22, డిసెంబర్ 2021, బుధవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 2 - గ్రంథ పరిచయం

 విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ -  గ్రంథ పరిచయం 

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనేది  హార్ట్ఫుల్నెస్  (శ్రీరామచంద్ర  మిషన్) సంస్థ యొక్క  పరమపవిత్ర  గ్రంథం. దివ్యలోకాల్లో  ఉండేటువంటి  ఎందరో  మహాత్ముల  నుండి అందుకున్న  దివ్య  సందేశాలు.  ఈ  సందేశాలని  ఇచ్చినవారిలో  శ్రీకృష్ణభగవానుడు, రాధాదేవి, స్వామి  వివేకానంద, బుద్ధ భగవానుడు,  ఏసుక్రీస్తు,     శ్రీ రామకృష్ణ  పరమహంస,  కబీరు, చైతన్య మహాప్రభువు, గురు  నానక్, లాలాజీ,  బాబూజీ, చారీజీ, ఇంకా  ఎందరెందరో  మహాత్ములున్నారు. ఈ  గ్రంథం  వీళ్ళందరూ  ఇచ్చిన  సందేశాల  సమాహారం. ఈ  సందేశాలను  అతిఉత్కృష్టమైన ధ్యాన  స్థితిలో  అందుకున్నవారు  శ్రీమతి  హెలీన్  పైరే గారు, ఒక  ఫ్రెంచి  దేషస్థురాలు, అభ్యాసి. వీరిని  శ్రీరామచంద్ర  మిషన్,  హార్ట్ఫుల్నెస్  అభ్యాసులందరూ  ఎంతో  శ్రద్ధతో  మదర్ అని  ఆప్యాయంగా  పిలుచుకుంటారు. 

మదర్  హెలీన్  పైరే  ఈ  సందేశాలను  1990  నుండి  అందుకోవడం  ప్రారంభించారు.  2018  వరకూ  కొన్ని  వేల  సంఖ్యలో  అందుకోవడం  జరిగింది;  ఇంచునమించు  ప్రతీ  రోజూ  అందుకోవడం  జరిగింది. ఇంతకు  ముందు  ప్రస్తావించినట్లుగా,  ఇన్ని  సందేశాలు  అందుకోవడం ప్రపంచ  ఛానలింగ్  చరిత్రలోనే  ఇది  మొట్టమొదటిసారి. 

ఈ  సందేశాల  సంకలనానికి హార్ట్ఫుల్నెస్  సహజమార్గ  గురుపరంపరలోని  మూడవ  గురువు,  రెండవ  అధ్యక్షుడు  అయిన పూజ్యశ్రీ  పార్థసారథి  రాజగోపాలాచారీజీ  ఒక  గ్రంథరూపంగా రూపొందించి, ఈ  గ్రంథానికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేసి  2005 ఏప్రిల్ 30వ తేదీన  తిరుప్పూరులో  బాబూజీ  జయత్యుత్సవాల్లో  విడుదల  చేశారు.  ఈ  మహాత్ములందరూ  మానవ ఉద్ధరణ  కోసం సూక్ష్మ రూపంలో  ఉండేటువంటి  లోకమే  ఈ  బ్రైటర్ వరల్డ్.  నిగూఢమైనవి,  గుహ్యమైనవి అయిన ఈ  దివ్యోపదేశాలన్నీ  కూడా  చెవిలో  రహస్యంగానే  ఉపదేశించడం  అనేది  అనాదికాలం  నుండి  జరుగుతూ  ఉన్నదే.  వీటిని  ఆంగ్లంలో  విస్పర్స్ అంటారు.  అందుకే  పూజ్య  చారీజీ  వీటికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేశారనిపిస్తుంది. 

ఈ  సందేశాలు  ఈ  భూమ్మీదున్నప్పుడు  అద్భుతమైన  దైవకార్యాలను  నిర్వహించినటువంటి  మహాత్ముల  నుండి, ఎన్నో  సంస్థలు  ఏర్పాటు  చేసినటువంటి  మహాత్ముల  నుండి అందుకోవడం  జరిగింది.  చాలా  వరకూ  ఈ  సందేశాలు  బాబూజీ  వద్ద  నుండి  అందుకున్నవే ఉన్నాయి. వీరందరూ  ఇప్పుడు  ఒక్కటిగా,  ఐక్యంగా  ఈ  బ్రైటర్ వరల్డ్ లో  ఉంటూ  మానవ  ఆధ్యాత్మికోద్ధరణకు  కృషి  చేస్తూ  ఉన్నారు;  వారి  ప్రణాళికను  భౌతికంగా  మన మధ్య  ఉన్న  సజీవ  మాస్టరు  ద్వారా  అమలు  చేస్తూ  ఉన్నారని  ఈ  సందేశాల  ద్వారా  మనం  చదువుకున్నప్పుడు  తెలుస్తుంది. 

ఇక  ఈ  సందేశాల్లోని  విషయానికొస్తే, ఇవన్నీ  కూడా  కేవలం  శ్రీరామ చంద్ర  మిషన్  లోని  అభ్యాసులకు  మాత్రమే  కాదు,  యావత్  మానవాళి  శ్రేయస్సును  ఉద్దేశించి  మనిషి జీవితం  యొక్క  అన్ని  పార్శ్వాలను  స్పృశిస్తూ, మానవాళి  భవిష్యత్తుకు  సంబంధించిన సందేశాలను,  మాస్టర్లను  గురించి,  నిగుఢ  ఆధ్యాత్మిక  సత్యాలను  గురించి  చాలా  సరళంగా  ఈ  సందేశాల  ద్వారా  అందించడం  జరిగింది. ఈ  గ్రంథాన్ని  గురించి  పూజ్య  చారీజీ  మహారాజ్  అనేక  సందర్భాల్లో  అనేక  ప్రసంగాల్లో  మాట్లాడిన  విషయాలను  తరువాయి  భాగంలో  తెలుసుకుందాం. అలాగే  పూజయ్ దాజీ  ప్రసంగాల్లో  చెప్పినవి  కూడా  తెలుసుకునే  ప్రయత్నం  చేద్దాం. అలాగే  మన  మదర్  హెలీన్  పైరే  గురించి  పూజ్య దాజీ  వివరించిన  అంశాలను  కూడా  తెలుసుకుందాం.

అయితే  ఈ  ప్రకంపనలు  ఏ  విధంగా  అందుకున్నదో  మనం  ఇంతకు  పూర్వం  చెప్పుకున్నాం. అంటే  శబ్ద రూపంలో  అందుకున్న  ఈ  సందేశాలను, (సంస్కృతంలో శబ్దం  అంటే  వైబ్రేషన్, అంటే  ప్రకంపన) మదర్  తన  మాతృభాష  అయిన  ఫ్రెంచి  భాషలో  తర్జుమా  చేయడం  జరిగింది.  ఆమేకు  ఫ్రెంచి  భాష  తప్ప  మరొక  భాష  రాదు. పూజ్య  చారీజీ  ఆ  సందేశాలందుకునేవారు  తెలుగు  వారై  ఉండుంటే  ఈ  సందేశాల మూలం  తెలుగు  భాషలో  ఉండేవని  చెబుతూండేవారు.  కాబట్టి  ప్రస్తుతం  ఈ  సందేశాలన్నీ  కూడా  ఫ్రెంచి  భాషలో  ఉన్నాయి.  వాటిని  ఆంగ్లంలొకి  తర్జుమా  చేసిన  తరువాత  పూజ్య  చారీజీ  ఆమోదించిన  తరువాత  అభ్యాసులు  చదువుకోవడానికి  అందించేవారు. ఆ  తరువాత  పూజ్య  దాజీ  ఆ  బాధ్యతలను  స్వీకరించారు. 2018, జూన్ లో  ఆమె  పరమపదించే వరకూ  ఈ  ప్రక్రియ  కొనసాగింది.  (సశేషం)


20, డిసెంబర్ 2021, సోమవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 1 - ఛానలింగ్

ఛానలింగ్ 

విస్పర్స్  ఫ్రమ్ ది  బ్రైటర్ వరల్డ్ అనే  అద్భుతమైన  ఉద్గ్రంథాన్ని  పరిచయం  చేసే  ముందు  మనం  ఛానలింగ్  అనే  ప్రక్రియను  గురించి  కొంచెం  తెలుసుకుందాం. ఛానలింగ్  అంటే  ఇతర లోకాలతో సంపర్కం  కలిగి,  ఆయా లోకాల  సమచారాన్ని  గాని,  ఇంతకు  ముందు  భూమ్మీదున్న  మహాత్ముల ఆత్మలు  గాని,  ఇతర  లోకాల  మహాత్ములతో  గాని  సంపర్కం  కలిగి  వారందించే  సమాచారాన్ని  గాని,  సందేశాలను  గాని  అందుకొని  ఈ  లోకానికి  అందజేయగలిగేటువంటి  ఒక అత్యున్నత  సహజ ప్రజ్ఞతో  కూడిన ఒక మానస ప్రక్రియ.  ఇది  ఉత్కృష్ట  శ్రేణికి  చెందిన  ఛానలింగ్  ప్రక్రియ.

ఈ  ప్రజ్ఞ  ద్వారా ఇతర  ఉన్నత  లోకాల్లో  ఉన్న  మహాత్ములతో  సంభాషించగలగడమే  కాదు, ఇతర  లోకాల్లో  సంచరిస్తున్న గతించిన ఆత్మలతో  కూడా  సంపర్కం  ఏర్పాటు  చేసుకుని  సమాచారాన్ని  గాని  సందేశాలను  గాని  అందుకొనే  మాధ్యమాలుగా  పని  చేసేవారున్నారు. 

మన  భాషలో  అర్థం  చేసుకోవాలంటే,  ఆ  వ్యక్తికి  ఇతరలోకాల  భాష  వచ్చి  ఉండాలి,  మన  లోకంలోని  భాష  వచ్చి  ఉండాలి;  అప్పుడు  ఆ  భాషలోని  సందేశాలను  మన  భాషలోకి  తర్జుమా  చేసేవాళ్ళన్నమాట.  

అయితే  పైన  చెప్పినట్లుగా  అటువంటి  ఉన్నత  కోవకు  చెందిన  ప్రజ్ఞ,  మహాత్ముల  సందేశాలను  అందుకోవాలంటే  అటువంటి  ప్రజ్ఞ  జన్మతః అంటే  పుట్టుకతోనే  ఉండాలంటారు పెద్దలు.  దానికి  ధ్యానం  తోడైనప్పుడు  అటువంటి  సూక్ష్మ  లోకాలతో  సంపర్కం  ఏర్పడి, ఆ  మహాత్ములు  ఈ  లోకానికి  అందించవలసిన సందేశాలు  ఈ  మాధ్యమాల  ద్వారా  పంపించడం  జరుగుతూ  ఉంటుంది. అటువంటి  సందేశాలు  మానవ  కళ్యాణానికి,  ఆధ్యాత్మిక  వికాసానికి,  భవిష్యత్ప్రణాళికకు  ఎంతగానో  ఉపయోగపడాలని,  అప్పుడప్పుడు  హెచ్చరించడం  కోసం  ముందస్తుగానే  తగిన  చర్యలు  తీసుకునే  విధంగా  ఆదేశాలు  కూడా  ఇస్తూ  ఉంటారు. ఇలా  అనేకమైన  ప్రయోజనాలున్నాయి  ఇటువంటి  సందేశాల  వల్ల.

అయితే  ఈ  ప్రక్రియను  అనుభవించడం  అనేది  అంత  తేలికైన  విషయం  కాదని  అర్థమవుతున్నది.  ఒక రకమైన  ప్రసవవేదనే  అని  తెలుస్తుంది  వీరి  జీవితాలను  గమనిస్తే.  కాని  అటువంటి  సేవలను  ఈ  మానవాళికి  అందించడమే  గొప్ప  సేవగా  భావిస్తూ  ఈ  సేవలకు  ఉపక్రమిస్తారు  ఈ  మాధ్యమాలు. 

ఇలాగ  ప్రపంచ  చరిత్రలో  ట్రాన్స్ ఛానలింగ్  చేసే  మాధ్యమాలు  చాలా  మందున్నారు. ఏసు  క్రీస్తు  వంటి  మహాత్ముల  నుండి, ఇంకా  ఇతర  మహాత్ముల  నుండి  సందేశాలు  అందుకున్నవారున్నారు. ఇదేమీ  ప్రపంచానికి  కొత్త  కాదు.  అయితే  మానవలోకంలో అన్ని విద్యల్లో  నకిలీ  విద్యలున్నట్లుగానే  ఇక్కడ  కూడా  నకిలీ  మాధ్యమాలున్నారు, తస్మాత్  జాగ్రత్త! జాగ్రత్త!

ఈ  మాధ్యమాలు  స్త్రీలు  కావచ్చు,  పురుషులు  కావచ్చు. వాళ్ళల్లో  అత్యున్నత  స్థాయికి  చెందిన  సూక్ష్మగ్రాహ్యత,  సున్నితత్త్వం,  సూక్ష్మాతి  సూక్ష్మ  తరంగాలను  గ్రహించగలిగే  సామర్థ్యమే  గాక  వాటిని  మన  భూలోక  భాషలోకి  తర్జుమా  చెయ్యగలిగేటువంటి  సామర్థ్యాలుంటాయి. సాధారణంగా  ఆధ్యాత్మిక  సాధకులుగా  ఉంటారు వీరు.  వీరినే  ఆంగ్లంలో  స్క్రైబ్  అని  అంటారు, తెలుగులో  లేఖరి  అనవచ్చు. 

అటువంటి  అత్యున్నత  కోవకు  చెందిన  స్క్రైబే  మనం  మదర్  అని  పిలుచుకొనే  మేడం  హెలీన్  పైరే. ఈమె  ఫ్రెంచ్ దేశస్థురాలు.  వీరిని గురించి  తరువాయి  భాగాల్లో  వివరంగా  తెలుసుకొనే  ప్రయత్నం  చేద్దాం. (సశేషం)


21, నవంబర్ 2021, ఆదివారం

గీతా హృదయం - అధ్యయనం (క్లుప్తంగా)

                                      

గీతా హృదయం - అధ్యయనం (క్లుప్తంగా)   
 కిరీటి, సవ్యశాచి, విజయుడు, పార్థుడు, గాండీవధారి వంటి అద్భుత పరాక్రమానికి   సంబంధిచిన  బిరుదులు  సంపాదించిన  అర్జునుడు తాను  ధర్మపక్షాన  యుద్ధాన్ని  చేస్తున్నాడన్న  వాస్తవాన్ని  మరచి,  ధర్మానికి  ప్రతినిధిత్వం వహిస్తున్నాడన్న సత్యాన్ని  మరచి, తన  క్షాత్ర ధర్మాన్ని  విస్మరించి, యుద్ధన్ని  వ్యక్తిగతంగా  తీసుకోవడం  వల్ల, ఎదురుగా  కనిపిస్తున్న  బంధుమిత్రజనమే  కనిపించడం వల్ల దుఃఖం చెంది,  ఆ  దుఃఖం శోకంగా  మారి,  శోకం  విషాదంగా మారిపోయి  అంతటి  ధీరుడు  భీరువుగా మారిపోయి  రెండు  సైన్యాలు  యుద్ధసన్నద్ధులై  ఎదురెదురుగా నిలబడిన  క్షణంలో యుద్ధం  చెయ్యనని  నిశ్చయించుకున్న  అర్జునుడిని  మరల తన  కర్తవ్య బోధను చేసి, మళ్ళీ  అతన్ని  ఉత్తిష్ఠుడిని  చేసే ప్రయత్నంలో  పలికిన  భగవానుడి  పలుకులు  ఈ  ఏడు శ్లోకాల్లో  నిక్షిప్తమై  ఉన్నది. ఈ  ఏడు  శ్లోకాల  ద్వారా మనం  ఇప్పుడు  చదువుకుంటున్న  గీతాసారాన్ని  అర్జునుడి  హృదయంలో  నిక్షిప్తం  చేసి  యుద్ధానికి  ఉద్యుక్తుడిని  చేశాడు  భగవానుడు. 

ఈ  ఏడు  శ్లోకాలను  పరిశీలిస్తే, శ్రీకృష్ణుడు  అర్జునుడిలో ఏ  విధంగా  ఆతనిలో వివిధ రకాల  స్థితులను  అనుభవింపజేసి, ఆతని చైతన్యంలో  పరివర్తన  కలిగేలా  చూశాడో అర్థమవుతుంది.   

మొదటి శ్లోకం ద్వారా  అందించిన స్థితి - స్థితప్రజ్ఞత్వం 

రెండవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - క్రోధం ఎలా ఉద్భవిస్తుంది?

మూడవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  -  క్రోధం ఏ విధంగా మనిషిని  అథోగతిపాలు  చేస్తుంది? 

నాల్గవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి - మనోనిగ్రహం ద్వారా మనిషి ఏ విధంగా విముక్తుడవుతాడు?

అయిదవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - మనశ్శాంతి  లేకుండా  సంతోషం  లేదు. 

ఆరవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  -  పరధర్మం కంటే స్వధర్మమే  మేలు

ఏడవ శ్లోకం ద్వారా  అందించిన స్థితి  - కర్మ చెయ్యకుండా  నైష్కర్మ్య సిద్ధి పొందలేము 

కృంగిపోయిన  అర్జునుడు, ఇలా  ఏడు  రత్నాల  ద్వారా పరివర్తన  చెందిన  చైతన్యంతో,  తిరిగి  తన ధర్మాన్ని  నిర్వర్తించడానికి సిద్ధమవుతాడు. 

భౌతిక ప్రపంచంలో మానవులకు ధర్మాధర్మాల మధ్య యుద్ధం అంతరంగంలో  నిత్యం  జరుగుతూనే  ఉంటుంది. అలాగే  ఆధ్యాత్మిక  సాధకులు  ఆత్మ-అనాత్మ వివేకం  కోసం  నిత్యం  పరితపిస్తూ  ఉంటారు. ఈ  యుద్ధాలన్నీ  హృదయంలోనే  ప్రతీ  మనిషిలోనూ  జరుగుతూ  ఉంటుంది  కాబట్టి శ్రీకృష్ణుడు బోధించినది  అప్పటికీ, ఇప్పటికీ  ఎప్పటికీ  వర్తిస్తుంది. 

కావున  పూజ్య  బాబూజీ  పూజ్య  దాజీ  ద్వారా ఆగష్టు 29, 2021 న  వెల్లడి  చేయించిన  ఈ  గీతాహృదయంలోని  ఈ  ఏడు  రత్నాలను  కేవలం  శ్రవణమే  గాక, మనన, నిధిధ్యాసనల  ద్వారా సాక్షాత్కారింపజేసుకుని  మనందరమూ  మన  జీవితాలను  తరింపజేసుకొనే  ప్రయత్నంలో ఎల్లప్పుడూ  ఉందాం.  

తరువాయి  భాగాల్లో  ఈ  శ్లోకాలను  వివరంగా అధ్యయనం  చేసే  ప్రయత్నం  చేద్దాం. 

(సశేషం) 

గీతాహృదయం 4 - పూజ్య దాజీ ప్రసంగం

                       

నమస్తేజీ!  హ్యాపీ జన్మాష్టమి.

గీతాబోధలు సనాతనమైనవి, కాలాతీతమైనవి. మనకు ఏదో రకంగా
ప్రేరణనందిస్తూనే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రేరణలు ఎంత గొప్పవైనప్పటికీ 
కూడా మనం తపిస్తున్నటువంటి ఆ సత్యాన్ని సాక్షాత్కరించే దిశలోకి తీసుకువెళ్ళవు.
ఉన్నతకోవకు చెందిన ఎందరో పేరున్న ఆచార్యులు, ప్రబోధకులు మనకు స్థితప్రజ్ఞత్వ 
స్థితికి చేరుకోవడం చాలా శ్రేష్ఠం అని  చెప్పడం జరిగింది. అందులో సందేహం 
లేదు. అలాగే మనిషికి ఎప్పుడూ కర్తృత్వభావం ఉండకూడదన్నారు, తానే అన్ని 

పనులు చేస్తున్నానన్న స్పృహ ఉండకూడదు.  నిజమే బాగానే ఉంది.


ఆకలిగా ఒక  5 స్టార్ హోటల్ కు   వెళ్ళి కేవలం  మెనూ చదివితే  కడుపు 
నిండుతుందా? తృప్తిగా ఉంటుందా? మనం  వీటిని చదువుతున్నాం. ఈ భావాన్ని 
ద్రష్టగా చూడటం ఎలా? ఆ స్థితప్రజ్ఞ స్థితికి, ఆ సమతౌల్య స్థితికి చేరుకోవడం ఎలా? 
అటువంటి ఉన్నతస్థితులకు చేరుకోవడం ఎలా? ప్రత్యక్షానుభవంతో ఈ స్థితులకు 
చేరుకోగలిగే  సాధనను చేపడితే  తప్ప, కేవలం చదవడం వల్ల గాని, కేవలం 
శ్రవణం చేయడం వల్ల గాని ఏ ప్రయోజనమూ లేదని మన  పరిశీలన తెలుపుతూ 
ఉన్నది. ఈ  ప్రయోజనం సిద్ధించడం కోసం అవసరమైన మార్గాల విషయంలో 
మనందరమూ ఎప్పుడూ అంధకారంలోనే ఉన్నాం. వాళ్ళు చేసిన, చేస్తున్న అన్ని 
ప్రవచనాల్లో కూడా ఈ మేరకు ఎటువంటి జాడ  కానరాదు. ఫలితంగా వీటిని 
వింటున్నవారందరూ కేవలం పదే  పదే  గీతా పారాయణం చేస్తే చాలన్న పొరపాటు 
నిర్ధారణకు వచ్చేస్తున్నారు. “నేను కర్తను  కాదు”, “అహం  బ్రహ్మాస్మి” అని  
మనసులో అనుకుంటే సరిపోతుందా? పారయణ చేయడంతో మన  వంతు 
ప్రయత్నం అయిపోయిందనుకోవడం నిజానికి ఒక  భ్రమలో ఉండిపోవడం 
అవుతుంది; ఇది  మన  పురోగతికి అడ్డుగోడవుతుంది. సరైన ఫలితాలు 
సాధించాలంటే సరైన మార్గాలను అనుసరించాలి మనం. సరైన  సాధన వల్ల కలిగే 
స్థితప్రజ్ఞ స్థితి గాని, గీతాచార్యుడు చెప్పినటువంటి పద్మపత్రమివాంభస అనే  స్థితి 
గాని, సాక్షి భావం గాని, శరణాగతివంటి ఆనందకరమైన స్థితులు గాని లేక  
నిష్కామ కర్మ స్థితి గాని అప్పుడే కలిగే అవకాశం ఉంటుంది. కేవలం “నేను 
సాక్షిని”,  “అహం  బ్రహ్మాస్మి” అని  మనసులో  జపించడం వల్ల ఈ స్థితులు 
సిద్ధిస్తాయా? దయచేసి ఆలోచించండి.

ఇది  అంత  తేలికై  ఉంటే ఈపాటికి  విన్నవారూ,  ఇలా  జపం  చేసినవారందరూ
  
శ్రీకృష్ణ  భగవానుడు  ఎన్నో  రకాలుగా  గీతలో  సూచించిన  స్థితులను సాధించి  

ఉండేవారు.  నా  పరమపూజ్య  గురుదేవులు పూజ్యశ్రీ  బాబూజీ మహారాజ్ ఎంతో 

కృపతో వెల్లడించిన గొప్ప సత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి 

సావధానంగా ఎంతో జాగ్రత్తగా వినండి.

మనం  ఒక్కసారి మహాభారత యుద్ధ సన్నివేశంలోకి వెడదాం. యుద్ధం 
ప్రారంభమవబోతోంది. అర్జునుడు విషాదంలోకి  కూరుకుపోయి యుద్ధం 
చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. మనకు ఈరోజు అందుబాటులో ఉన్న 
700  శ్లోకాల గీత  చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడికి అక్కడ ఎంత  సమయం ఉందో 
ఒక్కసారి అంచనా వెయ్యండి. రెండు సైన్యాలు ఎదురెదురుగా యుద్ధానికి 
సన్నద్ధమై ఉన్నాయి, యుద్ధం ప్రారంభించడానికి శంఖాలు పూరించడం 
జరిగిపోయింది. శ్రీకృష్ణ భగవానుడి వద్ద విషాదంతో నిండిపోయిన అర్జునుడికి  
బోధలు చేసి మళ్ళీ సరైన త్రోవలో పెట్టడానికి, అతన్ని యుద్ధానికి సన్నద్ధుడిని 
చెయ్యడానికి భగవానుడికి ఎంత  సమయం ఉందో కొంచెం ఆలోచించండి.
పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్న 700  శ్లోకాలు చెప్పాలంటే కనీసం కొన్ని గంటలైనా 
పడుతుంది. అటువంటి కీలకమైన క్షణంలో ఇది  కుదిరే పనేనా? ఆయన కొద్ది 
నిముషాలు మాత్రమే అర్జునుడికి చెప్పవలసినది చెప్పడానికి తీసుకుని  ఉంటాడని 
అర్థమవుతుంది, పరిశీలిస్తే.

వాస్తవం ఏమిటంటే,  శ్రీకృష్ణ భగవానుడు నిజానికి అర్జునుడికి, ఆ క్షణంలో 
అతనికి అవసరమైన మానసిక స్థితులన్నిటినీ కేవలం కొద్ది నిముషాల్లోనే 
అతనిలోకి ప్రసరించడం జరిగింది. నిజానికి ఆ స్థితులన్నీ కూడా సాధకుడు తన  
ఆధ్యాత్మిక యాత్రలో వీటి గుండా ప్రయాణించే స్థితులు. ఈ ప్రక్రియ అర్జునుడిని  
వెంటనే ఒక  ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి జేర్చి,  అతని హృదయంలో ఉన్న అవసరం 
లేని మోహాన్ని  తొలగించి వేస్తుంది.

అటువంటి సమ్ర్థుడైన వ్యక్తిత్వం అందుబాటులో ఉన్నట్లయితే అది  ఈ రోజు  
కూడా సాధ్యమే.కాని మనం  సాధారణంగా గమ్నిస్తున్నదేమిటంటే జనం  గీతను 
తమ  జీవితం అంతా వింటూనే ఉంటారు, పారాయణం చెస్తూఁటారు తప్ప 
అందులో ఉన్న స్థితులను అనుభవంలోకి కొంచెం కూడా తెచ్చుకోలేకపోతున్నారు. 
గీతా సారం వాళ్ళ హృదయాన్ని అస్సలు స్పృశించదు. గీతను ఇన్ని 
సంవత్సరాలుగా వింటున్నప్పటికీ కూడా ఎమతమది అర్జునుడిలా తమ విషాదంలో 
నుండి బయట  పడగ్లిగారు? 

వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ప్రసరించడం జరిగింది, 
వ్యాస మహర్షి ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది.. ఆయన  ఈ 
ప్రసరించిన జ్ఞానాన్ని శ్లోక రూపంలో తర్జుమా చేయడం జరిగింది. ఇది  అర్థం  
చేసుకోవడం  చాలా  ముఖ్యం -  అక్కడ  యుద్ధరంగంలో  శ్రీకృష్ణుడికి,  
అర్జునుడికీ  మధ్య  జరిగిందేమిటంటే,  మాటల్లో  కాకుండా  మరోరకంగా    
జ్ఞానాన్ని  ప్రసరించడం  జరిగింది;    ప్రసరణను  వ్యాస భగవానుడు    
తరువాత శ్లోకాల  రూపంలో తర్జుమా చేయడం  జరిగింది.  
 
ఈ విధంగా, వ్యాసమహర్షి సాక్షిగా, శ్రీకృష్ణ భగవానుడు తన  హృదయం నుండి 

అర్జునుడి హృదయానికి,హృదయంనుండి హృదయానికి ప్రసరించిన జ్ఞానాన్నే 

అందులో నిక్షిప్తమైయున్న  ఆధ్యాత్మిక స్థితులను, ఉద్వేగాలను, శ్లోకాల రూపంలో  

తర్జుమా  చేసినదాన్నే మనం    రోజున భగవద్గీతగా చదువుకుంటున్నాం.

నిజానికి  మౌఖికంగా పలికిన శ్లోకాలు కేవలం ఏడు  మాత్రమే. అర్జునుడికి ఈ ఏడు  
రత్నాలను ఏడు  శ్లోకాల ద్వారా అందించడం జరిగింది. వ్యాస మహర్షి వారివురి 
హృదయాల మధ్య జరిగిన సంభాషణ యొక్క తర్జుమా గాకుండగా కాలక్రమేణా 
ఎందరో మహర్షులు అనేక శ్లోకాలను వీటికి అదనంగా జోడించడం జరిగింది. ఆ 
హృదయాల మధ్య జరిగిన సంభాషణకున్న ప్రాధాన్యత  ఏమీ  తాకువ కాదు. బహుశా 
ఆ ఏడు  శ్లోకాల కంటే ముఖ్యమైన శ్లోకాలు కావచ్చు కూడా.

భగవానుడి పట్ల ఎంతో పూజ్య భావంతోనూ, నా  ప్రియతమ గురుదేవులైన పూజ్య 
బాబూజీ మహారాజ్ పట్ల హృదయపూర్వక కృతజ్ఞతాభావంతోనూ, ఆ ఏడు 
రత్నాలను, అదే  ఆ ఏడు  శ్లోకాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను:
 
1)    అధ్యాయం 2, శ్లోకం 55, సాంఖ్య యోగం
శ్రీ  భగవానువాచ:
ప్రజాహాతి  యదాకామాన్ సర్వాన్  పార్థ  మనోగతాన్
ఆత్మన్యేవాత్మనాతుష్ఠః స్థితప్రజ్ఞస్తదోచ్యతే.  //2:55//
ఓ పార్థా, మనసులో ఉద్భవించే కోరికలన్నిటినీ  ఎవరైతే త్యజిస్తాడో, ఆత్మసంతృప్తి కలిగి ఉంటాదో, ఆత్మలో సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి  వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.
 2)    అధ్యాయం 2, శ్లోకం 62, సాంఖ్య యోగం
యతో  విషయాంపుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే  కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//
ఇంద్రియాలపైనే  దృష్టిని  సారించినవాడు  వాటికి  ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ
  నుండి  కోరిక  పుడుతుంది; కోరిక  నుండే  కోపం పుడుతుంది.
 
3)    అధ్యాయం 2, శ్లోకం  63, సాంఖ్యయోగం
 క్రోదాద్భవతి  సమ్మోహః సమ్మోహాత్  స్మృతివిభ్రమః 
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//
కోపం మనసును గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుంది; ఫలితంగా జ్ఞాపక శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనమవడంతో మనిషి అథోగతిపాలవుతాడు.
  4)    అధ్యాయం 2, శ్లోకం  64, సాంఖ్య యోగం
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః  చరన్
యైఃఆత్మవశైః విధేయాత్మా విధేయాత్మాప్రసాదమధిగచ్ఛతి. //2:64//
మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల  (ఇష్టాయిష్టాల)నుండి
 ఇంద్రియములతో వస్తువులను వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి 
విముక్తుడవుతాడు;భగవదనుగ్రహాన్ని పొందుతున్నాడు.
 5)    అధ్యాయం 2, శ్లోకం 66, సాంఖ్య యోగం
నాస్తి  బుద్ధిరుక్తస్య న చా యుక్తస్య భావనా
భావనాన చా  భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్. //2:66//
సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదు; సామరస్యం లేకుండా ధ్యానం
 కుదరదు; ధ్యానించకుండా శాంతి  రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి 
సంతోషం ఎక్కడుంటుంది?
  6)    అధ్యాయం 3, శ్లోకం 35, కర్మయోగం
శ్రేయాన్ స్వధర్మో  విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్ 
స్వధర్మే  నిధనం  శ్రేయః పరధర్మో  భయావః //3:35//
పరధర్మాన్ని  ఎంతబాగా  నిర్వర్తించినప్పటికీ గుణము  లేనిదైనా  స్వధర్మమే 
మేలు; స్వధర్మ ఆచరిస్తూ  మృత్యువు  సంభవించినా  మంచిదే  పరధర్మాన్ని  
నిర్వహించడం  కంటే  కూడా. 
క్లుప్తంగా  చెప్పలంటే,  “నీ  పని  నువ్వు  చూసుకో” అని అనుండేవారు  బాబూజీ.
 7)    అధ్యాయం 3, శ్లోకం 4, కర్మయోగం
నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్నన్యసనాదేవ సిద్ధిం  సమాధిగచ్ఛతి. //3:04//
కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి విముక్తి కలగదు. కేవలం

 కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం  కుదరదు.
 
ఇవి  ఈ ఏడూ  రత్నాలు. ఆ తరువాత మొదటి రోజు యుద్ధం పూర్తయిన తరువాత

 అర్జునుడిని భగవానుడు ఓదారుస్తూ మూడు వ్యక్తిగత రహస్యాలను వెల్లడించాడు:
1)    అధ్యాయం 4, శ్లోకం 7, జ్ఞానయోగం
                       యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం  అధర్మస్య తదానాత్మానం సృజామ్యహం.


ధర్మానికి ఎప్పుడు గ్లాని కలుగుతుందో  అధర్మం ఎప్పుడు
 హద్దులు మీరుతుందో  ఓ అర్జునా, అప్పుడు నేను ఈ
 భూమ్మీదకు అవతరిస్తూంటాను.
 2)    అధ్యాయం  4, శ్లోకం 8, జ్ఞానయోగం
                          పరిత్రాణాయ  సాధూనాం వినాశాయ చ  దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి  యుగే  యుగే. 

దుష్టులను  శిక్షించడానికి,  శిష్టులను  రక్షించడానికి,  
ధర్మాన్ని  స్థాపించడం  కోసం  నేను  ప్రతీ  యుగము నందు  
  భూమిపై  అవతరిస్తూ  ఉంటాను. 
  అన్నిటి కంటే ముఖ్య శ్లోకం,
3)    అధ్యాయం  18, శ్లోకం 66, మోక్షసన్యాసయోగం
 
సర్వధర్మాన్పరిత్యజ్య  మామేకం శరణం వ్రజ 

అహంత్వా సర్వపాపేభ్యోః మోక్షయిష్యామి మా  శుచ.

అన్ని ధర్మాలు  పరిత్యజించి, నన్ను మాత్రమే శరణాగతి వేడినచో
 నేను నిన్నుసర్వపాపముల నుండి విడుదల చేయగలను: 
భయపడకు.
 
కాబట్టి సోదరసోదరీమణులారా, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని మీరందరూ అత్యంత

ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను; అలాగే మీలో 

కొంతమంది ఉపవాసం చెయ్యగలరేమో చూడండి.

ఈ శ్లోకాల  భావంపై దీర్ఘంగా ఆలోచించండానికి ప్రయత్నించండి. నేను 
చెప్పినట్లుగా ఈ శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో మౌఖికంగా చెప్పిన శ్లోకాలు. 
అలాగని, మౌఖికంగా చెప్పని శ్లోకాలు, హృదయాల మధ్య జరిగిన సంభాషణకు 
ప్రాధాన్యత లేదని కాదు దీనర్థం. 

గీత  మొత్తం  ఈ రోజున అందరికీ వర్తిస్తుంది; ఇంతకు పూర్వం కంటే కూడా, ఈ 
జీవితానికే గాక  భవిష్యత్తులో రానున్న తరాలు కూడా దీని నుండి ఎంతో 
ప్రయోజనం పొందుతాయి. 

ధన్యవాదాలు ఈ సాంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించండి.

 (ఆగష్టు 29 2021 న  కాన్హా శాంతివనమ్లో పూజ్య దాజీ ఇచ్చిన ప్రసంగం. )

గీతాహృదయం 3 - దాజీ వెల్లడించిన మరో 3 శ్లోకాలు



                         


శ్రీకృష్ణ  భగవానుడు   ఏడు  రత్నాలు అందించిన ఆ తరువాత మొదటి రోజు  
యుద్ధం పూర్తయిన తరువాత అర్జునుడిని భగవానుడు ఓదారుస్తూ మూడు వ్యక్తిగత 
రహస్యాలను వెల్లడించడం  జరిగింది:

రహస్యం 1

యదా యదా హి  ధర్మస్య గ్లానిర్భవతి  భారత 

అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4:7॥ 

 తాత్పర్యం: ధర్మానికి ఎప్పుడు  కలుగుతుందో, ధర్మం క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఓ అర్జునా, అప్పుడు నేను ఈ భూమ్మీద అవతరిస్తూ ఉంటాను. 

రహస్యం 2

 పరిత్రాణాయ  సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4:8॥

 తాత్పర్యం:శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని

 స్థాపించడం కోసం నేను భూమిపై మళ్ళీ  మళ్ళీ అవతరిస్తూ ఉంటాను.

రహస్యం 3

ఇది  చాలా ముఖ్యమైన శ్లోకం,  18వ  అధ్యాయంలోనిది, 66వ  శ్లోకం:

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం  వ్రజ

అహం త్వా  సర్వపాపేభ్యో మోక్షయిష్యామి  మా  శుచః 18 :66॥ 

తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేడినట్లయితే, నీ  సమస్త పాపాల నుండి విముక్తిని కలిగిస్తాను; భయపడకు. 

ఈ ఏడు  రత్నాలను,  ఈ  మూడు  రహస్యాలను  తరువాయి  భాగాల్లో  అధ్యయనం  చేసే  ప్రయత్నం  చేద్దాం. 

(సశేషం)


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...