేది. పైన అనుకున్న బాధ్యతలన్నీ, చేసే ప్రతీ పనిని నిరంతర దైవ స్మరణలో సమర్పణ భావంతో చేసినప్పుడే అది సరైన జీవనంగా మారుతుంది. 

సహజ మార్గ జీవన విధానం, గృహస్థు జీవనాన్ని ప్రేమ, త్యాగం, మమకారంలో వైరాగ్యాన్ని నేర్పించే రంగంగా భావిస్తుంది. గృహస్థు జీవనం నిరంతర దైవ స్మరణలో కొనసాగించినప్పుడు అదే మోక్షమార్గంగా మారిపోతుంది, అని బాబూజీ అంటారు. 

మన శాస్త్రాల ప్రకారం గృహస్థుని యొక్క ధర్మాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1) స్వధర్మం - నిజాయితీ నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్వహించడం 2) దానం - దానాలివ్వడం 3) యజ్ఞ - నైతిక, ఆధ్యాత్మిక కర్మలను (సాధనాలను) నిర్వర్తించడం 4) అతిథి సేవ - అతిత్తులను సేవించడం 5) సంస్కారాలు - నామకరణం, ఉపనయనం, వివాహం ఇత్యాది పవిత్ర కర్మలను ఏ సమయానికి చేయవలసినవి ఆ సమయంలో చేయడం 6) సమతౌల్యత - భౌతిక-ఆధ్యాత్మిక కర్మలను సామరస్యంగా ఉండేలా నిర్వర్తించడం. 

క్లుప్తంగా చెప్పాలంటే, గ్రుహస్థు జీవనం అంటే :
సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం 
సంబంధాల మధ్య ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం 
ఇంటిని ఒక ఆశ్రమంగా భావించడం. 




20, అక్టోబర్ 2025, సోమవారం

దీపావళి - బయట దీపం వెలుగు, లోపల దివ్యవెలుగు

 

 



దీపావళి - బయట దీపం వెలుగు, లోపల దివ్యవెలుగు 

దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఈ దీపాల పండుగను భారతీయులు, ముఖ్యంగా హిందువులు అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు. 

శ్రీరాముడు రావణ సంహారం చేసి సీతమ్మవారిని రావణ చర్య నుండి విడుదల చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా కొందరు; శ్రీకృష్ణుడు నరకాసుర వఢ చేసి 16,100 కన్యలను చెర నుండి విడిపించి, వివాహమాడి సమాజంలో వారికి గౌరవం లభించేలా గొప్ప వరాన్ని ప్రసాదించిన రోజుగానూ; మహావీర జైన్ అనే 24 వ తీర్థంకరుడు నిర్వాణం పొందిన రోజుగానూ; లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన రోజుగానూ, ఇలా అనేక కారణాల చేత ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. 

ఈ సందర్భంగా జనం అందరూ తమ ఇళ్ళను శుభ్రం చేసుకొని, నూతన వస్త్రాలు ధరించి, దీపాలు వెలిగించి, లోపలున్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టపాకాయలు కాలుస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. 

ఆధ్యాత్మికపరంగా దీన్ని అర్థం చేసుకుంటే, బయట దీపాలు లోపల కలిగే మేలుకొలుపుకు సంకేతాలు; నరకాసురుని వధించడం అంటే కామ, క్రోధ, అహంకారాలను నాశనం చేయడం; నిజమైన లక్ష్మీ అంటే శాంతి, పవిత్రత, దివ్యప్రేమ; దీపం వెలుగు అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మ నుండి వచ్చే ప్రకాశం.  

హార్ట్ఫుల్నెస్ సహజమార్గం ప్రకారం నా అవగాహనలో, ధ్యానం ద్వారా హృదయాన్ని ప్రకాశింపజేయడం; అంతరంగంలో జ్యోతిని ప్రజ్వలించడానికి సాంకేతమే బయట దీపాలు వెలిగించడం; యౌగిక ప్రాణాహుతి ప్రసరణ ద్వారా, హృదయం పవిత్రతతో వెలుగును విరజిమ్మడం. 
హృదయం లోపలి నుండి ప్రకాశించినప్పుడు నిజమైన దీపావళి ప్రారంభమవుతుంది - బాబూజీ  

సమస్త విశ్వానికి దీపావళి సందేశం 1) వివేకం ద్వారా వెలుగులో జీవించు 2) కారుణతో ప్రేమతో జీవించు  3) పవిత్రంగా ఉండటం ద్వారా శాంతిని వ్యాపింపజేయి 4) ద్వంద్వాలకతీతంగా జీవిస్తూ ఏకత్వాన్ని సాక్షాత్కరించుకో. 

"బాబూజీ మహారాజ్ కు అమావాస్య నాడు దైవ సాక్షాత్కారం జరిగింది; బుద్ధుడికి పౌర్ణమినాడు జరిగింది; సాక్షాత్కారం సాధకులకు ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ  క్షణమైనా జరగవచ్చు. దానికి తగిన విధంగా తయారవడానికే ప్రాణాహుతితో కూడిన ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన వంటి ప్రక్రియల సాధన చేయడం ద్వారా ఇది సాధ్యం. కానీ "నాకు సాక్షాత్కారం జరిగింది" అని డైరీలో వ్రాసుకోడానికి సాధకుడుండడు. దయచేసి ఈ విషయాన్ని గురించి ఆలోచించండి." - ఈ దీపావళి నాడు పూజ్య దాజీ కాన్హాశాంతి వనంలో ఇచ్చిన సందేశం  

అందరూ దీపాలువెలిగించుకుని (లోపల-బయట) నిశ్శబ్దంగా ప్రార్థనాపూర్వకంగా దీపావళి జరుపుకోవాలని ఆశిస్తూ 
అందరికీ దీపావళి శుభాకాక్షలు.  

17, అక్టోబర్ 2025, శుక్రవారం

హృదయంతో వినడం - 2

 


హృదయంతో వినడం - 2 

హృదయంలో నిద్రాణమై బీజరూపంలో ఉన్న శక్తులు అనేకం ఇంకా వెలికి రావలసినవి ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా నమ్ముతున్నారు. హార్ట్ మ్యాత్ సొల్యూషన్స్ (ఇది ఇంటర్నెట్ లో దొరుకుతుంది) అనే గ్రంథంలో హృదయానికి అవసరమైన బుద్ధి హృదయంలోనే ఉందని మామూలుగా వాడే బుద్ధి అవసరం లేదని తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ లో ఉల్లేఖించడం జరిగింది.  

లోపలి నుండి వినిపించే గళం హృదయ గళమా లేక మరేదైనా గళమా ఎలా తెలుస్తుంది?
ఇంతకు ముందు వ్యాసంలో లోపల అనేక గళాలున్నాయని తెలుసుకున్నాం. వాటిల్లో మనస్సాక్షిని లేక హృదయ గళాన్ని గుర్తించడం ఎలా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది హృదయ గళం మనం తప్పు చేస్తున్నప్పుడే వినిపిస్తుంది. మనం తీసుకున్న నిర్ణయం సరైనడా కాదా అన్న సందేహం వచ్చిందంటే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సరైన నిర్ణయం అయితే ఇక యేమాత్రమూ సందేహం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

హృదయం లేక మనస్సాక్షిని అనుసరించడం అనేది ఈ ప్రపంచంలో సాధ్యమా?
మనం ఉన్న పరిస్థితుల్లో కష్టసాధ్యమే. హృదయాన్ని ప్రస్తుత కాలంలో అనుసరించాలంటే సాహసం కావాలి; నిజానికిది చాలా సరళమైనది. సరళమైనది జటిలం చేసేసుకున్నాం. సరైన ఆలోచనా విధానం, సరైన అవగాహన చాలా అవసరం. 
కానీ అన్నిటికంటే పెద్ద ఒత్తిడి మనస్సాక్షికి దూరంగా ఉండటమే; భగవంతునికి దూయమగా ఉండటమే; ఆత్మవిరుద్ధంగా జీవించడమే. కాబట్టి సరైన దిశలో జీవితం కొనసాగాలంటే కనీస ప్రయత్నం అవసరం. అదే ఆధ్యాత్మిక సాధన.

సరైన ఆలోచనా విధానం అని , సరైన అవగాహన అని ఎలా తెలుస్తుంది ? 
సరైన ఆలోచనపైనే సరైన అవగాహన ఆధారపడుంది; సరైన అవగాహన సరైన ఆలోచనపైన ఆధారపడుతుంది. సరైన ఆలోచన, సరైన అవగాహన అని ఎప్పుడు తెలుస్తుందంటే మనసులో విపరీతమైన ప్రశాంతత ఉన్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతీదానికి అవసరం. అది హార్ట్ఫుల్నెస్ ధ్యానం వల్ల సరళంగా సంభవిస్తుంది.  
కాబట్టి హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన వల్ల హృదయంతో వినడం అనేది సుసాధ్యం, సహజం. దీనివల్ల సరైన ఆలోచన, సరైన అవగాహన, సరైన నిర్ణయాలు, అన్ని స్థాయిల్లో ఉండే ఒత్తిళ్ళు క్రమక్రమంగా పోగొట్టుకోవడం; ఆ తరువాత అణువణువూ ప్రశాంతత స్థిరంగా ఉన్నప్పుడు ఇతర సూక్ష్మ లోకాల సంపర్కం, ఆ తదుపరి ఆత్మ వికాసం జరుగుతాయి. ఈ యాత్ర పూర్తవడం అంటూ ఉండదు; ఇది అనంత యాత్ర. ఒత్తిడి నుండి మోక్షం; మోక్షం నుండి భగవత్సాక్షాత్కారం ; అక్కడి నుండి లయావస్థ; లయావస్థ నుండి పూజ్య దాజీ చెప్పినట్లుగా, అసలు అనంత యాత్ర ప్రారంభవడం జరుగుతుంది. ఇది ఆత్మ కొనసాగించే సృష్టి ఆది నుండి ఒక అనంత అంతరంగ సాహసయాత్ర. అందరూ ఉత్సాహంగా, ధైర్యంగా, ఆనందంగా కొనసాగింతురుగాక! 


15, అక్టోబర్ 2025, బుధవారం

హృదయంతో వినడం - 1

 


హృదయంతో వినడం - 1 
హృదయంతో వినడం అనేది ఒక కళ. హార్ట్ఫుల్నెస్ జీవన విధానం అంతా కూడా దీన్ని గురించే; హృదయాన్ని గురించే అంతా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది భౌతిక హృదయాన్ని గురించి కాదు; లబ్-డబ్, లబ్-డబ్ అని కొట్టుకునే మాంసపు గుండెను గురించి కాదు; మనం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక హృదయం గురించి; తెలుగులో వాడుకలో హృదయాన్ని మనసు అని కూడా అంటాం. మంచి మనసున్న మనిషి, సహృదయుడు, దయార్ద్ర హృదయుడు. కఠిన హృదయుడు, సున్నిత మనస్కుడు, ... ఇలా మనసు అనే పదాన్ని, హృదయం అనే పదాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక హృదయం ఎక్కడుంది? గుండె కొట్టుకునే ప్రాంతంలోనే ఉంది అని మన విస్పర్శ్ గ్రంథం కూడా ధృవీకరిస్తోంది. హృదయం అంటే కేంద్రం అని కూడా అర్థం ఉంది. హృదయం అనేది మనిషి చేతనకు కేంద్రంగా ఉంది. అందుకే హృదయాన్ని బట్టే మనిషి వ్యక్తిత్వం; మనిషి చేతనం; మారవలసినది హృదయమే; అందుకే హృదయ పరివర్తనం అంటారు; హృదయం మారితే మనిషి మారినట్లే. వేదాది శాస్త్రాలన్నీ కూడా హృదయాంతరాళంలోనే దైవం నివాసం అని చెబుతున్నాయి. మనం ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చు. అందుకే హృదయం ఎప్పుడూ తప్పుడు మార్గదర్శనం చేయదు. మనస్సాక్షి అంటే కూడా ఇదే; అంతఃకరణ అంటే కూడా ఇదే.  హృదయం అనేది ఉద్వేగాలకు, ప్రేరణలకు మూలస్థానం అని పూజ్య దాజీ చెబుతూ ఉంటారు. అంతే కాదు, మనిషి తప్పు చేస్తున్నప్పుడల్లా తప్పక ఎత్తి చూపుతుంది; కానీ సరైన పని చేసినప్పుడు, సరిగ్గా ఆలోచించినప్పుడు, మౌనంగా ఉండిపోతుంది, కానీ 'శభాష్' అని భుజం తట్టదు. 

మనలో అనేక గళాలున్నాయి 
మనిషి అంతరంగంలో నుండి అనేక గళాలు వినిపిస్తాయి - మన సంస్కారాల గళాలు, మన అహంకారానికి సంబంధించిన గళాలు, మన కోరికలకు సంబంధించిన గళాలు, ఈ గళాలన్నీ కూడా మనలో ఉండే వికారాల ప్రభావం కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ బుద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆ బుద్ధినే మనిషి సాధారణంగా అనుసరిస్తూ ఉంటాడు. 'బుద్ధి కర్మానుసారిణి' అని పెద్దలు అందుకే అన్నారు; అంటే బుద్ధి మన కర్మలను (సంస్కారాలను) అనుసరిస్తుంది; మనం బుద్ధిని అనుసరిస్తాం. అందుకే మనిషి జీవితం తన కర్మ ఎలా ఉంటే అలా కొనసాగుతూ ఉంటుంది. నిజానికి బుద్ధి కూడా హృదయాన్ని అనుసరించినట్లయితే కర్మల ప్రభావం తగ్గి, మనిషి జీవితం ఉండవలసిన రీతిలో సరైన దిశలో కొనసాగుతుంది; ఆ విధంగా వ్యక్తి యొక్క విధిరూపకల్పన ప్రారంభమవుతుంది. అది ధ్యానం వల్లనే సాధ్యపడుతుంది. బుద్ధికి  హృదయాన్ని అనుసరించే శిక్షణనివ్వడమే హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క లక్ష్యం. ఇది మొట్టమొదటి రోజు నుండి జరుగుతుంది. 
(ఇంకా ఉంది ...) 

14, అక్టోబర్ 2025, మంగళవారం

ఓం శాంతిః శాంతిః శాంతిః

 


(పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?)
ఓం శాంతిః శాంతిః శాంతిః
ప్రతీ ఆత్మ శాంతి కోసం పరితపిస్తూ ఉంటుంది. శాంతి లేకపోయినట్లయితే ఏ పనీ సరిగ్గా జరుగదు. మనశ్శాంతి అవసరం ఇంత-అంతా కాదు. సమస్త సృష్టే శాంతి కోసం తపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో జరిగే సమస్త కదలికలూ, సూక్ష్మ కదలికల నుండి స్థూల కదలికల వరకూ కూడా శాంతి కోసమే. మన వేదాల్లో కూడా, ప్రతీ మంత్రమూ ఓం శాంతిః శాంతిః శాంతిః తో ముగుస్తుంది. శాంతి మంత్రాలని వేదాలలో ప్రత్యేకంగా ఉన్నాయి కూడా. 

వేదశాస్త్రాల్లో శాంతి
శాంతికి మూడు పార్శ్వాలున్నాయి :
1) ఆధ్యాత్మిక శాంతి - మనసుకు, హృదయానికి  సంబంధించిన అంతరంగ శాంతి 
2) ఆధిభౌతిక శాంతి - ప్రకృతికి, సమాజానికి, తోటి జీవులకు సంబంధించిన శాంతి 
3) ఆధిదైవిక శాంతి - అంతరిక్షంలోని శక్తులకు, విధికి దైవత్వానికి సంబంధించిన శాంతి. 
అందుకే మన శాంతి మాత్రాల్లో మూడు సార్లు ఓం, శాంతిః శాంతిః శాంతిః అని భగవంతుని ప్రార్థించేది. 
సంగచ్ఛధ్వం, సంవదధ్వం, సం వో మనాంసి జానతాం  
- ఋగ్వేదం  (10.191.4)
అర్థం: అందరూ సామరస్యంగా కదలండి, అందరూ ఒక్క గళంతో మాట్లాడండి, మీ మనసులన్నీ సామరస్యంగా ఉండేలా హూసుకోండి. 
ఓం, శాంతిః శాంతిః శాంతిః
- అథర్వ వేదం (19.9 .14)
అర్థం: శరీరంలోనూ (ఆధ్యాత్మికం), వాతావరణంలోను (ఆధిభౌతికం), అంతరిక్షంలోనూ(ఆధిదైవికం) శాంతి ఉండాలని ప్రార్థన. 
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ 
- బృహదారణ్యక ఉపనిషత్తు (1.3.28)
 శాంతి అంటే అర్థం
 లోపల బయట ఉండవలసిన సామరస్యం, ప్రశాంతత; నిశ్చలత్వం; నిశ్శబ్దం; ఒకరకమైన శూన్యత్వం. 
అంతరంగంలో శాంతి ఎలా కలుగుతుంది?
ధ్యానం తరువాత వచ్చేదే శాంతి అంటుంది సహజ మార్గం. అభ్యాసం చేయగా-చేయగా శరీర వ్యవస్థలో అణువణువూ శాంతితో నిండిపోతుంది.
శాంతి కర్మఫల త్యాగం వల్ల వస్తుందంటుంది భగవద్గీత; మనలో ఉన్న భయం, చింతలు, అరిషడ్వర్గాల వంటి వికారాలు, సంస్కారాలు  తొలగిపోవడం వల్ల అపరిమితమైన గాఢమైన శాంతి కలుగుతుంది.

పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?
సమాధానం: బ్రహ్మ సృష్టించే ప్రక్రియపైన ధ్యానిస్తున్నాడు. విష్ణువు స్థితికార్యంపై ధ్యానిస్తున్నాడు; లయకారుడు లయంపై ధ్యానిస్తున్నాడు. వీరు ముగ్గురూ కూడా తమలో బీజస్థితిలో ఉన్న ఒకే పరబ్రహ్మ తత్త్వంపై  ధ్యానిస్తూ ఉంటారు. మనుషులకైనా, దేవతలకైనా, సృష్టిస్థితిలయకారులయినా ధ్యానం అనివార్యం.  

7, అక్టోబర్ 2025, మంగళవారం

సమయం - కాలం (భాగం 3)

 


సమయం - కాలం (భాగం 3)

సహజ మార్గ మాస్టర్లు అనుభవ జ్ఞానంతో, కాలాన్ని గురించిన పలికిన కొన్ని అమృత వాక్కులు:
- విడిచిన బాణం, పలికిన మాట, గడిచిన కాలం తిరిగి రావు. కాబట్టి వీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 
- భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తనను తాను 'కాలోస్మి' అని చెప్పుకుంటాడు; అంటే తానే కాలమని అర్థం. అందుకే కాలాన్ని వృథా చేయడం అంటే భగవంతుని వ్యర్థం చేయడమే అన్నారు చారీజీ. 
- శారీరక, మానసిక అనుభవాలన్నీ కాలపరిధిలోనే సంభవిస్తాయి. అంటే భూత, వర్తమాన, భవిష్యత్కాలాల్లోనే సంభవిస్తాయి. అందుకే శరీరానికి, మనసుకు అతీతంగా,కాలాతీతంగా  ఎదగవలసిన అవసరం; అదే పూర్ణత్వం;అది మనిషికి మాత్రమే ధ్యానం ద్వారా సాధ్యం. 
- ధ్యానం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు; సమయాన్ని సృష్టించుకోవచ్చు; వృథా గాకుండగా జీవించడం నేర్చుకోవచ్చు; తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనులను నాణ్యతలో రాజీ పడకుండా ఉండే సమర్థతలను పెంచుకోవచ్చు. - దాజీ  
- కాలాతీత చేతనంతో జీవించడం వల్ల అన్నిటి పట్ల  స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది; వివేకం ఏర్పడుతుంది; అది ఈ భవసాగరాన్ని సునాయాసంగా ఈదేలా చేస్తుంది.   
- నా సమయం ఎప్పుడూ వృథా కాదు. - లాలాజీ. అంటే వారెప్పుడూ నిరంతర స్మరణలో ఉంటారు కాబట్టి. 
- ప్రేమ, పవిత్రత, హృదయంలోని ప్రశాంతత, శాంతి, ఆనందము, నిశ్చలత్వం ఇత్యాదివన్నీ కాలాతీత స్థితులే. 

6, అక్టోబర్ 2025, సోమవారం

సమయం - కాలం (భాగం 2)

 


సమయం - కాలం (భాగం 2)
భారతీయ వేద వాజ్ఞ్మయంలో కాలం 

వేదోపనిషత్తులలో కాలం అంటే ఆ పరతత్త్వమే, ఆ పరబ్రహ్మమే  కాలంగా అభివ్యక్తమయ్యింది. ఆ పరబ్రహ్మమే కాలంగానూ, కాలాతీత తత్త్వంగానూ కూడా ఉన్నది. సృష్టిస్థితిలయలు ఈ కాలం ద్వారానే నిర్వహింపబడుతున్నాయి. 

భగవద్గీతలో "కాలోస్మి లోక క్షయత్ కృత్ ప్రవృద్ధో ..." (11:32) "నేనే కాలాన్ని సమస్త లోకాలను చివరికి లయం చేసేది నేనే" అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు.  

పురాణాలలో కాలం అనేది ఒక చక్రం; యుగాలు, కల్పాలు, మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటాయి. 

యోగశాస్త్రంలోనూ, వేదాంత శాస్త్రంలోనూ కాలం అనేది ఒక మిథ్య(మాయ); పదార్థానికి, మనసుకు,  ఆవల ఉన్నది కేవలం "శాశ్వత ప్రస్తుతం" మాత్రమే. 

ఆధ్యాత్మిక చింతన ప్రకారం కాలం అనేది మనలను మనం శరీరంగానూ, మనసుగానూ గుర్తించుకోవడం వల్ల నిజమలా అనిపిస్తుంది. నిగూఢ ధ్యానలోతుల్లో లీనమై ఉన్నప్పుడు కాలం అదృశ్యమైపోతుంది. చేతనకు సంబంధించిన తత్త్వంగా మాత్రమే మిగిలిపోతుంది. ఆధ్యాత్మికత ప్రకారం కాలం అనేది ఒక తెర మాత్రమే; దాని ఆవల ఉన్నదే అసలైన సత్యం; పరమసత్యం. 


సమయం - కాలం (భాగం 1)

 


సమయం  - కాలం (భాగం 1)
సమయం, కాలం - ఈ రెండు పదాలు నిత్యం మన జీవితంలో వాడుతూ ఉంటాం. వీటికి అర్థాలు పరిశీలిద్దాం. 
సమయము, లేదా కాలము అనేవి రెండు రకాలుగా అర్థం చేసుకోవలసి ఉంది: 
1) సమయం - కొలవగలిగే సమయం (సెకన్లు, నిముషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు 
2) కాలం - అస్తిత్వానికి సంబంధించినది (ఉనికికి స్వరూపాన్ని ఇవ్వడం, వీధి, మోక్షం, కాలం ఆసన్నమవడం అంటే మృత్యువు దగ్గరపడటం ఇత్యాది అర్థాలు)

సూక్ష్మ కాలమానం 
(విష్ణు పురాణం, భాగవత పురాణం, సూర్య సిద్ధాంతం)
తృటి: అతి సూక్ష్మ మానము (సెకనులో 1/16,875 భాగం )
నిమేషం: కనురెప్పపాటు (0.213 సెకను)
క్షణము: 0.8 సెకన్లు  
ముహూర్తము: 48 నిముషాలు (ఒక రోజుకు 30 ముహూర్తాలు)
అహోరాత్రులు: రాత్రింబవళ్ళు 24 గంటలు  

మహాకాలమానము 
మహాయుగం : 4 యుగాలు = 43,20,000 సంవత్సరాలు.

సత్య యుగం (కృతయుగం): 1,728,000 సంవత్సరాలు 

త్రేతా యుగం: 1,296,000 సంవత్సరాలు 

ద్వాపర యుగం: 864,000 సంవత్సరాలు 

కలి యుగం: 432,000 స,వత్సరాలు 

కల్పం : 1000 మహాయగాలు 

బ్రహ్మకు ఒక పగలు ఒక కల్పం, ఒక రాత్రి ఒక కల్పం 

సశేషం ....  

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

  కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020  తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7 పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్...