22, డిసెంబర్ 2021, బుధవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 2 - గ్రంథ పరిచయం

 విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ -  గ్రంథ పరిచయం 

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనేది  హార్ట్ఫుల్నెస్  (శ్రీరామచంద్ర  మిషన్) సంస్థ యొక్క  పరమపవిత్ర  గ్రంథం. దివ్యలోకాల్లో  ఉండేటువంటి  ఎందరో  మహాత్ముల  నుండి అందుకున్న  దివ్య  సందేశాలు.  ఈ  సందేశాలని  ఇచ్చినవారిలో  శ్రీకృష్ణభగవానుడు, రాధాదేవి, స్వామి  వివేకానంద, బుద్ధ భగవానుడు,  ఏసుక్రీస్తు,     శ్రీ రామకృష్ణ  పరమహంస,  కబీరు, చైతన్య మహాప్రభువు, గురు  నానక్, లాలాజీ,  బాబూజీ, చారీజీ, ఇంకా  ఎందరెందరో  మహాత్ములున్నారు. ఈ  గ్రంథం  వీళ్ళందరూ  ఇచ్చిన  సందేశాల  సమాహారం. ఈ  సందేశాలను  అతిఉత్కృష్టమైన ధ్యాన  స్థితిలో  అందుకున్నవారు  శ్రీమతి  హెలీన్  పైరే గారు, ఒక  ఫ్రెంచి  దేషస్థురాలు, అభ్యాసి. వీరిని  శ్రీరామచంద్ర  మిషన్,  హార్ట్ఫుల్నెస్  అభ్యాసులందరూ  ఎంతో  శ్రద్ధతో  మదర్ అని  ఆప్యాయంగా  పిలుచుకుంటారు. 

మదర్  హెలీన్  పైరే  ఈ  సందేశాలను  1990  నుండి  అందుకోవడం  ప్రారంభించారు.  2018  వరకూ  కొన్ని  వేల  సంఖ్యలో  అందుకోవడం  జరిగింది;  ఇంచునమించు  ప్రతీ  రోజూ  అందుకోవడం  జరిగింది. ఇంతకు  ముందు  ప్రస్తావించినట్లుగా,  ఇన్ని  సందేశాలు  అందుకోవడం ప్రపంచ  ఛానలింగ్  చరిత్రలోనే  ఇది  మొట్టమొదటిసారి. 

ఈ  సందేశాల  సంకలనానికి హార్ట్ఫుల్నెస్  సహజమార్గ  గురుపరంపరలోని  మూడవ  గురువు,  రెండవ  అధ్యక్షుడు  అయిన పూజ్యశ్రీ  పార్థసారథి  రాజగోపాలాచారీజీ  ఒక  గ్రంథరూపంగా రూపొందించి, ఈ  గ్రంథానికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేసి  2005 ఏప్రిల్ 30వ తేదీన  తిరుప్పూరులో  బాబూజీ  జయత్యుత్సవాల్లో  విడుదల  చేశారు.  ఈ  మహాత్ములందరూ  మానవ ఉద్ధరణ  కోసం సూక్ష్మ రూపంలో  ఉండేటువంటి  లోకమే  ఈ  బ్రైటర్ వరల్డ్.  నిగూఢమైనవి,  గుహ్యమైనవి అయిన ఈ  దివ్యోపదేశాలన్నీ  కూడా  చెవిలో  రహస్యంగానే  ఉపదేశించడం  అనేది  అనాదికాలం  నుండి  జరుగుతూ  ఉన్నదే.  వీటిని  ఆంగ్లంలో  విస్పర్స్ అంటారు.  అందుకే  పూజ్య  చారీజీ  వీటికి  విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని  నామకరణం  చేశారనిపిస్తుంది. 

ఈ  సందేశాలు  ఈ  భూమ్మీదున్నప్పుడు  అద్భుతమైన  దైవకార్యాలను  నిర్వహించినటువంటి  మహాత్ముల  నుండి, ఎన్నో  సంస్థలు  ఏర్పాటు  చేసినటువంటి  మహాత్ముల  నుండి అందుకోవడం  జరిగింది.  చాలా  వరకూ  ఈ  సందేశాలు  బాబూజీ  వద్ద  నుండి  అందుకున్నవే ఉన్నాయి. వీరందరూ  ఇప్పుడు  ఒక్కటిగా,  ఐక్యంగా  ఈ  బ్రైటర్ వరల్డ్ లో  ఉంటూ  మానవ  ఆధ్యాత్మికోద్ధరణకు  కృషి  చేస్తూ  ఉన్నారు;  వారి  ప్రణాళికను  భౌతికంగా  మన మధ్య  ఉన్న  సజీవ  మాస్టరు  ద్వారా  అమలు  చేస్తూ  ఉన్నారని  ఈ  సందేశాల  ద్వారా  మనం  చదువుకున్నప్పుడు  తెలుస్తుంది. 

ఇక  ఈ  సందేశాల్లోని  విషయానికొస్తే, ఇవన్నీ  కూడా  కేవలం  శ్రీరామ చంద్ర  మిషన్  లోని  అభ్యాసులకు  మాత్రమే  కాదు,  యావత్  మానవాళి  శ్రేయస్సును  ఉద్దేశించి  మనిషి జీవితం  యొక్క  అన్ని  పార్శ్వాలను  స్పృశిస్తూ, మానవాళి  భవిష్యత్తుకు  సంబంధించిన సందేశాలను,  మాస్టర్లను  గురించి,  నిగుఢ  ఆధ్యాత్మిక  సత్యాలను  గురించి  చాలా  సరళంగా  ఈ  సందేశాల  ద్వారా  అందించడం  జరిగింది. ఈ  గ్రంథాన్ని  గురించి  పూజ్య  చారీజీ  మహారాజ్  అనేక  సందర్భాల్లో  అనేక  ప్రసంగాల్లో  మాట్లాడిన  విషయాలను  తరువాయి  భాగంలో  తెలుసుకుందాం. అలాగే  పూజయ్ దాజీ  ప్రసంగాల్లో  చెప్పినవి  కూడా  తెలుసుకునే  ప్రయత్నం  చేద్దాం. అలాగే  మన  మదర్  హెలీన్  పైరే  గురించి  పూజ్య దాజీ  వివరించిన  అంశాలను  కూడా  తెలుసుకుందాం.

అయితే  ఈ  ప్రకంపనలు  ఏ  విధంగా  అందుకున్నదో  మనం  ఇంతకు  పూర్వం  చెప్పుకున్నాం. అంటే  శబ్ద రూపంలో  అందుకున్న  ఈ  సందేశాలను, (సంస్కృతంలో శబ్దం  అంటే  వైబ్రేషన్, అంటే  ప్రకంపన) మదర్  తన  మాతృభాష  అయిన  ఫ్రెంచి  భాషలో  తర్జుమా  చేయడం  జరిగింది.  ఆమేకు  ఫ్రెంచి  భాష  తప్ప  మరొక  భాష  రాదు. పూజ్య  చారీజీ  ఆ  సందేశాలందుకునేవారు  తెలుగు  వారై  ఉండుంటే  ఈ  సందేశాల మూలం  తెలుగు  భాషలో  ఉండేవని  చెబుతూండేవారు.  కాబట్టి  ప్రస్తుతం  ఈ  సందేశాలన్నీ  కూడా  ఫ్రెంచి  భాషలో  ఉన్నాయి.  వాటిని  ఆంగ్లంలొకి  తర్జుమా  చేసిన  తరువాత  పూజ్య  చారీజీ  ఆమోదించిన  తరువాత  అభ్యాసులు  చదువుకోవడానికి  అందించేవారు. ఆ  తరువాత  పూజ్య  దాజీ  ఆ  బాధ్యతలను  స్వీకరించారు. 2018, జూన్ లో  ఆమె  పరమపదించే వరకూ  ఈ  ప్రక్రియ  కొనసాగింది.  (సశేషం)


20, డిసెంబర్ 2021, సోమవారం

విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ - 1 - ఛానలింగ్

ఛానలింగ్ 

విస్పర్స్  ఫ్రమ్ ది  బ్రైటర్ వరల్డ్ అనే  అద్భుతమైన  ఉద్గ్రంథాన్ని  పరిచయం  చేసే  ముందు  మనం  ఛానలింగ్  అనే  ప్రక్రియను  గురించి  కొంచెం  తెలుసుకుందాం. ఛానలింగ్  అంటే  ఇతర లోకాలతో సంపర్కం  కలిగి,  ఆయా లోకాల  సమచారాన్ని  గాని,  ఇంతకు  ముందు  భూమ్మీదున్న  మహాత్ముల ఆత్మలు  గాని,  ఇతర  లోకాల  మహాత్ములతో  గాని  సంపర్కం  కలిగి  వారందించే  సమాచారాన్ని  గాని,  సందేశాలను  గాని  అందుకొని  ఈ  లోకానికి  అందజేయగలిగేటువంటి  ఒక అత్యున్నత  సహజ ప్రజ్ఞతో  కూడిన ఒక మానస ప్రక్రియ.  ఇది  ఉత్కృష్ట  శ్రేణికి  చెందిన  ఛానలింగ్  ప్రక్రియ.

ఈ  ప్రజ్ఞ  ద్వారా ఇతర  ఉన్నత  లోకాల్లో  ఉన్న  మహాత్ములతో  సంభాషించగలగడమే  కాదు, ఇతర  లోకాల్లో  సంచరిస్తున్న గతించిన ఆత్మలతో  కూడా  సంపర్కం  ఏర్పాటు  చేసుకుని  సమాచారాన్ని  గాని  సందేశాలను  గాని  అందుకొనే  మాధ్యమాలుగా  పని  చేసేవారున్నారు. 

మన  భాషలో  అర్థం  చేసుకోవాలంటే,  ఆ  వ్యక్తికి  ఇతరలోకాల  భాష  వచ్చి  ఉండాలి,  మన  లోకంలోని  భాష  వచ్చి  ఉండాలి;  అప్పుడు  ఆ  భాషలోని  సందేశాలను  మన  భాషలోకి  తర్జుమా  చేసేవాళ్ళన్నమాట.  

అయితే  పైన  చెప్పినట్లుగా  అటువంటి  ఉన్నత  కోవకు  చెందిన  ప్రజ్ఞ,  మహాత్ముల  సందేశాలను  అందుకోవాలంటే  అటువంటి  ప్రజ్ఞ  జన్మతః అంటే  పుట్టుకతోనే  ఉండాలంటారు పెద్దలు.  దానికి  ధ్యానం  తోడైనప్పుడు  అటువంటి  సూక్ష్మ  లోకాలతో  సంపర్కం  ఏర్పడి, ఆ  మహాత్ములు  ఈ  లోకానికి  అందించవలసిన సందేశాలు  ఈ  మాధ్యమాల  ద్వారా  పంపించడం  జరుగుతూ  ఉంటుంది. అటువంటి  సందేశాలు  మానవ  కళ్యాణానికి,  ఆధ్యాత్మిక  వికాసానికి,  భవిష్యత్ప్రణాళికకు  ఎంతగానో  ఉపయోగపడాలని,  అప్పుడప్పుడు  హెచ్చరించడం  కోసం  ముందస్తుగానే  తగిన  చర్యలు  తీసుకునే  విధంగా  ఆదేశాలు  కూడా  ఇస్తూ  ఉంటారు. ఇలా  అనేకమైన  ప్రయోజనాలున్నాయి  ఇటువంటి  సందేశాల  వల్ల.

అయితే  ఈ  ప్రక్రియను  అనుభవించడం  అనేది  అంత  తేలికైన  విషయం  కాదని  అర్థమవుతున్నది.  ఒక రకమైన  ప్రసవవేదనే  అని  తెలుస్తుంది  వీరి  జీవితాలను  గమనిస్తే.  కాని  అటువంటి  సేవలను  ఈ  మానవాళికి  అందించడమే  గొప్ప  సేవగా  భావిస్తూ  ఈ  సేవలకు  ఉపక్రమిస్తారు  ఈ  మాధ్యమాలు. 

ఇలాగ  ప్రపంచ  చరిత్రలో  ట్రాన్స్ ఛానలింగ్  చేసే  మాధ్యమాలు  చాలా  మందున్నారు. ఏసు  క్రీస్తు  వంటి  మహాత్ముల  నుండి, ఇంకా  ఇతర  మహాత్ముల  నుండి  సందేశాలు  అందుకున్నవారున్నారు. ఇదేమీ  ప్రపంచానికి  కొత్త  కాదు.  అయితే  మానవలోకంలో అన్ని విద్యల్లో  నకిలీ  విద్యలున్నట్లుగానే  ఇక్కడ  కూడా  నకిలీ  మాధ్యమాలున్నారు, తస్మాత్  జాగ్రత్త! జాగ్రత్త!

ఈ  మాధ్యమాలు  స్త్రీలు  కావచ్చు,  పురుషులు  కావచ్చు. వాళ్ళల్లో  అత్యున్నత  స్థాయికి  చెందిన  సూక్ష్మగ్రాహ్యత,  సున్నితత్త్వం,  సూక్ష్మాతి  సూక్ష్మ  తరంగాలను  గ్రహించగలిగే  సామర్థ్యమే  గాక  వాటిని  మన  భూలోక  భాషలోకి  తర్జుమా  చెయ్యగలిగేటువంటి  సామర్థ్యాలుంటాయి. సాధారణంగా  ఆధ్యాత్మిక  సాధకులుగా  ఉంటారు వీరు.  వీరినే  ఆంగ్లంలో  స్క్రైబ్  అని  అంటారు, తెలుగులో  లేఖరి  అనవచ్చు. 

అటువంటి  అత్యున్నత  కోవకు  చెందిన  స్క్రైబే  మనం  మదర్  అని  పిలుచుకొనే  మేడం  హెలీన్  పైరే. ఈమె  ఫ్రెంచ్ దేశస్థురాలు.  వీరిని గురించి  తరువాయి  భాగాల్లో  వివరంగా  తెలుసుకొనే  ప్రయత్నం  చేద్దాం. (సశేషం)


భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...