12, ఏప్రిల్ 2025, శనివారం

భక్త హనుమాన్ జయంతి

 

 భక్త హనుమాన్ జయంతి 

హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హనుమంతుని పాత్ర ఎంత విశిష్ఠమైనదో మనందరికీ తెలిసినదే. భారతీయ సనాతన ధర్మంలో హనుమంతులవారు భక్తాగ్రేశ్వరులుగా పూజింపబడతారు.  భక్తికి పరాకాష్ఠగా హనుమంతులవారినే స్మరిస్తాం మనం. అలాగే వారి అమేయ శక్తికి, అపూర్వ వ్యక్తిత్వానికి, సౌశీల్యానికి, నడవడికి, ఆదర్శప్రాయులు. వీరి వ్యక్తిత్వాన్ని జూచి సాక్షాత్తు శ్రీరాములవారే, స్వయంగా, మొట్టమొదటసారి చూచినప్పుడే ముగ్ధులయిపోయారట. 

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ 

మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ 

హనుమత్ స్మరణాద్భవేత్.

తాత్పర్యం: కేవలం హనుమంతులవారి స్మరణ మాత్రం చేత బుద్ధిబలం, యశస్సు(సత్కీర్తి), నిర్భయత్వం, రోగరాహిత్యము, అజాడ్యము, వాక్పటుత్వం  సిద్ధిస్తాయట. అటువంటిది వారి వ్యక్తిత్వం. 

వారి భక్తి స్వార్థరహితమైనది, అచంచలమైనది, పరిశుద్ధమైనది. తన కోసం యేమీ కోరని వ్యక్తి, కేవలం శ్రీరామ సేవ తప్ప. భౌతిక శక్తికి, పరాక్రమానికి మారు పేరు. రాక్షసులను చంపినవారు, విశాల  మహాసముద్రాన్ని లంఘించినవారు, లక్ష్మణుడిని రక్షించే నిమిత్తం హిమాలయాల నుండి ఒక పర్వతాన్నే మోసుకువచ్చిన ఘనులు హనుమంతులవారు. అద్భుతమైన వక్త, తర్కంలో నిష్ణాతులు, సమర్థవంతమైన రాయబారి. వేదాల జ్ఞానం కలిగినవారు, మొట్టమొదటి వయ్యాకరణులు (అంటే వ్యాకరణంలో నిష్ణాతులు) - ఒకసారి వాల్మీకి మహార్షినే సరిదిద్దినవారు. అస్సలు భయం లేనివారు, ముఖ్యంగా దుష్టశక్తులతో పోరాడటంలో అమితమైన ధైర్యాన్ని కనబరచేవారు. అమితమైన ఆత్మవిశ్వాసం, జన్మతః దివ్య ప్రయోజనం పట్ల ఆమోఘమైన స్పష్టత గలవారు. అసాధ్యమైనవి సాధించినప్పటికీ కూడా వారిలో అహంకారం ఉండేది కాదు, తన శక్తి-పరాక్రమాలను గురించిన ఆడంబరము ఉండేది కాదు. గొప్ప వినమ్రత గలవారు. తన విజయాలకు కారణం అంతా కేవలం శ్రీరాముని అనుగ్రహమేనని, తన శక్తులు కావని భావించేవారు హనుమంతుల వారు విధేయతలో పరాకాష్ఠ, ఇంద్రియ నిగ్రహము, స్థిరచిత్తము, గలవారు.
 
కాన్హా శాంతి వనంలో, యాత్రా గార్డెన్ లో సీతారామలక్ష్మణహనుమత్సమేత విగ్రహం
   
సహజమార్గ గురుపరంపరలోని మాస్టర్లు కూడా ఆధ్యాత్మిక చైతన్య వికాసాన్ని గురించి వివరిస్తున్నప్పుడు హనుమంతులవారిని స్మరించడం మనం గమనిస్తాం. ముఖ్యంగా 13 చక్రాల మన ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు 9 వ చక్రం చేరుకున్నప్పుడు హనుమంతులవారి చేతనాన్ని అనుభూతి చెందడం జరుగుతుందన్నారు. హను అంటే లేకపోవడం అని, మాన్ అంటే అహం. అంటే అహం లేనివాడు మాత్రమే భాకతుడవుతాడాని అర్థం. ఈ వాక్యాలు పూజ్య లాలాజీ పలికినవి. ఇదే అర్థం పూజ్య దాజీ కూడా పడే పడే ఇటమకించడం మనం గమణిస్తూనే ఉన్నాం. భక్తికి ప్రధాన యోగ్యత ఆహాన్ని త్యజించడమేనన్నారు లాలాజీ. అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోడాలచుకున్నవారు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పూజ్య దాజీ, హనుమాన్ లో రెండు గొప్ప లక్షణాలను ఉల్లేఖించారు 1) నేను నా స్వామితో కూడి ఉన్నంత సేపూ యేదీ తప్పవడానికి వీల్లేఎదన్న ధీరత్వం 2) వినమ్రత




1, ఏప్రిల్ 2025, మంగళవారం

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం 
ఒక పెద్ద వరం 

మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే బుద్ధి వికసించకపోయినా, ఆత్మ వికాసం జరుగకపోయినా మనిషి మనుగడ అసంపూర్ణమే, సమతౌల్యతలో కొరతే ఉంటుంది. ఈ వెలితుల కారణంగా ప్రతీ మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. వ్యక్తిత్వం సమగ్రంగా ఉండదు కూడా. పర్యవసానాలు అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. వ్యక్తిలో ఇటువంటి సమగ్ర పరివర్తన హార్ట్ఫుల్నెస్ సరళ ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతి సహజంగా తీసుకువస్తుంది; కొద్దిగా సమయం పట్టినా కూడా తప్పక జరుగుతుంది; ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. 
ఎందుకు వారం అంటే 
ఈ ధ్యాన పద్ధతి చాలా సరళమైనది. 
ఆధునిక జీవన విధానంలో తేలికగా ఇమిడిపోతుంది. 
నియమ-నిబంధనలు ఇంచుమించు లేవు. 
అర్హతలు చూడారు. చూసేదీ ఒక్క అరహాతే, మనలను మనం మార్చుకోటానికి సంసిద్ధంగా ఉన్నామా, లేమా? వ్యక్తి తనలో పరివర్తన రావాలని పరితపిస్తున్నాడా లేదా? అన్నదే ముఖ్యం. 
పూర్తిగా జీవిత పర్యంతం, ప్రతి వ్యక్తికీ వ్యక్తిగతంగా  మార్గదర్శనం అందుబాటులో ఉంటుంది, 
ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు. ఆధ్యాత్మిక శిక్షణ పూర్తిగా ఉచితం.  
అన్నీ సంస్కృతులలోనూ, ఎటువంటి నేపథ్యం కలిగినా, అందరిలో ఇబ్బంది లేకుండా తేలికగా ఇమిడిపోతుంది. 
దీనికి నమ్మకం కూడా అవసరం లేదు. నమ్మకం అనుభవంపై ఆధారపడఉంటుంది. అనుభవం ఉన్నచోట నమ్మకంతో పని లేదు. 
క్రతువులలేవు, తాంబూలాలు లేవు, గురువు పాదస్పర్శలు లేవు, గురు దక్షిణలు లేవు (కృతజ్ఞతతో కూడిన హృదయంతో, యథాశక్తి అందించే గురుదక్షిణలు తప్ప). 
ఈ ధ్యాన పద్ధతి, మనిషిలో సాధారణ ఒత్తిడిని తొలగించడం దగ్గర నుంచి దైవసాక్షాత్కారం వరకూ, ఇంకా మాట్లాడితే, అఆ తరువాత కూడా కొనసాగే అనంత యాత్ర వరకూ అడుగడుగునా సహాయపడే పద్ధతి. 
చాలా వరకు మనస్సాక్షిని అనుసరించడానికి సహాయపడే మార్గం. హయాఉతిక జీవనంలో రోజు-రోజుకూ హృదయంలో శాంతిని వృద్ధి చేసే జీవన విధానం. 
శాస్త్రాలలో ఉల్లేఖించిన నిగూఢమైన ఆధ్యాత్మిక స్థితులను తేలికగా అనుభవంలోకి తీసుకుయయగలిగే మార్గం. ఉదాహరణకు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తామరాకుపై నీటి బొట్టు వలె జీవించడం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా అందులోని ఆనందాన్ని పొందగలుగుతాం;  ఆత్మసమర్పణ యొక్క నిజమైన అర్థాన్ని ప్రత్యక్షానుభవం ద్వారా, సమీప అనుభూతిని  పొందవచ్చు. విలువలు అప్రయత్నంగా నెమ్మది-నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. 
వ్యక్తిలో ఉండే అపరిశుద్ధ తత్త్వాలను, జటిల మనస్తత్వాలను నిర్మూలించి, సరళంగా, స్వచ్ఛంగా తయారు చేసే మార్గం. 
కేవలం మూడు మాసాలలోనే,  త్రికరణ శుద్ధిగా చేసే ఈ యోగసాధన ద్వారా అపూర్వమైన మార్పులు చోటు చేసుకోవడం ఎవరైనా గమనించవచ్చు. ఇది ముందుకు సాగడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  
మోక్షసాధన మనకు అందుబాటులో ఉన్న విషయం సత్యమేనని,  మహాపురుసులు మనకు బోధిస్తున్నవి కేవలం గ్రంథాలకే పరిమితం కావని, అనుభవ జ్ఞానంలో సాధించవచ్చునన్న విశ్వాసం సగటు మనిషిలో కూడా ఏర్పడటం ఈ అనంత యాత్రలో పాల్గొనాలన్న ఉత్సాహం నిత్యనూతనంగా ఎన్నో ఇంతలు పెరుగుతూ ఉంటుంది.    

21, మార్చి 2025, శుక్రవారం

ఇప్పుడే, ఇక్కడే

ఇప్పుడే, ఇక్కడే 

84 లక్షల యోనుల  గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు. 

అలా  ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారుఇంత  మంది మానవుల్లో ఒక  ఆలుమగల జంట  ఏర్పడటంవాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో  ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని  ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడంతల్లి గర్భంలో ఆ పిండం పెరగడంఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడంనవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.

ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో, దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!

అక్కడి నుండి ప్రారంభమవుతుంది మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే  విధంగా? మొదట  ఆడబిడ్డా, మగ  బిడ్డా అని అడుగుతాం లింగం

ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నడా అంటాం రంగు.

ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక  జీవితాంతం ఇవి మన  తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.

మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.

వాటితోనే మన మనుగడను కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.

మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.

చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.  

 ఇవి ఉన్నంతవరకూ మనిషిలో వికాసం జరిగే అవకాశం ఉన్నట్లే. ఇది లేకపోతే మాత్రం, ఆదిశంకరులు చెప్పిన పునరపి జననం, పునరపి మరణం తప్పకపోవచ్చు. అలా ఎన్ని జన్మలో!!, 84 లక్షల జీవరాసుల్లో ఎక్కడ జన్మిస్తామో!! ఎవ్వరికీ తెలియదు.

అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.

ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి. 

మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు. 

ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. 

7, మార్చి 2025, శుక్రవారం

గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ - భారత మండపం - న్యూఢిల్లీ - ఫిబ్రవరి 21, 2025

 


గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ 
భారత మండపం - న్యూఢిల్లీ
ఫిబ్రవరి 21, 2025


పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ (PSSM) 2025, ఫిబ్రవరి 20 నుండి 23, వరకూ న్యూఢిల్లీలోని  ప్రతిష్ఠిత భారత మండపంలో, గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21, 2025 న హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో పూజ్య దాజీ ధ్యానాన్ని గురించి ప్రసంగం చేయడం, ఆ తరువాత అక్కడున్నవారికి, ధ్యానం యొక్క అనుభూతిని కలుగజేయడం జరిగింది. 

ప్రసంగంలో పూజ్య దాజీ పలికిన ముఖ్య  పలుకులు ఇలా ఉన్నాయి: 
నన్ను ధ్యానం మీద ముఖ్యంగా నిశ్శబ్దంగా జరుగుతున్న చైతన్య వికాసాన్ని గురించి, అంతరంగ శాంతిని గురించిన సైన్సును, అంతరంగ పరివర్తనకు సంబంధించిన విజ్ఞానాన్ని గురించి మాట్లాడమన్నారు మన నిర్వాహకులు. అదీ 4 నిముషాల్లో! నా పరిస్థితి మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడి పరిస్థితిలా ఉంది. 18 అధ్యాయాలు 5 నిముషాల్లో చెప్పవలసిన పరిస్థితి ఒకవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఇరువైపులా సేన మధ్య ఉన్న పరిస్థితిలా ఉంది. ఇరు పక్షాలూ ఒకర్నొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయడం నా వల్ల కాదంటాడు. కృష్ణ భగవానుడు నిస్సహాయుడుగా నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి అర్థమయ్యేలా ఎలా చెప్పడం అని అనుకుంటూ. నన్ను ఇక్కడ చైతన్య వికాసం గురించి, అంతరంగ పరివర్తనను గురించి మొత్తం అంతా 4 నిముషాల్లో చెప్పమన్నారు, నిర్వాహకులు నన్ను క్షమించాలి, ఈ పనికి మీరు పొరపాటు వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు మీరు. ఇది సాధ్యపడే వకాశం కూడా ఉండేది; కానీ వినేవాళ్ళు అర్జునుడిలా ఉండి, చెప్పేవాడు శ్రీకృష్ణుడిలా ఉండుంటే కొద్ది నిముషాల్లోనే ఇది సాధ్యపడుండేది.  కానీ దానికి ప్రాణాహుతి అవసరం. అర్జునుడి మానసిక స్థితిని మార్చడానికి, ఆతని చేతనంలో పరివర్తన తీసుకురావడానికి ఆయనకు ప్రాణాహుతి అవసరం అయ్యింది. ఆ విధంగా అతన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు. 
ముందు ధ్యానం అంటే ఏమిటో నిర్వచనం చేయాలి. ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. ఈ చేతనం అంటే ఏమిటి? కాబట్టి మనం ముందుగా ధ్యానం యొక్క ప్రయోజనంతో మొదలు పెడదాం. సరళంగా చెప్పాలంటే చైతన్య వికాసమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి మూడు శరీరాలున్నాయి - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరలో మనకున్న ఆయుష్షులో వికాసం జరగడం కుదరదు. అందులో వికాసం రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆత్మ, వికాసం చెందనవసరం లేదు. అది స్వఛ్ఛమైనది, మార్పులేనిది, నాశనం లేనిది. ముందే పరమ స్వచ్ఛంగా ఉన్నది మారడం గాని వికాసం చెందడం గాని ఎలా జరుగుతుంది? అవసరమే లేదు. కాబట్టి మార్పు చెందేది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరంలోని ప్రధాన భాగం చేతనం అనే నది. ఈ చేతనానికి, మనసు, బుద్ధి, అహంకారము సహాయపడతాయి. 
మనం ఈ మనసు, బుద్ధి, అహంకారాలను, చేతనాన్ని ప్రభావితం చేసేలా  మార్చాలనుకున్నప్పుడు ఇవి యే విధంగా పరివర్తన చెందేలా చేయాలి?  తద్వారా ఈ చేతనం, అధిచేతనం అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా, ఉపచేతనం అనే మహాసముద్రం లోలోతుల్లోకి మునక వేసేలా వికాసం చెందడానికి ప్రభావితం అవ్వాలంటే ఏమి చేయాలి? 
మనసు వికసించినప్పుడు, మనసు పరిణతి చెందినప్పుడు, అది చేసే పనిలో కూడా పరిణతి రావాలి. మనసు చేసే పనేమిటి? ఆలోచించడం. కాబట్టి మనసు వికాసం చెందినప్పుడు ఆలోచన కంటే మెరుగైన విధంగా మారాలి; ఆలోచన కంటే మెరుగైనాడేది? యంభూతి. మనసు అనుభూతిగా వికాసం చెండాలి. మెదడుతో ఆలోచించడం కంటే హృదయంతో అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అది ధ్యానంతో సాధ్యం. 
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అనే సాంకృత పదాన్ని, ఈ సంధిని విడగొడితే, ధీ + యానం అవుతుంది.  ఇక్కడ ధీ అంటే పరమోత్కృష్ట జ్ఞానం, లేక దివ్య జ్ఞానం. యానం అంటే  వాహనం; అంటే ధ్యానం అనేది దివ్యజ్ఞానానికి జేర్చే  వాహనం అన్నమాట. ధ్యానం అంటే అవ్యక్తంపై దృష్టిని కేంద్రీకరించడం. అయితే ప్రతీ వాహనానికి నడవాలంటే ఇంధనం అవసరం; ఇక్కడ ధ్యానంలోని యానానికి అవసరమైన ఇంధనం ఏమిటి? భౌతిక శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం, అంటే సమతౌల్య ఆహారం ఎలాగో, మనసుకు జ్ఞానం ఎలాగో, ఆత్మకు ఆహారం ప్రాణాహుతి శక్తి అలా  అవసరం.  నేను ఈ రోజు ఈ వేదిక నుండి ఉదఘోషిస్తున్నాను - ప్రాణాహుతి లేకుండా చైతన్య వికాసం అంగుళం కూడా  ముందుకు కదలదు. అందుకే ప్రాణహుతితో కూడిన ధ్యానం అందరికీ అవసరం. 
ఆ తరువాత ధ్యానంతో కార్యక్రమం ముగిసింది. 





7, జనవరి 2025, మంగళవారం

ఏకాత్మ అభియాన్ - హార్ట్ఫుల్నెస్

 


ఏకాత్మ అభియాన్ - హార్ట్ఫుల్నెస్ 

హార్ట్ఫుల్నెస్ సంస్థ 2024 వ సంవత్సరంలో ఆనాటి మధ్య ప్రదేశ్ ప్రభత్వ సహకారంతో ఏకాత్మ అభియాన్ పేరుతో, ఆ రాష్ట్రంలోని 42000 గ్రామాల్లో కోటి మందికి పైగా హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్పించడం జరిగింది. ఈ మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా ఎందరో ప్రశిక్షకులు, వలంటీర్లు భారత దేశ నలుమూలల నుండి వచ్చి నెలరోజులకు పైగా నిస్స్వార్థ సేవలనందించడం జరిగింది. 

అటువంటి కార్యక్రమమే ఈసారి, తెలంగాణాతో సహా మరో ఎనిమిది రాష్ట్రాలలో ఒక సంవత్సరంపాటుగా చేయాలని సంస్థ సంకల్పించింది. ఇందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకటన పూజ్య దాజీ జనవరి 1 వ తేదీన చేస్తూ, ఆసక్తిగల అభ్యాసులను, ప్రశిక్షకులను, అందరినీ ఈ యజ్ఞంలో పాల్గొనమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అందరికీ ఒక ముఖ్య సూచన చేశారు: "అందరినీ శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులుగా చేయడం మన లక్ష్యం కాదు. వారు నమ్ముతున్న దైవాన్ని, ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చని, ఆ అనుభవాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయడం. " ఇది మనందరి మనసులో ఉంచుకుంటూ పని చేద్దాం.  

కావున   అటువంటి ధ్యానానుభూతిని తెలంగాణాలోని అన్ని  గ్రామాల్లో ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయడానికి మనందరమూ మనకున్న భక్తిప్రపత్తులతో, ఉత్సాహంగా పాల్గొందాం; రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుదాం.    



1, జనవరి 2025, బుధవారం

ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం

 



ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం 

పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అద్భుత ప్రకటన చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2025 లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమర్థగురు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (పూజ్య లాలాజీ ), శ్రీరామ చంద్ర మిషన్ ఆదిగురువుల వార్షిక జన్మదినోత్సవాన్ని ఈసారి ఆది శక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నామని ప్రకటించారు. దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం అమలులో ఉన్న విద్యను, తరువాతి తరాల వారికి ఆ అందించడానికి వారసులు ఎవరూ లేక కాలగర్భంలో కనుమరుగైపోయిన  ప్రాణాహుతి ప్రసరణ విద్యను పునరుద్ధరించిన మహాత్ముడు  పూజ్య లాలాజీ మహారాజ్. ఆయన జన్మదినాన్ని అంటే ఫిబ్రవరి 2 వ తేదీన మనం ఆదిశక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నాం. 

ప్రాణాహుతి శక్తే ఈ ఆది శక్తి సృష్టి ఆరంభానికి పూర్వం ఉన్న శక్తిని ఆది శక్తి అని దాజీ తెలియజేయడం జరిగింది. మరొక సందర్భంలో ఈ ప్రాణాహుతి  ప్రసరణతో ఆధ్యాత్మిక శిక్షణానందించిన మహర్షి పేరు  కూడా పూజ్య దాజీ ఋషభ్ నాథ్ అని కూడా సూచించడం జరిగింది.  

ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారానే హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ్ ఆధ్యాత్మిక శిక్షణ అందించడం జరుగుతూ ఉంది. ప్రాణాహూతితో కూడిన  ధ్యానమే హార్ట్ఫుల్నెస్ విశిష్టత. ప్రాణాహుతి శక్తి లేక ఈ ఆది శక్తి, మూలం నుండి ఒక ఉత్కృష్ట స్థాయి యోగి హృదయం ద్వారా ధారగా ప్రవహించే శక్తి. 

ప్రాణాహుతి ఆత్మను మూలంతో అనుసంధానం చేస్తుంది ఆత్మకు మూలం యొక్క అంజుభూతిని కలిగించడం ద్వారా మూలాన్ని గుర్తు చేస్తుంది; మూలానికి తిరుగు ప్రయాణమయ్యేలా హృదయ పరివర్తన కలిగిస్తుంది. సంస్కార బీజాలను దగ్ధం చేస్తుంది. వికారాలను నశింపజేస్తుంది; చంచల మనస్సును క్రమబద్ధం చేస్తుంది; మానసిక ప్రశాంతతనువృద్ధి చేస్తుంది; కోరికలను తగ్గిస్తుంది. దివ్యప్రేమను, పరిశుద్ధ ప్రేమను, అకారణ ప్రేమను, అనుభవంలోకి తీసుకువస్తుంది. ఆత్మను ఆవరించి ఉన్న కలుపుమొక్కలను తొలగిస్తుంది; ఉన్నతోన్నత చేతనాస్థితుల అనుభూతిని కలిగిస్తుంది; అలుముకున్న అంధకారాన్ని నిర్మూలిస్తుంది; ఆహాన్ని వినమ్రతగా మారుస్తుంది; జీవితాలను శుద్ధి చేసి, సరళం చేస్తుంది. 

ఈ మహత్తర ఆది శక్తి మహోత్సవానికి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరూ విచ్చేసి ప్రాణాహుతి వృష్టిని అనుభూతి చెందుదురుగాక. 



28, డిసెంబర్ 2024, శనివారం

ధీశక్తి - ధ్యానం - 3

 


ధీశక్తి - ధ్యానం - 3 

సంకల్పం 
(Will, Suggestion)  
ఆధ్యాత్మిక సందర్భంలో సంకల్పం అంటే ఇచ్ఛాశక్తితో కూడిన ఆలోచన. 
ఆలోచన + ఇచ్ఛాశక్తి = సంకల్పం 
సంకల్పాలు లేనిదే యేమీ జరగవు జీవితంలో. ఈ సూత్రం మామూలు సాంసారిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా వర్తిస్తుంది. వాడుక భాషలో చెప్పుకోవాలంటే సంకల్పం అంటే మనసులో అనుకోవడం. మనసులో అనుకోకుండా ఏ పనీ చేయలేం. ఉదాహరణకు ఉదయం  గంటలకు లేవాలి అని మనసులో రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటేనే మనం ఆ సమయానికి లేవగలుగుతాం. మన శరీర వ్యవస్థ లేదా ప్రకృతి విచిత్రంగా ఈ సంకల్పానికి స్పందిస్తుంది. ఇది మనందరి అనుభవమే. అనుకుంటే జరిగి తీరుతుంది. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే , ఎంత పవిత్రమైనదైతే  అంతా త్వరగా నెరవేరుతుంది. 
సాంసారిక జీవనంలో Think, Do, and  Achieve అంటారు. అంటే సంకల్పించుకోవడం, సంకల్పం పనిగా తర్జుమా కావడం, ఆ తరువాత సంకల్పించినదాన్ని సాధించడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనంలో Think and Achieve అంటే సంకల్పం చేసుకోగానే, సాధించడం జరుగుతుంది అని అనేవారు చారీజీ. అందుకే హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధనలో ధ్యానం ప్రారంభించే ముందు ఒక సంకల్పం చేస్తాం, ఆ సంకల్పమే ధ్యానంగా మారిపోతుంది. 

అయితే ఈ సంకల్పం ఎంత సూక్ష్మంగా చేసుకోగలిగితే అంత శక్తివంతంగా, అంతా త్వరితంగానూ సాకారమవుతుంది. సంకల్పం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లయితే అటువంటి సంకల్పాన్ని దివ్య సంకల్పం అని అంటాం. అటువంటి సంకల్పాలు వెనువెంటనే సాకారమవుతాయి. మన సాధన అంతా కూడా మన సంకల్పాలు దివ్య సంకల్పాలుగా మారే దిశగానే కొనసాగాలి. 

సంకల్పంలో పవిత్రతా భావం, సూక్ష్మ ఆలోచనా శక్తి, తగినంత  ఇచ్ఛాశక్తి కీలకం. మనిషి సంకల్పం, దైవసంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు అవి నెరవేరుతాయి. దీనికి ఆధ్యాత్మిక సాధన కీలకం. అప్పుడు జీవితమే దైవసంకల్పానికి అనుగుణంగా నడుస్తూ ఉండే అవకాశం ఉంటుంది. 

(సశేషం ...)


భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...