8, జులై 2022, శుక్రవారం

ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాల గుండా ప్రయాణం


ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాల గుండా ప్రయాణం

 ఆధ్యాత్మిక పరిభాషలో ద్వంద్వాలంటే సుఖము-దుఃఖము, వెలుగు-చీకటి, జ్ఞానము-అజ్ఞానము,  మంచి-చెడు, జననము-మరణము, ఇష్టము-అయిష్టము, కోరికలు-సంతుష్ఠి, అశాంతి-శాంతి, కరుణ-ద్వేషము, సాహసము-భయము, భ్రమలు-స్పష్టత, వగైరా వంటి పరస్పర విరుద్ధ విషయాలు. ఒకటుంటే రెండవది ఉండక మానదు. ఒకటి కోరుకుని మరొకదాన్ని తప్పించుకోలేము. అందుకే ఈ లోకాన్ని ద్వంద్వాల ప్రపంచం అంటాం. మనం  జీవించే ప్రపంచం ఈ ద్వంద్వాలతో కూడుకున్న ప్రపంచం. వీటితోనే జన్మ నుండి మృత్యువు వరకూ మన మనుగడ కొనసాగుతూ ఉంటుంది. కష్టమొచ్చినప్పుడు కృంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు స్పృహలేకుండాపోయి; మన  ముఖం కాస్సేపు వికసించి, కాస్సేపు ముడుచుకుపోయి ఉంటూ ఉంటుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకూ అందరూ సామాన్యంగా జీవించే విధానం ఇదే. దీనికి కారణం మన  జీవన విధానంలో ఎరుకలో (లేక  చేతనలో) గణనీయమైన మార్పు సంభవించకపోవడమేనని యోగం అంటుంది. ఆ మార్పు కోసం ఏ ప్రయత్నమూ చెయ్యకపోవడమే మనలో  మార్పు లేకపోవడానికి కారణం అంటున్నారు మహాత్ములు. అందుకే ఈ ద్వంద్వాలకతీతంగా ఎదగడమే మానవ జన్మ యొక్క సార్థకత, పరమార్థము అని  మన  పెద్దలు చెబుతూ ఉంటారు. దీన్నే మోక్షం అని  కూడా అంటారు. ముఖ్యంగా  ప్రతీ మనిషీ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే – మనిషి పుట్టిందే ఎదగడం కోసం. పరివర్తన కోసం. తన  స్వస్వభావాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం. మార్పు, ఎదుగుదల లేని జీవితం  నిరర్థకం, వ్యర్థ  జీవితం అవుతుంది.

 సాంప్రదాయపరంగా మోక్షం అనేది  మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం, పరమావధి. దీనికి మించి ఏమీ  చేరుకునే గమ్యం మరేదీ లేదు. కాని సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం  మోక్షం అన్నది పరతత్త్వాన్ని చేరుకోవడంలో మొదటి లక్ష్యం మాత్రమే. దీన్ని గురించి మనం  తరువాత విపులంగా చెప్పుకుందాం.

 అయితే ద్వంద్వాలకతీతంగా ఉండే స్థితి ఎలా ఉంటుంది? అంటే మోక్షస్థితి ఎలా  ఉంటుంది?

భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించినటువంటి స్థితప్రజ్ఞత్వ స్థితిలా ఉంటుంది. అంటే సమత్వ స్థితిలో స్థిరపడిపోయినటువంటి చేతనాస్థితి, లేక  ఎరుక. పైన  చెప్పిన ద్వంద్వాల స్పర్శ కూడా కలగనటువంటి శాశ్వత అంతరంగ స్థితి. విపరీతమైన స్పష్టతతో కూడిన ప్రజ్ఞ లేక  ఎరుకకలిగి ఉండటం. ఆ  ఎరుకతో జీవనం కొనసాగించగలిగే పరిస్థితి ఈ స్థితి. ఈ స్థితిని దేహముండగానే అనుభూతి చెగలిగేటువంటి స్థితి. దేహంరాలిపోయే ముందు ప్రతీ  సాధకుడు  కనీసంగా సాధించవలసిన ఆధ్యాత్మిక  లక్ష్యం. 

 అది  అందరికీ సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే మనం  చెయ్యవలసినదేమిటి? యోగానికి దీనికి ఏమిటి సంబంధం? ముఖ్యంగా  బాబూజీ రూపకల్పన చేసిన సహజమార్గము అనే  ఆధ్యాత్మిక పథం  ప్రకారం, దీనికి పరిష్కారం ఎలా  ఉంది? వీటికి సమాధానాలు శోధించే ప్రయత్నం చేద్దాం.

 యౌగిక చక్రాల పరంగా జరిగే ఆధ్యాత్మిక యాత్ర:

సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం, పూజ్య బాబూజీ ఆవిష్కరించిన సహజమార్గ పథం  ప్రకారం,  జీవుడి ఆధ్యాత్మిక ప్రయాణం అంతులేని విధంగా, అనంతం వైపు కొనసాగుతూ ఉంటుంది. బాబూజీ ప్రకారం జీవుడు మూలం నుండి విడిపోయినప్పుడు, క్రిందకు వచ్చిన క్రమమే ఈ యౌగిక చక్రాలు. మొదటి మనసు (ఫస్ట్ మైండ్) నుండి క్రిందకు దిగి వచ్చినప్పుడు ఆ మనోశక్తి వివిధ స్థానాల్లో  ముడులు-ముడులుగా ఏర్పడింది; బాబూజీ వీటిని అందుకే గ్రంథులంటారు; వీటినే మనం  చక్రాలంటాం. సాంప్రదాయ పరంగా ఇవి  ఏడు  చక్రాలు-మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విషుద్ధి, ఆజ్ఞ చక్రాలు. సహస్రారచక్రం లేక  సహస్రదళ్ కమల్ అనేది గమ్యస్థానం సాంప్రదాయం ప్రకరం. సహజమార్గ ఆధ్యాత్మిక పథం  ప్రకారం ఈ యాత్ర 13  గ్రంథుల/చక్రాల గుండా చెయ్యవలసి ఉంది. సహస్రారం తరువాత బ్రహ్మ రంధ్రం (12 వ గ్రంథి), ఆ తరువాత దాని క్రింద కేంద్ర క్షేత్రానికి సంబంధించిన 13 వ గ్రంథి ఉన్నాయి. కాబట్టి సాంప్రదాయపరంగా యాత్ర సహస్రారంతో పూర్తవడం గాక ఇంకా 13వ  గ్రంథిని కూడా దాటి అనంతం వైపు కొనసాగుతూ ఉంటుందని సహజమార్గం చెబుతుంది.

 ద్వంద్వాలకతీతంగా దాటవలసిన 5 బిందువుల/గ్రంథుల/చక్రాల  హృదయ క్షేత్రం:

సహజమార్గ పథంలో అనాహత చక్రాన్ని 4 ఉపచక్రాలుగా చెబుతారు. వాటిని 1, 2, 3, 4 బిందువులుగా అభివర్ణిస్తారు. 5వ  బిందువును కంఠ  చక్రం లేక  విశుద్ధి చక్రం అని  కూడా పిలుస్తారు. ఈ అయిదు చక్రాలు మనం  ఉండే ద్వంద్వ ప్రపంచానికి సంబంధించినవి. ఈ 5 చక్రాలను/గ్రంథులను కలిపి హృదయ క్షేత్రం అంటారు. గురువు యొక్క మార్గదర్శనంలో సహజమార్గ సాధన ద్వారా ఈ 5 బిందువులను  దాటినప్పుడు ఈ స్థితప్రజ్ఞ స్థితి  లేక  ద్వంద్వాతీత స్థితి లేక  మోక్ష స్థితి సంభవిస్తుంది.

 ఈ హృదయ  క్షేత్రాన్ని గురించి పూజ్య దాజీ మరింత విపులంగా ఇచ్చిన వివరణ:

ఒక్కొక్క గ్రంథిలో ఒక్కొక్క చేతనం,  ఒక్కొక్క  రకమైన ప్రకంపనం, ఒక్కొక్క రకమైన వర్ణం, ఒక  ప్రత్యేక వాతావరణం, అక్కడ యాత్ర జరుగుతున్నప్పుడు అనుభవంలోకి వస్తాయి. ఒక్కొక్క  చక్ర  యాత్రం  పూర్తయినప్పుడు    చక్రానికి  తగినటువంటి  పరిణామం/ఆత్మవికాసం జరుగుతుంది. ఈ చక్రాలు  శక్తి  క్షేత్రాలు  కూడా.  ఆయా  చక్రంలో యాత్ర  చేస్తున్నప్పుడు  మామూలుగా  ఆయ  శక్తులు  రావడం  కూడా  జరుగుతుంది.  కాని  సహజమార్గ  ఆధ్యాత్మిక పథంలో ఆ  అవకాశం ఉండదు. ఆ శక్తులను సంపాదించడంలో ఉండే ప్రమాదాల్లో చిక్కుకుపోకుండా, అహంకారం అదుపులో  ఉంచుతూ గురువు మనలను రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథంలో శక్తులు సాధకుడికి రావు. గురువు అవసరమూ అని  అనుకుంటే తప్ప.  

 మనం  ఇంతకుముందు  చెప్పుకున్నట్లుగా    హృదయ  క్షేత్రంలో 5  బిందువులున్నాయి.  ఇదే  ద్వంద్వాల  లోకం  మనం  జీవిస్తున్న   ప్రపంచం.  ఈ ప్రపంచంలో జీవనం  మీద  పట్తు రావాలంటే, స్థిత ప్రజ్ఞత్వ స్థితిని చేరుకోవడానికి ఈ 5 బిందువుల యాత్ర పూర్తవ్వాలి, అంటే వీటిపై పట్టు సంపాదించాలి. ఇవి  గాక  ఎన్నో  ఉపబిందువులు  కూడా  ఉన్నాయి.  కాని  వాటిల్లో ప్రధానంగా పాయిట్ ఎ,  పాయింట్ బి,  పాయింట్ సి, పాయింట్ డి అని  నాలుగున్నాయి.

 బిందువు 1- హృదయ చక్రం/ భూమి బిందువు. ఈ చక్రం సంతుష్ఠికి-కోరికలకు అనే  ద్వంద్వాలకు నిలయం. ఈ చక్ర వాతావరణం కలుషితమైనప్పుడు కోరికలు ఎక్కువగా ఏర్పడతాయి. కోరికలు తగ్గినప్పుడు చక్ర శుద్ధి జరిగి సంతుష్థి పెరగడం వల్ల తదనుగుణంగా ఆత్మవికాసం జరుగుతుంది.

 బిందువు 2 – ఆత్మ చక్రం/ఆకాశ బిందువు . శాంతి- అశాంతుల నిలయం. 1వ  బిందువులో కోరికలు ఎక్కువగా ఏర్పడినప్పుడు అది  అశాంతిగా మారి 2వ  బిందువు  వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. 2వ  బిందువు శుద్ధి అవుతున్న కొద్దీ అశాంతి పోయి  శాంతి ఏర్పడి ఆత్మానుభూతి జరుగుతుంది.

 బిందువు3 – అగ్ని చక్రం. ఇది  సంవేదనకు/కరుణ-ద్వేషానికి/నిస్పృహకు  నిలయం. ఈ బిందువు కలుషితమైనప్పుడు ద్వేషానికి, నిరాశ-నిస్పృహలకు  ఎక్కువగా లోనవుతూ ఉంటాం. ఈ చక్ర శుద్ధి జరిగినప్పుడు సంవేదన, కరుణ జీవుడిలో వృద్ధి చెంది ఆత్మవికాసం జరుగుతుంది.

 బిందువు 4- జల  బిందువు.  ఇది  సాహసానికి-భయానికి నిలయం. ఇక్కడ వాతావరణం కలుషితమైనప్పుడు సాహసం తగ్గి  భయం  ఏర్పడుతుంది. ఈ బిందువు శుద్ధి జరిగినప్పుడు మానసిక  స్థైర్యం  పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం  పెరుగుతుంది. ఆ విధంగా  ఆత్మవికాసం  జరుగుతుంది. 

 బిందువు 5 – వాయు చక్రం. స్పష్టతకు-భ్రమలకు  నిలయం.  ఇక్కడి  వాతావరణం  కలుషితమైనప్పుడు  జీవుడు  భ్రమలకు  లోనవుతాడు.  స్పష్టతను  కోల్పోతాడు.  భ్రమలకు, భ్రాంతులకు లొంగిపోతాడు. మనఃస్థిమితం కోల్పోతాడు. ఈ చక్ర శుద్ధి జరిగినప్పుడు భ్రమలకు, భ్రాంతులకు దూరమై అన్ని విషయాల్లోనూ స్పష్టతను ఏర్పరచుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ ఆత్మవికాసం జరుగుతుంది.

 ఈ విధంగా ఈ 5 బిందువుల యాత్రను సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడు,  అంటే పూర్తిగా పట్టు సంపాదించినప్పుడు, ఆత్మ ద్వంద్వాలకతీతంగా ఎదిగి ముందుకు సాగుతుంది.  మోక్షస్థితి అనుభవంలోకి వస్తుంది. బంధవిముక్తిని  ఆత్మ  అనుభూతి చెందుతుంది. స్వేచ్ఛగా తరువాతి యాత్రను కొనసాగిస్తుంది. ఇది  సహజమార్గ సాధన ద్వారా సరళంగా గురుదేవుల మార్గదర్శనంలో ఈ జెవితంలోని కొంత భాగంలోనే ఎవరికైనా సాధ్యపడుతుంది. సాధకుడిలో దీనికి కావలసినది కేవలం దృఢ  సంకల్పం, అచంచల విశ్వాసము, సమర్పణాభావం మాత్రమే.

 మనం  ఇంతకు ముందు 4 ప్రధాన ఉపచక్రాలను/ఉపబిందువులను గురించి ప్రస్తావించుకున్నాం – పాయింట్ ఎ,  పాయింట్ బి,  పాయింట్ సి,  పాయింట్ డి. 

పూజ్య దాజీ ప్రకారం ఈ నాలుగు పాయింట్లు సంస్కారాల ప్రవేశ-ద్వారాలు. మనం  నిత్యం ప్రపంచంతో వ్యవహరించేప్పుడు ఏర్పడే ముద్రల ప్రవేశ-ద్వారాలు. అందుకే వీటిని వివిధ సమయాల్లో నిర్దేశించిన విధంగా శుద్ధి చేసుకోవలసిన అవసరం.

పాయింట్ఎ- ఈ పాయింట్లో ప్రాపంచిక చింతలకు, ఆర్థిక ఇబందులు,వంటివాటికి సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. దీన్ని రాత్రి పడుకొనే ముందు ఒక 7 నిముషాలకు మించకుండా శుద్ధి చేసుకోవడం మన  నిత్యసాధనలో ఒక  భాగం.

పాయింట్ బి - ఇక్కడ లైంగిక పరమైన ముద్రలు, స్త్రీ-పురుషుల మధ్య ఉండే ఆకర్షణలకు సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. దీన్ని ఉదయం ధ్యానానికి ముందు ఒక 7 నిముషాలకు మించకుండా నిర్దేశించిన విధంగా శుద్ధి చేసుకోవాలి.

పాయింట్ సి – ఇక్కడ మన ఇష్టాలకు-అయిష్టాలకు సంబంధించిన ముద్రలు ఏర్పడటం జరుగుతుంది. ఇది  ప్రిసెప్టరు వద్ద తీసుకొనే సిట్టింగుల ద్వారా శుద్ధి జరుగుతుంది.

పాయింట్ డి – ఇక్కడ మన  నిత్య జీవితంలో కలిగే అపరాధ భావాలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి. అంటే చెయ్యవలసినపనులు చెయ్యకపోయినా, చెయ్యకూడని పనులు చేసినా ఈ ముద్రలు ఏర్పడతాయి. ఇవి  అతి  భారమైన ముద్రలు. వీటిని ఏ శుద్ధీకరణ ప్రక్రియా తొలగించలేదు. కేవలం రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనలో భాగంగా మనం  చేసిన అపరాధాలకు త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెంది తిరిగి మరల  చేయకుండా ఉండేలా తీర్మానం చేసుకోవడం ద్వారా మాత్రమే తొలగిపోయే అవకాశం ఉంటుంది.

 మోక్షం అంటే దాజీ ఇచ్చిన సమాధానం:

సహజమార్గ సాధన నిత్యమూ నిర్దేశించిన విధంగా అభ్యాసి అనుసరించినప్పుడు  క్రమక్రమంగా సంస్కారాలన్నీ తొలగిపోయి, హృదయ క్షేత్ర శుద్ధి  జరిగి, అంటే ద్వంద్వాలకతీతంగా బంధవిముక్తులమై ముందుకు సాగినప్పుడు దాన్ని మోక్ష  స్థితి లేక  కర్మరాహిత్యస్థితి, కర్మశూన్యులమైపోవడం  వల్ల జనన మరణాల నుండి  విముక్తి  కలుగుతుంది. మోక్షం అంటే పూజ్య దాజీ ఇచ్చిన మరొక  స్పష్టీకరణ:  కేవలం బంధవిముక్తులమై  జననమరణ వలయం  నుండి  బయట  పడటమే  గాక,  అవసరమనుకుంటే  మానవ జన్మ  తీసుకునే  స్వేచ్ఛ కూడా  ఉంటుంది.  అందుకే  మహాత్ములందరూ,  భూమ్మీదున్న  ఆఖరి  వ్యక్తి కూడా  విముక్తుడయ్యే  వరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండటానికి ఇష్టపడతామని  కాంక్షించడం జరిగింది.

 కాబట్టి, ద్వంద్వాతీత స్థితి అంటే  కోరికల్లేకుండా సంతుష్ఠితో, శాంత హృదయం కలిగి, ద్వేషం లేకుండా ప్రేమతో,  భయం  లేకుండా ధైర్యంతో, భ్రమలు, భ్రాంతులు లేకుండా స్పషటతతో కూడిన ఉన్న్తమైన చేతనా స్థితి. ఇందులో ప్రాపంచిక చింతలుండవు,  స్త్రీపురుష ఆకర్షణలకు సంబంధించిన సమస్యలుండవు, ఇష్టాయిష్టాల కలత  ఉండదు, ఎటువంటి అపరాధభావమూ లేనటువంటి స్థితి ఈ ద్వంద్వాతీత స్థితి. కర్మలు/సంస్కారాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయిన స్థితిని  ఈ యౌగిక చక్రాల యాత్ర పూర్తవగానే చేరుకోవడం జరుగుతుంది. నిర్దేశించిన విధంగా ఈ సాధన చేసేవారందరికీ ఇది  సాధ్యం. ఎంత సమయం పడుతుంది? సాధకుని దృఢసంకల్పాన్ని బట్టి, తన నిబద్ధతను బట్టి, తన  సమర్పణా భావాన్ని బట్టి  ఈ జన్మలోనే, అదీ  కొంత భాగంలోనే ఈ స్థితిని చేరుకొనే అవకాశం ఉంది.

 

 

 

 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...