22, నవంబర్ 2024, శుక్రవారం

సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

https://www.youtube.com/watch?v=9VeumJifoJY

 సహజ మార్గ పద్ధతి యొక్క విశ్వజనీనత

సహజ మార్గ ధ్యాన ప్రక్రియలు విశ్వజనీనమైనవి, అంటే అన్నీ రకాల వ్యక్తులు అనుసరించగలిగేవి. ఎటువంటి అర్హతలూ చూడరు. కేవలం ప్రయత్నించడానికి సంసిద్ధత ఉండాలి అంటే. నమ్మకం, విశ్వాసం వంటివి కూడా అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం అనుభవం ద్వారానే కలుగుతుంది గనుక. అనుభవం మానవ ప్రయత్నం ద్వారా మాత్రమే సాధ్యం. 

ఎటువంటి విద్యార్హతలు గాని, ఎటువంటి నేపథ్యం గాని, కులమత రంగు,  జాతీయతలతో సంబంధం లేదు. శాస్త్రజ్ఞులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అంగవైకల్యం ఉన్నవారైనా, ఎవ్వరైనా ఈ ధ్యాన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలు హృదయ లోలోతుల్లోకి తీసుకువెళ్ళి మన చేతన స్థాయినే చేసిన ప్రతీశారీ మార్చగలిగే సామర్థ్యం ఉన్న పద్ధతి సహజ మార్గ ధ్యాన పద్ధతి. ఎవ్వరికైనా తెలియజేయవచ్చు, తనను తాను మార్చుకోవాలన్న తపన కలిగిన ప్రతీ వ్యక్తికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. మనసుకు అతీతంగా తీసుకువెళ్ళే ప్రక్రియలివి; సత్యాన్ని యథాతథంగా దర్శింపజేసి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తద్వారా జీవన ప్రమాణాలు, విలువలు సహజంగా ఉన్నతస్థాయిలో ఉండేలా చేస్తుంది. విలువలను నిజంగా గుర్తింపజేసి ఆ దిశలో జీవితాన్ని నడిపిస్తుంది ఈ మార్గం. 

కాబట్టి ఇది అందరికీ అవసరం, ముందు మనం అనుభవాన్ని సాధించి, ఆ తరువాత అందరికీ తెలియజేయదగ్గ మార్గం, సహజ మార్గం. అవసరమైనడల్లా పరివర్తన కోసం తపించే హృదయం. అనుభవాన్ని పంచుకోవడం ద్వారానే దీన్ని ఇతరులకు తెలియజేయగలం. 

 అయితే ఈ సందర్భంలో పూజ్య చారీజీ అడిగిన ఒక ప్రశ్న గుర్తుకొస్తున్నది. ఒక ఆశ్రమంలో ఆయన మాట్లాడుతూ, సహజ మార్గ పద్ధతిని తెలియజేయాలంటే ఒక గ్రుడ్డి, మూగ, చెవుడు మూడూ ఉన్న వ్యక్తికి తెలియజేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశ్చర్యం వేసింది. దానికి వారు, యేమీ లేదు, ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశిక్షకుడు ప్రాణాహుతినివ్వడమేనన్నారు. అది హృదయాన్ని స్పృశిస్తుంది కాబట్టి జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం జరుగుతుందన్నారు. అంతే కాదు, అన్నీ అవయవాలున్నవాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు గ్రుడ్డి, మూగ, చెవుడు ఉన్నట్లుగా కళ్ళు, చెవులు, నోరు మూసుకుంటే తప్ప, హృదయ గళాన్ని వినిపించుకోలేమని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ధ్యానంలో జరిగేది అదే మనకు యేమీ కనిపించదు, వినిపించదు, మాట్లాడటం ఉండదు. అందరూ మననం చెయ్యవలసిన అంశం ఇది. 

19, నవంబర్ 2024, మంగళవారం

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే యేది కాదు? 

 ఆధ్యాత్మికత అంటే మతం కాదు. 

ఆధ్యాత్మికత అంటే బాహ్యారాధన కాదు.

ఆధ్యాత్మికత విడదీసేది కాదు.  

 ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఆధ్యాత్మికత అంటే మతానికి అతీతమైనది. 

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమై తెలుసుకునేది. 

ఆధ్యాత్మికత అంటే కలిపేది, విడదీసేది కాదు. 



6, నవంబర్ 2024, బుధవారం

మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి

 


మా అమ్మగారు ధ్యాన ముద్రలో ... 
(అక్టోబర్ 22, 1942 - సెప్టెంబర్ 28, 2024)
మా తల్లిగారి నిర్యాణం - అశ్రు నివాళి 
మా తల్లిగారు నడుపల్లె రాజేశ్వరిగారు, సెప్టెంబర్ 28, 2024న హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో కాలం చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. విధి విలాసం ఎలా ఉందంటే, ఆవిడను ఆసుపత్రిలో జేర్చిన 2 రోజులకే నేను కూడా తీవ్రమైన కడుపునొప్పితో మరొక ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. శాస్త్ర చికిత్సలకు లోను కావలసి వచ్చింది. దానితో మా అమ్మగారు కాలం చేసినపుడు నేను అందుబాటులో లేకుండా పోవడమే గాక దహన ప్రక్రియలు కూడా నిర్వర్తించలేకపోయాను. ఇది నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన ఘట్టం ఇప్పటివరకూ. ఇవి చాలవన్నట్లుగా మేముండే 4 వ అంతస్తులో, మా అపార్టుమెంటులో లిఫ్ట్ పని చేయడం లేదు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా!

మాతృమూర్తిని కోల్పోవడం వ్యక్తి జీవితంలో హృదయంలో ఒక పూడ్చలేని వెలితిని సృష్టిస్తుంది. తల్లిని మించిన దైవము లేదు అని చిన్నప్పుడు, కాపీ పుస్తకాలలో వ్రాసేవాళ్ళం. అప్పుడు అర్థం తెలియదు, కేవలం స్కూల్లో మాష్టారు ఇచ్చిన హోమ్ వర్క్ లా ఉండేదంతే. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక్కోసారి జీవితకాలం కూడా సరిపోదు. కానీ ఆమెను కోల్పోయిన తరువాత ఒక్కసారిగా ఆమె  మన పట్ల చేసిన త్యాగాలన్నీ కళ్ళ ముందుంటాయి. ఎన్నిసార్లు ఆమెను బాధ పెట్టామో గుర్తుకు వస్తుంది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశామో గుర్తొస్తుంది. క్షమించమని అడిగిన దాఖలాలు ఒకవేళ ఉంటే అవి చాలా తక్కువ. ఎన్నో అవమానాలు మన కోసం భరించినప్పుడు యేమీ చేయలేని సందర్భాలు గుర్తొస్తున్నప్పుడు, బాధ వర్ణనాతీతం. తల్లి ఎటువంటిదైనప్పటికీ తల్లి మనసును బాధపెట్టడమూ అంటే భగవంతుని బాధపెట్టినట్లే అని పూజ్య చారీజీ అంటూండేవారు. తల్లి కళ్ళకెదురుగా కదలాడే నిస్స్వార్థ జీవి. 
అయితే సంతృప్తికరమైన రోజులు మా అమ్మగారితో బొత్తిగా లేవని కాదు. మా నాన్నగారు 1996 లో పరమపదించిన తరువాత 28 యేళ్ళు నాతోనే ఉండటం నా అదృష్టం ఆమెను చేతనైన జాగ్రత్తగా చూసుకో గలిగాను. నా గురుదేవులు నన్ను హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకునిగా చేసినప్పుడు మొట్టమొదటి ధ్యాన సిట్టింగ్ ఆమెకే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి చివరి వరకు నిత్యమూ ధ్యాన సిట్టింగులు ఇవ్వగలిగాను. నా దృష్టిలో తల్లి రుణం కొంతైనా తీర్చుకోగలిగే మహత్తర అవకాశం నా గురుదేవులు నాకు ప్రసాదించారనిపించింది. ఆధ్యాత్మిక సేవనందించగలిగాను. ఆవిడ క్రమం తప్పక తన సాధన చేసుకుంటూ ఉండేవారు. మన గురుపరంపర పట్ల అపార భక్తి ఉండేది. ధ్యానం అంటే గొప్ప గురి ఉండేది. మా చెల్లెళ్ళను, తన కోడలిని సమదృష్టితో చూడటానికి ప్రయత్నించేది. ఎవ్వరినీ నొప్పించే విధంగా మాట్లాడేది కాదు. తనను గురించిన ఆలోచన లేకుండా జీవించిన మహాసాధ్వి. 
ఈ ఉపద్రవ సమయంలో నాకు ఆసరాగా నిలిచినది నా సహజ మార్గ పరివారం. అన్నిటి కంటే మించి గురుదేవుల రక్షణ, అభయహస్తం మాపై ఉండటం. 13 రోజులు ఆమె ఆధ్యాత్మిక యాత్ర సాఫీగా కొనసాగడానికి కోసం ప్రార్థన-ధ్యానం చేయమని గురుదేవులు ఆదేశించడం మన అభ్యాసులు, ప్రశిక్షకులు పాల్గొనడం జరిగింది. 
మా అమ్మను సదా నా హృదయంలో స్మరిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రేమను కొనసాగిస్తూ నా శేషజీవితాన్ని గురుదేవుల సేవలో వెచ్చిస్తానని మా అమ్మకు మాటిస్తూ, ఇదే నా కృతజ్ఞతాపూర్వక అశ్రునివాళి! 

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...