ఇప్పుడే, ఇక్కడే
84 లక్షల యోనుల గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు.
అలా ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారు; ఇంత మంది మానవుల్లో ఒక ఆలుమగల జంట ఏర్పడటం; వాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడం; తల్లి గర్భంలో ఆ పిండం పెరగడం; ఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడం; నవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.
ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో,
దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!
అక్కడి నుండి ప్రారంభమవుతుంది
మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే విధంగా? మొదట
ఆడబిడ్డా, మగ
బిడ్డా అని అడుగుతాం –లింగం
ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా
ఉన్నడా అంటాం –రంగు.
ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక జీవితాంతం ఇవి మన తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.
మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.
వాటితోనే మన మనుగడను
కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.
మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.
చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.
అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.
ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి.
మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు.
ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది.